పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
కవిసంగమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిసంగమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

సంధ్య యెల్లాప్రగడ-తీరని ఒంటరితనం
 



 

కవిత్వానికి సమాజం,వ్యక్తిగతమైన ఉద్వేగాలు కారణాలు.సౌందర్యం లోనూ ఇలాంటి ఉద్వేగాలు వాటికి కారణలుంటాయని పూర్వుల వాదన.వర్ణిస్తున్నప్పుడు స్థితి వర్ణన(status discription)ఒకటి కనిపిస్తుంది.అనుభోక్త(Expeerienser)గా కవిత్వం చెబుతున్న వాళ్లలో ఈతరహా కవిత్వీకరణ కనిపిస్తుంది."నేను"అనేది ఒకటి ఇందులో కనిపిస్తుంది.ఇందులోనూ సమాజం అంతర్గతంగా ప్రవహిస్తుంది.

సంధ్య యెల్లాప్రగడ కవితలో ఈ నేను ఉంది.ఇందులోని స్వరం ఓ ఒంటరితనాన్ని తిరస్కరిస్తూ వినిపిస్తుంది.తాననుభవిస్తున్న ఒంటరితనాన్ని,బాధని కవిత్వీకరించారు.

"తీరని వంటరి తనం
నాకు మాయని గాయాని చేసింది"-
"ఒక్కొక్క కదలిక ఒక్కొక్క పామై..
నా కాలిని మెలి వేశాయి !"
"కన్ను రెప్పల క్రింద దాచిన కన్నీరు
రక్తం లా వెచ్చగా మసులుతోంది!!"
"ఇది సమరమని తెలుసు...
ఇది నా ఒంటరి సమరమని తెలుసు."..
"జయాపజయములు ఏమైనా
వేసే ప్రతి అడుగు లక్ష ప్రశ్నల సమాధానం! "

ఈ కవితని పూర్వ ,పర భాగలుగా చూడవచ్చు.తాననుభవిస్తున్న సంఘర్షణని చెప్పి.రెండవభాగంలో తనకు కావలసింది చెబుతారు.పైది మొదటి భాగం.ఒకతోడులేక తననుభవించే మానసిక సంఘర్షణ ఎదుటివారిలో కలిగించడానికి ఐదు కళాత్మక వాక్యాలుగా అందించారు."గాయం/పాము/మెలివేయటం/కన్నీరు/రక్తం"ఇవన్నీ బాధని తరువాత వాక్యాలు తన నిర్ణయాన్ని,తెగువని చెబుతాయి.


"ఏకాంతంతో సహవాసం
జీవిత గమ్యాలు, దిశా నిర్దేశాలు లేని గమనం
సాగి వేగి కడతేరేది ఎప్పుడో!
స్వచ్చమైన నీ తోడూ దొరికేది ఎప్పుడో!"

ఇది రెండవభాగం.నిజానికి "గమ్యం,దిశానిర్దేశం"లాంటి పదాలు లేకపోతే ఈ కవిత ఎవరిగురించనేది అర్థం కాదు.చెప్పదలచుకున్న అంశాన్ని గాఢంగా చెప్పడం.అందుకోసం నిర్మాణ వ్యూహాలను ఏర్పర్చుకోడం ఇందులో కనిపిస్తాయి.

కవిత్వం రాస్తున్న వాళ్లలో కొన్ని దశలుంటాయి.ఒక గొంతు బలాన్ని వీటినుంచే అంచనా వేయవచ్చు.వస్తువును పట్టుకోవడం దగ్గరినించి,కవిత్వీకరించడం,హృదయాన్ని తట్టే వాక్యాల్ని చెప్పడం వీటివెనుక పదిలమైన సాధన,అధ్యయనం అవసరం.ఇలాంటి సమయాలలో కొంతమంది కొన్ని గుర్తుల్ని అనుసరిస్తుంటారు.తొలి దశని గమనిస్తే పదాలలో బలవంతపు ప్రాసని అనుభవించడం.ఒకటి రెండువాక్యాలు యూనిట్లతో పూర్తిచేయటం లాంటివి.

సంధ్య గారిలో వీటన్నిటినించి తప్పించుకున్న పరిఙ్ఞానం ఉంది.ఇంకా కొంత స్పష్టమైన నిర్మాణ ధార ఈకవితకి కావాలి.మరిన్ని మంచి కవితలు సంధ్య గారినుంచి ఆశిద్దాం.


                                                                                                                  
                                                                                                              __________ఎం. నారాయణ శర్మ    

కవిత్వ విశ్లేషణ

కట్టా శ్రీనివాస్-ఎరుక







విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.

జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య ,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి "ఎరుక"నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.

ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.

"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను."
"దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది."
"రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"

ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.

"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."

ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది."చిన్నారి బుగ్గలు పుణికి నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు." ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.

అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.


                                                                                                        _____________ఎం. నారాయణ శర్మ  

కవిత్వ విశ్లేషణ

రాళ్లబండి కవితాప్రసాద్ -ఎగిరివొచ్చిన హంస





 



"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.


డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యాత్మిక అంశాలలో "హంస"శబ్దం ఙ్ఞానానికి ప్రతీక.పురాణాదులలో జీవం"పక్షి"గా చెప్పబడింది.ఈ హంసని ప్రతీకగా చూపుతూ ఈ కవిత సాగుతుంది.

ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది.

"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను.
నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది .
నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది .
నేను ఎగురుతున్నాను ......."

మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న తీరు తరువాతి అనేకాంశాలలో కనిపిస్తుంది.


"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది .
మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది .
ఇంకోసారి మేఘమవుతుంది .
నేను హిమాలయమై నదుల రెక్కలతో
పీఠ భూముల్లో ప్రవహిస్తాను "

ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.


"భూమ్మీద కావ్యాలు
అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్,
కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"

కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎగరడం మాని వ్యాపిస్తున్నానని"అంటారు.అప్పుడు రెక్కలు మొలిచాయి.వ్యాపిస్తున్నపుడు మొలిచిన
రెక్కలివి.

"రెక్కకొక కొత్త కన్ను.
రెక్క కింద మెదడు "

మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని అపేక్షించి,ఆకర్షిస్తుంది.కన్ను దృష్టికి ప్రతీక.దృష్టి లేదా దర్శనం ఙ్ఞాన వాహిక.ఈ దర్శనమే ఉన్నతీకరిస్తుంది.ఈ తర్కం తరువాత కవిత్వాన్ని నిర్వచిస్తారు.

"కవిత్వం వ్యక్తికి కాదు ,
ప్రపంచ హంసకు పర్యాయపదం"

అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి దివ్య జీవితానికి,ప్రశాంతతకు మార్గమైన దర్శనాన్ని ఈ కవిత చిత్రించింది.వస్తువుమత్రమే కాకుండా అందించిన తీరులోనూ ఈ కవిత ఉన్నత మైనది.

"ఇప్పుడు ఎగరడంమాని వ్యాపిస్తున్నాను !
శరీరమంతా హృదయం వ్యాపించింది !"

"నా భూమి ఒకకొత్త పద్యం లా కనిపిస్తోంది ."


మంచి కవితను మనందరికీ పంచి కవిత్వాన్ని కొత్తగానిర్వచించినందుకు కవితా ప్రసాద్ గారికి ధన్య వాదాలు.

"జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే జరామరనజం భయం"


                                                                                                           _____________ఎం. నారాయణ శర్మ 

కవిత్వ విశ్లేషణ

సి.వి.శశారద గారి కవిత :









 




ప్రపంచీకరణ పర్యవసనాలవల్ల కుటుంబ జీవితాలు ఛిన్నమయ్యాయి.ఇంట్లో ఉన్న నలుగురు నలుగువైపులా వెళుతూ ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి.విధ్యార్థులైతే సగటుగా ఇంటర్ విద్యనుంచే కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరీస్థితి.చదువులకోసం,ఉద్యోగాలకోసం పుట్టిపెరిగిన ఊరికి,కుటుంబానికి దూరంగా ఉండటం. ఈ కాలనికి ఒకటి,రెండుతరాలనించి కనిపిస్తుంది.


ఇలాంటి సందర్భం నుంచే ఒకకూతురుగొంతుక తన తల్లితండ్రులకు దూరమౌతున్న సందర్భాన్ని కవిత్వీకరించారు సి.వి.శారద.ఇలాంటి సందర్భంలో గతంలో తండ్రిగొంతుకనించి వచ్చిన కవితలున్నాయి.శ్రీ జింబో(మంగారి రాజేందర్)"చూస్తుండగానే"లో ఇలాంటివి కనిపిస్తాయి.కూతురు/కుమారుని గొంతుకనించి కనిపించవు.వస్తుసందర్భం,దాని మూలవస్తువులో సారూప్యతలున్నప్పటికీ ఇది ఈకాలానికి సంబందించి కొత్తవస్తువే.

రచనకు సంబంధించి రచనాపరిమితి(Limiteation of a writing)ఉంటుంది.దీన్నికూడా స్థలపరిమితి(Spase Limitetion)కాల పరిమితి(Time Limitetion)అని విడదీయొచ్చు.ఆఖ్యానంలో సత్యానికి సంబంధించిన ఆకళింపు ఉంటుంది. ఈ ఆకళింపులో స్వభావం ఉంటుంది.ఈ స్వభావమే రచన గొంతుని చూపుతుంది.ఈ పరిమితిని స్వభావపరిమితి(Personal Limitetion)అంటారు.

శారద కవితలో స్థల,కాల,స్వభావాలు ప్రత్యేకంగా ఉండటంవల్లే ఈ కవిత కొత్త దనాన్నిపులుముకుంది.నిర్మాణ గతంగా చూపిన శ్రద్ధకూడా శైలిని ప్రత్యేకించి చూపుతుంది.ప్రధానంగా వస్తువుని ప్రసారం చేయడానికి వాడుకున్న ప్రశ్నా వాక్యల పద్దతి రూపముఖంగాబాగా ఉపకరించింది.


"జీవితాన్ని వెతుక్కుంటూ, లక్ష్యాల్ని మోసుకుంటూ
ఉద్యోగమూ, చదువూ అంటూ
ఊరూ ఇల్లూ దాటుతుంటే
'అప్పుడే వెళ్తున్నావా?' ప్రశ్నిస్తాయా కళ్ళు!"

"'ఇంకో రెండు రోజులుండరాదూ?'/ఉండలేను!
'పోనీ తొందరగా వచ్చేస్తావా?'/చెప్పలేను!!
యదార్థాన్ని దాచలేక తల వంచుకుంటాను
వంగి కాళ్ళన్ని తాకితున్నప్పుడు
వర్షించే ఆ కళ్ళని నేనెప్పటికీ చూడలేను
'వెళ్తానమ్మా' అంటానా?/వెళ్ళిరమ్మంటాయా కళ్ళు
'వీలైతే తొందరగా వచ్చేస్తానమ్మా' అంటానా?
అబద్ధాన్ని పట్టేస్తాయా కళ్ళు"

ప్రశ్నలకు సమాధానాలుగా మౌనంగా అనుభవిస్తున్న సంఘర్షణని చిత్రించారు.ఇదంతా మనోగతంలా ధ్వనిస్తుంది.ఈ భాగం తరువాత తానుగా ఆ సఘర్షణని కవిత్వం చేస్తారు.ఈ క్రమంలో ఈ కవిత రెండు భాగాలుగా కనిపిస్తుంది.మొదటిభాగం సందర్భంలోకి తీసుకువెళ్లటానికి ఉపయోగ పడితే రెండవభాగం ఆగొంతుకని సారవంతం చేస్తుంది.



"నేను వెళుతున్న దారిలో ఆ కళ్లు
దృక్కులు పరిచాయని తెలుసు
వెను తిరిగి చూడలేను!"

"నిండు శ్రావణ మాసపు మేఘాల్లా ఆ కళ్ళు
వర్షిస్తూనే ఉంటాయని తెలుసు!
వెను తిరిగి చూడలేను!!"

"ఎదగాలని పోరాటం/ఎగరాలని ఆరాటం
గూడొదిలిన పక్షుల
రెక్కల చప్పుళ్ళు గుండె నిండా వినిపిస్తాయి.."

ఈమూడువాక్యాలలో మొదటిరెండు కళాత్మకమైనవి.హృదయాన్ని చేర్చడానికి వాటిపరిధిమేరకు అవి ప్రవర్తిస్తాయి.ఈ కవితలో గమనం, స్పందన అనే పద్ధతిలో వాక్యాలను నిర్మించారు.


చాలాసార్లు కొత్తతరం కవిత్వం రాయడంవల్ల కొత్తవస్తువులు గొంతులు వినిపిస్తాయని చెప్పుకున్నాం.ఈ గొంతుక అంతే తాజాగా తనదైన ఊహలో,ఉనికిలో ఉంది.సాధరణంగా కొత్తగ రాస్తున్న వాళ్లలో పాతవారిని అనుసరించే గుణం ఉంటుంది.అది భాష,వాక్యాలకే కాని మిగత విషయాలకు కాకూడదు.ప్రధానంగా వస్తువు.ఎవరికైనా ఆయాజీవితల్లోనించే వస్తువులు రావాలి.మంచికవితనందించి నందుకు సి.వి.శారద గారికి అభినందనలు.ఈ దారిలోనే ఈతరం వస్తువుల్ని మరిన్ని పరిచయం చేయాలని ఆశిద్దాం.

శారద గారు శీర్షికని రాయడం మరచిపోయారు.శీర్షిక గొంతుని,స్వభావాన్ని ప్రదర్శిస్తున్న సారాన్ని ప్రతిబింబించాలి.రాస్తరని ఆశిస్తాను. 


                                                                                                      _____________ఎం. నారాయణ శర్మ

21, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

షoషాద్ మహమ్మద్ గారి కవిత-మిగిలే ఈ రోజుని
 


గతకాలానికి సంబంధించిన వ్యక్తులు,భావాలు,సంఘటనలు,తిరిగి మననం చేసుకుంటూ రాయడాన్ని పునశ్చరణం(Anamnesis)అంటారు.గతాన్ని తార్కికంగా వ్యక్తం చేయడానికి ఇందులో మంచి అవకాశం ఉంటుంది.ఎక్కువగ జీవిత భావనలను వ్యక్తం చేయడానికి ఇలాంటి వాక్యాలు రాస్తారు.

షoషాద్ మహమ్మద్ గారు రాసిన కవితలో ఈ భావ జాలం ఉంది.ఈ అంశం వెనుక బలమైన స్త్రీగొంతుక వినిపిస్తుంది.అది గతాన్ని,వర్తమానాన్ని రేపటిని కూడా తార్కికంగా చిత్రించింది.ఆ రేపుని శూన్యంగా.

"ఎన్నెన్ని రాక్షస యుద్దపు చీకట్లు
ఓడిపోతున్న మనసును
ప్రతీ సారీ చంపేసుకున్నాను
నిన్నటి నా చరిత్ర

కావాల్సిందేదో
మనసుకెదురై ముసుగుతీసేసినట్టు"

ఈ వచనంలో భారమైన అనుభవశక్తి ఉంది."రాక్షస యుద్ధం""యుద్ధపు చీకటి"లలో అణచివేతని,"ఓడిపోతున్న మనసును""మనసుకెదురై ముసుగు తీసేసినట్టు"లలో కొల్పోతున్న జీవితాన్ని గూర్చి కనిపిస్తుంది.

