పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం ------------ చదివిన కవిత్వ సంపుటి - 32 ^^^^^^^^^^^^^^^^^^^^^^ పరిచయం చేస్తున్న కవిత్వ సంపుటి :- " ఒక కత్తుల వంతెన " కవిత్వ సంపుటి నిర్మించిన(రాసిన) కవి :- "చం." అని పిలువబడే చంద్రశేఖర శాస్త్రి సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్ .టి "దృశ్యమాన ప్రతిభకు నిలువుటద్దం చం. కవిత్వం బాలాంజనేయులు ఎంత సుందరుడు! ఆపిన కారు అద్దంలోనో అమ్మ కంటి పాపల్లోనో తన అందానికి తాను మురిసిపోతుంటాడు. సూర్యుడే వ్వ్డికి తొలి అనియత గురువు ఉదయాన్నే నిద్రలేపి మూతికి ఎరుపు రంగు పులుముతాడు ప్రకృతిలోని పచ్చదనమంతా వాని ముఖంలో ప్రతిఫలిస్తుంది మొలలో దోపుకున్న తోక ప్రశ్న గుర్తులా తొంగి చూస్తుంది అట్ట కిరీటం,ఊలు దారాలతో ఎంత అందంగా ముస్తాబవుతాడు" ఈ కవితా పాదాలు నావి కావు.నేనన్నవి కావు.’చం.’-అని పిలువబడే చంద్రశేఖర శాస్త్రివి."ఒక కత్తు ల వంతెన"-అనే కవితా సంపుటిలోనివి."బాలాంజనేయులు"-అనే కవిత లోని ప్రారంభ వాక్యాలివి. పగటిపూట వేషంతో రోడ్డు మీద ఎవరికీ ఎవరూ ఏమి కానట్టు నడుస్తున్న మనుషుల మధ్య ఏవో కొన్ని కళ్ళయిన తమ మీద పడి ఎంతో కొంత ఇవ్వకపోతాయా పొట్ట నిండక పోతుందా అని ఎదురు చూసే పిల్లల్లో ఒక బాలుని విషాదరేఖా చిత్రం ఈ కవిత. డార్విన్ మనిషి పుట్టుక కోతి నుంచే అన్నాడు.ఆడుతూ పాడుతు గడపాల్సిన బాల్యంలో బతుకు బండిని లాగుతూ రామాయణంలో ఆ ఆంజనేయుడు సంజీవిని మోస్తే కుటుంబ భారాన్ని మోయడా నికీ ఆ ఆంజనేయరూపాన్ని ఆ బాలుడు ఆలంబన చేసుకోవడం కేవలం యాధృఛ్చికం కాదేమో? రామాయణ పాత్రలతో,అందులోని సంఘటనలతో అనుసంధానిస్తూ వొక గడ్డకట్టిన దుఃఖసాంద్రత ను కరగించే తీక్షణతని చం. ఈ కవితలో నిక్షేపించాడు. "బాలాంజనేయులు ఎంత సుందరుడు!"-అనే వాక్యంతో ప్రారంభమైన ఈ కవిత "కనిపించిన ప్రతి వాడి ముందు చేయి చాచి దీనంగా యాచిస్తుంటాడు నా కళ్ళ ముందు జవాబు లేని ప్రశ్నలా మిగి లిపోతాడు"-అనేమాటలతో ముగుస్తుంది. ఆ బాలాంజనేయ వేషం వేసుకున్న ఆ బాలుడు అక్షర ఙ్ఞానం లేకున్న అణువంత చైతన్యంతో జీవన వ్యాకరణం వంటబట్టిన తనంతో, బాల కాండను ఆనందంగా గడుపుతూ…..అనుభవిస్తూ….. అమ్మ కంటి పాపల్లో తన అందం చూసి మురిసిపోయాడనటం ఒక అద్భుత భావచిత్రం. ఆపిన కారు అద్దంలో తన అందం చూసుకొని మురిసిపోయాడని రాయడంలో ఈ కవి ఆ బాలుడు ఏ వేషం వేసుకొన్నాడో ఆ వేషపు జాతి లక్షణాన్ని స్ఫురింపచేస్తున్నాడు.కోతులు అద్దం కనిపించగానే ఏంచే స్తాయో మనకు తెలుసు.