పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
అన్నవరం దేవేందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అన్నవరం దేవేందర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ




పండు వెన్నెల -పసందయిన జ్ఞాపకాలు

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం
వాకిట్ల గడించేల ఎల్లెలుకల పండి
తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో
కొంతయినా కవిత్వాల అల్లకం అబ్బింది

పండు వెన్నెల రోజు ఆరు బయట నడుస్తుంటే వచ్చే ఉల్లాసం ఎట్లుంటదో టైపు చేయరాదు రాయరాదు .పున్నం రాత్రి అన్నం తిని కట్టె పట్టుకొని పొలం కాడికి కావలి పోతే ,ఆ చెల్కలు చేన్లన్నీ తెల్లగ అగుపిస్తాయి .కొట్టంల కట్టేసిన ఎడ్లు అయితే మరింత తెల్లగ మెరిసిపోతాయి .
ఎన్నిల రాత్రి ఎవలకు వాళ్ళే మెరిసి పోతారు .చేను చెలక గొడ్డు గోదా మ్యాక వాటి మొకం సూస్తే అవ్వి సుత ఎన్నిల ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తయి .అమాస పున్నంకు ఎంత తేడా ఒకటి కటిక చీకటి ఒకటి ఎలుగుల పందిరి .
మేము చిన్నప్పుడు వాకిట్ల నులుక మంచం ఏసుకొని ముచ్చట్లు పెట్టుకుంట పండుకునేది .నడుమ మా తాత మాకు కచెప్పేది.ఇనుకుంట ఇనుకుంట మేము నిద్రల జారేది .ఆ కథలల్ల తప్పక చందమామ వచ్చేది .మా తాత కథలను శాత్రాలు అంటదు .
కాముని పున్నం నాడు అయితే పోరగాండ్లకు మస్తు సంబురం .కోలలు పట్టుకొని ఊరంతా జాజిరి ఆడపోయేది
జాజిరి జాజిరి జాజిరి జాజ
జాజిరి ఆడపోతే ఏమేం దొరికె
రింగుడు బిళ్ళ రూపుడు దండ
దండ కాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగు నీడ
నీడ కాదురో నిమ్మల బాయి
బాయి కాదురో బసంత తీగ

ఇట్లాంటి పాటలు పాడుకుంట ఇంటింటికి ఎన్నిల రాత్రిళ్ళు పాడుకుంట తిరిగిందీ కవిత్వమే ...కవిత్వం కావాలి కవిత్వం అని మన కవి సంగమం పిలిపిస్తే అక్కన్నుంచే వస్తుందిఏ కవనపు జాలు .కవిత్వానికి ఎన్నేలకు ఎంత సంబంధమో ఈ చందమామ లు కవిసమయాలే ...చల్లని పల్లె ఎన్నెల తాగిన వాళ్ళు ,చిక్కని బర్రె పాలు జుయ్యిన పిండిన వూరోల్ల కవిత్వం ఇప్పుడు పరిశోధన జరగాలె .
అందుకే వెన్నెల ను ప్రేమించిన మా కరీంనగర్ కవులం ప్రతి పున్నం రాత్రి 'ఎన్నీల ముచ్చట్లు 'పేర కలుసుకొని కవిత్వం చెప్పుకుంటన్నం .ఒక్కో పున్నంకు ఒక కవి ఇంటి డాబా మీద కలయిక .ఇప్పటికి మూడు సార్ల అయ్యింది .'సాహితీ సోపతి 'వాటిని పుస్తకాలు తెచ్చింది .రేపు 17.11.2013న కార్తీక పున్నం రోజు మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు ఇంటి మీద ..కవుల కలయిక ...

నిండు పున్నమి నాడు పండు వెన్నెల
భూమికి సున్నం ఎసినట్లు
ఎన్నీల ఎలుగు పల్లెటురంత స్వచ్చం
ఎన్నీల ఎలుగె మనుసుకు నిమ్మళం ......


                                                                                                                          
 
 
 
 
                                                                                                                 ________అన్నవరం దేవేందర్

6, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ

 
 తొవ్వ పొంటి నడుస్తూ పోతాంటే మనసు వికసిస్తది .చిన్నప్పుడైతే సంకకు పుస్తకాల సంచి ఏసుకొని మా తాతిబోత్తల్ల పానాది నుంచి నడిచి బడికి పోయేది .అదే బాట పొంట ఎడ్లు మ్యాకలు ల్యగలు సుత పోయ్యేవి .వాటిని సూస్తుంటే మస్తు మంచిగనిపిచ్చేది.ఆ తొవ్వ కు అటు ఇటు తాళ్ళు వాయిల్లు శిల్పక్కలు ఉండేవి నడకంటేనే ముచ్చట. అయితే మనుషలతోని లేకుంటే చెట్లతోని .అదొక కమ్మని యాది .
ఈ కాలం రాయిమని యాకూబ్ భాయ్ 'తొవ్వ ' పేరు కరారు చేసినంక నా మవుజుల కెల్లి తొవ్వ తిరిగిన అక్షరాలే రాలుతన్నాయి .మక్కజొన్న చేను మద్యల కేళి తొవ్వ ఉంటది ,అందుల కెలి నడిచి పోయి చేను మధ్య మంచె మీద రాత్రి పండుకొన్న జ్ఞాపకం .పచ్చని మక్క చేనుల ఎల్లెలుకల పండి ఆకశంల సుక్కలు చందమామ గోరుకోయ్యలు మూలసుక్క సూస్తంటే మంచిగనిపిచ్చేది .మక్క పెరడు వొడ్ల మీద పొలం మడికట్లల్ల వొడ్లమీద నడుసుడు గమ్మతంటే గమ్మతి .ఇగ మా తాతతోని ఎడ్ల కావలి పోయినప్పుడు గుట్టలు బోర్లు కంచెలు పొల్లు పొల్లు పొద్దుందాక తిరిగేది గుత్తకు పసుల మేప ఎక్కుతాంటే కిందికి సూస్తే ఇండ్లన్నీ అగ్గిపెట్టేల్లెక్కనే అగుపిచ్చేవి .గుట్టకు సుత తోవ్వలుంటాయి .అసలు తొవ్వ లేని వూరు ఉండనే వుండది.పిల్ల తోవ్వలు ముండ్ల తోవ్వలు ఉంటయి.ఏ తొవ్వల నడిచినా హాయి హాయి ..ఇప్పుడయితే మట్టి దారులు పోయి సిమిటి రోడ్లు వచ్చినయి.
ఈ తొవ్వలన్ని వచ్చి కవిత్వంల సోర్రినయి.అసలు కవిత్వమే ఒక తొవ్వ .సాహిత్యం ఒక బాట .సంస్కృతి ఒక ఆట .కవికి చిన్నప్పుడు తిరిగిన మక్క పెరడు ,వరిపొలం ,బోజట్ల ఎడ్ల పెయ్యి కడుగుడు ,పెండకాలు తీసుడు పెంట జార కొట్టుడు ఇప్పుడు కవిత్వం కాకుంట పొతదా...ఇప్పుడు మా ఊల్లెకు పోతే పాత పానాదులన్ని కలే తిరిగి కవి సమయాలను ఎరుక వచ్చుకుంట .ఆడికి పోంగానే కవిత్వం పొంగుక వస్తది
అసలు ఈ తోవ్వలు ఎందుకు మాయమైనయి.నున్నటి రోడ్లు వచ్చి మనలను సంపటానికా..లేదు వాని సరుకులు అమ్ముకోవడానికా...మన వనరులను తరలించుకపోవదానికా...వద్దని మర్లపడితే పొలీసొల్ల ను పంపడానికా.....అదే అయ్యుంటది ...
తొవ్వ ఒక కవిత్వపు నడక ..అప్పుడు మనసు నిండేది ,ఇప్పుడు మనుసుకు పట్టనియ్యనిది .....మల్ల భుధవారం మాట్లాడుకుందాం ..........
                      
 
                                                                                                                                     
 
 
                                                                                                                                                                                                                                                               ----------అన్నవరం దేవేందర్ 

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

అన్నవరం దేవేందర్-గుడ్డీస్





ప్రతీ ఆటకీ,శాస్త్రానికీ,అంశానికి కొంత పరిభాష ఉంటుంది.ఇది అనేక కోణాలలో ఆప్రాంతంలో,వ్యక్తుల మధ్య వాడుకలో ఉంటుంది.ఆవ్యక్తులు,ప్రాంతాలు పరిసరాలు సంస్కృతి సంప్రదాయాలతో సంబంధంలేనివారికి ఈ పదజాలం దూరంగా ఉండవచ్చు.జలియ క్రిస్టీనాచెప్పిన అంతర్గతవచనం(Inter textuality)ఇలాంటిదే.

