పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

షoషాద్ మహమ్మద్ గారి కవిత-మిగిలే ఈ రోజుని
 


గతకాలానికి సంబంధించిన వ్యక్తులు,భావాలు,సంఘటనలు,తిరిగి మననం చేసుకుంటూ రాయడాన్ని పునశ్చరణం(Anamnesis)అంటారు.గతాన్ని తార్కికంగా వ్యక్తం చేయడానికి ఇందులో మంచి అవకాశం ఉంటుంది.ఎక్కువగ జీవిత భావనలను వ్యక్తం చేయడానికి ఇలాంటి వాక్యాలు రాస్తారు.

షoషాద్ మహమ్మద్ గారు రాసిన కవితలో ఈ భావ జాలం ఉంది.ఈ అంశం వెనుక బలమైన స్త్రీగొంతుక వినిపిస్తుంది.అది గతాన్ని,వర్తమానాన్ని రేపటిని కూడా తార్కికంగా చిత్రించింది.ఆ రేపుని శూన్యంగా.

"ఎన్నెన్ని రాక్షస యుద్దపు చీకట్లు
ఓడిపోతున్న మనసును
ప్రతీ సారీ చంపేసుకున్నాను
నిన్నటి నా చరిత్ర

కావాల్సిందేదో
మనసుకెదురై ముసుగుతీసేసినట్టు"

ఈ వచనంలో భారమైన అనుభవశక్తి ఉంది."రాక్షస యుద్ధం""యుద్ధపు చీకటి"లలో అణచివేతని,"ఓడిపోతున్న మనసును""మనసుకెదురై ముసుగు తీసేసినట్టు"లలో కొల్పోతున్న జీవితాన్ని గూర్చి కనిపిస్తుంది.

ప్రతీ వాక్యంలోనూ ఒక అసహనం కనిపిస్తుంది.

'ప్రేమ యుద్ధానికి ఆహ్వానం
గెలుపైనా ఓటమైనా ఇద్దరిది
నిజంకాలేని రేపటి నా ఊహచిత్రం"

"చరిత్రకు సాక్షం
నా ఒడిలో
ఊహకి స్థానం నా గుండెల్లో"

తాను బందీ అవుతున్న అంశాన్ని చిత్రించిన సంధర్భాలు.వాక్యంలో గాఢతకనిపిస్తుంది.వస్తువు విషయంలో పోలిక లేదుకానీ గతంలో స్కైబాబాగారు రాసిన "దుఃఖనామా"కవితలోని వాక్యాలతో పోలికలున్నాయి.ఆ శైలి ఇందులో కనిపిస్తుంది.కొత్తగా రాస్తున్నట్టు కనిపించినా షoషాద్ గారిలో బలమైన గొంతుక ఉంది.మరిన్ని కవితలతో త్వరలోనే తానోప్రత్యేకమైన గొంతుగా కనిపిస్తుందనటానికి ఏమాత్రం సందేహపడ నవసరంలేదు.
 
 
                                                                                                               ______________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

బూర్ల వెంకటేశ్వర్లు-ఎన్నీల ముచ్చట్లు
 



తెలుగులో ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది.ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని సారవంతంగా,సహజాతి సహజంగా అందించింది.ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి సంబంధమైన కవిత రాయవచ్చాలేదా అనే చర్చలు జరిగాయి.బూర్ల వెంకటేశ్ కవిత అందుకు సమాధానం చెబుతుంది.

వెన్నెలని ఆధారం చేసుకొని చాల గొప్ప భావచిత్రాలతో ఈ కవితని నిర్మించారు బూర్ల.బూర్ల దర్శనంలో తన్మయీ భావంకనిపిస్తుంది.వెన్నెలని చాలా భిన్నంగా తెల్లటి దుప్పటిలా,పాలలా,వరిగొలుకల్లా,వెండిలా,తెల్ల కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు.బూర్ల దర్శనంపై వర్ణ(colour) ప్రభావం కనిపిస్తుంది.నిజానికి వెన్నెలని చల్లనిదనేదృష్టితో చూస్తారు.

"ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె
నేను ఇంట్ల ఉంటే/కిటికిలకెల్లి తొంగి చూస్తది
బైటికివోతె/ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది"

"రాత్రిరాత్రంత/తెల్లటి దుప్పటిగప్పి
నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లుమూసుకుంటే
మనుసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది"

"పొద్దుగాల పాలువిండేటప్పుడు
సర్వలదునికి జాక్కుంటది"

"ఆకాశంల నిలవడి నాకోసం తపస్సుజేసి/వరిగొలుకల అవతారమెత్తి
నా గుండిగెల నిండుతది/సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి
రమ్మని చేతులు చాపుతె/తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి
తనమనుసు తెల్లకాయిదం జేసి/నాకు ప్రేమలేఖ పంపిస్తది"

వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు.కోడ్ చేయగలిగితే అన్నివాక్యాలు అంతే బలమైనవి.తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో ఉన్న మార్దవాన్ని,మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది.సాధారణంగా తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ కనిపిస్తుంది.వెంకటేశ్ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు."తొంగి చూసు/ఎంటవడు/ముచ్చటవెట్టు/దునుకు/జాక్కొను/కుమ్మరిచ్చు/ఇనుకుంట"ఇలాంటివి కనిపిస్తాయి.

"చెప్పాలె/ఉంటే/వోతె 'లాంటి క్రియలుకూడా సహజత్వాన్ని ప్రదర్శిస్తాయి.కవిత్వానికి బూర్ల కొత్తకాదుకాని తనని నిలబెట్టే
కవితలో ఇదీ ఒకటవుతుంది.

"ఆమె కాళ్ళపట్టీల నుంచి రాలిపడ్డ గజ్జెలు
పక్షులగొంతుల్ల చేరి
ఉదయపు పాటలైతయ్"

ఇలాంటి మంచి ఊహలతో,భావచిత్రాలతో వెంకటేశ్ మరిన్ని మంచికవితలని అందిస్తడని ఆశిద్దాం.అభినందనలు బూర్ల వెంకటేశ్ గారు.
 
                                                                                                              ______________ఎం.నారాయణ శర్మ