ఇట్లాంటి పరిశీలన చేయడం,ఆ పరిశీలనను తన కవిత్వంలో అవసరమైన చోట్ల ధ్వనింపచేయడం చం. చేస్తుంటాడు. "బాల కాండ ముగిశాక బడికెళ్తే సుందర కాండ/లేకుంటే కిష్కింధకాండ/వాడిని కోతిని చేసిన ఘనత మనదంత"-ఈ మాటల్లో ఆ బాలుని దుస్థితికి కారణం ఈ వ్యవస్థేనన్న స్ఫృహని కలుగజేస్తాడు. ఈ కవితలో చాల వరకు ప్రతిపాదంలో సందర్భోచితంగా రామాయణ మహకావ్యా న్ని స్పృశిస్తూ మనం ప్రగతిని గురించి మాట్లాడుకోవాలంటే ముందు అలాంటి బాలాంజనేయుల్ని వీరాంజనేయుళ్ళుగా ఎదగనివ్వాలన్న పరిష్కార సూచనని చేస్తాడు చం.రోడ్ల కూడళ్ళలో ఈ బాలాంజనేయుల్నీ చూసిన ప్రతి సారి ఈ కవిత నా వెంట నడిచినట్లుగానే వుంటుంది. అనంతపురంలో ఎక్కడ సాహిత్య కార్యక్రమం జరిగినా అక్కడ తనదైన ప్రత్యకతతో ప్రత్యక్షమయ్యే చం. అంటే కవులందరికీ ఎంతో యిష్టం.ఇంగ్లీషులో CHUM అంటే సన్నిహిత మిత్రుడని (CLOSE FRIEND).నిజంగా ఇతను చం. ఎంత సుధీర్ఘ వచన కవితే అయినా ఏ పేపర్ లేకుండా గొప్ప ధారణతో పాదరసంలా జారిపోయే గొంతుతో చదివే ఇతని పద్దతి బహుశా ఇష్టపడని కవి ఇక్కడ లేడేమో? "సామాజికంగా రాసిన కవితలు ఆలోచింపచేసేవే కాదు ఆవేశింప చేసేవి"-అని సి.నా.రె చం. కవితల్ని గురించి అంటే,"చం. కీ దృశ్యమానం చేసే ఒక గొప్ప నైపుణ్యం వుందని" కె.శివారెడ్డి చెబుతాడు."పదాలకు రూపాన్నివ్వటంలో మంచి శిల్పి"-అని దర్భశయనం అంటాడు చం.గురించి. "రెండో సహస్రాబ్ది తుది సంధ్యలో"-చం. ఒక దృశ్యం చూశాడు. ఎప్పుడూ నిండుగా తృప్తిగా వుండే చం. అసంతృప్తి కలిగించే సన్నివేశాన్ని ఎలా చూశాడో ఇలా చెబుతాడు. "గుంజ మీద ప్రకాశిస్తున్న సత్తు గ్లాసును నేను చూశాను/వంగి వంగి దండాలు పెడుతున్న నల్ల సూర్యున్ని నేను చూశాను"అంటూ తాను చూసిన యథార్థ వ్యథార్థ దృశ్యాన్ని చూపిస్తూ.."కాంతి పరావర్తనం చెందకపోతే ప్రకాశముండదు"-అనే శాస్త్ర సంబంధ అంశాన్ని జోడిస్తాడు. ఇంకా ఈ కవి తానేం చూడాలనుకుంటున్నాడంటే మూడో సహస్రాబ్దిలో ఇలా చెబుతాడు. "సత్తుగ్లాసు విస్ఫోటనం నేను చూడాలి. నవ భారతం తెల్ల తామరై వికసించాలి వెలుగు రెక్కలు చాపి వేకువ పిట్టలెగరాలి రెండు గ్లాసులు ఒకటవ్వాలి" దళిత ఉద్యమాల పట్ల చం.కు సానుభూతే కాదు సహానుభూతి కూడా వుంది.అయితే ఈ ఉద్యమాల వైఫల్యాలకు వెనకున్న కారణాల మూలాల అన్వేషణ గురించి చేయకుండా కేవలం ఉపరితల కారణాలను మాత్రమే ఇలా ప్రస్తావించాడు. "ఔను సూర్యునికి స్వార్థపు తేలు కుట్టింది సహ పంక్తి భోజనం జరిగింది ఆర్భాటంగా ర్యాకీ ముగిసింది ఫోటోలకు,మీడియా ప్రచారానికి కొదవేంలేదు అంటూ కేవలం ప్రచార పటాటోపాలకు పరిమితమయి ఆ ఉద్యమ అలలపై గుర్తింపు కోసం ఎగెరెగిరిపడే వాళ్ళను విమర్శ చేస్తాడు. నల్లచెరువులో ప్రశ్న గుర్తులా వికసించిన నల్ల కలువ తెల్లారకముందే చతికలబడుతోంది సత్తుగ్లాసు మాత్రం పగలబడి నవ్వూతూనే ఉంది" రెండుగ్లాసుల సంస్కృతిపై తన నిరసనని కవిత్వం చేసి తెలిపే కవిగా చం. ఎదుగగలిగాడు. మదర్ థెరీసా మానవి మాత్రమే కాదు మానవత్వ్వానికీ ప్రతీరూపం.