పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

30, అక్టోబర్ 2013, బుధవారం

ఉర్దూ కవిత్వ నజరానా






బక్రీద్ పండుగ హడావుడి ముగిసింది. ఈద్ ముబారక్ చెప్పుకోవడమూ, ముబారక్ లు స్వీకరించడంలోనే రెండు రోజులు గడిచిపోయాయి. అఫ్ కోర్స్ బిరియానీ ఉండనే ఉందనుకోండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది బిరియానీలో ఉగాది పచ్చడి కలుపుకు తింటే ఎలా ఉంటుందా అని, అలాంటి ఆలోచనలతో భుక్తాయాసం తీర్చుకోక ముందే తలుపు మీద టక టకా మని శుక్రవారం కొడుతుంది. ఆ వెనుకే ఫైజ్ గారు పాస్ రహో అంటున్నాడు. కవిసంగమం మిత్రులు ఎదురు చూస్తుంటామన్నారు కాబట్టి ఆయాసాలు, ఆలోచనలు పక్కన పెట్టి కంప్యూటర్ కీబోర్డు చేతిలోకి తీసుకున్నాను.

గత శుక్రవారం ఫైజ్ మీద రాసిన పంక్తులకు నేను ఊహించని స్పందన వచ్చింది. కవులను గండపెండేరాలతో ఘనంగా సన్మానించిన తెలుగు నేల మనదిరా అంటూ మనసు ఒక మొట్టికాయ వేసింది. ముఖపుస్తకంలో పరిచయమైన మిత్రుడు కృష్ణమోహన్ మోచర్ల గారు ఫైజ్ గురించి కొంత సమాచారం పంపించారు. నా కోసం శ్రమకోర్చి ఆయన సమాచారం సేకరించడం కొంత ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. ఇలాంటి మిత్రులు లభించినందుకు గర్వంగాను ఉంది.
ఇక అసలు విషయానికి వస్తే, ఫైజ్ గురించి ఫైజ్ ఏమన్నారన్నది ఆసక్తికరమైన విషయం. తన గురించి ఆయన ఇలా చెప్పుకున్నాడు :
’’1920 నుంచి 1930 మధ్య కాలం సాహిత్యంలో అనేక జాతీయ, రాజకీయ ఉద్యమాల కాలం. కేవలం సీరియస్ సాహిత్యమే కాదు, సరదాగా నడిచే రచనలు కూడా వచ్చేవి. హస్రత్ మోహానీ, జోష్, హాఫీజ్ జలంధరీ, అక్తర్ షీరానీల పేర్లు కవిత్వంలో బలంగా వినిపించేవి. ఈ వాతావరణంలో నక్ష్ ఫరియాదీలోని కవితలు కొన్ని రాశాను.
1934లో కాలేజీ విడిచిపెట్టాను. 1935లో అమృతసర్ లోని ఎం.ఏ.ఓ. కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఇక్కడే నాకు నా సమకాలీనుల్లో చాలా మందికి మానసికంగాను, భావావేశపరంగాను పరిణతి లభించింది. ఈ కాలంలోనే మేము సాహిబ్జాదా మహమూదుజ్జఫర్ ను ఆయన శ్రీమతి రాషిదా జీహాన్ ను కలిశాము. ఆ తర్వాత ప్రగతిశీల రచయితల ఉద్యమం మొదలైంది. దాంతో పాటే శ్రామిక ఉద్యమాలు కూడాను. ఈ క్రమంలో అనేక దృక్పథాల వేదికలు ఏర్పడ్డాయి. ఇక్కడ మేము నేర్చుకున్నదేమిటంటే ప్రపంచానికి దూరంగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. ఎందుకంటే మన చుట్టు ఉన్న వాతావరణం మనపై ఖచ్చితంగా ప్రభావం వేస్తుంది. వ్యక్తిగతంగా మనిషి అతనికి ఉన్న ప్రేమలు, సంతోషాలు, కష్టాలు, బాధలు వగైరా ఎన్ని ఉన్నా కాని, వ్యక్తిగతంగా మనిషి ఈ పూర్తి చట్రంలో చాలా చిన్నవాడు. జీవితం ఈ విశ్వమంత విస్తారమైనది. కాబట్టి ప్రేమబాధ, ప్రాపంచిక బాధ ఈ రెండు ఒకే అనుభవానికి చెందిన రెండు పార్శ్వాలు. ఈ భావం మనసులో చోటు చేసుకున్న తర్వాత రాసిన పద్యమే – మునుపటి ప్రేమను అడగవద్దు ప్రియా – అన్న కవిత. పూర్తి ప్రపంచంలోని దు:ఖం గురించి ఆలోచించవలసి ఉంది. ఆ తర్వాత కొంత కాలం సైన్యంలోను, జర్నలిజమ్ లోను, శ్రామిక సంఘాల్లోను గడిపిన తర్వాత నాలుగేళ్ళు జైలులో గడపవలసి వచ్చింది. దస్త్ సబా, జిందాన్ నామా కవితా సంకలనాలు జైలు అనుభవాల రికార్డులే. ప్రేమలానే జైలు జీవితం కూడా ఒక మౌలికమైన అనుభవం. ఈ అనుభవం కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. తొలి ప్రేమ ఉదయించినప్పుడు ఉండే భావావేశాలు మళ్లీ మొగ్గ తొడిగాయి. ఉదయాస్తమయాల్లోని సౌందర్యం, ఆకాశంలోని నీలిమ, చిరుగాలి స్పర్శ అన్నీ జైలులోను అనుభూతికి వచ్చాయి. మరో విషయమేమంటే, బయటి ప్రపంచానికి సంబంధించిన కాలం దూరం అనేవి జైలులో ఉండవు. దూరం దగ్గర అనేది ఇక్కడ లేదు. ఒక్క క్షణం కూడా శతాబ్ధాల కాలంగా ఉండవచ్చు లేదా శతాబ్ధాలు కూడా నిన్నటి రోజులా కనిపించవచ్చు. మూడో ముఖ్యమైన విషయమేమంటే, అందరితోను వేరుపడిన భావం. ఒంటరితనం. ఇక్కడ చదవడానికి, ఆలోచించడానికి, సృజనాత్మక వధువును సింగారించడానికి కావలసిన సమయం ఉంటుంది.‘‘
ఫైజ్ తన గురించి తాను ఎక్కువగా చెప్పేవారు కాదు.. ఈ సంభాషణ అర్థాంతరంగానే ఆపేశారు.
భారత ఉపఖండం తీవ్రమైన మార్పులకు గురవుతున్న కాలంలో ఫైజ్ రాసిన పంక్తులు ఈ మార్పులపై తమ ప్రభావాన్ని వేశాయి. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు. ఒక విప్లవకారుడు, ఉద్యమకారుడు. కేవలం కవితలు మాత్రమే రాయలేదు. పత్రికల్లో సంపాదకీయాలు, వ్యాసాలు, రాసేవారు. అనేక విషయాలపై ఆయన ఇంటర్వ్యులు చదివితే ఆనాటి రాజకీయ పరిస్థితులపై లోతయిన అవగాహన కలిగిన వ్యక్తిని చూస్తాం. భారత ఉపఖండంలో నేటికి ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలకు ఆయన అభిప్రాయాల్లో జవాబులు దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు.
అణిచివేతలు, అన్యాయాలపై గళమెత్తిన కవి ఫైజ్. పాస్ రహో అంటూ ఆయన రాసిన కవిత ఈ వారం చూద్దాం:

పక్కనే ఉండు
నా హంతకీ, నా ప్రేయసి
పక్కనే ఉండు

రాత్రి నడుస్తున్నప్పుడు
ఆకాశంలో నెత్తురు తాగి రాత్రి నడుస్తున్నప్పుడు
కస్తూరీ లేపనం చేతబట్టి వజ్ర ఖడ్గం నడుస్తున్నప్పుడు
పాడుతూ నవ్వుతూ ఆర్తనాదాలు చేస్తూ నడుస్తున్నప్పడు
బాధల నీలిమువ్వలు అడుగడుగున మోగిస్తూ నడుస్తున్నప్పుడు

రొమ్ములో మునుగుతున్న గుండె
చొక్కా చేతుల్లో ముడచుకుంటున్న హస్తాలను చూస్తూ
ఆశ పడుతున్నప్పుడు

శిశువు రోదనలా మద్యం గలగలలు
ఎంత సముదాయించినా వ్యర్థమైనప్పుడు
అనుకున్నది ఏదీ జరగనప్పుడు
ఏదీ పనికిరానప్పుడు
రాత్రి నడుస్తున్నప్పుడు
విషాదం తొడుక్కుని నిర్మానుష్య రాత్రి నడుస్తున్నప్పుడు
పక్కనే ఉండు
నా హంతకి నా ప్రేయసి నా పక్కనే ఉండు
ఫైజ్ ఉర్దూలో రాసిన పంక్తులు ఇవి.

పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో
జిస్ ఘడీ రాత్ చలే

ఆస్మానోం కా లహూ పీకర్ సయా రాత్ చలే
మర్ హమ్ ముష్ఖ్ లియే నష్తర్ అల్మాస్ చలే
బైన్ కర్తీ హుయీ హస్తీ హుయీ గాతీ నికలే
దర్ద్ కా కాస్నీ పాజేబ్ బజాతీ నికలే

జిస్ ఘడీ సీనోం మేం డూబతే హువే దిల్
ఆస్తినోం మే నిహాం హాథోం కే రాహ్ తక్నే లగేం
ఆస్ లియే

ఔర్ బచ్చోంకే బిలఖ్నేకీ తరాహ్ ఖుల్ ఖులె మై
బహరె నాసూదగీ మచలే తో మనాయే నా మనే
జబ్ కోయీ బాత్ బనాయే నా బనే
జబ్ న కోయీ బాత్ చలే
జిస్ ఘడీ రాత్ చలే
జిస్ ఘడీ మాతమీ సున్ సాన్ సియా రాత్ చలే
పాస్ రహో
మేరే ఖాతిల్ మేరే దిల్ దార్ మేరే పాస్ రహో


                                                                                                       అబ్దుల్ వాహెద్ 

                                                                                                                                         October 18 

ఉర్దూ కవిత్వ నజరానా





శుక్రవారం మరీ ఇలా పరుగెత్తుకు వచ్చేయాలా? మొన్ననే కదా వెళ్ళింది. మరీ అంత తొందరేం వచ్చిందని ఉరుకులు పరుగుల మీద రావడం...అనుకుంటూ మొదలు పెట్టాను ఈ పంక్తులు. అసలు ఈ వారం రోజులు ఎలా గడిచాయో, ఎప్పుడు గడిచాయో తెలియడం లేదు. దానిక్కారణమేమిటంటే, పాతకోటలోకి సరదాగా వెళితే చేతికి వజ్రాల లంకెబిందెలు దొరికినట్లు, నేనేదో ఉర్దూ కవితలు నాలుగు పరిచయం చేద్దామని రాసిన రాతలకు వజ్రవైఢూర్యాలను మించిన ప్రశంసలు దొరికాయి. కామెంట్లు భుజం మీద చరుస్తుంటే నా మనసు సప్తాకాశాలు దాటేసి విహరించడం మొదలెట్టింది. నన్ను నేనే మరిచిపోయిన స్థితిలో వారం రోజులేంటి, ఏళ్ళు గడిచినా తెలుస్తుందా? ఈ ప్రోత్సాహానికి నేను అర్హుణ్ణి అవునో కాదో తెలియదు కానీ ఆ అర్హత సంపాదించడానికి తప్పకుండా కష్టపడతాను. ఇంతగా అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతఙ్ఙతలు 

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం

మొన్న శుక్రవారం ఫైజ్ గురించి నాలుగు ముచ్చట్లు చెప్పుకున్నాం. ఈ రోజు మరో రెండు ముచ్చట్లు చెప్పుకుని మరో కవిత చదువుకుందాం.

చాలా మంది కవుల్లాగే ఫైజ్ కూడా ప్రేమకవితలతోనే మొదలెట్టాడు. నెమ్మదిగా సామ్యవాదం వైపు మొగ్గు చూపడంతో ఫైజ్ లోని ప్రగతిశీల భావాలు ఆయన కవితల్లోను ప్రతిఫలించడం మొదలయ్యింది. ఒక విప్లవకవిగా ఆయన ఉర్దూ సాహిత్యంలో పేరు సంపాదించుకున్నాడు. ఇరవయ్యో శతాబ్ధంలో ముఖ్యమైన కవుల్లో ఒకడిగా ప్రసిద్ధి చెందాడు. ఫైజ్ కవితల్లో ఒక అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తుంది. ఆయనకు సంతృప్తి ఎన్నడూ లేదు. ప్రేమ కవితల్లో కూడా ఈ అసంతృప్తి కనిపిస్తుంది. ఒక ప్రేమకవితలో – పూలలో రంగులు నింపేద్దాం, వసంత గాలి వీస్తుంది. రారాదూ ఉద్యానవనానికి పనిలేదు, స్తబ్ధత వదిలింది, పదండి గాలితో మాట్లాడదాం, ఎక్కడో ఒక చోట ప్రేయసి కబుర్ల చెప్పుకుందాం.. అంటూ కొనసాగే కవిత చివర – ఐతే ప్రేయసి ఇంట్లో లేదా ఉరికంబం పైన తప్ప మధ్యదారిలో తానెక్కడా ఉండేది లేదంటాడు.
నా చేతిలో పెన్ను, ఇంకు లాక్కుంటే లాక్కోనీ... నా గుండె నెత్తుటిలో వేళ్ళు ఎప్పుడో ముంచాను- అని రాశాడు మరో చోట.

1951లో కుట్ర కేసులో జైలుకెళ్ళినప్పడు ఫైజ్ తన బ్రిటీషు భార్య అలీస్ కు అనేక ఉత్తరాలు రాశాడు. తర్వాత ఆ ఉత్తరాలను ప్రచురించాలని కొందరు మిత్రులు ఆయన్ను కోరారు. తన భార్యకు ఇంగ్లీషులో రాసిన ఉత్తరాలన్నీ స్వయంగా ఫైజ్ తిరిగి ఉర్దూలోకి అనువదించాడు. ఆ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తూ, ఈ ఉత్తరాలు వ్యక్తిగతమైనవే అయినా, వీటిని ప్రచురించడం వల్ల రాజకీయ ఖైదీల మనోస్థితి, ముఖ్యంగా సామ్యవాద సిద్దాంతాల కోసం పోరాడేవారు జైళ్ళలో ఉన్నప్పుడు ఎంత మానసిక సంఘర్షణకు గురవుతారో తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడతాయని, అందుకే ప్రచురిస్తున్నానని చెప్పాడు.

ఫైజ్ ఉత్తరాల గురించి, ఫైజ్ జీవితం గురించి వచ్చేవారం మరికొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఇప్పడు ఫైజ్ రాసిన – ఇంకా కొన్ని రోజులు మాత్రమే, ప్రియా (చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్) కవిత చూద్దాం:

కొన్ని రోజులు మాత్రమే, ప్రియా, కేవలం గుప్పెడు రోజులు మాత్రమే
దౌర్జన్యం నీడలో ఊపిరి పీల్చే నిస్పహాయత ఇంకొన్ని రోజులే...
ఇంకాస్త సమయం ఈ వేధింపులు సహిద్దాం, అలమటిద్దాం, రోదిద్దాం...

ఇది మన పూర్వికుల వారసత్వం ... మన అంగవైకల్యం...
శరీరానికి ఖైదు, భావావేశాలకు సంకెళ్ళున్నాయి
ఆలోచనలకు దాస్యబంధాలు, మాటలపై కట్టడులు
అయినా ధైర్యంగా బతుకుతూ పోతున్నాం

జీవితం, బిచ్చగాడి చిరుగుల పంచేనా
ప్రతిక్షణం దానిపై బాధల మాసికలు పడుతుండాలా
ఫర్వాలేదు, దౌర్జన్యం కొన్ని రోజులు మాత్రమే
కాస్త ఓపికపట్టు, అణిచివేతల రోజులు కొన్నే

ఈ నిర్జన, ఎడారి, బీడు లోకంలో
మనం ఉండాలి, కాని ఇలాగే ఉండడం కాదు.
అపరిచిత హస్తాల అనామక వేధింపుల భారం
నేడు భరించాలి, ఎల్లప్పుడు కాదు...

నీ అందాన్ని కప్పేస్తున్న అమానుషాల ధూళి
మన మూన్నాళ్ళ యవ్వనంలోని నిరాశలతో సమానం
వెన్నెల రాత్రుల్లో వ్యర్థంగా ప్రజ్వరిల్లే బాధ
ఆలకించబడని గుండె నిట్టూర్పులు, వినబడలేని శరీర ఆర్తనాదాలు
కొన్ని రోజులే, ప్రియా, కొన్ని రోజులు మాత్రమే...

ఉర్దూలో ఫైజ్ భావాలను సాధ్యమైనంత వరకు తెలుగులో తీసుకువచ్చే ప్రయత్నం చేశాను. కవిత చివరి పంక్తులు – చాందినీ రాతోంకా బేకార్ దహకతా హువా దర్ద్... భావాన్ని తెలుగులో రాసినా.... ఆ అనుభూతిని రాయడం కష్టమే. అలాగే – జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కీ ఖబా హై జిస్ మేం, హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం – అన్న పంక్తుల్లోధ్వనించే బలమైన నిరసన, ఆగ్రహం, ఆవేదన, తిరుగుబాటు తదితర భావాలు తెలుగులో వచ్చాయా? అనుమానమే... ఉర్దూలో కవిత మీరే చదవండి. నా అనువాదం అసలు కవితకు ఒక ఆమడ దూరంలో ఉందని చెప్పినా, ఫర్వాలేదు కనీసం ఆమడ దూరం వరకు వచ్చాను కదా?