ప్రతీ వాక్యంలోనూ ఒక అసహనం కనిపిస్తుంది.

'ప్రేమ యుద్ధానికి ఆహ్వానం
గెలుపైనా ఓటమైనా ఇద్దరిది
నిజంకాలేని రేపటి నా ఊహచిత్రం"

"చరిత్రకు సాక్షం
నా ఒడిలో
ఊహకి స్థానం నా గుండెల్లో"

తాను బందీ అవుతున్న అంశాన్ని చిత్రించిన సంధర్భాలు.వాక్యంలో గాఢతకనిపిస్తుంది.వస్తువు విషయంలో పోలిక లేదుకానీ గతంలో స్కైబాబాగారు రాసిన "దుఃఖనామా"కవితలోని వాక్యాలతో పోలికలున్నాయి.ఆ శైలి ఇందులో కనిపిస్తుంది.కొత్తగా రాస్తున్నట్టు కనిపించినా షoషాద్ గారిలో బలమైన గొంతుక ఉంది.మరిన్ని కవితలతో త్వరలోనే తానోప్రత్యేకమైన గొంతుగా కనిపిస్తుందనటానికి ఏమాత్రం సందేహపడ నవసరంలేదు.
 
 
                                                                                                               ______________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

బూర్ల వెంకటేశ్వర్లు-ఎన్నీల ముచ్చట్లు
 



తెలుగులో ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది.ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని సారవంతంగా,సహజాతి సహజంగా అందించింది.ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి సంబంధమైన కవిత రాయవచ్చాలేదా అనే చర్చలు జరిగాయి.బూర్ల వెంకటేశ్ కవిత అందుకు సమాధానం చెబుతుంది.

వెన్నెలని ఆధారం చేసుకొని చాల గొప్ప భావచిత్రాలతో ఈ కవితని నిర్మించారు బూర్ల.బూర్ల దర్శనంలో తన్మయీ భావంకనిపిస్తుంది.వెన్నెలని చాలా భిన్నంగా తెల్లటి దుప్పటిలా,పాలలా,వరిగొలుకల్లా,వెండిలా,తెల్ల కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు.బూర్ల దర్శనంపై వర్ణ(colour) ప్రభావం కనిపిస్తుంది.నిజానికి వెన్నెలని చల్లనిదనేదృష్టితో చూస్తారు.

"ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె
నేను ఇంట్ల ఉంటే/కిటికిలకెల్లి తొంగి చూస్తది
బైటికివోతె/ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది"

"రాత్రిరాత్రంత/తెల్లటి దుప్పటిగప్పి
నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లుమూసుకుంటే
మనుసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది"

"పొద్దుగాల పాలువిండేటప్పుడు
సర్వలదునికి జాక్కుంటది"

"ఆకాశంల నిలవడి నాకోసం తపస్సుజేసి/వరిగొలుకల అవతారమెత్తి
నా గుండిగెల నిండుతది/సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి
రమ్మని చేతులు చాపుతె/తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి
తనమనుసు తెల్లకాయిదం జేసి/నాకు ప్రేమలేఖ పంపిస్తది"

వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు.కోడ్ చేయగలిగితే అన్నివాక్యాలు అంతే బలమైనవి.తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో ఉన్న మార్దవాన్ని,మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది.సాధారణంగా తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ కనిపిస్తుంది.వెంకటేశ్ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు."తొంగి చూసు/ఎంటవడు/ముచ్చటవెట్టు/దునుకు/జాక్కొను/కుమ్మరిచ్చు/ఇనుకుంట"ఇలాంటివి కనిపిస్తాయి.

"చెప్పాలె/ఉంటే/వోతె 'లాంటి క్రియలుకూడా సహజత్వాన్ని ప్రదర్శిస్తాయి.కవిత్వానికి బూర్ల కొత్తకాదుకాని తనని నిలబెట్టే
కవితలో ఇదీ ఒకటవుతుంది.

"ఆమె కాళ్ళపట్టీల నుంచి రాలిపడ్డ గజ్జెలు
పక్షులగొంతుల్ల చేరి
ఉదయపు పాటలైతయ్"

ఇలాంటి మంచి ఊహలతో,భావచిత్రాలతో వెంకటేశ్ మరిన్ని మంచికవితలని అందిస్తడని ఆశిద్దాం.అభినందనలు బూర్ల వెంకటేశ్ గారు.
 
                                                                                                              ______________ఎం.నారాయణ శర్మ
 

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

కె.ఎన్.వి.ఎం.వర్మ-గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల




 






నైవ రాజ్యం న రాజాసి నదండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వే రక్షంతి చ పరస్ఫరం




(రాజ్యములేదు,రాజులేడు దండించేవాడు దండింప బడేవాడులేడు.ధర్మాన్నొకదాన్ని తాముగ నిర్మించుకుని ప్రజలు పరస్పరం ఒకరినొకరు రక్షించుకునేవారు)భారతం శంతి పర్వం లోని ఈశ్లోకం రాజ్యం యొక్క డొల్లతనాన్ని చెబుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో నైతే పాలన,చట్టం,న్యాయం అనే అంశాలు వ్యష్టిగా పనిచేస్తాయి.అందువల్ల రాజ్యం దాని ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.


వర్తమానంలో ప్రజాప్రతినిధులు కేవలం పార్టీనాయకులుగా ప్రవర్తించడం వల్ల ప్రజా ఉద్యమాలు అణచబడుతాయి.అందువల్ల తమ ఆకాంక్షలకోసం పోరాడేప్రజాచైతన్యం అనేక సార్లు మోసం చేయబడుతుంది.పోరాట ఫలితాలను ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా నాయకుల ఆలోచనలకు దగ్గరగా నియంత్రించ బడతాయి.అందువల్ల ఉద్యమకారుడు ఎప్పుడూ ఒక స్థితిలోనే ఉంటాడు.


కొన్ని సంఘాలని చూస్తే ఈ అంశం అర్థమౌతుంది.కొన్ని సమీకరణాల మేరకు ఒకే చింతనగలిగిన సంస్థలుకూడా వేరై పూర్వపు భాగస్వామ్య పక్షాలనే మళ్లీ నిషేదించాయి.పాలన రూపాన్ని మార్చుకుంటుందిగాని తననడవడినికాదు.

కె,ఎన్.వి.ఎం.వర్మ కవిత అలాంటి పోరాటాన్ని చేసిన వీరుని మనస్సులోని సంఘర్షణని చిత్రించింది.

'నేల తల్లిని దోసిలోకి తీసుకొని/కళ్ళ కద్దు కున్నాను,
చెమట రక్తం తడిసిన మట్టివాసనలోంచి/వనాన్ని ఆఘ్రాణిస్తిన్న కల."

"నిశబ్దాన్ని మౌనాన్ని చీల్చుకొంటూ/కెవ్వుమని నావీపు పై విరిగిన లాఠీ
పడదోసి కసితీరా తన్ని భూట్లు/వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాకా...
నా ఆకుపచ్చని కలని/ఆ గుప్పెడు మన్నుని
నాలుగు సిం హాల కళ్ళలోకి విసిరి/చీకటిలోకి మాయమయ్యాను."