ఆమెను "మనిషి మనిషిని మింగాక/మానవత్వం మసిబారాక/నాడు నేడు మరునాడు తోడుగా/నిలిచింది నీలంచు నూలు చీర" అనే చిన్న మాటలతో మన ముందు నిలబెట్టడమే కాదు ఆమె లేని తనం భారత దేశానికీ ఉత్పాతం అని ఒక మౌననరాగం ఆలపిస్తాడు. అనంతపురం ప్రాంతంలో వో మారు కరువు కరాళ నృత్యం చేసింది.ఈ నేల మీదే కాదు ఏ నేల మీద అయిన మట్టిని మాణిక్యపు బంగారుగా మార్చగలిగే రైతు జీవితం విషాదం అయ్యేది అన్నం మెతుకుల్ని రాలుస్తాయనుకునే వాన చినుకులు కత్తులు దూసినప్పుడూ,సేద్యపు విసుర్రాయిలో రైతు జీవితం నూక నూకయినప్పుడు,కల్తీ విత్తనాల,ఎరువుల మోసాలకు దోమ పోట్లకు పంటలన్ని పూల రేకులయి రాలిపోయినప్పుడు..ఆ రైతు జీవితం చావు నే ఆశ్రయించింది. ఆ సందర్భంలో అనంతపురం కవులు కళాకారులు రైతు ఆత్మ విశ్వాస యాత్ర చేశారు.ఆ సమయంలో చం."నీ వొ క్కడివి బ్రతికుంటే చాలు "-అనే కవిత రాసి జిల్లా అంతటా చదివాడు. "వీరుడా! నాగలి యోధుడా! నిస్సహాయంగా నీవు కూలిపోతుంటే మేమెలా బతుకగలం ఏ ఆశతో నిబ్బరంగా ఉండగలం" అంటూ వొక దైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కలుగజేసే ప్రయత్నం చేశాడు."నీవెప్పుడూ ఒకరికి పెట్టిన వాడివే /ఎవరిముందు చేయిసాచి వాడివి కాదు"అంటూ రైతు గొప్పదనాన్ని గుర్తు చేసి చచ్చిపోవాలనుకున్న కోరికను తగ్గించే ప్రయత్నం చేస్తాడు."నీ దుక్కిలో విత్తనమవుతాం /నీ చేలో సత్తువవుతాం /మా కన్నీళ్ళను వాన చినుకులు చేస్తాం"-అని అంటూ రైతులో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయాడానికీ యత్నిస్తాడు."వస్తున్నాం నిన్ను రక్షించుకోవటానికి /మా ప్రతిఙ్ఞ వృథా కాదు" అన్న ధృఢ నమ్మకం కలిగించే మాటల్నీ గొప్ప సంకల్పంతో అంటాడు.ఈ కవిత ఆనాడు కరువు పాటకు చావు దరువేసినప్పుడుజ్ నిరోధించే పోరు గీతంగా గానం చేయబడింది. సంఘటనలు అనేకం సంభవిస్తూ వుంటాయి.కవులు వాటికి అనుకూలంగానో ప్రతికూలంగానో వారి ఆలోచనల బట్టి స్పందించి కవిత్వం రాస్తూవుంటారు.ఈ కవి కూడా తాను చూసిన,విన్న సంఘటన లకు తనదైన ఆలోచనతో కవిత్వం రాశాడు. బుద్దుడు నవ్వినప్పుడు అంటే భారత్ అణుపాటవ పరీక్ష చేసినప్పుడు,రెండు భేదాలతో దళితులు ఘర్షణ పడ్డప్పుడూ,కాశ్మీర్ లో ఉగ్రవాదం శాంతి గీతాలాపనకు శతఘ్ని నాదాలను తోడు చేసినప్పుడు ఇంకా అనేకానేక హృదయ విచలిత దృశ్యాలకు తన కవితల్ని తోడు చేసి మనల్ని వాటి వెంట ఆలోచిస్తూ నడిచేటట్లు చేస్తాడు. "ఎర్ర పుప్పొపిడి నింపుకున్న మంచు పూలతో నిలువెల్లా ఎర్రబడ్డ ఆపిల్ తోట"-అనే పోలికతో కాశ్మీర్ ని ఊహించి విధం హృదయాన్ని హత్తుకొంటుంది.