చంద్ రోజ్ ఔర్ మేరీ జాన్, ఫక్త్ చంద్ హీ రోజ్,
జుల్మ్ కీ ఛావూం మేం దమ్ లేనే పర్ మజబూర్ హై హమ్
ఔర్ కుఛ్ దేర్ సితమ్ సహ్ లేం, తడప్ లేం, రో లేం,

అప్నే అజ్ దాబ్ కీ మీరాస్ హై, మాజూర్ హైం హమ్
జిస్మ్ పర్ ఖైద్ హై, జజ్బాత్ పే జంజీరేం హైం
ఫిక్ర్ మహ్బూస్ హై, గుఫ్తార్ పే తాజీరేం హైం
అప్నీ హిమ్మత్ హై కే హమ్ ఫిర్ భీ జియే జాతే హైం

జిందగీ క్యా కిసీ ముఫ్ లిస్ కి ఖబా హై జిస్ మేం
హర్ ఘడీ దర్ద్ కే పైవంద్ లగే జాతే హైం
లేకిన్ అబ్ జుల్మ్ కీ మాయాద్ కే దిన్ థోడే హైం
ఇక్ జరా సబ్ర్, కే ఫరియాద్ కే దిన్ థోడే హైం

అర్స యే దహ్ర్ కీ ఝుల్సీ హుయీ వీరానీ మేం
హమ్ కో రహ్నా హై, పర్ యుం హీ తో నహీ రహ్నా
అజ్నబీ హాతోంకే బేనామ్ గారన్ బార్ సితమ్
ఆజ్ సహ్నా హై, హమేషాతో నహీ సహ్నా హై

యహ్ తేరే హుస్న్ సే లిపటీ హుయీ ఆలమ్ కీ గర్ద్
అప్నీ దో రోజా జవానీ కీ షికస్తోం కా షుమార్
చాందినీ రాతోంకా బేకార్ దహక్తా హువా దర్ద్
దిల్ కీ బేసూద్ తడప్, జిస్మ్ కీ మాయూస్ పుకార్
చంద్ రోజ్ ఔర్, మేరీ జాన్, ఫకత్ చంద్ హీ రోజ్ ....

మళ్లీ శుక్రవారం కలుద్దాం.. అంత వరకు సెలవు..


అక్టోబర్ 10, 2013

25, అక్టోబర్ 2013, శుక్రవారం

కవిసంగమం సిరీస్ 11 : కవుల పరిచయం

మూడు తరాల కవుల కవిసంగమం :సీరీస్ -11
...............................................................
వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్',ఆబిడ్స్,నాంపల్లి స్టేషన్ రోడ్,హైదరాబాద్
సమయం : 9.11.2013

6pm- 'మిస్ మీనా' నాటక ప్రదర్శన
7pm-కవిసంగమం


.

నందిని సిధారెడ్డి  


16, అక్టోబర్ 2013, బుధవారం

బుక్ ఇంట్రో

అవేద( చదివిన కవితా సంపుటి)



గాయాల పూదోటలో విశ్రమించినవేళ గుండె మీది పొరల్ని చీల్చుకొని వచ్చిన కవితా కల్పతరువు మొక్కై మానై విస్తరించినపుడు కల్గే వేదనను అనుభవించి అనుభూతించి తనలో తాను తుఫాను కమానైవూగి మరుక్షణం మహాప్రవాహమై తాను నడిచినా మేరా డప్పుల మోతల్లో బాధా తప్త హృదయాల విషాద గీతికల్ని పలికించి కవిత శకలాల పరిమళాల్ని తన 'అవేద'కవితా సంపుటిలో అంతటా వెదజల్లిన కవి ప్రేమ్ చంద్ ను నేనేకాదు ఎవరైనా మంచి కవి అనక తప్పదు.
కవిత్వం వొక ఆత్మకళగా భావించే కవుల్ని అందం , ఆనందంతో పాటు చైతన్యం కూడా దాని పరమావధి అని నమ్మే కవుల్ని , విప్లవ దృక్ఫథం ద్వారా సామాజి క అభివ్యక్తి ని ఆహ్వనించే కవుల్ని అస్త్తిత్వ సంక్షోభంలో చిక్కుకున్న ఆధునికమానవుడి అనుభవాల్ని అధిరూపకం ద్వారా వ్యక్తపరుస్తున్న కవుల్ని ప్రే మ్ చంద్ గాడంగా అధ్యనం చేయడం వల్లనేమో ' అవేద' లాంటి కావ్యాన్ని అస్తిత్వం లోకి తేగలిగాడు.
1990 దశకంలో వున్న కవిత్వమంతా ఏక శిలా నిర్మితంకాదు
ఏక ప్రవాహం కాదు. అది వివిధ పాయలుగా ప్రవహించిన ప్రవాహం.ప్రేమ్ చంద్ 'అవేద' లో తన కాలపు వాదాలను , సమస్తమానవ అనుభూతుల్ని కవిత్వాభి వ్యక్తి మార్చే ప్రయత్నం చేశాడు.
,దాహం వొంటరి అంకెతో నేరవేరిందా'- అంటూ ప్రశ్నించి న కవి లింగభేధమేందుకు?- అంటూ ప్రశ్నించిస్త్రీమారకం విలువగా మారిన క్షణాన్ని నిరసించాడు తన కవిత్వం లో .
'నేను కుట్ర గురించి మాట్లడుతున్నాను/డిసెంబర్ 6 న పట్ట పగలు దేశం నడిబొడ్డు మీద జరిగిన కుట్ర గురించి ... '- మతో న్మాదందుర్మార్గాన్ని సూచించడమే కాక ఉత్పత్తికీ కారకులైన దళితులు ,బహు జనులు ,మైనారిటీల వాదాల్ని సహానుభూతితో కవిత్వం చేయడంమే కాదు వారి పక్షానా నిలుస్తాడు.
'ఋణగ్రస్తుడా ఏం ఫర్వాలేదు ' - అని ప్రారంభించిన కవిత మూడో ప్రపంచ దేశాల ఆర్థిక స్థలాలను ఆక్రమిస్తున్న అగ్రరాజ్యాల కుట్రను బహిర్గతం చేస్తుంది . విప్లవం పట్ల విప్లవకారుల పట్ల కవికి గల విశ్వాసం కవిత్వం తొట్రు పాటు లేనితనాన్ని వ్యక్తం చేస్తుంది .
ప్రాంతీయ,జాతీయ, అంతర్జాతీయసమస్యలపై సైతం కవి తన అక్షరాస్త్రాలను సంధించాడు. '
'నానుదుటి మైదానంమీద/చలమలుపుడుతున్నాయి/
అప్రయత్నంగానాచేయి నీటిని తోడేస్తుంది'-లాంటి కవిత్వ పంక్తులు అనేకం కావ్యమంతా పరుచుకొని కవి భావనా పటిమను తెలుపడమే కాక కవిత్వమంటే పదాల స మూహాలకూర్పు కాదు తెలియచేస్తాయి.
ఊహించగల మేధ ,స్పందించగల హృదయం,రాటుదేలిన కలం
ఈ మూడింటి సమ్మేళనమే ఈ 'అవేద' - అని చెప్పొచ్చు.
అందరికీ నమస్కారం.మళ్ళీ నన్ను ఈ మార్గం లోకి మళ్ళించి న యాకూబ్ కు ధన్యవాదలతో మళ్ళీ మంగళ వారం మరో సంపటి పరిచయంతో.....కలుద్దాం.




                                                                                                   



                                                                                                           







                                                                                                                                                        టి.రాజారామ్(15-10-2013)

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

సంధ్య యెల్లాప్రగడ-తీరని ఒంటరితనం
 



 

కవిత్వానికి సమాజం,వ్యక్తిగతమైన ఉద్వేగాలు కారణాలు.సౌందర్యం లోనూ ఇలాంటి ఉద్వేగాలు వాటికి కారణలుంటాయని పూర్వుల వాదన.వర్ణిస్తున్నప్పుడు స్థితి వర్ణన(status discription)ఒకటి కనిపిస్తుంది.అనుభోక్త(Expeerienser)గా కవిత్వం చెబుతున్న వాళ్లలో ఈతరహా కవిత్వీకరణ కనిపిస్తుంది."నేను"అనేది ఒకటి ఇందులో కనిపిస్తుంది.ఇందులోనూ సమాజం అంతర్గతంగా ప్రవహిస్తుంది.

సంధ్య యెల్లాప్రగడ కవితలో ఈ నేను ఉంది.ఇందులోని స్వరం ఓ ఒంటరితనాన్ని తిరస్కరిస్తూ వినిపిస్తుంది.తాననుభవిస్తున్న ఒంటరితనాన్ని,బాధని కవిత్వీకరించారు.

"తీరని వంటరి తనం
నాకు మాయని గాయాని చేసింది"-
"ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పామై..
నా కాలిని మెలి వేశాయి !"
"కన్ను రెప్పల క్రింద దాచిన కన్నీరు
రక్తం లా వెచ్చగా మసులుతోంది!!"
"ఇది సమరమని తెలుసు...
ఇది నా ఒంటరి సమరమని తెలుసు."..
"జయాపజయములు ఏమైనా
వేసే ప్రతి అడుగు లక్ష ప్రశ్నల సమాధానం! "

ఈ కవితని పూర్వ ,పర భాగలుగా చూడవచ్చు.తాననుభవిస్తున్న సంఘర్షణని చెప్పి.రెండవభాగంలో తనకు కావలసింది చెబుతారు.పైది మొదటి భాగం.ఒకతోడులేక తననుభవించే మానసిక సంఘర్షణ ఎదుటివారిలో కలిగించడానికి ఐదు కళాత్మక వాక్యాలుగా అందించారు."గాయం/పాము/మెలివేయటం/కన్నీరు/రక్తం"ఇవన్నీ బాధని తరువాత వాక్యాలు తన నిర్ణయాన్ని,తెగువని చెబుతాయి.