వస్తుసంబంధంగా కవితా వచనంలో భావాభివర్గాలు(Ideological groops)ను గుర్తించవచ్చు.వస్తువు వాస్తవిక,సౌందర్య,తాత్విక మొదలైన వర్గలలో ఎవర్గానికి చెందుతుందనేది ఈ అంశం చెబుతుంది.వర్మ వాస్తవికతకి సంబంధించిన వస్తువును తీసుకున్నారు.కాని ఆఖ్యానం(Neretion)లో దాన్ని సౌందర్యనికి దగ్గరగా తీసుకువెళ్లారు."పచ్చనికల""వనాన్ని ఆఘ్రాణించడం"మొదలైన వి అందుకు ఉదాహరణ ."ఆకుపచ్చని కలని సిం హల కళ్లలోకి విసరడం"వ్యక్తిగత రక్షణని చూపుతుంది.

అకుపచ్చని కల ఆకాంక్షకి.నాలుగుసిం హాలు పోలీస్ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.


"ఎన్ని జెండాలు మోసినా,
యధాతదం చరిత్ర మొత్తం"

ఈ వాక్యం ఉద్యమ సంస్థల,పాలనల డొల్లతనాన్ని చెబుతుంది.ఫలాలను అందుకునే అవకాశం ప్రజకు చిక్కటం లేదనే అంశాన్ని నొక్కి చెబుతుంది.

కవిత చిన్నదైనా ,నిర్మాణం ,అభివ్యక్తి విషయంలో మంచి పరిఙ్ఞానం కనిపిస్తుంది.వస్తుగతంగా అంశం పాతదే అయినా చూసిన దర్శనంలో కొత్తదనముంది.ఇంకా మంచికవితలు వర్మ గారినుండి ఆశిద్దాం.


                                                                                                                                                      ______________ఎం.నారాయణ శర్మ

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ

కరణం లుగేంద్ర పిళ్ళై -బతుకడమంటే
 


సాధారణంగా వర్ణనలో వాక్యాలని రాస్తాం ఈవాక్యాలలో రాసేపద్దతిని బట్టి కొన్ని నమూనాలున్నాయి.ఈ వాక్యాల్లో ప్రశ్నావాక్యాలు,పదసమ్మేళనం లాంటి కొన్ని మార్గాలున్నాయి.ఇందులో సాధారణంగా ఉండే వాక్యాలూ కొన్ని ఉన్నాయి.ఇలాంటివాక్యాలు అంశాన్ని చేరవేయడానికి వాహకాల్లాంటివి.

రెండువాక్యాలని ఒక యూనిట్ గా రాయటమో,రెండుచిన్న వాక్యాలని సమ్యుక్తం చేసిరాయటమో చేస్తాం.ఇలాచేస్తున్నప్పుడు వాక్యాల్లో కొన్ని అంశాలని గమనించవచ్చు.1.ఆఖ్యానం (Neretion)మరొకటి వ్యాఖ్యానం(Comment)ఒక సంధర్భాన్ని,అంశాన్ని కవిత్వీకరిస్తున్నప్పుడు ఈ రెండురకాల వాక్యాలు సర్వ సాధారణంగా కనిపిస్తాయి.

ఆఖ్యానం వస్తువునుగూర్చి చెబితే వ్యాఖ్యానం మన దర్శనంలోని విషయాన్ని చెబుతాయి.ఈరెండిటిలోనూ ఒకదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని నిర్వచనం(Definetion)అంటారు.ఈ నిర్వచనం సంక్షిప్తంగా ఉంటుంది సాధారణంగా.కాని వస్తువునుబట్టి సంగ్రంగా చెప్పాలనుకున్నప్పుడు దీనినిడివి ఎక్కువ అవుతుంది.

పూర్వంలో నీతిశాస్త్రం మొదలుకొని కవిత్వంలో ఇలాంటి వాక్యాలు చెప్పటం మొదలైంది.అంటే ఏమిటి?లాంటివాటికి ఇవి సమాధానాన్నిచెప్పేవి.లుగేంద్ర పిళ్లై"బతుకడమంటే "లో ఈ రకమైన వాక్యాలున్నాయి.జీవితాన్ని అనేకమైన అంశాలనించి కొలవడం ఇందులో కనిపిస్తుంది.వర్ణనలో ఇది సాధారణమే కాని ఇక్కడ పిళ్ళై ఒక వస్తువుచుట్టూ ఈ నిర్వచనాలని నిర్మించారు.

"ఆలోచనల సుడిగాలి
వీచినప్పుడు కొట్టుకుపోని/ఏకాంత ధ్యానమై నిలవాలి"

"భాద్యతల బండరాయి
నిశ్శబ్దాన్ని బద్దలు చేసినప్పుడు/చెదరని సరోవరమై నవ్వాలి"

ఈవాక్యాలన్ని జీవితాన్ని కూడ దీసుకునే బలాన్ని ఇవ్వడానికి నిర్వచిస్తున్నాయి.స్థిరత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఇందులో కనిపించే"ధ్యానం,సరోవరం,విత్తనం,శంఖారవం'అలాంటి అంశాలని సూచిస్తున్నాయి.

"మూగ గొంతు పలికే/పాటకు గొంతుక కావాలి
చెవిటి గుండెకూ వినబడే/చైతన్య శంఖారావమవ్వాలి"

"బతుకంటే జీవిస్తూ/మరణించడం కాదు
బతుకడమంటే/మరణిస్తూ జీవించడమవ్వాలి"

చివరివాక్యాన్ని పైవాక్యాలన్ని విడమర్చి చర్చిస్తాయి.చివరివాక్యపు సమగ్రతకోసం ఇలాంటివి అనేకమందిలో కనిపిస్తాయి.లుగేంద్రపిళ్ళై గారికి వస్తువును వర్ణించే అనుక్రం అర్థమైంది.వాక్యాలు కొన్నిసార్లు నినాదాల్లా కనిపిస్తాయి.కొంత కళాత్మకతను పెనవేసుకుంటే వాక్యాలకు ఆ నిర్దిష్టత చేరుతుంది.సమగ్రనిర్వచనాన్ని చెప్పుకోవడానికి ఈ కవిత మంచి ఉదహరణ.అభినందనలు కరణం లుగేంద్ర పిళ్ళై గారు.
 
                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ
 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

వంశీధర్ రెడ్డి కవిత-ఓ రోజెందుకో,

         
                 




చాలానాళ్లక్రితం"చితి చింత"లో"మో" నరాల సంగీతం అంటూ ఓ కవిత రాసారు.అది దుఃఖానికి సంబందించిన బాహ్య స్థితిని ప్రతీకలనుపయోగించి చెప్పిన కవిత.వంశీధర్ కవిత(ఓ రోజెందుకో)లోనూ వస్తు గతంగా ఆకవితకి సారూప్యతలున్నాయి.

1966 తరువాత తెలుగులోనేకాక,మొత్తం సాహిత్యంలోనే ఒక కొత్త ఉనికిని,అభివ్యక్తిని మోస్తూ వచ్చింది వినిర్మాణం.ఈ వాదంలోని కొన్ని అంశాలని విమర్శ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది.

1.భాషకి,పదానికి నియతమైన ఉనికి ,మూలాలు ఉండవని నమ్మటం.
2.విమర్శకులు (నిర్మాణవాదులు)కవితా వివేచనలో చెప్పే కేంద్రం(center)అంచులు(feriferi)వంటివి లేవని విశ్వసించింది.
3.అనుభూతిని వ్యక్తం చేయడానికి అగాథం ఉంటుందని నమ్మింది.
4.సంపూర్ణత్వం అనేది భ్రమ అని అన్నీ అసంపూర్ణాలేనని నమ్మటం.
5.ఏ అంశంపై మరే అంశపు ఆధిపత్యం ఉందకూడదని ఆలోచించింది.
6.రచనలోని ఖాళీలగురించి,అనేకమైన అప్రధాన మైన విషయాలని కూడా పట్టించుకుంది.
6.ఇది స్వీయ మానసిక వాదంపై ఆధార పడుతుందని విమర్శకులు అభిప్రాయ పడ్దారు.
వంశీలో ఈ రకమైన మానసిక సంస్కారం కనిపిస్తుంది.
7.నిహిలిజం లాంటిపిడివాదాన్ని మోసిందని,ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టతను సృష్టించిదని నిందలుకూడాపడింది.

తెలుగులో కొందరు ఈ తరహాకవితలు రాసినా మో ఒకరే వినిర్మాణ కవిగా కనిపిస్తారు.వంశీధర్ ని ఒక కవిత తో నిర్ణయించేయలేం కాని గతంలోని కవితలని చూసాక ఇందుకు కొంత అవకాశమూ లేక పోలేదు.

మో కవిత్వంలో ప్రతీకలని ఎక్కువగా వాడుకునేవారు.వాటి ఉనికిని వాటికి ఆపాదించే స్వభావాలని సాధారణం కంటే భిన్నంగాఉపయోగించేవారు.శ్రీరామ్మూర్తి లాంటివాళ్లు సంస్కృతం,లాటిన్,లాంటి భాషలతో పాటు మెడిసిన్లోని పరిభాషని వాడారు.వాక్యాలక్రమాన్ని మార్చిరాయటంకూడ కొందరిలో కనిపిస్తుంది.

వంశీధర్ లో స్వీయమానసిక వాదం కనిపిస్తుంది.సహజంతో వైవిధ్యమైన ,వైరుధ్యమైన భాషని,వాక్యాన్ని ప్రేరేపించేదిదే.

వంశీవాక్యరచనకి అసంబంధస్వభావాలని,ఉపయోగాలని చేర్చడం ద్వారా అవగాహనకు సంబంధించి ఒక అగాధాన్ని సృష్టిస్తారు.సూత్రప్రాయంగా ఇందులో ఒక అర్థవాహిక పని చేస్తుంది.

"ఏడుపునీళ్లనిగాలిలో విత్తడం"
"వెంట్రుకనై కురవాలనిపించడం"
సీతాకోకని చుట్టడం" ఇవి అవగాహనకు దూరంగా కనిపించినా ఒక అర్థ వాహకం ఉంది-విషాదంలో వెంట్రుకలస్థితి,కోక అనేపదానికి సంబందించిన ఉనికి ఈ వాహకాన్ని సృష్టిస్తుంది.చాలవరకు ఇందులో కొన్ని స్థితి సమీకరణాలని ఉపయోగించారు.

మరో వాక్యంలో-దేవుడి మునిమనవలు పలకలు తీసి పాడు బొమ్మలు గీసేదాక-అంటూ రాస్తారు ఇందులోనూ మోకాళ్ల నడుమగడ్డం పెరగటం..మునిమనవలు,కాల సమీకరణాన్ని
చూపుతాయి.

ఎవరో దేవతట-అనే వాక్యంలోమేల్కోవడం అనే స్థితి ఉంది..స్వభావ గతంగా ఇదికొంత వేదాంతాన్ని ధ్వనిస్తుంది.కలలు మారటం పర్యవసానం.చివర్లో ఆక్రొశాన్ని ద్వనించే స్థితి ఒకటి ఉంది-దేవుడు చనిపోయాట్ట అనేవాక్యంలో..

స్వీయ మానసికవాదమొకటిఉందని తెలిసిందే..ఇది సహజానికి విరుద్దమైన భాషని,వాక్య రచనని ,నిర్మాణాన్ని,ప్రతీకల్ని ప్రేరేపిస్తుంది.ఇలాంటి కవితా మార్గాలని అర్థం చేసుకోడానికి కావల్సిన దర్శన గ్రంధాలుతెలుగులో ఎక్కువగా అందుబాటులోలేవు.బి.తిరుపతి రావుగారు రాసిన"పోస్టు మోడర్నిజం"-ఆయనే మో కవిత్వానికి రాసిన 1,2 పీఠికలు,సమీక్షలు."మిసిమి"పత్రిక వేసిన ప్రత్యేక సంచిక.మినహా కనిపించవు.కళతత్వశాస్త్రం -మౌలికాంశవివేచన అనేగ్రంధంలో డా.ముదిగొండ వీరభద్రయ్య కొంతచర్చించారు.

వంశీధర్ లో తనదైన మార్గం ఒకటి ఉంది.ఇది పైన చెప్పుకున్న భాషా,మనసిక సంస్కారాలకు దగ్గరిది.ఈ మార్గంలోవంశీసాధన గమనించదగింది.

4.8.2013





                                                                                                                _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

శివసాగర్ కవిత-నడుస్తున్న చరిత్ర


       
తెలుగు నేలమీద సోషలిస్టుపార్టీల ఆవిర్భావం తరువాత ఆ తాలూకు తాత్వికతలు,దృక్పథాలు అనేక అంశాలపై ప్రతిఫలించాయి.ఆ మార్గంలో ప్రత్యేక సాహిత్య మార్గాలు కూడావచ్చాయి.మార్క్సిస్ట్ సాహిత్య విమర్శనాపద్దతులు పాదుకొనడానికీ ఊతమిచ్చాయనటం కూడా అతిశయోక్తికాదేమో..బహుశఃఅభ్యుదయవాదం నుంచి అనంతర ప్రజా ఉద్యమ ధోరణులలో కూడా ఈ వాస్తవికత ప్రభావాన్ని కాదనలేం.

విమర్శలోనూ ఈమార్గంలో సవిమర్శక వాస్తవికత(Critical Realism)సామ్యవాద వాస్తవికత(Socialist Realism)అనే రెండు పదాలు కనిపిస్తాయి.మొదటిది-సమాజంలోని వ్యత్యాసాలను,వైరుధ్యాలను గుర్తించి,చిత్రించే ప్రయత్నం చేసింది.రెండవది సవిమర్శకవాస్తవికత కన్న ముందడుగు వేసి మార్క్సిస్ట్,లెనినిస్ట్ సిద్ధాంతాల ద్వారా-విప్లవం ద్వారానే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మింది.

ఇందుకోసం సోషలిస్టు వాస్తవికత ఓ తాత్విక ధారని సృష్టించింది.ఇందులో కొన్ని ప్రధాన అంశాలని గుర్తించవచ్చు.
1.విషయాలను పైపైన చూడటంగాక వాటికారణాలనూ అర్థంచేసుకోవడం మొదలుపెట్టింది.
2.ప్రతి అంశాలూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయని అభివృద్ధికి వర్గాలమధ్య సంఘర్షణ తప్పదని నమ్మింది.
3. పీడిత ప్రజల పక్షపాతంతో వారిలో చైతన్య సాధన ,నూతన సమ సమాజ స్థాపనకోసం ప్రయత్నించింది.

శివసాగర్ కవిత్వంలో రెండు తాత్విక ధారలు ప్రధానంగా కనిపిస్తాయి.అవి వైప్లవిక ,దళిత ఉద్యమాలు.ఈ రెంటికీ దగ్గరగా ఉన్నదే సోషలిస్టు వాస్తవికత.నిజానికి దళిత సాహిత్యానికి ఓ మేనిఫెస్టో లాంటి నిర్మాణ దార్శనికతనిచ్చిన కవిత శివసాగర్ ది.శంబూకుడు,ఏకలవ్యుడు మొదలైన పాత్రలని దళిత ప్రతీకలుగా అందించిన కవిత"నడుస్తున్న చరిత్ర". ఇప్పటికీ దళిత సాహిత్యాన్ని అంచనా కట్టడానికి శివసాగర్ కవిత సాహిత్య ప్రమాణం(Litarary Criterion).

"శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో/
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్దలితో నరుకుతున్నాడు"

"మనువు కళ్లలో సూదులు గుచ్చుకుని
నాలుక తెగ్గోసుకుని/చెవిలో సీసంపోసుకుని/
స్మశానంలో దొర్లుతున్నాడు"

వాద నిర్మాణంలోప్రాతిపదికగా మూడు సమీకరణలున్నాయి.ఇవి వాటి గమనాన్ని నిర్దేశిస్తాయి.1.స్వీయ అస్తిత్వోద్దీపన 2.తిరస్కారం 3.ధిక్కారం.ధిక్కార దశలోనే వాక్యాల్లో ప్రతీకార స్వరం వినిపిస్తుంది.ప్రతీకార,సంఘర్షణల్లోనే చరిత్ర పునర్నిర్మాణమౌతుంది.ఈ స్వరం ఈ కవితలోని అన్ని వాక్యాల్లో కనిపిస్తుంది.

శివసాగర్ తరువాతి కాలం శంబూకున్ని,ఏకలవ్యున్ని దళితప్రతీకలుగా అనేకసార్లు చిత్రించింది.బలిని తక్కువే.శివసాగర్ తరువాత కవిత్వం కర్ణుడిని కూడ ప్రతీకగా పరిచయం చేసింది కానీ ఈప్రతీకను కూడ తరువాతి కాలాల్లో కొనసాగించినట్లు కనిపించదు.ఈ మార్గంలోనే ఎండ్లూరి సుధాకర్"గోసంగిని"పరిచయంచేసారు.

జాషువా గబ్బిలం దళిత వాదానికి ఒక స్పృహని ఇచ్చివెళితే శివసాగర్ దానికి ఒక చైతన్యాన్ని దార్శనిక అస్తిత్వాన్ని చారిత్రక దృష్టిని ఇచ్చారు.

సాహిత్య చరిత్రకు ప్రధాన ఆకరమైన ఈకవితను పునఃపరిచయం చేసినందుకు కపిల రాంకుమార్ గారికి ధన్యవాదాలు.

7.8.2013







                                                                                                            _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



 





తెలుగులో1980 కి ఈవలిదశనుంచి సాహిత్యంలో స్త్రీవాదం ఒకటి కనిపిస్తుంది.60 కాలాలల్లోనే అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ వంటి దేశాలలో వీటి జాడలున్నాయని విశ్లేషకుల మాట.దీనిని ఆనుకొని ఒకవిమర్శాపద్దతికూడా ఉన్నప్పటికి దీని క్రమ వికాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.

తొలి దశల్లో ఆర్థిక ,సామాజిక,సాంస్కృతిక అసమానతలపై దృష్టి పెట్టిన స్త్రీవాదం ఇప్పుడు మానవీయ విలువలతో జీవితాన్ని చిత్రిస్తూ కొత్త కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తొంది.


సంస్కృతంలో శ్రీనివాస రథ్ అనే పండితుడు "తదేవ గగనం సైవ ధరా"అనే సంపుటిని ప్రచురించారు.అందులో ఓ చోట"శాస్త్రగతా పరిభాషాధీతా గీతామృతకణికాపి నిపీతా,కో జానీతే తథాపి భీతా కేన హేతునా విలపతి సీతా"(విఙ్ఞాన శాస్త్రాలలో వృద్దిని సాదించాం,భగవద్గీతను కొత్తగా అర్థం చేసుకో గలిగాంగాని ఇప్పటికీ సీత(స్త్రీ)ఎందుకు దుఃఖిస్తుందో ఎవరికి తెలుసు)అన్నాడు.

సాంకేతిక పురోగతిని అభివృద్దిగా చెప్పుకుంటున్న సందర్భంలో నైతికంగా ఎలా మానవీయ విలువలని కోల్పోయామో ఈ వాక్యాలు చెబుతాయి.

జ్యోతిర్మయి మళ్ల గారికవిత కూడాఇలాంటిదే..ఆధునిక దశలో సాహిత్యం మనోవైఙ్ఞానికాంశాలమీద దృష్టిపెట్టింది.ఈక్రమంలో జ్యోతిర్మయిగారు రెండు పాత్రల మనస్సులను,అందులో ఒకేపదంపై స్వభావగతంగా ఉండే భావనలనుదర్శించి కవిత్వీకరంచడం కనిపిస్తుంది.కవిత్వంలో పెద్దగా కళ.దర్శనం,వర్ణనలాంటివి లేక పోయినా ఈ కవిత సిద్దాంత ధర్మాన్ని మోసింది.

స్వభావగతంగా వ్యక్తులు,వర్గాల మధ్య వచ్చే అర్థ వైరుధ్యాలను"విపరిణామం"గాచెబుతారు.ఈస్పృహతో స్వభావాలని,దాన్నించి జెండర్ వర్గాన్ని నిర్వచించే ప్రయత్నం చేసారిందులో.

"కొంటె కళ్లతో ఆమె
చంపేయ్ నీచేతుల్లో చచ్చి పోవటం నాభాగ్యం
అతని గుండెలపై వాలి పోయింది"

"ఏమన్నా చేసుకో/నా అణువణువూ నీదేగా/
కళ్లు మూసుకుంది/-/ఆ కళ్లు అప్పుడే మూసుకు పోయాయి శాశ్వతంగా/"-చంపటం అనేపదం చుట్టూ రెండు దృశ్యాలను చిత్రించి ఈకవితను సాధించారు.

జెండర్ వైరుధ్యాలను ప్రాతిపదిక స్థాయినుండి కొన సాగించినట్టుగాకాక ఓకొత్తచూపు,ఆవిష్కరణ కనిపిస్తాయి.ఇందులోని స్త్రీ గొంతుక వాదతాత్వికతని కూర్చుకున్నా మానవీయ అన్వేషణ కనిపిస్తుంది.

నిర్మాణం,వాక్య రచన,అభివ్యక్తి విషయంలో ఈకవిత సౌష్టవంగాఉంది.మంచికవిత అందించినందుకు జ్యోతిర్మయి గారికి అభినందనలు.మరింత మంచి రచనలతో ముందుకువెళ్లాలని ఆశిద్దాం.

8.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

భవాని ఫణిగారి కవిత-ఉత్తరమొచ్చింది.




సందేశాత్మక వచనం కవిత్వంలో తెలుగు నేలమీదికి అడుగుపెట్టిచాలా కాలం అయ్యింది.వ్యాస భాగవతంలో "రుక్మిణి"కృష్ణునికి లేఖ రాస్తుంది.కాలిదాసు మేఘ సందేశాన్ని గురించి తెలియని వారుండరు.ఆమధ్యన ఓ సినిమా రచయిత కూడా"కాబోయే శ్రీవారికి"అంటూలేఖని కవితా ఆఖ్యానంలో పొందు పరిచారు.

భవానీ ఫణి గారికవిత"ఉత్తరమొచ్చింది"కూడ ఆలాంటిదే.కవితానిర్వహణలో ఆఖ్యానం,వ్యాఖ్యానం అని రెండు భాగాలున్నాయి.ఆఖ్యానం లో కథనాత్మకత ఉంటే,వ్యాఖ్యానం లో కళాభివ్యక్తులుంటాయి.

ఇలాంటి కథనాలలో వ్యక్తుల సంబంధ సంభావ్యతలగురించి కూడా గమనించాలి.ఓ అమ్మాయి తనభర్త విషయాన్ని తనకు తాను చెప్పుకోడానికి .మరొకరితో చెప్పుకోడానికి ,తన భర్తతోనే పంచుకోడానికి మధ్య తేడాలున్నాయి.ఈతేడాలే సంభావ్యతలకు మూలం.

భవానీ ఫణిగారి కవిత ఓసైనికుడి భార్య అంతరంగాన్ని ఆవిష్కరించిది.ఈ కవితలో వ్యక్తుల సంభావ్యత ఎంత గొప్పగాపరిమళించిదో,మానసిక భూమిక గూడ అంతే ప్రగాడంగా అల్లుకుంది.చాలాబలమైన వాక్యాలు అడుగడుగునా కనిపిస్తాయి.ఓ ఆర్ద్రమైన స్వరం ఈకవిత నిండా మూగగా,గర్వంగా,ప్రేమగా అనేకరకాల అభినివేషంతో ప్రవర్తిస్తుంది.

ఈకవితనిండా భాషని కావలసినంతా మార్దవంగాఉపయోగించారు.

""కన్నెటి పొరలతో కాసేపు/ పోరాడితే గాని కంటిపాపకు/కోరుకున్నది దొరకలేదు"

"మంచులో తడిసిన పూలరేకుల్లా/కనురెప్పల్ని విదిల్చాను/
నువ్వు రాసిన ఓ అక్షరం/తడిసి అలుముకు పోయిందని /ఎంతగా గాభరా పడ్డానో"

ఈ రెండు వాక్యాలుచాలు ఇందులోని తాదత్మ్యత గురించి మాట్లాడటానికి.ఆఖ్యానంలో తరంగ వైరుధ్యాలని లెక్కిస్తారు.ఇవి వ్యక్తినించి,విషయం నించి,శారీరిక ,మానసిక స్థాయిలనుండిలెక్కిస్తారు.నిజానికి ఈవిశ్లేషణ కథానికలలో చేయడమే తెలుసు.మంచి కళాత్మక వాక్యాలున్నవి
కూడా ఉన్నాయి.

""అప్పుడే జల పడిన బావిలా /ఎంతగా ఊరిపోయాయో నీళ్లు,కళ్లనిండా"

"శ్రావణ మేఘంలా ఉన్నానని చెబితే సరిపోతుందేమో"

"ఏమిటో చెంపలు ఎప్పుడూ తడిగానే ఉన్నాయి/చిరపుంజీలోని చిత్తడి వేళ్లలా"

భవానీ ఫణిగారి వాక్యాలలో మంచి కవితా శక్తి ఉంది.మరిన్ని మంచి కవితలతో ముందుకురావడానికి ఆశక్తే మార్గం చూపుతుంది.

10.8.2013


                                                                                                                             ________________ఎం.నారాయణ శర్మ

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

పుష్యమీ సాగర్ కవిత-ఓ పుట్టుక వ్యథ





విమర్శలో సామాజిక వాస్తవికత(social reality)అనేఅంశాన్నొకదాన్ని చూస్తాం.సమాజంలోని అంశాలని గమనించిసృజన చేసినప్పుడు దాని సామాజిక వాస్తవికతగా చెబుతాం.ఈక్రమంలోనే సవిమర్శక వాస్తవికత(Critical reality)ఒకటి కనిపిస్తుంది.సమాజంలోని అన్యాయాలను,వ్యత్యాసాలను గుర్తించి వాటిని విశ్లేషిస్తూ రచనలు చేయడం.కేవలం సమస్యను చూడటంతోనే ముగించేసిందని విమర్శకుల నిందల్నిమోసినా ఈ అంశం అనేక సూక్ష్మాంశాలని వెలికితెచ్చింది.

అభ్యుదయ భావనని తీసుకొని వెలికి వచ్చిన అనేక వాదాలలో ఈవాస్తవ ప్రతిఫలనాలున్నాయి.ఏ సృజనకారుడైనా తానున్న కాలానికి సమాజానికి కట్టుబడకుంటే అతనిలోఈ వాస్తవాంశ ఆశించిన స్థాయిలో కనిపించదు.

సమాజంలోని ఒక అమానవీయ సంఘటనని,సందర్భాన్ని ఉద్వేగంగా వ్యక్తంచేసారు సాగర్.నిర్మాణపరంగా చూస్తేఇందులో రెండు అంశాలున్నాయి. కొంత సేపు ప్రథమ పురుష కథనం ,మరో భాగంలో ఉత్తమ పురుష కథనం ఈరెంటిలోనూ సారవంతమైన ఉద్వేగాన్ని పలికించారు.

"కోట్ల కణాల యుద్ధంలో గెలిచి
చొరబడింది మాతృగర్భంలోకి
రేపటి భవితకి పునాదిలా"--ఇది నిజానికి ఒక అనిర్దిష్ట వాక్యం కవి దేన్ని గురించి చెబుతున్నాడో తెలీకుండా పరోక్ష స్పృహ కలిగిస్తాడు.ఇలా ప్రాణం గర్భంలో చేరడందగ్గరనుంచి,అందులో నిలదొక్కుకోవడం దాకా కవిత సహజంగా సాగిపోతుంది.

"ప్రతిక్షణం పోరాటమే నీలో నిలబడటంకోసం"..ఈ వాక్యం నుంచే కవియొక్క దర్శనం కవితపై ప్రభావం చూపుతుంది..నిజానికి ఇక్కడ కవి స్వరం మారింది.పాత్ర లోకి లీనమై నాటకీయమైన (Drametic0వాక్యాల్ని ఇక్కడ నిర్మిస్తారు.

"వివక్ష నీ నరనరాననింపి /విత్తనంలా మొలవ బోతున్న నన్ను /విచ్చిత్తి చేస్తున్నావు"...సవిమర్శకవాస్తవికత భవిష్యత్తును దర్శిస్తుంది..ఈకవిత ఇలాంటి వాక్యాలతోనే ముగుస్తుంది..

"నీ గుడ్డి తప్పుకి మూల్యాన్ని చెల్లిస్తావు
ఒక్కో నలుసుని నలు దిక్కులా వెదుకుతూ"

వర్తమాన సమాజాన్ని ఎక్కువగా పీడుస్తున్న అనేక సమస్యల్లో భ్రూణ హత్యలొకటి..ఈఅంశాన్ని సమాంతరానుభవాన్ని పొందేలా అందించారు పుష్యమీ సాగర్.ఇలాంటి కొత్త అంశాలని(ఈ అంశంపై కవితలు గతంలోవచ్చినప్పటికి..అవితక్కువే మిగత అంశాలతోపోలిస్తే)కవులందరూ లోకనికి అందిచాలని ఆశిద్దాం.మంచి కవిత అందించి నందుకు పుష్యమీ సాగర్ గారికి అభినందనలు.

12.8.2013

                                                                          
                                                                                        

                                                                                                             ____ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

డా.ప్రతాప్ కత్తిమండ-మరణ శయ్య





abstraact అనే పదానికి సూక్ష్మీకరణ అనేఅర్థం ఉంది.నిజానికి సూక్ష్మీకరించినపుడు విషయం మొత్తం అవగాహనకు రాదు. ఒక సన్నివేశాన్నో,వాతావరణాన్నో తెలుపుతున్నపుడు ఆ సందర్భంలోని అంశాల సంభావ్యతలవల్ల చెప్పాలనుకున్నది చేరుతుంది.వాక్యాలు ఒక స్థాయిలో సూక్ష్మీకరింపబడి ఇతర వాక్యాలతో సంబంధాన్ని ఏర్పరచుకుని ఒక వాతావరణాన్నో,సందర్భాన్నో చెబుతాయి.ఇది భాషా శాస్త్రంలోని "సంధాయక సంబంధం"(Cohesive link)లాంటిది.


భావచిత్రం-అనేపదం ఒకటి వినిపిస్తూ ఉంటుంది.సంపూర్తిగ
అ ఒక దృశ్యాన్ని వర్ణిస్తే,చిత్రిస్తే అది భావచిత్రం(Imege).కొన్ని అంశాలు వాతావరణాన్ని దృశ్యాన్ని స్ఫురించేటట్టు చేస్తే అది నైరూప్యతకు దగ్గరగా ఉంటుంది.అయితే ఇందులో స్ఫురణకు దోహద పడనివి,సామాన్య దృష్టికి కూడా కనపడనివి ఉంటాయి.

డా.ప్రతాప్ కత్తిమండ "మరణ శయ్య"-కవిత "ఎయిడ్స్"వంటి వైరస్ లకు సంబందించి ప్రేరణాత్మకమైన వాక్యాలని
అందించింది.నాలుగు భాగాలుగా కనిపించే ఈకవితలో మొదటి దానిలో విషయాన్ని ప్రతిపాదిస్తారు.రెండవ దాంట్లో కారణాన్ని వివరిస్తూ హెచ్చరిస్తారు.మూడవదాంట్లో పైన చెప్పుకున్న ఒక సూక్ష్మీకరింప బడ్డ చిత్రం కనిపిస్తుంది.

"పరిమళాల మంచంపై
సరసాల షోకులతో/పొంగి దొర్లిన నాకు
అదే మంచం/మరణశయ్య గా మారింది"

"మత్తెక్కించే అందం/పక్కకు లాగితే
మతి చెదిరిన నేను/గతి లేకుండా పోయాను "

ఈరెండు వాక్యాలు కవి చెప్పాలనుకున్న వాతావరణం లోనికి తీసుకెళతాయి.మూడవ భాగంలో వాక్యాన్ని పదబంధంగా సూక్ష్మీకరించడం కనిపిస్తుంది.

"జాజుల సువాసనలు/గాజుల గల గలలు
అత్తరు పరిమళాల/అక్రమ సంబంధాలు
చిత్తడి జీవితాలు/చిత్తయ్యే బతుకులు "

ఈ ఆరు పద బంధాలు అర్థపరంగా వాక్యాలంత నిడివి కలిగినవి.ఇందులో వాక్య నిర్మాణ పద్దతిలో చూస్తే కేవలం క్రియలని మాత్రమే ఉప సం హరించారు.ఇవి సామాన్య వ్యవహారంలోనివే. రెందు ప్రేరకాంశాలు,కారణం,పరిణామం వీటిని ఈ అంశాలు వెల్లడిస్తాయి.చివరి భాగంలో పర్యవసానాన్ని చెప్పి ముగిస్తారు.చిన్న కవితే అయిన నిర్మాణ వ్యూహం ఇందులో కనిపిస్తుంది.వస్తువు కూడ మానవ స్వభావాలని పరోక్షంగా చెప్పేదే.మంచికవిత అందించి నందుకు ప్రతాప్ గారికి అభినందనలు.



                                                              


                                                                 










                                                                                          _____ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

అన్నవరం దేవేందర్-గుడ్డీస్





ప్రతీ ఆటకీ,శాస్త్రానికీ,అంశానికి కొంత పరిభాష ఉంటుంది.ఇది అనేక కోణాలలో ఆప్రాంతంలో,వ్యక్తుల మధ్య వాడుకలో ఉంటుంది.ఆవ్యక్తులు,ప్రాంతాలు పరిసరాలు సంస్కృతి సంప్రదాయాలతో సంబంధంలేనివారికి ఈ పదజాలం దూరంగా ఉండవచ్చు.జలియ క్రిస్టీనాచెప్పిన అంతర్గతవచనం(Inter textuality)ఇలాంటిదే.

అన్నవరందేవేందర్ తెలంగాణాలో పల్లెప్రజలలో ఎక్కువగా అలవాటులో ఉన్న "పచ్చీస్"ఆటకు సంబంధించిన పరిభాషతో ఉద్యమ సందర్భాన్ని స్ఫురింపజేస్తూ రాసినకవిత"గుడ్డీస్".ఇందులోపచ్చీస్ ఆటలోని ఎత్తులు,పయ్యెత్తుల గురించి చెబుతున్నట్టుగా ఉంటుంది కానీ దాన్నానుకొని తను చెప్పాలనుకొన్న అంశాన్ని చెప్పడం ఇందులో కనిపిస్తుంది.

ఈదశాబ్దంలో తెలంగాణాఉద్యమం,దళిత బహుజన వాదాలు ప్రజావ్యవహారంలోని జీవద్భాషకు సాహిత్యంలో ఉనికిని తెచ్చాయి.
ఆయా జీవితాలు,సంస్కారం,సంప్రదాయాలు కవిత్వంలో అనేక మార్గాలలో ప్రతిఫలించాయి.

"పిడికిట్ల గవ్వల/గలగలా చప్పుళ్ళు
పచ్చీస్ ,తీస్ దస్సులతో/గడ గడలాడిస్తా"

"గడల మీద కూకున్నా/గడ్డ మీద నిలబడ్డా
గండం తప్పది "
మొదటి వాక్యంలో ఆట నడకని,రెండవవాక్యంలో ఉద్యమ సందర్భాన్ని నడుపటం ఇందులో కనిపిస్తుంది.ఇలంటిదాన్ని అనువర్తనగమనం అన్నారు.పై యూనిట్లలో రెండవ భాగంలో మూడు అంశాలున్నాయి.మొదటిది ఒక సందర్భాన్ని రెండవది మరో సందర్భాన్ని మూడవది ఈరెంటికీ సమన్వయమయ్యేలా ప్రవర్తిస్తుంది.

ఇందులో కొంత పరిభాషకూడ గమనించదగ్గది,పచ్చీస్>ఐదు గవ్వలు వెల్కల పడటం,తీస్>ఆరువెలకల పడటం,(ఇందులో మొత్తం గవ్వలు 7.ఒక్కో దానికి 5 పాయింట్లు లెక్కిస్తారు)దస్>ఒకటి వెల్కల పడటం.దూగ తీని,చారి లాంతివి అలాంటివే
.ఇవన్నీ పందాలు.ఈ క్రమంలోనూ ఉద్యమంలోనిధర్మంపట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు.

"గవ్వలు ధర్మం చెడలే/గౌరాంతం గడ దించుతాయి
సంకలమంటి సంబురమైనా/దూగ తీని చారీలే"
"పోరాట నేలలో పచ్చీస్ ఆటలో/నిన్ను ఓడ కొట్టేందుకు
సంపుడు పంజం పుట్టింది/పానషరం పట్టి అయినా గెలుస్తా"
గౌరాంతం,సంబురం,పానషరం లాంటి పదాలు తెలంగాణా భాషాసౌందర్యాన్ని చెబుతాయి.రెంటి మధ్య కవితలో అన్నవరం సాధించిన సమన్వయం గొప్పగా ఆకట్టుకొంటుంది.

తొవ్వ,నడక,మంకమ్మ తోట లేబర్ అడ్దా,బొడ్దుమల్లె చెట్టు,పొద్దుపొడుపు లాంటి సంపుటాలు అన్నవరం శైలికి ,దృష్టికి అద్దం పడుతాయి.అత్యంత సుకుమారంగా అన్నవరం జీవద్భాషని కవిత్వంలో ప్రదర్శిస్తాడు.వస్తువుతోనే కాదు భాషతోకూడా అన్నవరం విలక్షణంగా కనిపిస్తాడు.మంచి కవితని పంచుకున్నందుకు అన్నవరం దేవేందర్ గారికి అభినందనలు.


                                                                                                                             


                                                                                                                         













                                                                                                                                                                                                            _____ఎం.నారాయణ శర్మ