ఇట్లాంటివెన్నో పోలికలు చం. కవితలో ఎన్నో అలవోకగా నడుస్తుంటాయి."ఒకని బాధ , మరొకనికి నవ్వు /ఎద్దు పుండు కాకికీ ముద్దు సదూ!"-లాంటి సామెతలు నుడికారాలు మరి ఏరి ప్రయోగించి తన శిల్పాన్ని సంపన్నం, చేసుకొంటాడు."నల్ల కలువ వికసిస్తేనే వెన్నెలకు నిండుదనం"- "చద రంగంలో నల్ల కలువలు గెలవాలి"-అని ఈ కవి దళితుళ్లో తానెవరివైపో చెప్పకుండా ఇరువురి విజయాన్ని కాంక్షించే దృక్ప థాన్ని కన బరుస్తాడు. స్త్ర్రి వాదాన్ని బలపరుస్తూనే అకారణంగా విడిపోతున్న స్త్రీపురుష సంబందాల విఛ్చిన్నతను ఈ కవి ఎంతో సుకుమారంగా వ్యాఖ్యానిస్తూ కవిత్వం చేశాడు. "కుసుమ మనస్విని నేను నిను చేరి వికసించలేను వీడి వాడి రాలిపోలేను రెండికీ చెడిన రేవడినైనా పురుషాహంకారానికి దాసిని మాత్రం కాను" అంటూ "ప్రణయ కలహాలు పండుటాకులై వసంతంకై ఎదురు చూసే మోడును కొమ్మలు నరికి, పేళ్ళు ఏరుకొనే మంద భాగ్యులు మహిలో కలరు"-అనే వ్యంగ్య నీతి బోధని కూడా చేస్తాడు ఈ చం. మీ కందరికీ గుర్తు వుండే వుంటుంది బషీర్ భాగ్ లో పోలీసు కాల్పుల్లో ఓ ముగ్గురు పోరాట మరణం చేశారని.ఆ దృశ్యాన్ని కవి స్వయంగా చూడలేదు.కానీ విన్నాడు మీడియాలో దర్శించాడు.ఎంత కోపం కలిగిందో తెలీదు కానీ కవి ఆగ్రహం ఆ సంఘటనకు కారణమైన ప్రభుత్వ పతనం కోరుకుంది.ఆ తరువాత అదే జరగడం ఒక యాధృఛ్చికమే. "రక్షించు నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ భ్రాంతి నుంచి విజన్ ట్వంటీ ట్వంటి కలలనుంచి ఆంద్ర ప్రదేశ్ సైబరాబాదన్న విభ్రాంతి నుంచి నేతి బీరకాయల పథకాల నుంచి చెంబు పెట్టి తపేలా ఎత్తుకపోయే సామ్రాజ్యవాద తత్వం నుండి" ఈ మాటల్లో తిలక్ " ప్రార్థన" వాసనలు కనిపిస్తున్నాయి కదా!.తన ధోరణిలో కవితను ఈ కవి చెప్పొచ్చు.కానీ తీవ్ర వ్యంగ్యతను తెలపాడానికీ ఆ కవితకు పేరడి రూపంగా రాశాడేమో నని నా అనుమానం.అంతే కాని తిలక్ ని అనుసరించడం కానీ సంగ్రహించడం కానీ చేసేంత భావ దారిద్ర్యం చర్య గుణం చం.లో లేదు.చం.కవిత్వ నిర్మాణ శిల్పంలో ఆరితేరిన వాడు అని చెప్పడానికీ అతని "అవ్వ "-అనే కవిత వొకటే చాలు. "ఇటు అమ్మ-అటు అవ్వ దుప్పటిలా ఆక్రమిస్తారు నా బాల్యంలో,నా జీవనంలో సగపాలు వారిదే." ఇలా ఈ కవి తన ఉఛ్చ్వాస నిశ్వాసాల్తో నిరంతరం భ్రమణించే వాళ్ళను గురించి ఒక నోస్టాల్జియా తో గొప్పగా కవిత్వం చేసి ఒక సాంస్కృతిక శోభను ప్రకాశింప చేస్తాడు.