"ఏకాంతంతో సహవాసం
జీవిత గమ్యాలు, దిశా నిర్దేశాలు లేని గమనం
సాగి వేగి కడతేరేది ఎప్పుడో!
స్వచ్చమైన నీ తోడూ దొరికేది ఎప్పుడో!"

ఇది రెండవభాగం.నిజానికి "గమ్యం,దిశానిర్దేశం"లాంటి పదాలు లేకపోతే ఈ కవిత ఎవరిగురించనేది అర్థం కాదు.చెప్పదలచుకున్న అంశాన్ని గాఢంగా చెప్పడం.అందుకోసం నిర్మాణ వ్యూహాలను ఏర్పర్చుకోడం ఇందులో కనిపిస్తాయి.

కవిత్వం రాస్తున్న వాళ్లలో కొన్ని దశలుంటాయి.ఒక గొంతు బలాన్ని వీటినుంచే అంచనా వేయవచ్చు.వస్తువును పట్టుకోవడం దగ్గరినించి,కవిత్వీకరించడం,హృదయాన్ని తట్టే వాక్యాల్ని చెప్పడం వీటివెనుక పదిలమైన సాధన,అధ్యయనం అవసరం.ఇలాంటి సమయాలలో కొంతమంది కొన్ని గుర్తుల్ని అనుసరిస్తుంటారు.తొలి దశని గమనిస్తే పదాలలో బలవంతపు ప్రాసని అనుభవించడం.ఒకటి రెండువాక్యాలు యూనిట్లతో పూర్తిచేయటం లాంటివి.

సంధ్య గారిలో వీటన్నిటినించి తప్పించుకున్న పరిఙ్ఞానం ఉంది.ఇంకా కొంత స్పష్టమైన నిర్మాణ ధార ఈకవితకి కావాలి.మరిన్ని మంచి కవితలు సంధ్య గారినుంచి ఆశిద్దాం.


                                                                                                                  
                                                                                                              __________ఎం. నారాయణ శర్మ    

కవిత్వ విశ్లేషణ

తిలక్ బొమ్మరాజు-చెట్టు





 


చెట్టు అనాదికాలంగా గొప్ప కవితా వస్తువు.చెట్టుని ఆదర్శమయంగా,త్యాగ శీలిగా నీతిశాస్త్రం అనేక కోణాలలో అభివర్ణించింది.సత్పురుషుడుగా చెప్పింది.

"ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే
ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ"

(చెట్టు తను ఎండలో వుంటు ఆశ్రయించిన వారికి నీడనిస్తుంది.ఇతరుల కోసం ఫలాలను కూడా ఇస్తుంది.సత్పురుషుడిలా)

తెలుగులో మనకి"చెట్టుకవి"(ఇస్మాయిల్)ఉన్నారు.ఏ కాలానికైనా చెట్టు గొప్ప వస్తువు.అలాంటి చెట్టు వస్తువుగా రాసిన కవిత తిలక్ "చెట్టు".ఇందులో తిలక్ లో ఒక ఉద్వేగం కనిపిస్తుంది.చెట్లను నరకడం పట్ల స్పందించి,భవిష్యత్తుని ఊహిస్తున్నారు.అనేక అవసరాలకోసం చెట్లపై జరుగుతున్న పనులని తిరస్కరిస్తున్నారు.

"నా తనువునంతా/తొలిచేస్తూ/తడియారని కొమ్మలపై
మానవ త్రాచుల/గొడ్డలి వేట్లు ",

"నవ్వుతున్న/వెన్నెల పూలు
నా ఒళ్ళంతా/తుంచేసేవారే ... కాని తుమ్మేదవాలనిచేవారేవ­­రు ?"

చెట్టు తానుగా మట్లాడుతున్నట్టుగా ఉత్తమ పురుష కథనం.త్రిపురనేని గోపిచెంద్ "మాకూ ఉన్నాయి స్వగతాలు"లో ఇలాంటి శైలి కనిపిస్తుంది.అందులోనూ ఓ తుమ్మ చెట్టు కథ ఉంది.మంచి భారమైన వాక్యాలున్నాయి.గొంతుకని సమర్థవంతంగా అవి ప్రసారం చేస్తాయి.

"నా మనసంత దిగులే/రాలిపోయిన ఆకులను
చూస్తే/హృదయమే బరువవుతుంది/నా జాడే కరువైతే"

"ఒడిలిన ఆకులకన్న/రాలిన పువ్వులకన్న బాదిస్తోంది నేను లేని
నా భూమిని పరికిస్తే/కూకటి వేళ్ళతో పెకలించేసారు/నా నేస్తాలెందరినో"
రెండు స్థితుల సంఘర్షణని చూపారిక్కడ.రాలిన ఆకులు,తనులేని భూమి ఈరెంటినించి తిలక్ వచనం సాగింది.సాధరణంగా కవిత్వంపై ప్రతిఫలనాలుంటాయి.తిలక్ కవితపై సామాజిక ,వైఙ్ఞానిక ప్రతిఫలనాలున్నాయి.చెట్టులేని వాతావరణాన్ని ,ఆయా క్రమాలని ఊహించి జాగృతులని చేస్తున్నారు.


"పొదిగిన గూళ్ళు అన్ని చెదిరిపోయాయి ఇక నాలో ఒదగలేక ఆకసం సైతం అలిగింది/నా నిష్క్రమణతో"

"మేఘం ఉరమనంటుంది
నేను లేని ఈ ధాత్రిలో చినుకు కురవనంది చెంతకురానివసంతాన్ని/చూసి "

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు "శ్రీ రామచంద్ర లఘు కావ్య సంగ్రహః"అనే గ్రంథంలో ఓ కథలో వృక్షంలేని నగరాన్ని చిత్రించారు.అందులో "రావణ నగరి లంకాయాం షడపి రుతవః "అంటూ రావణ నగరంలోని వృక్ష రక్షణ గూర్చి చెబుతారు.ఈ క్రమంలో పరోక్షంగా తిలక్ ప్రపంచీకరణని తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తాడు.కాని వాక్య రూపంలో ఇది కనిపించదు.

"మానవ త్రాచులు/వెన్నెల పూలు/వొదగలేని ఆకసం"లాంటి పదబంధాలతో పాటూ "చినుకు కురవనంది చెంతకు రానివసంతాన్ని చూసి"వంటి కళాత్మక,అనుభూతి వాక్యాలున్నాయి.

కొత్తగా రాస్తున్న ప్పుడు కవిత్వాన్ని ఒక రూపంలోకి తెచ్చుకోవటం కూడా అవసరం.వాక్యాలని యూనిట్లుగా రాస్తున్నప్పుడు.ఆవాక్యాల రూపం అవగాహనని అడ్డుకోగూడదు.వాక్యాల సమగ్ర రూపమే కవిత సమగ్రతని నిలబెడుతుంది.పద బందాన్ని "వరుస"లో రాయగూడదని కాదు కానీ దానివల్ల అర్థ సంబంధంగానో,వస్తు సంబంధంగానో ఒక అవసరమో,ప్రత్యేకతో ఉండాలి.

వేరువేరుగా వరుసలు,వాక్యాలు,యూనిట్లు రాస్తున్నప్పుడు కూడా అర్థం, వ్యక్తీ కరణ ప్రధానం.ఈ విభాగాలని ,వరుసలని రాస్తున్నప్పుడు శ్రద్ధ అవసరం.

మంచికవిత అందించినందుకు తిలక్ బొమ్మరాజు గారికి అభినందనలు.ఇంకా సాధన,అధ్యయనంతో మరిన్ని మంచి కవితలకోసం తిలక్ తనను నిలబెట్టుకోడానికి దగ్గరలో ఉన్నారు.

"వృక్షోరక్షతి రక్షితః"అనే కాదు"నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను" అని మనమంతా నమ్మితే చాలు.




                                                                                                              __________ఎం. నారాయణ శర్మ   

కవిత్వ విశ్లేషణ

కట్టా శ్రీనివాస్-ఎరుక







విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.

జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య ,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి "ఎరుక"నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.

ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.

"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను."
"దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది."
"రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"

ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.

"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."

ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది."చిన్నారి బుగ్గలు పుణికి నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు." ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.

అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.


                                                                                                        _____________ఎం. నారాయణ శర్మ  

కవిత్వ విశ్లేషణ

రాళ్లబండి కవితాప్రసాద్ -ఎగిరివొచ్చిన హంస





 



"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.


డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యాత్మిక అంశాలలో "హంస"శబ్దం ఙ్ఞానానికి ప్రతీక.పురాణాదులలో జీవం"పక్షి"గా చెప్పబడింది.ఈ హంసని ప్రతీకగా చూపుతూ ఈ కవిత సాగుతుంది.

ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది.

"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను.
నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది .
నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది .
నేను ఎగురుతున్నాను ......."

మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న తీరు తరువాతి అనేకాంశాలలో కనిపిస్తుంది.


"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది .
మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది .
ఇంకోసారి మేఘమవుతుంది .
నేను హిమాలయమై నదుల రెక్కలతో
పీఠ భూముల్లో ప్రవహిస్తాను "

ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.


"భూమ్మీద కావ్యాలు
అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్,
కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"

కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎగరడం మాని వ్యాపిస్తున్నానని"అంటారు.అప్పుడు రెక్కలు మొలిచాయి.వ్యాపిస్తున్నపుడు మొలిచిన
రెక్కలివి.

"రెక్కకొక కొత్త కన్ను.
రెక్క కింద మెదడు "

మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని అపేక్షించి,ఆకర్షిస్తుంది.కన్ను దృష్టికి ప్రతీక.దృష్టి లేదా దర్శనం ఙ్ఞాన వాహిక.ఈ దర్శనమే ఉన్నతీకరిస్తుంది.ఈ తర్కం తరువాత కవిత్వాన్ని నిర్వచిస్తారు.

"కవిత్వం వ్యక్తికి కాదు ,
ప్రపంచ హంసకు పర్యాయపదం"

అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి దివ్య జీవితానికి,ప్రశాంతతకు మార్గమైన దర్శనాన్ని ఈ కవిత చిత్రించింది.వస్తువుమత్రమే కాకుండా అందించిన తీరులోనూ ఈ కవిత ఉన్నత మైనది.

"ఇప్పుడు ఎగరడంమాని వ్యాపిస్తున్నాను !
శరీరమంతా హృదయం వ్యాపించింది !"

"నా భూమి ఒకకొత్త పద్యం లా కనిపిస్తోంది ."


మంచి కవితను మనందరికీ పంచి కవిత్వాన్ని కొత్తగానిర్వచించినందుకు కవితా ప్రసాద్ గారికి ధన్య వాదాలు.

"జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే జరామరనజం భయం"


                                                                                                           _____________ఎం. నారాయణ శర్మ 

కవిత్వ విశ్లేషణ

సి.వి.శశారద గారి కవిత :









 




ప్రపంచీకరణ పర్యవసనాలవల్ల కుటుంబ జీవితాలు ఛిన్నమయ్యాయి.ఇంట్లో ఉన్న నలుగురు నలుగువైపులా వెళుతూ ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి.విధ్యార్థులైతే సగటుగా ఇంటర్ విద్యనుంచే కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరీస్థితి.చదువులకోసం,ఉద్యోగాలకోసం పుట్టిపెరిగిన ఊరికి,కుటుంబానికి దూరంగా ఉండటం. ఈ కాలనికి ఒకటి,రెండుతరాలనించి కనిపిస్తుంది.


ఇలాంటి సందర్భం నుంచే ఒకకూతురుగొంతుక తన తల్లితండ్రులకు దూరమౌతున్న సందర్భాన్ని కవిత్వీకరించారు సి.వి.శారద.ఇలాంటి సందర్భంలో గతంలో తండ్రిగొంతుకనించి వచ్చిన కవితలున్నాయి.శ్రీ జింబో(మంగారి రాజేందర్)"చూస్తుండగానే"లో ఇలాంటివి కనిపిస్తాయి.కూతురు/కుమారుని గొంతుకనించి కనిపించవు.వస్తుసందర్భం,దాని మూలవస్తువులో సారూప్యతలున్నప్పటికీ ఇది ఈకాలానికి సంబందించి కొత్తవస్తువే.

రచనకు సంబంధించి రచనాపరిమితి(Limiteation of a writing)ఉంటుంది.దీన్నికూడా స్థలపరిమితి(Spase Limitetion)కాల పరిమితి(Time Limitetion)అని విడదీయొచ్చు.ఆఖ్యానంలో సత్యానికి సంబంధించిన ఆకళింపు ఉంటుంది. ఈ ఆకళింపులో స్వభావం ఉంటుంది.ఈ స్వభావమే రచన గొంతుని చూపుతుంది.ఈ పరిమితిని స్వభావపరిమితి(Personal Limitetion)అంటారు.

శారద కవితలో స్థల,కాల,స్వభావాలు ప్రత్యేకంగా ఉండటంవల్లే ఈ కవిత కొత్త దనాన్నిపులుముకుంది.నిర్మాణ గతంగా చూపిన శ్రద్ధకూడా శైలిని ప్రత్యేకించి చూపుతుంది.ప్రధానంగా వస్తువుని ప్రసారం చేయడానికి వాడుకున్న ప్రశ్నా వాక్యల పద్దతి రూపముఖంగాబాగా ఉపకరించింది.


"జీవితాన్ని వెతుక్కుంటూ, లక్ష్యాల్ని మోసుకుంటూ
ఉద్యోగమూ, చదువూ అంటూ
ఊరూ ఇల్లూ దాటుతుంటే
'అప్పుడే వెళ్తున్నావా?' ప్రశ్నిస్తాయా కళ్ళు!"

"'ఇంకో రెండు రోజులుండరాదూ?'/ఉండలేను!
'పోనీ తొందరగా వచ్చేస్తావా?'/చెప్పలేను!!
యదార్థాన్ని దాచలేక తల వంచుకుంటాను
వంగి కాళ్ళన్ని తాకితున్నప్పుడు
వర్షించే ఆ కళ్ళని నేనెప్పటికీ చూడలేను
'వెళ్తానమ్మా' అంటానా?/వెళ్ళిరమ్మంటాయా కళ్ళు
'వీలైతే తొందరగా వచ్చేస్తానమ్మా' అంటానా?
అబద్ధాన్ని పట్టేస్తాయా కళ్ళు"

ప్రశ్నలకు సమాధానాలుగా మౌనంగా అనుభవిస్తున్న సంఘర్షణని చిత్రించారు.ఇదంతా మనోగతంలా ధ్వనిస్తుంది.ఈ భాగం తరువాత తానుగా ఆ సఘర్షణని కవిత్వం చేస్తారు.ఈ క్రమంలో ఈ కవిత రెండు భాగాలుగా కనిపిస్తుంది.మొదటిభాగం సందర్భంలోకి తీసుకువెళ్లటానికి ఉపయోగ పడితే రెండవభాగం ఆగొంతుకని సారవంతం చేస్తుంది.



"నేను వెళుతున్న దారిలో ఆ కళ్లు
దృక్కులు పరిచాయని తెలుసు
వెను తిరిగి చూడలేను!"

"నిండు శ్రావణ మాసపు మేఘాల్లా ఆ కళ్ళు
వర్షిస్తూనే ఉంటాయని తెలుసు!
వెను తిరిగి చూడలేను!!"

"ఎదగాలని పోరాటం/ఎగరాలని ఆరాటం
గూడొదిలిన పక్షుల
రెక్కల చప్పుళ్ళు గుండె నిండా వినిపిస్తాయి.."

ఈమూడువాక్యాలలో మొదటిరెండు కళాత్మకమైనవి.హృదయాన్ని చేర్చడానికి వాటిపరిధిమేరకు అవి ప్రవర్తిస్తాయి.ఈ కవితలో గమనం, స్పందన అనే పద్ధతిలో వాక్యాలను నిర్మించారు.


చాలాసార్లు కొత్తతరం కవిత్వం రాయడంవల్ల కొత్తవస్తువులు గొంతులు వినిపిస్తాయని చెప్పుకున్నాం.ఈ గొంతుక అంతే తాజాగా తనదైన ఊహలో,ఉనికిలో ఉంది.సాధరణంగా కొత్తగ రాస్తున్న వాళ్లలో పాతవారిని అనుసరించే గుణం ఉంటుంది.అది భాష,వాక్యాలకే కాని మిగత విషయాలకు కాకూడదు.ప్రధానంగా వస్తువు.ఎవరికైనా ఆయాజీవితల్లోనించే వస్తువులు రావాలి.మంచికవితనందించి నందుకు సి.వి.శారద గారికి అభినందనలు.ఈ దారిలోనే ఈతరం వస్తువుల్ని మరిన్ని పరిచయం చేయాలని ఆశిద్దాం.

శారద గారు శీర్షికని రాయడం మరచిపోయారు.శీర్షిక గొంతుని,స్వభావాన్ని ప్రదర్శిస్తున్న సారాన్ని ప్రతిబింబించాలి.రాస్తరని ఆశిస్తాను. 


                                                                                                      _____________ఎం. నారాయణ శర్మ

21, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

షoషాద్ మహమ్మద్ గారి కవిత-మిగిలే ఈ రోజుని
 


గతకాలానికి సంబంధించిన వ్యక్తులు,భావాలు,సంఘటనలు,తిరిగి మననం చేసుకుంటూ రాయడాన్ని పునశ్చరణం(Anamnesis)అంటారు.గతాన్ని తార్కికంగా వ్యక్తం చేయడానికి ఇందులో మంచి అవకాశం ఉంటుంది.ఎక్కువగ జీవిత భావనలను వ్యక్తం చేయడానికి ఇలాంటి వాక్యాలు రాస్తారు.

షoషాద్ మహమ్మద్ గారు రాసిన కవితలో ఈ భావ జాలం ఉంది.ఈ అంశం వెనుక బలమైన స్త్రీగొంతుక వినిపిస్తుంది.అది గతాన్ని,వర్తమానాన్ని రేపటిని కూడా తార్కికంగా చిత్రించింది.ఆ రేపుని శూన్యంగా.

"ఎన్నెన్ని రాక్షస యుద్దపు చీకట్లు
ఓడిపోతున్న మనసును
ప్రతీ సారీ చంపేసుకున్నాను
నిన్నటి నా చరిత్ర

కావాల్సిందేదో
మనసుకెదురై ముసుగుతీసేసినట్టు"

ఈ వచనంలో భారమైన అనుభవశక్తి ఉంది."రాక్షస యుద్ధం""యుద్ధపు చీకటి"లలో అణచివేతని,"ఓడిపోతున్న మనసును""మనసుకెదురై ముసుగు తీసేసినట్టు"లలో కొల్పోతున్న జీవితాన్ని గూర్చి కనిపిస్తుంది.

ప్రతీ వాక్యంలోనూ ఒక అసహనం కనిపిస్తుంది.

'ప్రేమ యుద్ధానికి ఆహ్వానం
గెలుపైనా ఓటమైనా ఇద్దరిది
నిజంకాలేని రేపటి నా ఊహచిత్రం"

"చరిత్రకు సాక్షం
నా ఒడిలో
ఊహకి స్థానం నా గుండెల్లో"

తాను బందీ అవుతున్న అంశాన్ని చిత్రించిన సంధర్భాలు.వాక్యంలో గాఢతకనిపిస్తుంది.వస్తువు విషయంలో పోలిక లేదుకానీ గతంలో స్కైబాబాగారు రాసిన "దుఃఖనామా"కవితలోని వాక్యాలతో పోలికలున్నాయి.ఆ శైలి ఇందులో కనిపిస్తుంది.కొత్తగా రాస్తున్నట్టు కనిపించినా షoషాద్ గారిలో బలమైన గొంతుక ఉంది.మరిన్ని కవితలతో త్వరలోనే తానోప్రత్యేకమైన గొంతుగా కనిపిస్తుందనటానికి ఏమాత్రం సందేహపడ నవసరంలేదు.
 
 
                                                                                                               ______________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

బూర్ల వెంకటేశ్వర్లు-ఎన్నీల ముచ్చట్లు
 



తెలుగులో ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది.ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని సారవంతంగా,సహజాతి సహజంగా అందించింది.ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి సంబంధమైన కవిత రాయవచ్చాలేదా అనే చర్చలు జరిగాయి.బూర్ల వెంకటేశ్ కవిత అందుకు సమాధానం చెబుతుంది.

వెన్నెలని ఆధారం చేసుకొని చాల గొప్ప భావచిత్రాలతో ఈ కవితని నిర్మించారు బూర్ల.బూర్ల దర్శనంలో తన్మయీ భావంకనిపిస్తుంది.వెన్నెలని చాలా భిన్నంగా తెల్లటి దుప్పటిలా,పాలలా,వరిగొలుకల్లా,వెండిలా,తెల్ల కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు.బూర్ల దర్శనంపై వర్ణ(colour) ప్రభావం కనిపిస్తుంది.నిజానికి వెన్నెలని చల్లనిదనేదృష్టితో చూస్తారు.

"ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె
నేను ఇంట్ల ఉంటే/కిటికిలకెల్లి తొంగి చూస్తది
బైటికివోతె/ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది"

"రాత్రిరాత్రంత/తెల్లటి దుప్పటిగప్పి
నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లుమూసుకుంటే
మనుసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది"

"పొద్దుగాల పాలువిండేటప్పుడు
సర్వలదునికి జాక్కుంటది"

"ఆకాశంల నిలవడి నాకోసం తపస్సుజేసి/వరిగొలుకల అవతారమెత్తి
నా గుండిగెల నిండుతది/సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి
రమ్మని చేతులు చాపుతె/తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి
తనమనుసు తెల్లకాయిదం జేసి/నాకు ప్రేమలేఖ పంపిస్తది"

వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు.కోడ్ చేయగలిగితే అన్నివాక్యాలు అంతే బలమైనవి.తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో ఉన్న మార్దవాన్ని,మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది.సాధారణంగా తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ కనిపిస్తుంది.వెంకటేశ్ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు."తొంగి చూసు/ఎంటవడు/ముచ్చటవెట్టు/దునుకు/జాక్కొను/కుమ్మరిచ్చు/ఇనుకుంట"ఇలాంటివి కనిపిస్తాయి.

"చెప్పాలె/ఉంటే/వోతె 'లాంటి క్రియలుకూడా సహజత్వాన్ని ప్రదర్శిస్తాయి.కవిత్వానికి బూర్ల కొత్తకాదుకాని తనని నిలబెట్టే
కవితలో ఇదీ ఒకటవుతుంది.

"ఆమె కాళ్ళపట్టీల నుంచి రాలిపడ్డ గజ్జెలు
పక్షులగొంతుల్ల చేరి
ఉదయపు పాటలైతయ్"

ఇలాంటి మంచి ఊహలతో,భావచిత్రాలతో వెంకటేశ్ మరిన్ని మంచికవితలని అందిస్తడని ఆశిద్దాం.అభినందనలు బూర్ల వెంకటేశ్ గారు.
 
                                                                                                              ______________ఎం.నారాయణ శర్మ
 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ


రక్షిత సుమ-అడుగులు

 





ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.

నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం.చలం గారికి ఈ అలవాటు ఎక్కువ.చాలామంది కవులు ఒక అచ్చుమీదో,పదం మీదో వొత్తిడి(Stress)తో కవిత్వం రాస్తారు
.కవిత్వంలో వేగం (Swift)తేవడానికి ఇదో మార్గం.

రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు.నిజానికి ఇది ఊనిక మాత్రమే.మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి.పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.

"పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు
వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి
వసివాడని సంతోషాల కొసరడుగు
మసిబారని ఆలోచనల మెరుపడుగు"

'పోగుబడ్డ ప్రపంచ విషయాలు""వసివాడని సంతోషాలు""మసిబారని ఆలోచనలు"మంచి ప్రయోగాలు.ప్రేరణాత్మకంగా సాగే వచనం పఠనాసక్తినికలిగిస్తుంది.

"వెలుగెక్కడుందని నీడనడుగు
గమ్యాన్ని చేరేలా నడవాలంటే,
ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్నీ
దాటేయాలి నీ ప్రతి అడుగు"

నిజానికి ఇందులో పై చివరివాక్యంలోని "అడుగే" కవితకు ఊనిక.ప్రశ్నించి తెలుసుకోడంలోనే అన్నీ సమకూరుతాయనే అంసాన్ని ప్రతిపాదిస్తూ ఈవాక్యాలు కొనసాగాయి.కొన్ని వాక్యాలు మంచి భారతని కూఒడా కలిగి కనిపిస్తాయి.

"పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. "

పడకుండనితూకం,పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు.కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి.తనదైన వాతావరణం కవితకి కావాలి.మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు.నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది.మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.



                    
                                                                                                                                                                       ______________ఎం.నారాయణ శర్మ

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

కె.ఎన్.వి.ఎం.వర్మ-గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల




 






నైవ రాజ్యం న రాజాసి నదండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వే రక్షంతి చ పరస్ఫరం




(రాజ్యములేదు,రాజులేడు దండించేవాడు దండింప బడేవాడులేడు.ధర్మాన్నొకదాన్ని తాముగ నిర్మించుకుని ప్రజలు పరస్పరం ఒకరినొకరు రక్షించుకునేవారు)భారతం శంతి పర్వం లోని ఈశ్లోకం రాజ్యం యొక్క డొల్లతనాన్ని చెబుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో నైతే పాలన,చట్టం,న్యాయం అనే అంశాలు వ్యష్టిగా పనిచేస్తాయి.అందువల్ల రాజ్యం దాని ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.


వర్తమానంలో ప్రజాప్రతినిధులు కేవలం పార్టీనాయకులుగా ప్రవర్తించడం వల్ల ప్రజా ఉద్యమాలు అణచబడుతాయి.అందువల్ల తమ ఆకాంక్షలకోసం పోరాడేప్రజాచైతన్యం అనేక సార్లు మోసం చేయబడుతుంది.పోరాట ఫలితాలను ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా నాయకుల ఆలోచనలకు దగ్గరగా నియంత్రించ బడతాయి.అందువల్ల ఉద్యమకారుడు ఎప్పుడూ ఒక స్థితిలోనే ఉంటాడు.


కొన్ని సంఘాలని చూస్తే ఈ అంశం అర్థమౌతుంది.కొన్ని సమీకరణాల మేరకు ఒకే చింతనగలిగిన సంస్థలుకూడా వేరై పూర్వపు భాగస్వామ్య పక్షాలనే మళ్లీ నిషేదించాయి.పాలన రూపాన్ని మార్చుకుంటుందిగాని తననడవడినికాదు.

కె,ఎన్.వి.ఎం.వర్మ కవిత అలాంటి పోరాటాన్ని చేసిన వీరుని మనస్సులోని సంఘర్షణని చిత్రించింది.

'నేల తల్లిని దోసిలోకి తీసుకొని/కళ్ళ కద్దు కున్నాను,
చెమట రక్తం తడిసిన మట్టివాసనలోంచి/వనాన్ని ఆఘ్రాణిస్తిన్న కల."

"నిశబ్దాన్ని మౌనాన్ని చీల్చుకొంటూ/కెవ్వుమని నావీపు పై విరిగిన లాఠీ
పడదోసి కసితీరా తన్ని భూట్లు/వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాకా...
నా ఆకుపచ్చని కలని/ఆ గుప్పెడు మన్నుని
నాలుగు సిం హాల కళ్ళలోకి విసిరి/చీకటిలోకి మాయమయ్యాను."


వస్తుసంబంధంగా కవితా వచనంలో భావాభివర్గాలు(Ideological groops)ను గుర్తించవచ్చు.వస్తువు వాస్తవిక,సౌందర్య,తాత్విక మొదలైన వర్గలలో ఎవర్గానికి చెందుతుందనేది ఈ అంశం చెబుతుంది.వర్మ వాస్తవికతకి సంబంధించిన వస్తువును తీసుకున్నారు.కాని ఆఖ్యానం(Neretion)లో దాన్ని సౌందర్యనికి దగ్గరగా తీసుకువెళ్లారు."పచ్చనికల""వనాన్ని ఆఘ్రాణించడం"మొదలైన వి అందుకు ఉదాహరణ ."ఆకుపచ్చని కలని సిం హల కళ్లలోకి విసరడం"వ్యక్తిగత రక్షణని చూపుతుంది.

అకుపచ్చని కల ఆకాంక్షకి.నాలుగుసిం హాలు పోలీస్ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.


"ఎన్ని జెండాలు మోసినా,
యధాతదం చరిత్ర మొత్తం"

ఈ వాక్యం ఉద్యమ సంస్థల,పాలనల డొల్లతనాన్ని చెబుతుంది.ఫలాలను అందుకునే అవకాశం ప్రజకు చిక్కటం లేదనే అంశాన్ని నొక్కి చెబుతుంది.

కవిత చిన్నదైనా ,నిర్మాణం ,అభివ్యక్తి విషయంలో మంచి పరిఙ్ఞానం కనిపిస్తుంది.వస్తుగతంగా అంశం పాతదే అయినా చూసిన దర్శనంలో కొత్తదనముంది.ఇంకా మంచికవితలు వర్మ గారినుండి ఆశిద్దాం.


                                                                                                                                                      ______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

గుబ్బల శ్రీనివాస్-క్షురకుడు
 


అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తరువాత బహుజన వాదం పేరుతో అణగారిన వర్గాల కవిత్వం(Poetry of appressed groups)వెలువడింది.నిజానికి ఇది వచ్చిన వేగం ఆకాలానికి అనేక చర్చలు తీసుకు వచ్చాయి.జూలూరి గౌరి శంకర్"వెంటాడే కలాలు"తీసుకువచ్చారు.ఆ తరువాత కూడా చాలామంది కవులు తెచ్చిన సంపుటాలున్నాయి.

చరిత్ర గతిలో వచ్చిన ఉద్యమాలవల్ల ఈ కవిత్వం తన గొంతును మార్చుకుంది.తరువాతి కాలంలో వచ్చిన ప్రపంచీకరణ (Globalisetion)కవిత్వం లో ఒక ప్రధాన పాయగా ప్రవహించిన కుల వృత్తుల కవిత్వం ఈ వర్గాలదే.దానికి కారణం ప్రపంచీకరణ వల్ల ఆయా వృత్తుల విధ్వంసం జరగటమే. ఆతరువాత తెలంగాణా ప్రాంతీయ ఉద్యమంలోనూ ఈ తాత్వికత పాత్ర గమనించదగింది

గుబ్బల శ్రీనివాస్"క్షురకుడు"మానవీయ స్పందనను కూర్చుకున్న కవిత.ఔపయోగిక దృక్పథంతో జీవితాన్ని పరిశీలించిన కవిత.ఇందులో అంశాత్మక పరిశీలన(Case study)ఉంది.నిజానికి ఇలాంటి నిర్మాణం దీర్ఘ కవితల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

"నెరిసిన తలలకు మాసిన ముఖాలకు
కత్తి పట్టి వైద్యం చేస్తాడు/వైధ్యుడు కాదు"

"రాక్షస రూపాలను అందమైన
నగిషీలు చెక్కుతాడు/శిల్పి కాదు"

చివరి భాగం వల్ల వాక్యం పొడుపుకథ నిర్మాణాన్ని సంతరించుకుంది.మనసును హత్తుకునే మార్దవమైన వాక్య భాగాలూ ఉన్నాయి.ఇవి ఒకింత కళాత్మకంగా కనిపిస్తాయి.

"మనసు లగ్నం అయితే/వేళ్ళు విన్యాసం చేస్తే
క్రమ పద్ధతిలో అమిరిపోతాయి/జులపాలు
అవి ప్రేమిక ఊహల్లో నీలి మేఘాలు"

"నిద్దరోతున్న జనాన్ని బద్ధకం కమ్ముకున్న లోకాన్ని
డప్పు దరువుతో చైతన్యం నింపుతాడు"

"తనువు చాలించి చివరి మజిలి
చేరుతుంటే/విచార గీతం ఆలపించి
మరుభూమి చేరుస్తాడు ఆత్మీయుడిలా "

జీవితాన్ని గమనించిన తీరు బాగుంది.మంచి అంశాలని కవిత్వీకరించారు.జీవితాన్ని అనేక భావాభి వర్గాలనించి చూడటం కూడా కనిపిస్తుంది.వచనంలో ఇంకా తాదాత్మ్యత అవసరమనిపిస్తుంది.సాధనే క్రమంగా ఆ మార్గాన్ని ఉపదేశిస్తుంది.మంచికవిత అందించినందుకు శ్రీనివాస్ గారికి అభినందనలు.
 
 
                                                                                                                                                    ______________ఎం.నారాయణ శర్మ

14, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

అరుణ నారద భట్ల-ఆశానగర్ అశోక్ నగర్


కారణాలు పెద్దగా తెలియవుకాని నిరుద్యోగం పై వచ్చిన కవితలు తెలుగులో చాలా తక్కువ.విద్యా సంబంధంగా కార్పోరేట్ విద్యపై సాహిత్యం చాలా సార్లు మాట్లాడింది.మిగత వ్యవస్థల గురించి మాట్లాడటం తక్కువే.ఆతరహాలోనే కోచింగ్ సెంటర్లూ
తెలుగునాట ప్రధానంగా రాజధాని హైదరబాద్ లో ఎక్కువ.అందులోనూ అశోక్ నగర్ అందుకు ఒక ప్రధాన కూడలి.

అరుణ నారదభట్ల కవిత ఇలాంటి జీవితాలను వారివెనక ఉన్న సంఘర్షణలను చిత్రించింది.ఈ జీవితాన్ని దగ్గరినించి గమనించిన సహృదయత ఈ కవితలో కనిపిస్తుంది.ప్రధానంగా ఆశకు,అవకాశానికి మధ్యన ఈ కథనం కనిపిస్తుంది.

"అది కలల సౌధమో/కాలం నేర్చిన జీవిత సత్యమో
లేక...పాలకులు పరచిన ప్రకటనల హోరో!"

"ఒక్కసారిగా సిటీ నడివొడ్డున పడి/లేవలేక కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు"

"బలీయమైన భవిష్యత్తుకై/కూడబెట్టిన సొమ్మంతా
ఆ వీధిలో ధార పోస్తున్నారు"

ఈవాక్యాల్లో ఒక అనుక్రమం ఉంది.ఆశ కలుగుతున్న స్థితిని,దానికోసం చేస్తున్న ప్రయత్నాన్ని,అందులో సఫల మౌతున్న ,కాని వారి గురించి ఈక్రమం వివరిస్తుంది.

"వులిదెబ్బకు భయపడక నిలదొక్కినవారే
సాకార ప్రపంచాన్ని చూస్తున్నారు"

"మింగుడు పడని ఓటమికి ముసుగేస్తూ
ముందేటికైనా నిలబెట్టుకుందామని
తేరుకోలేక....!?!ఒంటరిగానే ఆ గదిలో
మలివయస్సులోకి తొంగిచూస్తూ
అక్షరాలతో సహవాసం నేర్చి"

పోటీపరీక్షల్లో అనుకున్న స్థాయికి రాక,మళ్లీమళ్లీ ప్రయత్నించి ఇంకా వెదుకులాడే వాళ్లూ ఎక్కువే.కాని ఏదో ఆశ ఇంకా నడిపిస్తుంటుంది.నిజానికి ఈ జీవితాల వెనుక ఇంకా చాలా అంశాలున్నాయి.జీవితమంతా కవిత్వంలో పట్టనట్టు,అన్ని అంశాలు ఒకే కవితలో రావడమూ అసాధ్యమే.

"సాకార ప్రపంచం""చీకటి చెర""మలి వయస్సులోకి తొంగి చూస్తూ""కాలం దెబ్బ"లాంటి మంచి పద బంధాలున్నాయి.మరిన్ని మంచి కవితలు అరుణ నారద భట్ల అందిస్తారని ఆశిద్దాం.

కవిత్వంలోకి ఇంకా కొత్త వస్తువులు రావాలి.తమదైన జీవితాన్ని,తమ దైన ప్రపంచాన్ని కొత్త తరం గమనిస్తే కవిత్వీకరిస్తే కొత్త వస్తువులు,అదేవిధంగా పాతవస్తువులూ కొత్తగా తొంగిచూస్తాయి.



                                                                                                                                                 _____________________ఎం.నారాయణ శర్మ

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ

కరణం లుగేంద్ర పిళ్ళై -బతుకడమంటే
 


సాధారణంగా వర్ణనలో వాక్యాలని రాస్తాం ఈవాక్యాలలో రాసేపద్దతిని బట్టి కొన్ని నమూనాలున్నాయి.ఈ వాక్యాల్లో ప్రశ్నావాక్యాలు,పదసమ్మేళనం లాంటి కొన్ని మార్గాలున్నాయి.ఇందులో సాధారణంగా ఉండే వాక్యాలూ కొన్ని ఉన్నాయి.ఇలాంటివాక్యాలు అంశాన్ని చేరవేయడానికి వాహకాల్లాంటివి.

రెండువాక్యాలని ఒక యూనిట్ గా రాయటమో,రెండుచిన్న వాక్యాలని సమ్యుక్తం చేసిరాయటమో చేస్తాం.ఇలాచేస్తున్నప్పుడు వాక్యాల్లో కొన్ని అంశాలని గమనించవచ్చు.1.ఆఖ్యానం (Neretion)మరొకటి వ్యాఖ్యానం(Comment)ఒక సంధర్భాన్ని,అంశాన్ని కవిత్వీకరిస్తున్నప్పుడు ఈ రెండురకాల వాక్యాలు సర్వ సాధారణంగా కనిపిస్తాయి.

ఆఖ్యానం వస్తువునుగూర్చి చెబితే వ్యాఖ్యానం మన దర్శనంలోని విషయాన్ని చెబుతాయి.ఈరెండిటిలోనూ ఒకదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని నిర్వచనం(Definetion)అంటారు.ఈ నిర్వచనం సంక్షిప్తంగా ఉంటుంది సాధారణంగా.కాని వస్తువునుబట్టి సంగ్రంగా చెప్పాలనుకున్నప్పుడు దీనినిడివి ఎక్కువ అవుతుంది.

పూర్వంలో నీతిశాస్త్రం మొదలుకొని కవిత్వంలో ఇలాంటి వాక్యాలు చెప్పటం మొదలైంది.అంటే ఏమిటి?లాంటివాటికి ఇవి సమాధానాన్నిచెప్పేవి.లుగేంద్ర పిళ్లై"బతుకడమంటే "లో ఈ రకమైన వాక్యాలున్నాయి.జీవితాన్ని అనేకమైన అంశాలనించి కొలవడం ఇందులో కనిపిస్తుంది.వర్ణనలో ఇది సాధారణమే కాని ఇక్కడ పిళ్ళై ఒక వస్తువుచుట్టూ ఈ నిర్వచనాలని నిర్మించారు.

"ఆలోచనల సుడిగాలి
వీచినప్పుడు కొట్టుకుపోని/ఏకాంత ధ్యానమై నిలవాలి"

"భాద్యతల బండరాయి
నిశ్శబ్దాన్ని బద్దలు చేసినప్పుడు/చెదరని సరోవరమై నవ్వాలి"

ఈవాక్యాలన్ని జీవితాన్ని కూడ దీసుకునే బలాన్ని ఇవ్వడానికి నిర్వచిస్తున్నాయి.స్థిరత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఇందులో కనిపించే"ధ్యానం,సరోవరం,విత్తనం,శంఖారవం'అలాంటి అంశాలని సూచిస్తున్నాయి.

"మూగ గొంతు పలికే/పాటకు గొంతుక కావాలి
చెవిటి గుండెకూ వినబడే/చైతన్య శంఖారావమవ్వాలి"

"బతుకంటే జీవిస్తూ/మరణించడం కాదు
బతుకడమంటే/మరణిస్తూ జీవించడమవ్వాలి"

చివరివాక్యాన్ని పైవాక్యాలన్ని విడమర్చి చర్చిస్తాయి.చివరివాక్యపు సమగ్రతకోసం ఇలాంటివి అనేకమందిలో కనిపిస్తాయి.లుగేంద్రపిళ్ళై గారికి వస్తువును వర్ణించే అనుక్రం అర్థమైంది.వాక్యాలు కొన్నిసార్లు నినాదాల్లా కనిపిస్తాయి.కొంత కళాత్మకతను పెనవేసుకుంటే వాక్యాలకు ఆ నిర్దిష్టత చేరుతుంది.సమగ్రనిర్వచనాన్ని చెప్పుకోవడానికి ఈ కవిత మంచి ఉదహరణ.అభినందనలు కరణం లుగేంద్ర పిళ్ళై గారు.
 
                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

కపిల రాంకుమార్ కవిత : కవిత్వానికి మానిఫెస్టో



కొన్నళ్ల తరువాతకావొచ్చు,తొలిదశలోనే కావొచ్చు కవులకు కవిత్వం మీదా,ఆయా రచనల మీదా,ప్రక్రియల మీదా,వస్తువుల మీద కొన్ని అభిప్రాయాలుకలుగుతాయి.నిజానికి ఇవ్వే కొన్ని సార్లు తరువాతి కాలాలకు మార్గదర్శకమౌతాయికూడా.శ్రీశ్రీ "కవితాఓ కవితా".లాంటి కవితలు అలాంటివే.

ప్రాచీన కావ్యంలో కావ్య"ముఖం"పేరుతో అవతారిక ఒకటి ఉండేది.కవులు అలాంటి వాటిలోనే తమతమ అభిప్రాయాలు చెప్పేవారు.ఈ కాలంలో కూడా కవిత్వం ఇలా ఉండాలి అంటూ ఒకటో ,అరో కవితావాక్యాలు రాయనివారుండరు.

కపిల రాంకుమార్ గారు అలాంటి అంశాన్నే కవిత్వం చేసారు.ఇందులో రాంకుమార్ కొంత పూర్వుల మాటలకు విలువనిచ్చి మాట్లాడినట్టు కనిపిస్తారు.సినారే ఒక పద్యంలో "అంత కడివెడు పాలపై ఒకింత మీగడపేరినట్లు మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"అన్నారు.పాతనించి మిగుల్చుకునేది ఎంతో కొంత ఉంటుంది.

"జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ/పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!"

సాధరణంగా కనిపించినా ఈవాక్యాల వెనుక ఓ నేపథ్యముంది.ఈ మాటల వెనుక పరోక్షంగా ప్రాచీన సాహిత్యాధ్యయనాన్ని గూర్చి చెబుతున్నారు.

"అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!"

ఒక వాక్యాన్ని కళాత్మకంగ,ఆలంకరికంగా ఎలాచెప్పాలో తెలియడానికి అధ్యయనం చాలా అవసరం.పురాణాలల్లోనూ ప్రతీకలని పట్టుకోడానికి మార్గాలున్నాయంటున్నారు.నిజమే. బోదెలార్ సుసన్నా లాంటి పాశ్చాత్యులుకూడా వారిపుస్తకాలలో పురుషోత్తముడిలాంటివారిగురించి చెప్పుకున్నారంటారు.ఈ అధ్యయనం ఏ కాలానికైనా చాలావసరమే కదా.

"కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!"
చదివించే లక్షణం (Reedability)ఒకటి కవితకి చాల అవసరం.ఆనడక వెంటే పాఠకుడు పరిగెడతాడు.

"ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే/తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా/హృదయస్పందన కలిగించేలా"

పాల్ వాలరీ"కవిత్వం మేధకు కాదు హృదయానికి చేరాలి" అన్నాడు.అధ్యయనం వల్ల ఇవన్నీ పెద్దగా కష్ట పడకుండానే అలవడుతాయి.కవిత్వం ఎలా ఉన్న బిగుతుగా ,ప్రౌఢభాషతో ఎలావున్నా కవిత్వం లో కవిత్వం కనిపించాలని అంటారు.

చాలావరకు అందరికీ కవిత్వం ఎందుకురాస్తున్నామో అర్థం కాదు.పడికట్టు పదాలతో కవిత్వాన్ని నిలుపుకోలేము.వస్తువూ ఎక్కువకాలం నిలుపదు.కవిత్వమే కావాలి.అందుకోసం హృదయాన్ని ఆవిష్కరించే నేర్పుకావాలి.అందుకు అధ్యయనం, సాధన కావాలి.ఈ రెంటి గురించే రాంకుమార్ గారి కవిత మనకు సూచన లిచ్చింది.ధన్యవాదాలు రాం కుమార్ గారు మంచికవిత.
                                                                                                                                               _____________________ఎం.నారాయణ శర్మ