అన్నవరందేవేందర్ తెలంగాణాలో పల్లెప్రజలలో ఎక్కువగా అలవాటులో ఉన్న "పచ్చీస్"ఆటకు సంబంధించిన పరిభాషతో ఉద్యమ సందర్భాన్ని స్ఫురింపజేస్తూ రాసినకవిత"గుడ్డీస్".ఇందులోపచ్చీస్ ఆటలోని ఎత్తులు,పయ్యెత్తుల గురించి చెబుతున్నట్టుగా ఉంటుంది కానీ దాన్నానుకొని తను చెప్పాలనుకొన్న అంశాన్ని చెప్పడం ఇందులో కనిపిస్తుంది.

ఈదశాబ్దంలో తెలంగాణాఉద్యమం,దళిత బహుజన వాదాలు ప్రజావ్యవహారంలోని జీవద్భాషకు సాహిత్యంలో ఉనికిని తెచ్చాయి.
ఆయా జీవితాలు,సంస్కారం,సంప్రదాయాలు కవిత్వంలో అనేక మార్గాలలో ప్రతిఫలించాయి.

"పిడికిట్ల గవ్వల/గలగలా చప్పుళ్ళు
పచ్చీస్ ,తీస్ దస్సులతో/గడ గడలాడిస్తా"

"గడల మీద కూకున్నా/గడ్డ మీద నిలబడ్డా
గండం తప్పది "
మొదటి వాక్యంలో ఆట నడకని,రెండవవాక్యంలో ఉద్యమ సందర్భాన్ని నడుపటం ఇందులో కనిపిస్తుంది.ఇలంటిదాన్ని అనువర్తనగమనం అన్నారు.పై యూనిట్లలో రెండవ భాగంలో మూడు అంశాలున్నాయి.మొదటిది ఒక సందర్భాన్ని రెండవది మరో సందర్భాన్ని మూడవది ఈరెంటికీ సమన్వయమయ్యేలా ప్రవర్తిస్తుంది.

ఇందులో కొంత పరిభాషకూడ గమనించదగ్గది,పచ్చీస్>ఐదు గవ్వలు వెల్కల పడటం,తీస్>ఆరువెలకల పడటం,(ఇందులో మొత్తం గవ్వలు 7.ఒక్కో దానికి 5 పాయింట్లు లెక్కిస్తారు)దస్>ఒకటి వెల్కల పడటం.దూగ తీని,చారి లాంతివి అలాంటివే
.ఇవన్నీ పందాలు.ఈ క్రమంలోనూ ఉద్యమంలోనిధర్మంపట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తాడు.

"గవ్వలు ధర్మం చెడలే/గౌరాంతం గడ దించుతాయి
సంకలమంటి సంబురమైనా/దూగ తీని చారీలే"
"పోరాట నేలలో పచ్చీస్ ఆటలో/నిన్ను ఓడ కొట్టేందుకు
సంపుడు పంజం పుట్టింది/పానషరం పట్టి అయినా గెలుస్తా"
గౌరాంతం,సంబురం,పానషరం లాంటి పదాలు తెలంగాణా భాషాసౌందర్యాన్ని చెబుతాయి.రెంటి మధ్య కవితలో అన్నవరం సాధించిన సమన్వయం గొప్పగా ఆకట్టుకొంటుంది.

తొవ్వ,నడక,మంకమ్మ తోట లేబర్ అడ్దా,బొడ్దుమల్లె చెట్టు,పొద్దుపొడుపు లాంటి సంపుటాలు అన్నవరం శైలికి ,దృష్టికి అద్దం పడుతాయి.అత్యంత సుకుమారంగా అన్నవరం జీవద్భాషని కవిత్వంలో ప్రదర్శిస్తాడు.వస్తువుతోనే కాదు భాషతోకూడా అన్నవరం విలక్షణంగా కనిపిస్తాడు.మంచి కవితని పంచుకున్నందుకు అన్నవరం దేవేందర్ గారికి అభినందనలు.


                                                                                                                             


                                                                                                                         













                                                                                                                                                                                                            _____ఎం.నారాయణ శర్మ