కవితలకీ శీర్షికలను ఎన్నిక చేయడం వొక కళే.ఈ కళ చం.లో ఎక్కువ."సుజాత"-అనే కవిత ఈ సంపుటికీ కిరీటంలా నిలుస్తుంది. సుజాత ఒక ఙ్ఞాపకం మరపు రాని మధురానుభూతి సుజాత అప్పుడు........ ఎంత అందంగా వుండేది" అంటూ ఈ కవితను మొదలేట్టి సుజాత ఒక మనిషి కాదని సాయంత్రమయ్యేసరికీ అందర్నీ సాదరంగా ఆహ్వానించే వొక సాధరణ కాఫికేఫ్ అని తనే చెబుతాడు.ఆ చెప్పటంలో అనంతపురంలో వుండే కవులను,రచయితలను,విమర్శకులను పేర్లు చెప్పకుండానే వారి రచనల ప్రస్తావనతో గుర్తుకుతెస్తాడు.సుజాత ఒడిలో సేద దీరింది శివరామ్,శేషశాస్త్రి, అంజిబాబు,సైదాచారి ఇమ్కా ఆశావాది ప్రకాశరావు,శేషేంద్ర,రమణజీవి,మల్లెల,బండి నారాయణస్వామి ,రాయుడు,రాచపాలెం,యక్కలూరి శ్రీరాములు ఇలా ఎంతో మందిని మరో సారి ఆ "ప్రియురాలి రహస్య చర్మంలాంటి మీగడ తరకల ఙ్ఞాపకాలలోకి ఈ కవిత తీసుకెళుతుంది.అప్పటి సుజాతకు ఇప్పటి ఈ హోటల్ కు ఎలాంటి సారూప్యం ఇప్పుడు లేకపోవడాని కారణం "గ్లోబల్ గాలానికీ అది చేపగా దొరకటమే అనే ఆలోచనను కవి ఇస్తాడు.నిజానికీ అప్పుడు ఆ సుజాతకు ఈ కవులు కళాకారులే గొప్ప అతిథులు.కాని వ్యాపారికరణ మొదలయ్యింతరువాత ,వ్యాపార తత్వం ముదిరింతరువాతా ఎర్పడే పరిణామాలు ఇలానే వుంటాయని చెప్పడానికీ ఈ కవిత మంచి ఉదాహరణ. ఇలాంటి సుజాతలు ఎక్కడైనా వుంటారు అందరి అనుభవంలో పాతబడి చిరిగిపోతున్న వర్ణచిత్రంలా వెలిసిపోతుంటారు. కరువు ,పేదరికం ఒక్కటే కాదు ఈ సీమ వెనుకబాటుకూ సాయుధ ముఠాల హింస కూడ ఒక ప్రధాన కారణం.దాన్ని ఈ చం. గుర్తించాడు. సీమాంతర నేపథ్యమైన ఫ్యాక్షనిజం పైన కూడా మంచి కవిత్వం రాసి తన కవిత్వం అసమగ్రం కాదు అని నిరూపించుకున్నాడు. ప్రియురాల్ని 'చినుకు రాల్చని మేఘం'గా,గుప్త నది గా పోలిక చేసిన ఇతనిలో ఉన్న ప్రణయ భావనలు కూడా మంచి కవిత్వంగా నిలుస్తాయి. " వాడే సృష్టి,వాడె స్థితి వాడే లయ కారుడు వాడిదే ప్రపంచం ప్రపపంచానికి పర్యాయ పదమ్ వాడే"-అని కర్త,కర్మ.క్రియ అయిన మానవున్ని కీర్తించిన ఈ కవి "ఎంత తాగినా /దాహం తీరటం లేదు /ఇదో సముద్రం" వంటి హైకూలూ కూడా రాశాడు ఈ సంపుటిలో. కవిత్వం "ఒక సంభార సందోహలం /సమూహ సమరోత్సోహా సంరంభం /క్రాంతి మయ జ్వాల /సముడ్ర ఘోష,నిరసన గీతిక /ప్రాతినిధ్య గొంతుక,/పోరాట నినాదం /అంతరంగ ఉద్వేగం /అంతర్ముఖీనత...ఇలా పోల్చిన ఈ కవి నిజంగా కవిత్వ,కవుల ప్రియుడు.ఈ చం కవిత్వాన్నీ ఆఘ్రాణించమని కవి సంగమ కవులను కోరుతూ.. .మంగళ వారం మళ్ళి మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qjjQ56

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి