పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ





మనసు మనిషిల నిలువది-౩

మోసానికి గురవుతున్నావ్ .లేదా దోపిడీ కి గురవుతునావ్ అన్న నిజం తెలిసినంక మనిషికి ఇగ మనుసున పట్టడి .నిదుర పట్టడి అది ఒక సామూహిక అన్యాయానికి సమూహమే అన్యాయమైందంటే అంతా అగ్గిమీద గుగ్గిలమే .

అది ఆందోళన
అది అలజడి
అది పోరాటం
అది పోరుబాట
అది తిరుగుబాటు
అగొ గండ్ల నుంచే కవిత్వం వస్తది రాగం వస్తది ఊర్లకు ఊర్లె సాంస్కృతిక వేదికలయితై .రచ్చ బండలు బహిరంగ సభలు అయితయి .అన్యాయాన్ని సహించని సహజ తనం మనిషి తనం .తెలిసి మిన్నకుంటు ఉన్నదంటే అనుమనిన్చాలే .పోరాటం నుంచే కవులు కలాలు పదును పెట్టుకుంటారు .ప్రజలు పల్లవి అందుకుంటారు .ఉద్యమం ఉప్పెన అయినంక ఇన్ని రోజులు వీళ్ళంతా ఏడ పోయిండ్రు అనిపిస్తది .

అరె ,ఇన్ని రోజులు వీళ్ళు
వోక్కలు లేకుంట బజట్లకు వస్తండ్లు
బొండిగలన్ని పొంగ లాసిగా వోర్లుతున్నారు
వాడ వాడలు కలే తిరుగుతన్నరు

ఇలా ప్రజా సమూహం ఉద్యమ సమయం అవడం తన కండ్ల ముందే కదలాడడం కవి ని నిలువనియ్యది.గాయకుణ్ణి కదలనియ్యది.

ఉరికి వస్తండ్రు రువ్వాడిగా వురికస్తండ్రు
విద్యార్థులంతా ఉద్యమమై ఎగిరిండ్రు
బడి పోరగాండ్లు బాత పెట్టి నిలిచిండ్రు

వూరు కదిలింది వాడ కదిలింది
పల్లె కదిలింది పట్నం కదిలింది
బొబ్బ మొదలైంది బొబ్బ బొబ్బ

ఈ బొబ్బ నే దోపిడీ పీటం కదిలస్తది. జంగ్ మొదలయితే దోపిడీ దారులు వోక్కటయితారు.ఎన్నో అడ్డంకులు మొదలయితై .అయినా చరిత్ర చూస్తే అవి ఏమి ఆగయి.కవిత్వం సాహిత్యం పాట కథ ఆట మాట ప్రజా ఉద్యమానికి మద్దతును ఇస్తాయి

ఎంత కాలం ఈ పరిపచ్చపు పాలన
ఎన్ని రోజులీ ఇసపుకోండి సంసారం
మిక్కుటమైన అవస్థ కక్కుతానికస్తండి
సకులం సమాజమే అగ్గి మండుతంది

ఉద్యమం సమాజానికి త్యాగాల తల్లులను అందిస్తుతుంది .ఉరికొయ్యను ముద్దాడే బిడ్డలను అందిస్తంది.పోరాట వారసత్వాన్ని కొనసాగించే కవిగాయకులను అందిస్తుంది .ఇప్పుడు తెలంగాణ . వూరురిలో కవి గాయకులే రచయితలే....

గాలి నేలా చెట్టు చేమా గుట్టా పిట్టా
అస్తిత్వ ఆకాంక్షల ఉద్యమాలై నినదిస్తున్నాయి

అదంతా చెవ్వు పెట్టి ఇంటే కవిత్వమే పో ....అంతా కవిత్వమేనే .....


________అన్నవరం దేవేందర్

15, నవంబర్ 2013, శుక్రవారం

ఉర్దూ కవిత్వ నజరానా


మళ్ళీ శుక్రవారం వచ్చేసింది. పదిరోజులు సెలవు పెట్టినా, ఫైజ్ గారు సెలవిచ్చేలా లేరు. కాబట్టి, యథావిథిగా శుక్రవారం ఫైజ్ కవితలను మరోసారి తిరగేద్దాం.
ఫైజ్ వామపక్ష భావాలతో ప్రభావితుడయ్యారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఫైజ్ అహ్మద్ ఫైజ్ జన్మదిన వేడుకలు జరపడానికి చాలా మంది ఉత్సాహం చూపడం ఇటీవల కాలంలో కనబడుతుంది. విచిత్రమేమంటే, పాకిస్తాన్ లో వివిధ ప్రభుత్వాలు ఆయన్ను వేధించాయి. జైళ్ళలో పెట్టాయి. కాని ఆయన మరణించిన తర్వాత ఆయన గొప్పదనాన్ని అందరూ కీర్తిస్తున్నారు. ఒకవేళ ఆయనే బతికి ఉంటే, ఇప్పటి పరిస్థితులపై ఆయన ప్రతిస్పందిస్తే, వీళ్ళంతా దానికి ఎలా స్పందించేవారు?
జబ్ జుల్మ్ ఓ సితమ్ కి కోహ్ యే గిరాం, రూయీ కి తరాహ్ ఉడ్ జాయేంగే, హమ్ మహ్కుమోంకే పాంవ్ తలే, యే థర్తీ థర్ థర్ థర్కేగీ, ఔర్ అహ్లే హకామ్ కే సిర్ ఊపర్, జబ్ బిజిలీ కర్ కర్ కర్కేగి, హమ్ దేఖేంగే ...
దౌర్జన్యాలు అణిచివేతల కొండలన్నీ, దూదిపింజల్లా ఎగిరిపోయినప్పుడు, పాలితులు బాధితుల కాళ్ళ కింద, ఈ నేల గుండెలా కొట్టుకుంటుంది, పాలకుల తలలపై, పిడుగులు వర్షిస్తాయి, అప్పుడు మేం చూస్తాం ... అంటూ పాలకుల వైఖరిపై ప్రత్యక్షదాడికి దిగిన కవి ఫైజ్.
ఈ కవితను ఇక్బాల్ బానూ శాశ్వతంగా ప్రజల మనోమస్తిష్కాలపై ముద్రించేలా పాడారు. పాకిస్తాన్ లో అనేక ఉద్యమాల్లో ఈ కవిత ప్రేరకశక్తిగా నిలిచింది. ఈ కవితల ద్వారా ఫైజ్ వర్గరహిత సమాజం కోసం కలలు కన్నాడు. వామపక్ష సిద్దాంతాలు కోరేది ఇదే. ఈ కవిత ఏదో ఒక ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. ఆయన అణిచివేతలు, అన్యాయాలు లేని సమాజం కోసం కలలు కన్నాడు. ఆయన రాతలు ఆ కలల నుంచి వచ్చినవే. ఆయన నమ్మిన సిద్దాంతం వేరు. ఆయన ఎవరిపైన పోరాడారో, ఎవరు ఆయన్ను వేధించారో, వారే నేడు ఆయనను పొగుడుతూ, ఆయన కవితలను కోట్ చేస్తూ కనబడడం విచిత్రం. చెగువెరా విషయంలోను ఇదే జరిగింది. చెగువెరా నమ్మింది వామపక్ష సిద్దాంతాన్ని. ఏ కార్పోరేట్ వ్యవస్థను చేగువెరా నిరసించాడో, వ్యతిరేకించాడో ఆ వ్యవస్థ ఇప్పుడు చెగువెరా చిహ్నాలను వాడుకుంటుంది. నైక్ సంస్థ చెగువెరా బొమ్మను వాడుకోడాన్ని మనం ఎలా అర్ధం చేసుకోవాలి.
ఫైజ్ నమ్మిన సిద్దాంతం నేటి కాలంలో వర్తిస్తుందా లేదా అన్నది కాదు ప్రశ్న. ఆయన నమ్మిన సిద్దాంతానికి ఆయన్ను ప్రతినిధిగా గుర్తించాలి. ఆయన కవితలను ఆ నేపథ్యంలోనే చూడాలి.
హమ్ దేఖేంగే అంటూ ఆయన రాసిన కవిత జియావుల్ హక్, జనరల్ ముషర్రఫ్ వంటి సైనిక పాలకులను కూడా వెర్రెత్తించింది. జనరల్ అయ్యూబ్ ఖాన్ పాకిస్తాన్ పాలకుడిగా ఉన్నప్పుడే ఫైజ్ కుట్ర కేసులో జైలు పాలయ్యింది. ఫైజ్ ను నిర్బంధించినప్పటికీ జనరల్ అయ్యూబ్ ఖాన్ ఒక గొప్ప కవిగా ఫైజ్ ను పొగిడేవాడు. కాని ఫైజ్ సిద్దాంతం అయ్యూబ్ ఖాన్ కు ఏమాత్రం గిట్టదు. తన అయిష్టాన్ని ఆయన దాచుకోలేదు. కనీసం ఈ పాటి నిజాయితి నేడు కనబడడం లేదు. ఒక జాతీయవాద కావిగా రాయడం వేరు, జాతీయ కవిగా రాయడం వేరు. ఫైజ్ ఎన్నడూ జాతీయ కవి కాదు. ఆయన బడుగువర్గాల కోసమే రాశాడు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి రాశాడు. కావాలని కూర్చుని ఒక సిద్దాంతం కోసం రాసేది కవిత్వమవుతుందా? అన్న ప్రశ్న ఫైజ్ వంటి వారికి వర్తించదు. ఆయన సామ్యవాద సిద్దాంతం పట్ల ఆకర్షితుడు కాకముందే మంచి కవిగా గుర్తింపు పొందాడు. యువకుడిగా ఉన్నప్పుడు సహజంగా తనలో ఉండే భావాలను ప్రేమకవితలుగా మార్చాడు. సామ్యవాద సిద్దాంతాల ప్రభావంతో తనలో జనించిన భావాలను అలాగే కవితలుగా వ్యక్తీకరించాడు. ఆయన ఏదో ఒక దేశానికి పరిమితమై రాయలేదు. అమెరికాలో జూలియస్, ఎథెన్ రోసెన్ బర్గ్ లను కమ్యునిస్టు గూఢచారులుగా ఆరోపించి మరణశిక్ష విధించినప్పుడు ఆయన తన దు:ఖాన్ని కవిత్వంగా రాసుకున్నాడు. వియత్నాం రైతుల బాధలకు స్పందించాడు. నజీమ్ హిక్మత్ ను అనువదించాడు. కొంతకాలం బీరుట్ తన దేశంగా మార్చుకున్నాడు.
ఈజిప్టు తహ్రీర్ స్క్వేర్ లో జరిగిన ప్రదర్శనలను ఫైజ్ చూసి ఉన్నట్లయితే, ఈజిప్టు పరిణామాలపై తప్పక ప్రతిస్పందించి ఉండేవాడు, అంతేకాదు, అలాంటివి రావల్పిండిలో కూడా జరగాలని కోరుకుని ఉండేవాడు. తాను కలలు కన్న సమాజం ఉనికిలోకి వస్తుందని బలంగా నమ్మిన కవి ఫైజ్.

దిల్ నా ఉమ్మీద్ తో నహీం
నా కామ్ హీతో హై
లంబీ హై గమ్ కీ షామ్
మగర్ షామ్ హీతో హై

మనసులో నిరాశ లేదు
వైఫల్యం మాత్రమే కదా
విషాదాల రాత్రి చాలా పెద్దదిగా ఉంది
అయినా, రాత్రే కదా...(రాత్రి అంతరించి తెల్లవారడం ఖాయం కదా)

ఆయన ఆశావాది. ఎప్పటికైనా వర్గరహిత సమాజం ఏర్పడుతుందని నమ్మిన కవి. ఇప్పుడు ఆయన కవితలు కొన్ని చూద్దాం.
ఒక కవిత కాదు, ఓ నాలుగు కవితల స్పెషల్ నజరానా...నాలుగు రోజులుగా సెలవులో ఉన్నందుకు...
ఈ రోజు మొదటి కవిత ఒక గజల్. గజల్ నిబంధనలను పాటిస్తూ అనువదించాలనుకోవడం ఒక పెద్ద సాహసమే అవుతుంది. అయినా ఫైజ్ రాసిన ఈ గజల్ ను సాధ్యమైనంత వరకు గజల్ ప్రక్రియలోనే అనువదించడానికి ప్రయత్నించాను. గజల్ లోని శబ్ధమాధుర్యం కూడా భావానికి బలాన్నిస్తుంది.

కష్టాలకు వివరణలూ లేనేలేవు కదా
మనోవ్యధకు సాంత్వనలు లేనే లేవు కదా

మరోసారి వాగ్దానం నిలబడనే లేదు
మరోసారి మాట నిజం కానేలేదు కదా

అమరత్వపు అనుమతులు పురుగులకూ లేవు
దీపాలకు ఒక్కరాత్రి రానేలేదు కదా

మత్తు రుచికి ముందే మనసు ఎగసిపడుతోంది
పరాకాష్ఠ ఈ గోష్ఠిలొ పలకనె లేదు కదా

తపిస్తున్న కళ్లముందు ఒక్కచూపు మెరిసి
కలవలేని రాత్రి గడిచి పోనేలేదు కదా

వ్యాజ్యాల ద్వారాలూ మూతపడే వేళ
మొత్తుకోళ్ళ నోళ్ళు మూత పడనె లేదు కదా

ప్రతిరోజూ ఫైజ్ నీకు కాళరాత్రి కదా
ఒక్కసారి పరిహారం దొరకనె లేదు కదా

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

షరహ్ బేదర్దీ హాలాత్ న హోనే పాయీ
అబ్ కే భీ దిల్ కీ ముదారాత్ న హోనే పాయీ

ఫిర్ వహీ వాదా జో ఇక్రార్ న బన్ నే పాయా
ఫిర్ వహీ బాత్ జో అస్ బాత్ న హోనే పాయీ

ఫిర్ వో పర్వానే జిన్హే ఇజ్నే షహాదత్ న మిలా
ఫిర్ వో షమేం కె జిన్హే రాత్ న హోనే పాయీ

ఫిర్ వహీ జాం బల్బీ లజ్జత్ మై సు పహలే
ఫిర్ ఓ మహ్ఫిల్ జో ఖరాబాత్ న హోనే పాయీ

ఫిర్ దమ్ దీద్ రహే చష్మ్ ఓ నజర్ దీద్ తలబ్
ఫిర్ షబ్ వసల్ ములాఖాత్ న హోనే పాయీ

ఫిర్ వహాం బాబ్ అసర్ జానియే కబ్ బంద్ హో
ఫిర్ యహాం ఖతమ్ మనాజాత్ న హోనే పాయీ

ఫైజ్ సర్ పర్ జో హర్ ఇక్ రోజ్ ఖయామత్ గుజరీ
ఎక్ భీ రోజ్ మకాఫాత్ న హోనే పాయీ

మరో కవిత:

ప్రపంచబాధలో మనసు మునిగిపోయింది
ప్రతి శ్వాస తపిస్తున్న బాధ అయిపోయింది

అంతరంగ గోష్టి కూడా నిర్జనమైపోయింది
జతగా ఉన్న దు:ఖమూ ఎక్కడికో పోయింది.

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

దిల్ రాహియే గమె జహాం హై ఆజ్
హర్ నఫ్స్ తష్నాయే ఫుఘాన్ హై ఆజ్

సఖ్త్ వీరాం హై మహ్ఫిలె హస్తీ
యే గమే దోస్త్ తూ కహాం హై ఆజ్

ఇంకో కవిత:

సోదరా, ఇదేంటి ఇలా చేశావు
వెళ్తూ వెళ్తూ నా జీవిత పుస్తకాన్ని పట్టుకుపోయావు
అందులో చాలా విలువైన బొమ్మలున్నాయి.

అందులో నా బాల్యం ఉంది, నా యవ్వనం ఉంది
దానికి బదులుగా నువ్వు వెళ్తూ వెళ్తూ ఏమిచ్చావ్
భగ్గుమంటున్న నీ బాధల నెత్తుటి గులాబీ

నన్నేం చేయమంటావ్, ఈ ఆదరాన్ని నేనెందుకు తొడగాలి?
నా దుస్తుల లెక్కలన్నీ తీసుకో
చివరిసారిగా, ఈ ఒక్కప్రశ్నకు ఒప్పుకో
నువ్వెప్పుడు నన్ను జవాబివ్వకుండా పంపలేదు

వచ్చి నీ భగ్గుమంటున్న ఈ పువ్వు తీసుకుపో
నాకు నా గతజీవిత పుస్తకాన్ని ఇచ్చిపో

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

ముఝ్కో షిక్వా హై మేరే భాయీ కె తుమ్ జాతే జాతే
లేగయే సాథ్ మేరే ఉమ్ర్ గుజిష్తా కి కితాబ్
ఇస్మేం తో మేరీ బహుత్ కీమతీ తస్వీరేం థీం

ఇస్మేం బచ్పన్ థా మేరా ఔర్ మేరా అహదె షబాబ్
ఇస్కే బదలే దేగయే ముఝే తుమ్ జాతే జాతే
అప్నే గమ్ కా యే దహెక్తా హువా యే ఖూరంగ్ గులాబ్

క్యా కరూం భాయ్ యే ఐజాజ్ మైం క్యోం కర్ పహనూం
ముఝ్ సే లేలో మేరీ సబ్ చాక్ కమీజోంకా హిసాబ్
ఆఖ్రీ బార్ అబ్ లో మాన్ లో ఏక్ యహ్ భీ సవాల్
ఆజ్ తక్ తుమ్ సే మైం లౌటా నహీ మాయూసె జవాబ్

ఆకే లే జావో తుమ్ అప్నా యే దహెక్తా హువా ఫూల్
ముఝ్ కో లౌటా దో మేరీ ఉమ్ర్ గుజిష్తా కీ కితాబ్

చివరి కవిత :

ప్రతిరాత్రి మనసు వెర్రిగా వెదుకుతోంది
ప్రతి పిలుపు లోను నీ మధురస్వర అలికిడి

ప్రతి పొద్దు తరచూ కలుస్తాయి చూపులు
ప్రకాశించే వదనంలో మల్లె మందారాల రంగులు

ఫైజ్ రాసిన ఉర్దూ పంక్తులు

తమామ్ షబ్ దిల్ వహషీ తలాష్ కర్తా హై
హర్ ఏక్ సదా మేం తేరే హర్ఫ్ యే లుత్ఫ్ కా ఆహంగ్

హర్ ఏక్ సుబా మిల్తీ హై బార్ బార్ నజర్
తేరే దహన్ సే లాలా ఓ గులాబ్ కా రంగ్

మళ్ళీ శుక్రవారం కలుద్దాం.. అంతవరకు అస్సలాము అలైకుమ్
















                                                                                                                                 - అబ్దుల్ వాహెద్

13, నవంబర్ 2013, బుధవారం

మహేష్ కుమార్ కత్తి కవిత్వ విశ్లేషణ

కవిత యొక్క టైటిల్ చూస్తేనే తెలుస్తుంది ...లోతైన భావాన్ని ...కవిత లోని మొత్తం అర్థాన్ని ఒకే పదంలో నూతనంగా మూతబెట్టి చిత్రించిన తీరు కవి తాత్విక ధోరణికి అద్దం పడుతుంది.

తనకు తానుగా కావలని చేరుకున్న ఓ తీరం...అందులోని రసాయనంలా కవి ఎంచుకున్న వస్తువు అది మత్తు పదార్థం కావచ్చు లేదా ప్రేమకూడా కావచ్చు ఇంకేదైనా వ్యసనం కావచ్చు! తనకు తానుగా ద్రవంలా కరిగిపోయి మనసు వొలకబోసుకోవడం (మనసు పడటం)...ఆ కవితా వస్తువులో సంతృప్తి చెంది అక్కడే ఆగిపోయి తనకు తానుగా బంధీ అవడం... ఇదంతా ఒకే వాక్యంలో వర్ణించారు!

"నన్ను నేను సీసాలోకి ఒంపుకుని
బిరడా బిగించి, టైం కాప్స్యూల్ లో పడేసుకున్నాను.
అనుభవం ఉంది. జ్ఞానం ఉంది.
కానీ నేను మాత్రం ఆ సీసాలోనే మిగిలిపోయాను."

అనుభవమూ,జ్ఞానమూ అన్నీ తెలిసి కూడ కావాలని కోరుకున్న బంధంలోనే ఉండిపోయానంటారు! ఇది కవి మనస్తత్వాన్ని స్పష్టపరుస్తుంది.

తనను తాను సీసాలో వలకబోసుకునే ద్రవణంతో మరియు కవితా వస్తువును భూతంతో పోల్చడం... పీడించబడిన మనసును కవి యొక్క కళాత్మక దృష్టిని తెలియజేస్తుంది

"నన్ను నేను వృధా చేసుకున్నానా!
రాబోయేకాలానికి నమూనాగా మలుచుకున్నానా
లేక ఒక మ్యూజియం పీస్ గా మిగిలిపోతానా
అసలు గుర్తింపేలేకుండా ఇంకిపోతానో తెలీదు"

ఆ బంధం మత్తులో కాలం తెలియక గడిపాకగాని గుర్తొచ్చే విషయం...!గతించిన కాలాన్ని తలచి వృధాగ వగచి ప్రశ్నించుకోవడం....భవిష్యత్తుకు తానొక నష్టపోయిన జీవితపు నమూనాగా మిగిలిపోతానేమోనని...,అసలు గుర్తింపుకూడా లేకుండా పోతాననుకోవడం కవి పశ్చాత్తాప ధోరణితో కలవరపడుతూ ఆలోచించడం... కవి మనసు ఊగిసలాడే స్పందనను తెలియజేస్తుంది...!

"కొన్ని బిరడాలు తీస్తే భూతాలు వస్తాయి
కానీ ఈ సీసాలోంచీ భూతకాలపు అనవాళ్ళు
వర్తమానపు జ్ఞాపకాలు వస్తాయి
అవిభవిష్యత్తుకు పనికొస్తాయోలేదో తెలీదు
కానీ నన్ను కోల్పోయిన నేను కాలంగా మిగిలాను"

మనసు తలుపు తెరిచినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కానీ కవి ఎంచుకున్న విషయం గుర్తొస్తే మాత్రం తను నస్టపోయిన కాలం గుర్తొస్తుంది అని అది వర్తమానాన్ని కూడా స్పృషిస్తుందని ....భవిష్యత్తులో అది ఒక గుణపాఠంగా పనికొస్తుందో లేదో అని.....ప్రస్తుతం ఎలా ఉన్నా గతించిన కాలం బ్యాడ్ టైం గా తనను నిలబెట్టిందని వ్యసనానికి బానిస అయి బయట పడడాన్ని చిత్రంగా చిత్రించారు!!!
సూక్ష్మంలో మోక్షం చూపించినట్టు వ్యసనానికి బానిస కావడం వల్ల అమూల్యమైన కాలాన్ని, విలువైన జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిగూఢంగా తెలియజేసారు!

విషయం ఎలాంటిదైనా ఏర్పడకుండా చెప్పగలగడం కళాత్మకమే!
అమూల్యమైన సందేశాన్ని కవితగా చెప్పిన "మహేష్ కత్తి" గారికి ధన్యవాదాలు!

________ అరుణ నారదబొట్ల(13-11-2013)

కవిత్వ విష్లేశణ



లక్ష్మణ్ స్వామి కవిత

విలయానికి, విద్వంసానికి సంబందించిన విషయాన్ని వస్తువు గా తీసుకోవడం అన్నది కొత్త ప్రక్రియగా చెప్పవచ్చు. బీబత్సానికి అక్షర రూపమిచ్చే ప్రయత్నం చేసారు లక్ష్మణ స్వామి గారు తన కవిత లో , మొత్తం కవిత ని సంబాషణ రూపం లో వ్యక్తీకరించారు.

విద్వంసం ఎంత భయాన్ని సృష్టిస్తుందో, క్షణాల్లో ఎన్ని నగరాలని నేలమట్టం చెయ్యగలదో అంటాయి మొదటి పాదాలు

//కొన్ని నిమిషాలు చాలు నీకు //ఒక్కోనగరాన్ని ఉఫ్ మని ఊది //పారెయ్యటానికి...!

వాయు తీవ్రతకి ఎంతటి బలం వున్న వస్తువైనా కూలిపోవాల్సిందే, పెను గాలి కి వృక్షాలు సైతం చిత్తు కాగితం మే అంటూ పోలికలతో వర్ణిస్తారు .....

//విమానాల్ని వెనక్కినేట్టే //నీ విలయ గాలికి //వృక్షాలు మేడలు చిత్తుకాగితాలు ...!!!

విద్వంసపు తాలూకు స్పందనల్ని బీబత్స నృత్యానికి ముడివేస్తూ , ఆ క్రమం లో ప్రపంచం లో ని కొన్ని నగరాలు మటుమాయం అయి, ఆనవాళ్ళు ను కూడా మిగల్చని ఈ తుఫాను ..పెను విషాదభరితం అంటూ చెప్తూనే.... జరిగిపొయిన గతాన్ని మననం చేసి నిజాన్ని వెలికి తెచ్చే ప్రయత్నం కన్పిస్తుంది ...

//నీ అల్లకల్లోల//కంకాళ తాండవానికి //ప్రపంచ పటం నుంచి //పెకలించబడిన కొన్ని నగరాలు ..!!
//బహుశః కొన్ని రోజులకింద//ఇక్కడో మానవ ఆవాసముండేదేమో అన్న౦తగా ..!!

నీటి ప్రవాహపు శక్తి అణుబాంబు కన్నా వెయ్యి రెట్లు బలముంటుంది , ఆ ధాటికి చెల్లా చెదురైన బక్క ప్రాణాలు అవి జంతు జాలం అయిన, లేదు మనిషి అయిన సముద్రపు అడుగున వెళ్తాయి నిర్దయగా ........!!!
"అణు బాంబుల్ని వెక్కిరించే //నీ అసిధారకు ముక్కలైన ‘బక్క ప్రాణులు’//సముద్రం అడుక్కి !!

అంతరిక్షాన అబివృద్ధి కి చిహ్నాలు గ చెప్పుకుంటున్నవి కూడా నీ ఉనికి ని పసిగట్టలేక చతికిల బడి చూడలేకపోతున్నాయి, కేవలం గంటల వ్యవధి లో మానవుడు పేర్చుకున్న నాగరికత ను కొన్ని వందల వత్సరం ల వరకు తుడిచి పెట్టగలదు అంటూ అందులో ని తీవ్రత ను పట్టి ఇస్తాయి ఇలా..

"మార్స్ చూసే ‘మానవ కళ్ళు’ నీ మారణాయుధాన్ని //చూళ్ళేక పోతున్నాయి !
గంటల్లో యుగాల కావల //నా‘గరిక’తను తోసి పడేస్తావు !!

భవిష్యత్తు నిర్మాణాన్ని ఊహించేముందు, నేటి పరిస్థితి ని అవగాహన చేసుకోమంటూ, నేల మీద నిలిచేందుకు కనీసపు సాక్షాలన్న వుండాలి అన్న స్పృహ ను కల్పిస్తాయి కొన్ని పాదాలు

//చంద్రుని పైనా , అరుణిని పైనా , మేడలు కడతాడట !!??, మరి నేలమీద నీడలు నిలిచేందుకు
జాడలు౦డాలిగా ముందు !//

మనిషి తన ఆనందం కోసం, విలాసాల కోసం ప్రకృతి ని మట్టుబెట్టినపుడు, ప్రతీకారం తీర్చుకోడానికి ప్రతిజ్ఞ చేసి ..., .విషం తో అంతం చేస్తావా అంటూ ప్రకృతి ని నిలదీస్తారు ..

//అంత పగెందుకే ప్రకృతి ??//విశృంఖల విలాసాలకు //నిన్ను విచ్ఛిన్నం చేస్తే మట్టుకు //‘కాల’ కూటంతో కాటేయ్యాలా..!!??//

ప్రకృతి భీబత్సాలకు ప్రతిక గా కొన్ని ఉదాహరణలను చూపుతూ .....అవి మారణాయుధాలు, ఎంతో శక్తివంతం అయినవి ప్రకృతి విలయాలు అంటూ ముగిస్తారు ..ఇందులో "‘బెర్ముడా ట్రయాంగిల్’ అమ్ములపొదిలో !! అనేది ఓ చక్కని పదబంధం ...సముద్రానికి సంబదించిన ఓ రహస్యం ...., ఈ వృత్తం నుంచి వెళ్ళినన ఏ వస్తువు అయిన కూడా ఆ ట్రయాంగిల్ పడి అంతం అవుతుంటాయి ...దానికి సంబదించిన రహస్యాన్ని చేదించారు ...అది వేరే విషయం, ప్రకృతి ప్రకోపిస్తే అన్ని రూపాల్లో వినాశనం తప్పదు ఇది సత్యం అంటూ ముగిస్తారు ...

//హరికేన్లు ... టోర్నడోలు , తుఫాన్లు ..భూకంపాలు., ఉల్కలు ... లావాలు
గ్రహశకలాలు, ఒక్కటా, రెండా .లెక్ఖ లేనన్ని మాయావి విశ్వంలో //
మారణ హోమాయుధాలు ...!! //‘బెర్ముడా ట్రయాంగిల్’ అమ్ములపొదిలో !!

లక్ష్మణ్ స్వామి గారి లో వ్యక్తీకరించే భావేవాశం వున్నది ....అయితే కేవలం సమస్య తీవ్రత ని చెప్పారు తప్ప, పరిష్కార మార్గాన్ని సూచించలేదు ఆ ఒక్కటి తప్ప మిగితా మొత్తం కవిత చదివించేలా ఆకట్టుకొన్నది. ఓ కొత్త వస్తువు తో ముందుకు వచ్చిన స్వామి గారు అభినందనీయులు ..సామాజిక స్పృహ ని రంగరించి అక్షరానికి మెరుగులు దిద్దుకుంటే ఇంకా మరిన్ని మంచి కవితలని అందిచగలరు ...

వారు ఈ విషయము లో విజయం సాదించాలని మనస్పూర్తి గా కోరుకుంటూ ...

సెలవు ...
 
                                                                                                                             
 
 
 
 
                                                                                                                             _______పుష్యమి సాగర్
 

తొవ్వ




పండు వెన్నెల -పసందయిన జ్ఞాపకాలు

తెల్లని ఎన్నీల ఎలుగుల చల్లదనం
వాకిట్ల గడించేల ఎల్లెలుకల పండి
తాత చెప్పిన శాత్రాలు ఇన్నందుకేమో
కొంతయినా కవిత్వాల అల్లకం అబ్బింది

పండు వెన్నెల రోజు ఆరు బయట నడుస్తుంటే వచ్చే ఉల్లాసం ఎట్లుంటదో టైపు చేయరాదు రాయరాదు .పున్నం రాత్రి అన్నం తిని కట్టె పట్టుకొని పొలం కాడికి కావలి పోతే ,ఆ చెల్కలు చేన్లన్నీ తెల్లగ అగుపిస్తాయి .కొట్టంల కట్టేసిన ఎడ్లు అయితే మరింత తెల్లగ మెరిసిపోతాయి .
ఎన్నిల రాత్రి ఎవలకు వాళ్ళే మెరిసి పోతారు .చేను చెలక గొడ్డు గోదా మ్యాక వాటి మొకం సూస్తే అవ్వి సుత ఎన్నిల ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తయి .అమాస పున్నంకు ఎంత తేడా ఒకటి కటిక చీకటి ఒకటి ఎలుగుల పందిరి .
మేము చిన్నప్పుడు వాకిట్ల నులుక మంచం ఏసుకొని ముచ్చట్లు పెట్టుకుంట పండుకునేది .నడుమ మా తాత మాకు కచెప్పేది.ఇనుకుంట ఇనుకుంట మేము నిద్రల జారేది .ఆ కథలల్ల తప్పక చందమామ వచ్చేది .మా తాత కథలను శాత్రాలు అంటదు .
కాముని పున్నం నాడు అయితే పోరగాండ్లకు మస్తు సంబురం .కోలలు పట్టుకొని ఊరంతా జాజిరి ఆడపోయేది
జాజిరి జాజిరి జాజిరి జాజ
జాజిరి ఆడపోతే ఏమేం దొరికె
రింగుడు బిళ్ళ రూపుడు దండ
దండ కాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోదుగు నీడ
నీడ కాదురో నిమ్మల బాయి
బాయి కాదురో బసంత తీగ

ఇట్లాంటి పాటలు పాడుకుంట ఇంటింటికి ఎన్నిల రాత్రిళ్ళు పాడుకుంట తిరిగిందీ కవిత్వమే ...కవిత్వం కావాలి కవిత్వం అని మన కవి సంగమం పిలిపిస్తే అక్కన్నుంచే వస్తుందిఏ కవనపు జాలు .కవిత్వానికి ఎన్నేలకు ఎంత సంబంధమో ఈ చందమామ లు కవిసమయాలే ...చల్లని పల్లె ఎన్నెల తాగిన వాళ్ళు ,చిక్కని బర్రె పాలు జుయ్యిన పిండిన వూరోల్ల కవిత్వం ఇప్పుడు పరిశోధన జరగాలె .
అందుకే వెన్నెల ను ప్రేమించిన మా కరీంనగర్ కవులం ప్రతి పున్నం రాత్రి 'ఎన్నీల ముచ్చట్లు 'పేర కలుసుకొని కవిత్వం చెప్పుకుంటన్నం .ఒక్కో పున్నంకు ఒక కవి ఇంటి డాబా మీద కలయిక .ఇప్పటికి మూడు సార్ల అయ్యింది .'సాహితీ సోపతి 'వాటిని పుస్తకాలు తెచ్చింది .రేపు 17.11.2013న కార్తీక పున్నం రోజు మిత్రుడు బూర్ల వెంకటేశ్వర్లు ఇంటి మీద ..కవుల కలయిక ...

నిండు పున్నమి నాడు పండు వెన్నెల
భూమికి సున్నం ఎసినట్లు
ఎన్నీల ఎలుగు పల్లెటురంత స్వచ్చం
ఎన్నీల ఎలుగె మనుసుకు నిమ్మళం ......


                                                                                                                          
 
 
 
 
                                                                                                                 ________అన్నవరం దేవేందర్

11, నవంబర్ 2013, సోమవారం

భూమధ్యరేఖ




"శ్లోకం శోకత్వమాగతః"అని ప్రాచీనులు.అసలు భారతీయ లౌకిక సాహిత్యాత్మే శోకంతో ప్రారంభమయింది."మానిషాద" శ్లోకం అందుకు ఉదాహరణ.జీవితానికి ఒక గతి ఉంటుంది.ఆ గతికి దగ్గరగా కొన్ని పరిసరాలుంటాయి.ఆ పరిసరాల భావజాలానికి అతని ఆలోచనకి ఏర్పడే పారస్పర్యం వల్ల అతని మానసిక సంస్కారం రూపొందుతుంది.ఈ సంస్కారమే అతని చుట్టూ ఉన్న పరిసరాలని,జీవితాన్ని పరిచయం చేస్తుంది.

కాశీరాజు కవితలో దుఃఖానికి సంబందించిన అవగాహన ఒకటి కొత్తగా ,నిలకడగా కనిపిస్తుంది.ఈ మధ్య తనురాసిన కవితలలో జీవితాలవెనుక ఉన్న అనిర్దిష్టసంఘర్షణకి,ఇదీ అని అంచనా వేయలేని గతికి రూపాన్నిచ్చాడు.సాధారణంగానే ఈమధ్యకాలపు కవిత్వం వస్తువులోకి తీసుకెళ్లేందుకు మానసిక పరివర్తనలని ఉపయోగిస్తుంది.



కాశీరాజుకూడా అందుకు కావలసిన నిర్మాణాన్నొకదాన్ని ఏర్పరచుకున్నాడు.వస్తువును పరిచయం చేయడానికి పరిమితి(Limit)ఒకటుంటుంది.తాను ఒక వర్గానికో ప్రాంతానికో (తప్పనిసరై )చేరడం ఒకటైతే,జీవితాన్ని పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట పాత్రని తీసుకోడం మరొకటి.ఇలా తీసుకున్న పాత్ర నాన్న.నాన్న స్వభావం చెప్పడానికి ఒక సన్నివేశాన్ని రూపొందించి అందులోకి తీసుకెల్తాడు.

"ఇళ్ళు కట్టేపనికే ఎందుకెల్తావ్" అని అడిగావ్ గుర్తుందా
కూలివ్వకపోతే కూడన్నా పెడతాడని
పనికెళ్ళి అక్కడే తినేసొత్తే, ఓ పూట బియ్యం ఎనకేద్దామని
మిమ్మల్ని కాత నవ్వుతూ సూదామని
ఒంట్లో జివలేకున్నా సులువైన పని కాదు, తెలివైన పనే ఎతుకున్నా!"

నిజానికి ఇక్కడపరిచయం చేస్తున్నది,పాత్రని మాత్రమేకాదు,జీవితాన్ని దాని వెనక ఉన్న సంఘర్షణని.స్థితిని,సంక్లిష్టతని.దీనికి మరో మెట్టు రెండవ యూనిట్.ఇక్కడనించే అసలువస్తువుకు సంబంధించిన అంశం ప్రారంభమయ్యేది.

"ఒరేయ్ బంగార్రాజు ! ఆ బగమంతుడు
ఆకలి అక్సాంసాల్నీ, అత్మాభిమాన రేఖాంసాల్నీ ఓ చోట కలిపి
అది మన చుట్టూ తిరిగేట్టు చేసిన భూమధ్యరేకేరా ఈ ఏడుపు
భాదపడకు
అది మన బ్రమనాన్ని బతుకుచట్రం లో నుండి తప్పిపోనియ్యదు"

ఇక్కడినుంచే బతుకులోని దుఃఖ తాత్వికతని కవిత్వంగా అందిస్తాడు.

"ఆకలి అక్సాంసాల్నీ, అత్మాభిమాన రేఖాంసాల్నీ ఓ చోట కలిపి
అది మన చుట్టూ తిరిగేట్టు చేసిన భూమధ్యరేకేరా ఈ ఏడుపు"

"మన గోదారి సూత్తే తెలీదా భాదంటే మేఘమని
ఏడుపంటే వానని, ఏడవడం అంటే ప్రవాహమని"

"దుక్కమొస్తే దాసకోరేయ్
ఎలాగైనా నువ్వూ, నేను నీరైపోవాలి
గుర్తెట్టుకో ఏడుపు ఇంకితే ఎక్కడా ఉండలేం."

"ఇయ్యాల నేను , రేపు నువ్వు
ఒకడు సెప్పినంత, ఇంకోడు ఇన్నంత
దుఃఖానికి కొత్త అభివ్యక్తి దొరకదొరేయ్ "

ఈ దుఃఖ గీతవెనుక ఒక అనుభవధార ఉంది.బలమైన తాత్వికాభినివేశముంది.సాధరణ సంభాషణామాధ్యమాన్ని ఎన్నుకున్నా పాత్రల మధ్య ఉండే సంభావ్యతా ధర్మమొకటి ఉపదేశ గుణాన్ని ఆపాదించింది.

"నీకైనా ,నాకైనా దుఃఖానికి మూలం దొరికిపోయాక
అడుగులు తిన్నగా పడ్తాయ్"-దుఃఖం జీవించడం నేర్పుతుందనే అంశాన్ని ప్రకటిస్తున్నట్టుగా కనిపించేవాక్యం ఇది.తరువాతి వాక్యం మళ్లీ గంభీరమైన వచనాన్నించి సాధారణతవైపు తీసుకెళ్తుంది.

అస్తిత్వ వాదులు జీవితంలో మృత్యువుతో పాటూ,దుఃఖాన్ని ప్రేమించారు.ఇందులోనూ ఆ భావన కనిపించినా ఈ కవిత వైయ్యక్తికమైనదికాదు.దీని చుట్టూ కుటుంబం,దాన్నించి ఒక సామాజిక ఏకాంతం(Social Isolation)ఉంది.

కాశీరాజు పట్టుకున్న జీవధార లాంటి భాషని గురించి కూడా మాట్లాడుకోవాలి.మాండలికాల్లోనే కవిత్వం రాస్తే చేరదనే మాటని తప్పుచేస్తూ అనేకమైన కవితలు,సాహిత్యం కనిపిస్తాయి.కాశీరాజులోను ఇందుకు ఉదాహరణలున్నాయి.యానం వాసనలతో మరోమంచిగొంతుకను కాశీరాజు రూపంలో పొందినందుకు సంతోషంగా ఉంది.                                                           

                                                                                             










                                                                                                        _________ఎం నారాయణ శర్మ 

8, నవంబర్ 2013, శుక్రవారం

ఉర్దూ కవిత్వ నజరానా











కరేనా జగ్ మేం అలావ్ తో షేర్ కిస్ మస్రఫ్
కరేనా షహర్ మేం జల్ తాల్ తో చష్మె ఇనామ్ క్యాహై

ప్రపంచంలో వెలుగు నింపని వాక్యమెందుకు
ఊరిని ముంచెత్తని కన్నీరు ఎందుకు

ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఎలాంటి కవి అన్నది చెప్పడానికి పై కవిత చాలు. నూరేళ్ళ క్రితం జన్మించిన ఫైజ్ నేటికి కూడా కవిత్వ ప్రేమికుల మనసుల్లో సజీవంగా నిత్య యవ్వనుడిగానే ఉన్నాడు. ఫైజ్ గొప్ప కవిగా కేవలం భారత ఉపఖండంలో మాత్రమే కాదు యావత్తు ప్రపంచంలో పేరు ప్రతిష్ఠలు పొందాడు. ఫైజ్ తండ్రి గురించి చాలా మందికి తక్కువ తెలుసు. కాని వాస్తవానికి ఆయన కూడా మంచి కవి, పండితుడు. నిజానికి ఫైజ్ కన్నా ఆయన తండ్రిగారి జీవితం మరింత సవాళ్ళతో కూడుకున్న జీవితం. సియాల్ కోట్ (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది)లో ఒక నిరుపేద పశుకాపరి కొడుకు సుల్తాన్ ముహమ్మద్ ఖాన్. ఈయనే ఫైజ్ తండ్రి. సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ తెలివితేటలు గమనించి అక్కడి ఒక ఉపాధ్యాయుడు ఆయనకు చదువు చెప్పించాడు. సియాల్ కోట్ లో చదువు ముగిసిన తర్వాత సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ లాహోర్ వెళ్ళి చదువు కొనసాగించాడు. అక్కడ నిరుపేద, అనాథ పిల్లలతో పాటు మస్జిదులో ఉండి చదువుకున్నాడు. ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో తిరుగులేని ప్రావీణ్యం సంపాదించాడు. అదృష్టవశాత్తు ఒకరోజు ఆప్ఘన్ రాజు దర్బారులో అధికారి హబీబుల్లా ఖాన్ ను కలవడం జరిగింది. సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ భాషా ప్రావీణ్యం చూసి ముచ్చటపడిన ఆ అధికారి ఆయన్ను ఆఫ్ఘన్ రాజదర్బారుకు తీసుకెళ్ళాడు. క్రమేణా సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ ఆఫ్ఘన్ రాజుకు వ్యక్తిగత అనువాదకుడిగా, మంత్రిగా ఎదిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కేంబ్రిడ్జిలో న్యాయశాస్త్రం చదివాడు. అక్కడే ఇక్బాల్ వంటి మహాకవిని, తాత్వికుడిని కలిశాడు. చివరకు సియాల్ కోట్ లోనే స్థిరపడి న్యాయవాద వృత్తి కొనసాగించాడు. ఫైజ్ గారి తండ్రి కథ ఇది. సియాల్ కోట్ లో స్ధిరపడిన తర్వాత ఆయన ఫైజ్ తల్లిని పెళ్ళి చేసుకున్నాడు. ఫైజ్ జన్మించిన తర్వాత సయ్యద్ మీర్ హసన్ వంటి పండితుల వద్ద విద్యాభ్యాసం చేయగలిగాడు. ఫైజ్ ఒక నాస్తికుడన్న ఆరోపణలు ఉన్నాయి. కాని సంప్రదాయిక ముస్లిమ్ కుటుంబాల్లో పిల్లలు ఖుర్ఆన్ కంఠస్థం చేసిన విధంగానే ఫైజ్ కూడా ఖుర్ఆన్ కొంతభాగం కంఠస్థం చేశాడు. ఫైజ్ నాస్తికుడన్న ఆరోపణలు బలంగా వినిపించింది 1951లో ఆయన అరెస్టయిన తర్వాత. రావల్పిండి కుట్ర కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. నాలుగేళ్ళు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ ఆరోపణలు చాలా బలంగా వచ్చాయి. టర్కీలో ముస్తఫా అతా తుర్క్ చేసిన మాదిరిగా పాకిస్తాన్ లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొందరు వామపక్ష భావాలతో ప్రభావితులైన సైనికాధికారులు ప్రయత్నించిన కేసు రావల్పిండి కుట్ర కేసుగా చరిత్రకెక్కింది. ఈ పథకంలో ఫైజ్ కూడా భాగస్తుడే. ఫైజ్ జైల్లో ఖైదీలకు ఖుర్ఆన్ చదవడం నేర్పేవాడు. ఇది చూసి జైలర్లు ఆశ్చర్యపోయేవారు. ఈ కుట్ర కేసులో నిందితులందరూ నాస్తికులు, కమ్యునిస్టులని ప్రభుత్వం వారికి చెప్పింది. ఇక్కడేమో ఫైజ్ కూర్చని కొందరికి ఖుర్ఆన్ బోధనలు చేస్తున్నాడు.
ఫైజ్ విద్యాభ్యాసం విషయంలో అల్లమా ఇక్బాల్ స్వయంగా శ్రధ్ధ తీసుకున్నడన్నది చాలా మందికి తెలియదు. లాహోరులో అప్పట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కళాశాలలో ఫైజ్ కు అడ్మిషన్ లభించేలా ఇక్బాల్ సిఫారసు చేశారు. అల్లమా ఇక్బాల్ వంటి కవిని అప్పటి ఫైజ్ కవితలు ఆకట్టుకున్నాయి. ఆయన చేతులమీదుగా ఫైజ్ బహుమతి కూడా అందుకున్నాడు. మీర్ తకీ మీర్, మీర్జా రఫీ, సౌదా, అసదుల్లా ఖాన్ గాలిబ్ వంటి క్లాసికల్ ఉర్దూ కవుల కవిత్వాన్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఫైజ్ కు ఉర్దూ కవిత్వంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్లాసికల్ గజల్ కు, ఆధునిక గజల్ కు మధ్య వారధిగా పేరు పొందాడాయన.
ఆయన కేవలం కవిత్వాన్ని సాహిత్యసేవగా భావించలేదు. ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అన్న భావాన్ని బలంగా తిరస్కరించిన కవి ఫైజ్. కవిత్వాన్ని సామాజిక చైతన్యానికి సారధిగా మార్చాలని ప్రయత్నించాడు. భారత స్వతంత్ర పోరాటాన్ని అతి దగ్గరగా చూడడమే కాదు అందులో భాగస్వామి కూడా అయిన ఫైజ్ దేశవిభజనను తీవ్రంగా నిరసించాడు. ఈ నిరసనన పట్ల కొందరు పాకిస్తానీ మిత్రులు ఆగ్రహించినా ఆయన లెక్కచేయలేదు. స్వతంత్ర ఉదయం – అన్న కవితలో అతి తీవ్రంగా ఈ నిరసనను ప్రకటించాడు.
ఈ మచ్చపడిన పగలు, ఈ చీకటి నిండిన ఊరు
మనం ఎదురు చూసిన ఉదయం ఇది కాదు...
అన్నాడు.1947లో ఇంగ్లీషు పత్రిక పాకిస్తాన్ టైమ్స్ కు సంపాదకుడిగా పనిచేశాడు. పాకిస్తాన్ లో శ్రామికులు, మహిళలు, నిరుపేదలు, కూలీల హక్కుల కొరకు పోరాడే పత్రికగా దాన్ని తీర్చి దిద్దాడు. రావల్పిండి కుట్ర కేసులో అరెస్టయిన తర్వాత, ప్రభుత్వం ఆయనకు మరణశిక్ష విధించే అవకాశాలున్న పరిస్థితిలో కూడా జైలు జీవితం మళ్ళీ ప్రేమలో పడడంలా ఉందని వ్యాఖ్యానించాడు.
ఆ కుట్ర కేసు నుంచి బయటపడిన తర్వాత ఫైజ్ ప్రతిష్ఠ మరింత పెరిగింది. 1962లో ఆయనకు ప్రతిష్ఠాత్మక లెనిన్ శాంతి బహుమతి లభించింది. సోవియట్ బ్లాకులో ఇది నోబెల్ బహుమతికి సమానమైన బహుమతిగా పేరుపొందింది. ఈ అవార్డుకు దూరంగా ఉండాలని సైనిక ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్ అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. మరోవైపు భారతదేశం సోవియట్ కు దగ్గరయ్యింది. పాకిస్తాన్ లో వామపక్ష భావాలపై తీవ్రమైన అణిచివేత అమలవుతున్న కాలమది. ఫైజ్ ఈ హెచ్చరికలు ఖాతరు చేయలేదు. మాస్కో వెళ్ళి అవార్డు స్వీకరించడమే కాదు అక్కడ ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో ఒక గొప్ప ప్రసంగంగా నమోదయ్యింది.
జనరల్ అయ్యూబ్ ఖాన్ కాలంలో ఫైజ్ అనేకసార్లు అరెస్టయ్యాడు. ముఖ్యంగా 1965లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఫైజ్ విచిత్రమైన సంఘర్షణకు గురయ్యాడు. మిత్రులు ఆయన్ను దేశభక్తి పాటలు రాయమని అడిగారు. కాని ఫైజ్ మాత్రం ఒక మరణించిన సైనికుడి కోసం విషాదగీతం రాశాడు.
చిన్నపిల్లవాడిని ఇంటికి రమ్మని లాలిస్తున్నట్లుగా ఆ కవిత సాగింది. ఈ రాతలు చాలా మందికి కోపాన్ని కలిగించాయి. 1971లో బంగ్లాదేశ్ వేర్పాటు, రక్తపాతం, ఆ తర్వాత పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రబుత్వం ఏర్పడినప్పడు ఫైజ్ సాంస్కృతిక సలహాదారుగా నియమితుడయ్యాడు. ఆయన ఉన్నప్పుడే పాకిస్తాన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆర్ట్స్, లోక్ విర్సా పేరిట జానపద కళల కేంద్రం ఏర్పాటయ్యాయి. అంతర్యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటుల తర్వాత పాకిస్తాన్ లో ముజీబుర్రహ్మాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ తో సంబంధాలు పునరుద్ధరించుకోడానికి చేసిన ప్రయత్నాల్లో ఫైజ్ కూడా పాలుపంచుకున్నాడు. నిజానికి బంగ్లాదేశ్ ప్రధాని ముజీబుర్రహ్మాన్ ఆయనకు మంచి మిత్రుడు. ముజీబుర్రహ్మాన్ ఒక కవిత రాయమంటే - మనం అపరిచితులమయ్యాం – అన్న కవిత రాశాడు. 1977లో పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు తర్వాత ఆయన బీరుట్ వెళ్ళిపోయాడు. అక్కడ పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్ అధినేత యాసర్ అరఫాత్ తో కలిసి పనిచేశాడు. ఆఫ్రో ఆసియన్ రైటర్స్ అసోసియేషన్ వారి పత్రిక లోటస్ కు అక్కడ ఎడిటర్ గా ఉన్నాడు. బీరుట్ లో పలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ స్థావరాలపై ఇస్రాయీల్ హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నప్పడు ఆయన పలస్తీనా పిల్లల కోసం ఆయన రాసిన జోలపాట లాంటి కవిత చూడండి.
మత్ రో మేరే బచ్చే
రోరో కే అబీ తేరే అమ్మీ కీ ఆంఖ్ లగీ హై
మత్ రో బచ్చే
కుఛ్ హీ పహలే
తేరే అబ్బా నే అప్నే గమ్ సే రుక్సత్ లీ హై

ఏడవకు చిన్నారీ..ఏడవకు
ఏడుస్తూ.. ఇప్పడే నీ తల్లి నిద్రపోయింది
ఏడవకు చిన్నారీ .. ఏడవకు
ఇప్పుడే నీ తండ్రి విషాదాలకు సెలవు చెప్పాడు.
1982లో ఇస్రాయీల్ ట్యాంకు దాడుల్లో అదృష్టవశాత్తు బతికి బయటపడిన ఫైజ్ తన తుది రోజుల్లో తిరిగి లాహోర్ వచ్చాడు. ఉపఖండమంతటా ఫైజ్ అభిమానులున్నారు. ఫైజ్ నిత్య అసంతృప్తికి సంకేతంగా జీవించాడు. తాను ఎంత రాసినా ఆయనకు సంతృప్తి లేదు. ఇంకా రాయాలి. తనను ఇంతగా అభిమానించే వారి అభిమానానికి తగిన విధంగా తాను రాయలేదనే భావించేవాడు.
అలాంటి ఫైజ్ రాసిన ఒక కవిత ఇప్పడు చూద్దామా:
ప్రతి చెట్టు ఒక మందిరమే
శిధిలమైన కాంతిహీన మందిరమే
పతనానికి కారణాలు వెదుకుతోంది ఎప్పటి నుంచో

ప్రతి ఇల్లు, ప్రతి కప్పు తుదిశ్వాసలు వదులుతోంది.
ప్రతి కప్పు కింద ఆకాశమే పూజారి
భస్మం పూసుకున్న దేహం, నుదుట సింధూరం
మౌనంగా తలవాల్చి ఎప్పటి నుంచి కూర్చుని ఉన్నదో
ఒక మౌనమంత్రగత్తెలా

ప్రపంచంపై పెద్ద మంత్రజాలన్నే పరచింది
మలిసంధ్య కొంగును కాలం పైటకు కట్టేసింది
ఇప్పుడు సంధ్య కొడిగట్టదు, చీకటి కమ్ముకోదు
రాత్రి వాలి పొద్దు పొడవదు

ఈ మంత్రజాలం బద్దలు కావాలని ఆకాశం ఆశిస్తోంది
మౌన సంకెళ్ళు తెగాలని, కాలం పైట వదిలించుకోవాలని
ఎవరైనా శంఖం పూరించాలని, కాలిగజ్జలు ఘల్లుమనాలని
ఏదైనా విగ్రహం మేల్కోవాలని,
ఉషోదయ చామన సుందరి మేలిముసుగు తొలగాలని...

ఇస్ తరాహ్ హై కి హర్ ఇక్ పేఢ్ కోయీ మందిర్ హై
కోయీ ఉజడా హువా బే నూర్ పురానా మందిర్
ధూంఢ్తా హై జో ఖరాబీ కె బహానే కబ్ సే
చాక్ హర్ బామ్, హర్ ఇక్ దార్ కా దమె ఆఖిర్ హై

ఆస్మాం కోయీ పురోహిత్ హై జొ హర్ బామ్ తలే
జిస్మ్ పర్ రాఖ్ మిలే మాథే పర్ సింధూర్ మిలే
సర్నిఘూం బైఠాహై చుప్ చాప్ న జానే కబ్ సే
ఇస్ తరాహ్ హై కె పస్ పర్దా కోయీ సాహిర్ హై

జిస్ నే ఆఫాక్ పె ఫైలాయా హై యుం సహర్ కా దామ్
దామనె వక్త్ సె పుయూస్త్ హై యుం దామనె షామ్
అబ్ కభీ షామ్ బుఝేగి న అంధేరా హోగా
అబ్ కభీ రాత్ ఢలేగీ న సవేరా హోగా

ఆస్మాం ఆస్ లియే హై కి యే జాదూ టూటే
చుప్ కి జంజీర్ కటే, వక్త్ కా దామన్ ఛుటే
దే కోయీ శంఖ్ దుహాయీ కోయీ పాయల్ బోలే
కోయీ బుత్ జాగే కోయీ సాంవలీ ఘూంఘట్ ఖోలే

ఈ రోజు ఒక కవిత కాదు, మరో కవిత కూడా చూద్దాం

వో లోగ్ బహుత్ ఖుష్ కిస్మత్ థే
జో ఇష్క్ కో కామ్ సమఝ్తే థే
యా కామ్ సే ఆషిఖీ కర్తే థే
హమ్ జీతే జీ మస్రూఫ్ రహే
కుఛ్ ఇష్క్ కియా, కుఛ్ కామ్ కియా
కామ్ ఇష్క్ కే ఆడే ఆతా హై
ఔర్ ఇష్క్ సే కామ్ ఉలఝ్తా హై
ఫిర్ ఆఖిర్ తంగ్ ఆకర్ హమ్నే
దోనోం కో అధూరా ఛోడ్ దియా

ప్రేమను పనిగా భావించిన వారు
లేదా పనిని ప్రేమించిన వారు
అదృష్టవంతులు
బతకడమే మన పని
కాస్త ప్రేమ, కాస్త పని
పని ప్రేమకు అడ్డొస్తుంది.
ప్రేమతో పని పాడవుతుంది
చివరికి విసిగి
రెండింటిని అసంపూర్ణంగా వదిలేశాం

కవిత్వమంటే ప్రేమ మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రేమ ఒక్కటే కాదు ఇంకా చాలా బాధలున్నయని నిష్కర్షగా చెప్పిన కవి ఫైజ్.
వచ్చే శుక్రవారం మళ్ళీ కలుద్దాం.. అంతవరకు అస్సలాము అలైకుమ్.













- అబ్దుల్ వాహెద్

7, నవంబర్ 2013, గురువారం

కవిత్వ నిర్మాణ వ్యూహాలు


కవిత్వం ఎలా రాయాలో తెలుసుకోవడానికి ముందు కవిత్వాన్ని ఎలా చదువుకోవాలో తెలుసుకోవడం అవసరం. నా గురువులు నాకిదే నేర్పించారు. కవిత్వనిర్మాణ వ్యూహాల గురించి నా ఆలోచనలు మీతో పంచుకునే క్రమంలో ముందు కవిత్వాన్ని లోతుగా, గాఢంగా చదవడమెలానో ఒక ఉదాహరణతో మీతో పంచుకుందామనుకుంటున్నాను.

ఈ కవిత చదవండి. ఇది బైరాగి రాసిన 'ఎర్రక్రీస్తు ' కవిత. కవితని ఒకటి రెండుసార్లు ఆమూలాగ్రం చదవండి.

2.

ఎర్రక్రీస్తు

ఆ ప్రాచీనాచారాల ప్రాచీరాలు
బంగారపు దేవళాల నింగినేలే గోపురాలు
పాతకాపులు పూజారులు, అస్మితముఖులు
అమలినాద్భుత చీనిచీనాంబరధరులు
స్వర్ణదండమండితకరులు, ధర్మధ్వజరక్షకల 5
దేళంలో ధూపదీపనైవేద్యాల దుర్భేద్యసౌగంధ్యాల
చిక్కని పొగమంచులోన ఉక్కిరిబిక్కిరియై
గాలికి కూడ ఊపిరాడని శాశ్వతసంధ్యాజగాల
యత్నరచిత రత్నఖచిత విచిత్ర విగ్రహాలమ్రోల
నర్తించే పసిడివన్నియకన్నియలు- 10
నీవక్కడలేవని నాకు తెలియక కాదు.
(అది ఒక ఖయ్యాళి అను, అసమర్థుని జాలి అను)
పుత్తడిపుట్టలోనిది చావని నాకు తెలియక కాదు.
తలతాకున ధీరమేరుగౌరవాన్ని
కాంచన కుంభికుంభాన్ని డీకొనాలని అనుకున్నాను, 15
(వ్యర్థప్రయత్నం; ఒక నిరర్థ సంకేతం)
కరుకుకేల, మొరకు బ్రతుకు నెత్తుటి చెమటల తీర్థం తెచ్చిన నేను
అగణిత క్షత విక్షత చరణధూళి ధూసరదేహుడనై వచ్చిన నేను
(కూలీల మెలిదిరిగిన, బలిసిన కండలు; రైతుల్లాంటి అరచేతులు; మొరటుమొగం)

ప్రేమోద్రిక్త క్రోధంతో; అక్కడ కూడా 20
ఆ బంగరు పంజరంలో కూడా
నీవు విధిగా ఉండి తీరాలని శాసించాను.
లోలోన పిరికిగానే అశించాను.
ధర్మశాస్త్రరహస్యాలు
తర్కమహామాయాజాలచ్ఛిద్రాన్వేషణల సూక్ష్మసూత్రాలు 25
వాటి వెనుక దాగిన నీ లీలా గూఢపరమార్థం నాకెలా తెలుస్తుంది.
మూడుఢను-నీ ఉనికీ, లేకునికీ ఒకేలా చలిస్తుంది.
మూడుమారులు కోడికూసి
ద్రోహపు నల్లని పొద్దు భళ్ళున పొడిచిన వేళ
నా నీడచూచి తుళ్ళి నేనే హడలిన వేళ 30
నా కండలు తిండికాగ
నా రుధిరం మధువుకాగ
పుత్తడిమిత్తవముద్దు నా పెదవుల భగ్గున మండినవేళ
నేనిచ్చే ప్రాణం తప్ప నీవిచ్చే దానం గుర్తించని నేను
'దేవా! నీవెక్కడ?' అని అరచానేగాని 35
నా అశక్తదాహంలో, జనుల రక్తదాహంలో
అవహేళనల ఉమ్ములోన, అవమానపు దుమ్ములోన
నీవు నాకు మునుపటికన్న సన్నిహితుడివైనావనుకొనలేదు.
నా వెనుకనే ఉన్న నిన్ను కనుగొన లేదు. 40
బాధాశైలాగ్రాన.
కంటక మకుట శూలాగ్రాల, రోజాలు రాజసంగా మొగ్గలిడగా
కాళుల, కేళుల కమ్మని కెందమ్ములు భగ్గుమనగా
(అజ్ఞుడను) అప్పుడు నిన్ను గుర్తించాను.
కడపటి కృతజ్ఞతతో నిట్టూర్చాను. 45

3.

పాశ్చాత్యదేశాల్లోనూ, ఇతరభాషల్లోనూ కూడా బైబిలూ, క్రీస్తూ ప్రస్తావనకి రావడం ఆధునిక కవిత్వం తాలూకు ఒక లక్షణం. యూరోప్ లో మధ్యయుగాల్లో సాహిత్యం, కళ మతం చుట్టూతానే తిరిగాయి. కాని ఆధునిక కాలంలో బైబిల్ ప్రతీకల్నీ,క్రీస్తునీ మానవీయంగా చూసే, చూపే ఒక ధోరణి మొదలయ్యింది. ముఖ్యంగా పాశ్చాత్య అస్తిత్వవాదులు కిర్క్ గార్డ్, డాస్టవస్కీ, కాఫ్కాలు ప్రకటించిన జీవుని వేదన భారతీయ రచయితల్నీ, కవుల్నీ కూడా చాలా ప్రభావితం చేసింది. అందుకు బైరాగి మినహాయింపు కాదు.

ముఖ్యంగా 'నడిరేతిరిమేలుకున్నవాడెవ్వడు?', 'రెండు క్రిమస్ గీతాలు ' పూర్తికవితలే కాక, బైబిల్, క్రీస్తు స్ఫురణలతో చేసిన ఎన్నో ప్రయోగాలు:

లాజరస్ మృతతంద్ర విడివస్తాడు శాశవత కాంతిసీమకు
పిలుపు నీ గళమంగళ ధ్వని, మృత్యు యజనపు జీవమంత్రం ( నూతిలో గొంతుకలు: రాస్కల్నికావ్)

కుష్టురోగి కౌగిలి నాదనగలవారెవ్వరు..చుంబించిన హస్తానికి ద్రోహులు కానివారెవ్వరు? (ఆగమగీతి)

మానవసూతి కోరుకున్నది శిలువ కాదా..
కనుపించని శిలువనేడు, అదే ప్రశ్న, శబ్దాల్లో మార్పున్నది
'దేవా వదిలేసావా నీవు కూడా ' బరబ్బాసు విలపిస్తాడు. ( కామ్రేడ్ రాయ్ స్మృత్యర్థం)

శిలువ మోయలేని వాడు నవ్యజీవనార్హుడు కాడు ( శాంతిపథం)
బుద్ధుడు క్రీస్తు వారు వేరు, గాలిలాగు, వెలుగు లాగు, జాలిలాగు వారి ప్రేమ (ప్రేమకవితలు-3)

క్రీస్తు కాళుల కేళుల వ్రణాలు కెందామరలు (కెందామర)

విశ్వమహాకావ్యాలన్నీ వేదనతో విలపించే
పసివాని అశ్రుఇబిందువు సాటిచేయవు
ఏసుక్రీస్తు పదరేణువు పాటిచేయవు (వినతి)

అయితే ఈ ప్రస్తావనల్లో క్రీస్తు త్యాగాన్నీ, మనిషిపట్ల మమతనీ ప్రశంసించడమే ముఖ్యం. సాధారణంగా క్రీస్తు చూపించిన ప్రేమ,క్షమ, విశ్వాసం లోకోత్తరమైనవీ, మానవాతీతమైనవీ అనే భావాన్ని ప్రకటించడమే అక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది.కాని 'ఎర్రక్రీస్తు ' కవిత అక్కడితో ఆగక క్రీస్తును కేవలం మానవోత్తముడిగా కాకా, ఒక మనిషిగా, మామూలుగా మనిషిగా , అశక్తమానవుడిగా చూపించడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి అశక్తతాస్ఫురణలో ఆయన దేవుడికి మరింత సన్నిహితుడైనాడన్న ధ్వని ఈ కవితకు ప్రాణం. అదేమిటో చూద్దాం.

4.

ఈ కవిత క్రీస్తు స్వగతం. దీన్ని అర్థం చేసుకునేముందు క్రీస్తు జీవితంలోని కొన్ని సంఘటనలు గుర్తుచేసుకోవాలి. అవి క్రీస్తు కోపానికీ, అశక్తతకీ, నిస్పృహకీ లోనైన క్షణాలు. సువార్తల్లో చెప్పినదాన్ని బట్టి క్రీస్తు రెండుసార్లు కోపోద్రిక్తుడైనట్టు కనిపిస్తుంది. మొదటిసారి ఆయన్ను సైతాను ప్రలోభపరచడానికి ప్రయత్నించినపుడు (మత్తయి.4-10).రెండవది ఆయన యెరుషలేం దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆ దేవాలయాన్ని ఒక బజారుగా మార్చిన వడ్డీవ్యాపారస్థులమీద,అమ్మకందారులమీద ఆగ్రహం చూపించిన క్షణాలు.ఆయన పట్టలేని కోపంతో వాళ్ళ అంగడి బల్లలు కిందకు తోసేసాడనీ, పావురాళ్ళని పంజరాలనుంచి విడుదల చేసేసాడనీ సువార్త చెప్తున్నది.21:12-13). ప్రార్థనాగృహాన్ని దొంగల స్థావరంగా మార్చేసారని వాళ్ళమీద అరిచాడాయన. క్రీస్తు దృష్టిలో యెరుషలేం దేవాలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఈ ప్రపంచమంతా ఆయన దృష్టిలో ఒక ప్రార్థనాగృహమే. నిజమైన విశ్వాసి దేహం, ప్రాణం కూడా ఆయన దృష్టిలో యెరుషలేం దేవాలయంతో సమానమే. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో తిరిగిలేపుతాను అని ఆయన అన్నప్పుడు ఉద్దేశించింది తన ప్రాణం గురించే.

ఇక శిలువ వెయ్యడానికి ముందురోజు గెస్తమని తోటలో ఆయన అనుభవించిన వేదన నిజమైన మానవీయ వేదన. అక్కడ ఆయన ఏకాంతంలో 'తండ్రీ నీకు చాతనైతే ఈ పానపాత్రని నా నుంచి తప్పించు ' అని అడిగాడు. (26:39). ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ భూమ్మీద దైవసందేశ వార్తాహరుడిగా మరికొన్నాళ్ళు జీవించాలన్న కోరిక అందులో ఉందనుకోవచ్చు. లేదా ప్రవక్తలందరిలానే, ఈ నిష్టురమైన బాధ్యత తనే ఎందుకు మోయాలన్న తలపు కూడా ఉండవచ్చు. తన శిష్యులు ఆ ఒక్కరాత్రి తనకోసం నిద్రని ఆపుకోలేకపోవడం, తాను నిర్మించబోతున్న దైవసంఘానికి పునాదిరాయిగా ఉండవలసిన పేతురు తెల్లవారే లోపు ఒక్కసార్రి, మూడు సార్లు తనెవరో తెలియదని చెప్పడం (26:69-75)ఒక మానవుడిగా క్రీస్తుకి భరించడం కష్టమైన విషయాలే. ఇక అన్నిటికన్నా అత్యంత వేదనాభరిత క్షణం ఆయన శిలువమీద 'దేవా, దేవా, నా చేతిని ఎందుకు విడిచావు ' అని విలపించడం. (27:46).

సరిగ్గా ఈ అశక్త క్షణాలమీదనుంచే బైరాగి తనకవితని నిర్మించాడు. కవితలో మొదటి 19 పంక్తులు ఆయన యెరుషలేం లో వర్తకుల మీద ఆగ్రహం ప్రకటించిన విషయాన్నే గుర్తుచేసుకుం టున్నాయి. ఆయన దాన్ని కేవలం ఒక దేవాలయానికే పరిమితమైన విషయంగా చూడటం లేదు. 'పుత్తడి పుట్ట ', 'కాంచన కుంభి కుంభం ' అనే మాటలు వాడుతున్నప్పుడు, ఒక ఒంటె సూదిబెజ్జంలోంచి ప్రయాణించడం కన్నా ఒక ధనికుడికి దైవానుగ్రహం లభించడం మరింత కష్టమన్న క్రీస్తునే స్ఫురింపచేస్తున్నాడు. అటువంటి ఆడంబర, విలాస, వైభవోపేత ప్రపంచానికి ఎదురుగా ఆయన క్రీస్తును ఒక రైతులాగా, కార్మికుడిలాగా చూపించడానికి ప్రయత్నించడం విశేషం.

'కరుకు కేల మొరకు బ్రతుకు నెత్తుటి చెమటల తీర్థం'

'కూలీల మెలిదిరిగిన, బలిసిన కండలు రైతుల్లాంటి అరచేతులు, మొరటుమొగం'

ఇవి చాలా విశిష్ట పదప్రయోగాలు. కవి క్రీస్తుని ఒక శుష్కదేహుడిగా, అర్భకుడిగా కాకుండా శారీరకంగా బలాఢ్యుడిగా, కాయకష్టం చేసేవాడిగా చూపిస్తున్నాడు. ప్రసిద్ధ యూరోపీయ చిత్రకారుడు కారవగ్గియో చిత్రించిన క్రీస్తు ఇలా ఉంటాడు. ఈ మాటలు రాస్తున్నప్పుడు బైరాగి మనసులో గురజాడ వాక్యం 'కండ కలవాడేను మనిషోయ్ ' లేదని అనుకోలేం.
అయితే కేవలం తన మనోబలంతో ధనికప్రపంచాన్ని ధిక్కరించడం ఒక 'వ్యర్థ ప్రయత్నం 'అని క్రీస్తుకు తెలుసు, దాన్నొక సంకేతంగా భావించాలనుకున్నా అది నిరర్థకమని కూడా అతడికి తెలుసు. ఈ భావాల వరకూ ఇందులో కొత్తదనమేమీ లేదు. కాని

ప్రేమోద్రిక్త క్రోధంతో: అక్కడ కూడా
ఆ బంగరు పజరంలో కూడా
నీవు విధిగా ఉండి తీరాలని శాసించాను

అనే వాక్యాలతో కవి మనని విభ్రాంత పరుస్తున్నాడు తన తండ్రి అందరికీ తండ్రి అయినప్పుడు ఆ వాణిజ్యసమూహానికి మాత్రం తండ్రి కాకుండా ఎలా పోతాడు? నిజమైన అద్వైతికికలిగే ప్రశ్న ఇది. అక్కడితో ఆగకుండా-

లోలోన పిరికిగానే ఆశించాను

అనడంతో మనల్ని పూర్తిగా నిశ్చేష్టితుల్ని చేస్తున్నాడు.

ఇక్కడ పిరికిగా అనే మాట గమనించాలి. పిరికితనం ఎందుకు? అది ధనికప్రపంచబలాన్ని చూస్తే కలిగిన పిరికితనం కాదు. దైవాజ్ఞల్ని ఉల్లంఘిస్తున్న తోటిమనుషుల్ని క్షమించమని తన తండ్రిని అడగకుండా ఉండలేనితనం వల్ల వచ్చిన పిరికితనం. కాని అంతకు ముందు 'ప్రేమోద్రిక్త క్రోధం 'అనే మాట వాడాడు. ఆ క్రోధం ఎవరిపైన? వ్యాపారస్థులమీద కాదు.అది కూడా తన తండ్రి మీదనే. అందుకనే ప్రేమోద్రిక్త క్రోధం. తన తండ్రి ఇల్లు దోంగల నివాసంగా మారిందన్న బాధ వల్ల , ఏం, అయితే మాత్రం, ఆయన అక్కడ ఉండకూడదా అన్న వేదనగా మారి అక్కడ విధిగా ఉండాలన్న శాసనంగా వ్యక్తమై, మరుక్షణమే తాను నిర్బంధిస్తున్నది తన తండ్రిని అన్న ఎరుకవల్ల పిరికితనంగా మారిపోయింది. నాలుగు వాక్యాల్లో ఇంత మానవీయ అనుభవాన్ని ప్రకటించడం బైరాగికే సాధ్యమైంది అనాలి.

'ఎర్రక్రీస్తు ' అన్న శీర్షికలోని మొదటి స్ఫూర్తి ఇక్కడ.ఎర్రదనం కోపానికి గుర్తు. కోపోద్రిక్తుడైన క్రీస్తు ఎర్రక్రీస్తు. అయితే సిగ్గువల్ల కూడా ముఖం ఎర్రబారుతుంది. సిగ్గువల్ల కలిగిన పిరికితనం వల్ల కూడా ఎర్రక్రీస్తు.

ఇక ఇంతకన్నా మరింత సమున్నతశిఖరాలవైపు కవి చేసినప్రయాణం 34-40 పంక్తుల్లో చూడవలసిఉంటుంది.

‘దేవా, దేవా నా చేతిని ఎందుకు విడిచావు’ అని తాను శిలువ మీద ప్రశ్నించిన దాన్ని తలుచుకుని క్రీస్తు పునరాలోచనలో పడటం ఈ వాక్యాల సారాంశం. ఆ స్ఫురణకి ప్రధాన వాక్యం.

'నేనిచ్చే ప్రాణం తప్ప, నీవిచ్చే దానం గురుతించని నేను '

క్రీస్తు తన తండ్రి పట్ల చూపిస్తున్న విశ్వాసం లాగా కనబడుతున్న ఈ వాక్యం నిజానికి సోదరమానవసమాజం పట్ల ఆయన చూపుతున్న అపారమైన దయాన్వితవాక్యంగా కనిపించి మన హృదయాన్ని చెమ్మగిలచేస్తున్నది.

'దేవా, నీవెక్కడ అని అరచానే గాని
నా అశక్తదాహంలో, జనుల రక్తదాహంలో
అవహేళనల ఉమ్ములోన, అవమానపు దుమ్ములోన
నీవు నాకు మునుపటికన్న సన్నిహితుడవైనావనుకొనలేదు '

ఈ వాక్యాలు కేవలం తెలుగు కవిత్వంలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలోనే అత్యున్నతవాక్యాలు. ఒక్క సువార్తల్లో వాక్యాలు మాత్రమే ఈ వాక్యాలకు సాటిరాగల వాక్యాలు. బ్లేక్ నుంచి ఇలియట్ దాకా ఏ ఇంగ్లీషు కవి కూడా ఇంత అత్యున్నత మనోభూమికను చేరలేకపోయాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.

'దేవా నువ్వు నా చేతిని ఎందుకు విడిచావు ' అన్న వాక్యం పైకి అశక్తతా ప్రకటనగా కనిపించినా అది నిజానికి ఒక సాక్షాత్కారం పొందిన క్షణంలో పలికిన వాక్యంలాంటిదేనని కవి భావిస్తున్నాడు.. పునరాలోచనవల్ల కలిగిన సిగ్గుతో ఎర్రబారిన ముఖంవల్ల కూడా ఆయన ఎర్రక్రీస్తు.

ఇక 40-45 పంక్తుల్లో శిలువమీద రక్తసిక్త దేహంతో ఉన్న క్రీస్తు నిజంగానే ఎర్రక్రీస్తు గాని అక్కడ కవి రక్తమనే మాట వాడకుండా 'రాజసంగా మొగ్గలిడిన రోజాలు ' 'కమ్మని కెందమ్ములు ' అనే మాటలు వాడాడు. తనకి తన తండ్రి మునుపటికన్నా సన్నిహితుడైనాడన్న మెలకువ కలిగించిన పులకింతవల్ల దేహమంతా ఎర్రటి గులాబులు, తామరలు పూచినందువల్ల కూడా ఆయన ఎర్రక్రీస్తు.

5.

ఒక కవికి ముందొక స్ఫురణ కలుగుతుంది. దాన్ని అనేకస్థాయిల్లో దర్శించిన తరువాత దాన్ని కవితగా నిర్మించినప్పుడు ఆ కవితకొక గాఢత చేకూరుతుంది. దాన్ని పాఠకుడు చదివినప్పుడు దాని స్వారస్యం ఒక్కసారి బోధపడదు. ఆ కవిత అతడిని పదే పడే తనవైపు రప్పించుకుంటుంది. ఆ కవితను చదివే క్రమంలో పాఠకుడు మరెంతో అధ్యయనం చేయవలసిఉంటుంది.

ఈ కవితనే చూడండి, ఈ కవితలోతుల్లోకి ప్రయాణించాలంటే సువార్తలు చదివిఉండాలి, క్రీస్తు పడ్డ వేదనని మనమెంతో కొంత ఊహించగలిగిఉండాలి. క్రీస్తు గురించి పాశ్చాత్యకవులు, చిత్రకారులు ఎటువంటి తమకై తాము ఏ విధంగా వ్యాఖ్యానించుకున్నారో ఎంతో కొంత అవగాహన వుండాలి. ముఖ్యంగా కవి తన తక్కిన కవిత్వంలో క్రీస్తు గురించి ఏం చెప్పాడు, ఈ కవితలో ప్రత్యేకంగా ఏం చెప్పాడో వివేచించి వింగడించగలగాలి. ప్రతికవీ తన యుగధర్మాన్ని, దృక్పథాన్నీ ఎంతో కొంత ప్రకటిస్తాడనుకుంటే, ఈకవితలో కవి చూపించిన ఆధునికత ఏమిటో గుర్తుపట్టగలగాలి. గొప్పకవులు తాము జీవిస్తున్న కాలాన్ని దాటి కవిత్వం చెప్తారనుకుంటే, ఈ కవితలో కవి ఆధునికతను దాటి ముందుకు పోయి ఏమి చెప్పగలిగాడో చూడగలగాలి.

యూరోప్ లో రొమాంటిసిజం భారతదేశంలో ఆధునిక యుగానికి కారణమైనప్పుడు మొదటితరం కవులు ప్రబోధకవిత్వం రాసారు. బంకింబాబు, టాగోరు, రాయప్రోలు, గురజాడ, భారతి, శ్రీశ్రీ ఆ యుగధర్మాన్ని ప్రతిబింబించిన కవులు. భారతీయ కవిత్వంలో 1950 తర్వాత పరిస్థితి మారింది.మానవుణ్ణి సర్వశక్తిమంతుడిగా కీర్తించడం కేవలం డంబం మాత్రమేనని కవి గుర్తించాడు. మానవుడి శక్తతని ప్రకటించడంలోకన్నా అతడి అశక్తతని ప్రకటించడంలో ఎక్కువ నిజాయితీ ఉందని ముందు గుర్తుపట్టినవాడు ముక్తిబోధ్. తెలుగులో ఆ పనిచేసినవాడు బైరాగి.

ఆధునిక తెలుగు కవిత్వం క్రీస్తునొక మానవాతీత ప్రతీకగా చిత్రించడంలో ఆసక్తి చూపించింది. కాని బైరాగి క్రీస్తు జీవితంలోని అశక్తక్షణాల్ని పట్టుకున్నాడు. ఆ అశక్తక్షణాల్లో, క్రీస్తు కూడా మనలానే మామూలు మనిషిగా భావించిన క్షణాల్లో అతడి మనోవేదన ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు. ఆ విధంగా ఆయన ఆధునికయుగలక్షణం నుంచి చాలా అడుగులు ముందుకు వేసి ఇప్పటికి కూడా మనకి ఎంతో కొత్తగా,సమకాలీనంగా కనిపించే కవితను నిర్మించాడు.

ఒక కవితనెలా నిర్మించాలో తెలుసుకుందామనుకునే జిజ్ఞాసులకి ఈ కవిత ఎప్పటికీ నివ్వెరపరిచే ఒక నమూనా.
                   

                                  










                                                                                               __________వాడ్రేవు చినవీర భద్రుడు
                          

6, నవంబర్ 2013, బుధవారం

తొవ్వ

 
 తొవ్వ పొంటి నడుస్తూ పోతాంటే మనసు వికసిస్తది .చిన్నప్పుడైతే సంకకు పుస్తకాల సంచి ఏసుకొని మా తాతిబోత్తల్ల పానాది నుంచి నడిచి బడికి పోయేది .అదే బాట పొంట ఎడ్లు మ్యాకలు ల్యగలు సుత పోయ్యేవి .వాటిని సూస్తుంటే మస్తు మంచిగనిపిచ్చేది.ఆ తొవ్వ కు అటు ఇటు తాళ్ళు వాయిల్లు శిల్పక్కలు ఉండేవి నడకంటేనే ముచ్చట. అయితే మనుషలతోని లేకుంటే చెట్లతోని .అదొక కమ్మని యాది .
ఈ కాలం రాయిమని యాకూబ్ భాయ్ 'తొవ్వ ' పేరు కరారు చేసినంక నా మవుజుల కెల్లి తొవ్వ తిరిగిన అక్షరాలే రాలుతన్నాయి .మక్కజొన్న చేను మద్యల కేళి తొవ్వ ఉంటది ,అందుల కెలి నడిచి పోయి చేను మధ్య మంచె మీద రాత్రి పండుకొన్న జ్ఞాపకం .పచ్చని మక్క చేనుల ఎల్లెలుకల పండి ఆకశంల సుక్కలు చందమామ గోరుకోయ్యలు మూలసుక్క సూస్తంటే మంచిగనిపిచ్చేది .మక్క పెరడు వొడ్ల మీద పొలం మడికట్లల్ల వొడ్లమీద నడుసుడు గమ్మతంటే గమ్మతి .ఇగ మా తాతతోని ఎడ్ల కావలి పోయినప్పుడు గుట్టలు బోర్లు కంచెలు పొల్లు పొల్లు పొద్దుందాక తిరిగేది గుత్తకు పసుల మేప ఎక్కుతాంటే కిందికి సూస్తే ఇండ్లన్నీ అగ్గిపెట్టేల్లెక్కనే అగుపిచ్చేవి .గుట్టకు సుత తోవ్వలుంటాయి .అసలు తొవ్వ లేని వూరు ఉండనే వుండది.పిల్ల తోవ్వలు ముండ్ల తోవ్వలు ఉంటయి.ఏ తొవ్వల నడిచినా హాయి హాయి ..ఇప్పుడయితే మట్టి దారులు పోయి సిమిటి రోడ్లు వచ్చినయి.
ఈ తొవ్వలన్ని వచ్చి కవిత్వంల సోర్రినయి.అసలు కవిత్వమే ఒక తొవ్వ .సాహిత్యం ఒక బాట .సంస్కృతి ఒక ఆట .కవికి చిన్నప్పుడు తిరిగిన మక్క పెరడు ,వరిపొలం ,బోజట్ల ఎడ్ల పెయ్యి కడుగుడు ,పెండకాలు తీసుడు పెంట జార కొట్టుడు ఇప్పుడు కవిత్వం కాకుంట పొతదా...ఇప్పుడు మా ఊల్లెకు పోతే పాత పానాదులన్ని కలే తిరిగి కవి సమయాలను ఎరుక వచ్చుకుంట .ఆడికి పోంగానే కవిత్వం పొంగుక వస్తది
అసలు ఈ తోవ్వలు ఎందుకు మాయమైనయి.నున్నటి రోడ్లు వచ్చి మనలను సంపటానికా..లేదు వాని సరుకులు అమ్ముకోవడానికా...మన వనరులను తరలించుకపోవదానికా...వద్దని మర్లపడితే పొలీసొల్ల ను పంపడానికా.....అదే అయ్యుంటది ...
తొవ్వ ఒక కవిత్వపు నడక ..అప్పుడు మనసు నిండేది ,ఇప్పుడు మనుసుకు పట్టనియ్యనిది .....మల్ల భుధవారం మాట్లాడుకుందాం ..........
                      
 
                                                                                                                                     
 
 
                                                                                                                                                                                                                                                               ----------అన్నవరం దేవేందర్ 

5, నవంబర్ 2013, మంగళవారం

బుక్ ఇంట్రో


 
శ్రేపి.విద్యాసాగర్:(గాలికట్ట)
 

ఆకలి గుహలో ప్రవేశించి లిపిలేని దుఃఖం అనుభవిస్తూ,రేలారే పాటను రెండుభయాలు మధ్యలో ఆలపిస్తూ వివక్షతను ఎదుర్కోడానికి లోలోన ప్రశ్న లు వేసుకొంటూ తెలంగాణా గోస ను వినిపిస్తూ కరువు లో చావుల్నినేస్తూన్న మగ్గాలు చేసే శబ్డాల్ని కన్నీళ్ళకీ హృదయాన్నిచ్హి వీరుల ఉరికంబం మీద నెలవంకను లోచూపుతో చూసి ఉత్తమ కవితా సంపుటి గాలికట్ట ను సృష్టించిన కవి విద్యాసాగర్.

"చితికిన తాటిముంజ కన్ను సుళ్ళు తిరిగే గిరిజనుడి ఆర్తనాదం అది లిపి లేని దుఃఖం "- అని విద్యాసాగర్ ఆదివాసులైన గిరిజనుల దుఃఖాన్ని పల్కిన్చడమే కాదు తనను గాయపర్చిన పలుసంఘటన పైన ఆ సంఘటనల కారణంగా తనలో మొదలైన తండ్లాటను "గాలికట్ట" గా సృజించాడు.సతీష్ చందర్ కంటి చెమ్మతో ఈ కవి కవిత్వాన్ని చదివి దీన్ని కన్నీట కరగిన కవిత్వమన్నాడు.

"గాలికట్ట" అనే ఈ పేరు వొకింత విస్మయాన్ని కలుగచేస్తుంది.అరణ్యప్రంత సాంప్రదాయాలు,బీడి కార్మికుల జీవితాలతో పరిచయం లేకపోతే గాలికట్ట అనే ఈ పదం అర్థం కాకపోవచ్చు.ఇది ఆదివాసులపై జరిగేదోపిడికీ వొక మచ్చు తునక.ఒక్కోగిరిజనుడి నుండి తునికా ఆకును కొనే వాళ్ళూ ఉచితంగా తీసుకోంటారు.ఈ విధంగా కాంట్రాక్టర్లు,దళారీలు,మైదానప్రాంత వ్యాపారులు ఆఖరుకీ అటవీ ఉడ్యోగులు కూడా ఆదీవాసీ ప్రజల అటవీ వనరుల ఆర్థిక మూలాల్ని ఏలా దోపిడి చేస్తున్నారో గాలికట్ట అనే ఈ కవిత ద్వారా కవి సమాజినికి తెలియచేస్తాడు.పైకి కనిపించని ఈ దోపిడిని వివరించాడానికి కవి చేసిన ప్రయత్నం చాల గొప్పదని ఆచార్య జనార్దనరావు గారు పేర్కోన్నారు.

'ఆమె అప్పుడెప్పుడో అడ్డదిడ్డంగా నరికిన మోడుకు ముడత రోగంతో పూసిన తునికాకు లా వుంటుంది"- అని ప్రారంభమైన ఈ కవిత ప్రతి పంక్తి కవిత్వమై సడియం లచ్చక్క లాంటి మహిళలు ఎందరో బుక్కెడు బువ్వ కోసం ఆకులు ఆకులుగా రాల్చుకున్న,కట్టలు కట్టలుగా పేర్చ్చుకున్న జీవితాన్ని మన ముందు వుంచుతుంది.విద్యాసాగర్ కవిత్వానికి వొక లక్షణం వుంది.మెల్లగా మొదలై వొక మహోధృతై సాగుతుంది. "ఆమె అప్పుడేప్పుడో.....అంటూ మెల్లగా మొదలైన ఈ కవిత "ఇసుక తుఫానుల ఆవహించిన దాహం /పులి పంజలా విస్తరించిన రాత్రుల్లో నడిచి నడిచి గుండె లోలకమై వూగివూగి చెమట సముద్రమై ఉప్పొంగి ఉప్పొంగి"- ఇలా సాగిపోయి మన కళ్ళ ముందు తునికా ఆకులేరుకొనే"ఆమె తప్ప సమస్తం శూన్యంలా"-కనిపింపచేసే శక్తి విద్యాసాగర్లో వుంది.
'వన్ ఆఫ్ సెవెంటి'-చట్టాన్ని అడ్డంపెట్టుకొని ఆదీవాసి స్త్రీ ని పెళ్ళి పేరుతో గిరిజన శకుంతల్నీ మోసం చేస్తున్న దుర్మార్గపు దుష్యంతుడిని జింకను మింగిన కొండచిలువలా /తీగ లేకుండా వీణను మీటినట్లూ/తాళి లేకుండా దేహాన్ని మీటి'-
మాయమై పోయాడని చిత్రించడమే కాక అతడు చేసే దోపిడిని ఎండగట్టాడు.జిన్నెలగూడెం గుండె నిమిరి కన్నీళ్ళను తుడవడానికీ కవి రాసిన కవిత్వం ఏవరికీ వారు చీకటిగుహలో బతికిన మూలాల్నీ వెతుక్కునేటట్టు చేస్తుంది.తెల్ల ఏనుగు ప్రపంచీకరణ సృష్టించిన మెర్క్యురీ మాయజాలంలో నదులు,నీళ్ళు,గుహలు,కొండలు ఎలా లుప్తమై పోతున్నాయో కన్నీటి లోని ఉప్పును సైతం ఎలా కొల్లగొడుతున్నరో ఆరిపోయినా కిరోసిన్ కాగడా వెలుగులో పాఠకులు దర్శించేటట్టు చేయగల శక్తి విద్యాసాగర్ కవిత్వానికుంది. తన నేల భాష తెలంగాణ యాసలో 'మీ సేతుల్లొ సావనీకే పుట్టినమా?'-అనే ప్రశ్న వేస్తూ తమ బ్రతుకుల్లో మన్ను పడ్డానికీ కారణమైనా అంశాలను దృష్టి లోకి తెస్తాడు.
అడవిపుత్రులు నిరంతరం రెండు భయాలు మధ్య లో జీవనయానం సాగిస్తున్నారన్న వాస్తవాన్ని ఆ సందర్భంలో వారు నిద్రలేని రాత్రులను ఎంతభయోద్విగ్నంగా గడుపుతున్నారో కవిత్వం చేసి వారి తరపున నిలిచి రాజ్యం,ఇన్ ఫార్మర్ల పేరుతో తీవ్ర వాదులు ఎలా వాళ్ళను హింసకు గురి చేస్తున్నారో చిత్రించిన వైనం కవి దృక్ఫదాన్ని వ్యక్తం చేస్తుంది.
'ఆకాశమంతా వస్త్రాన్నిఅగ్గిపేట్టెలో మడిచి /చేతుల్ని పోగొట్టుకొన్న నేతన్న ఈ వ్యవస్తలో మరోసారి
మోసపోయిన విషయం మన ముఖమ్మీద ఫెటీల్మని చరిచినట్లు కవి రాస్తాడు '.ఆకలికి మించిన విషం లేదు/హామికీ మించిన అబద్దం లేదు/డరిద్రానికి మించిన కుట్ర లేదు"-రంగుల ప్రపంచాన్ని సృష్టించిన నేతన్న చేతులు ఎలా మసిబారాయో కవి విషాదంగా నిర్మిస్తాడు ఈ అంశాన్ని కవిత్వంగా.అన్యాయపు పోకడల్ని నిలదీసే తెలంగాణ సాంప్రదాయాన్ని " గోస' -అనే కవితలో ఆ ప్రాంత యాసలో "ఎంత పని చేసావురా?ఈగలకు బెల్ల్లం సూపెట్టినట్టు పత్తి మిర్చీల
కొరికుడు పురుగుల్ని గూడెం మీద వదిలనవు/పత్తి నీకు మిగిలే/పురుగులు మాకు తగిలా/సుఖంనీకు దక్కే/సావులు మాకు మిగిలే"-అంటూ జీవవైవిద్యాన్ని మొదలంటా నాశనం చేస్తున్న అభివృద్ది నమూనాలు ఆదీవాశీల జేవితాన్ని ఎలా చిద్రం చేస్తున్నయో కవి తనగొంతులో ద్వనింపచేస్తాడు
చెమట పువ్వుల్ని కాసిన దేహం రైతుది.ఏ ప్రాంత రైతయినా కావోచ్చు
అది అరణ్యం ప్రాంతమైనా,మైదానప్రాంతమైనా రైతు జీవితం ఇసుర్రాయి మద్య నూకనూకైన జీవితం రైతుది.పంటతో, పాడితో అతని అనుబందం విడదీయలేనిది. పశ్చిమగాలి పెనుగాలై వీస్తున్న సందర్భంలో ఆగమైపొయిన జీవివతం రైతుదే.'కరువు ముల్లు గుచ్చుకొని రైతు జీవితపుబుడగ ఎలా వుపిరి కోల్పోయిందో కవి చిత్రించిన వైనం మన కళ్ళు మబ్బుతునకలై కన్నీళ్ళను వర్షిస్తాయి.
. "అర్ధరాత్రి నాగలిశిరస్సు మీద గుడ్లగూబవెర్రికేక/నావొంటి మీద జెర్రిలా పాకింది"-అంటున్న కవి అద్దంలా బీటలువారిన నేలను నమ్ముకున్న రైతు వ్యధను "నేను డప్పు శబ్డాన్నై గుండెలు బాదుకుంటాను"-అని విలపిస్తాడు.ఐ.టి పరిభాష లోనే మాట్లాడుకొంటూ..సాఫ్ట్ వేర్ దారి తప్పిన వాళ్ళకీ,కేవలం వీసాలు,పాస్ పోర్ట్లు,క్రెడిట్స్,డెబిట్స్ మాత్రమే జీవితమైన వాళ్ళకీ,బిడ్డ అమెరికా వెళుతుంటే వెయ్యిదేవుళ్ళకి మొక్కి పార్టీలిచ్చే తల్లితండ్రులకీ గుణపాఠంలాంటి కవిత డాలర్ డాట్ కామ్ .
ఇలా ఆదివాసీ వేదనలోని ఆకలికేకల్ని వాళ్ళ అస్తిత్వరోదనల్ని,విచ్చిన్నమైన జనజీవితాల్నీ,వనజీవితాల్నీ అశేష ఆదీవాసీ జనసాగరానికీ అనుబందంగా అడ్భుతంగా' గాలికట్ట'ను ఆవిష్కరించిన విద్యాసాగర్ ను వొక ఉత్తమ కవిగా సంభావిస్తాను.ఇదోక గిరిజన దుఃఖం..ఇదో రైతు విషాదం..ప్రపంచీకరణ భీభత్సం..కవి గాయాల అనుభవాల సలపరం..వెరసి మొత్తం ఈ కావ్యం కవిత్వం మెడలో సుమహారం.మరో మంగళ వారం మరో...కవితా సంపుటితో..
                                                                                                                                                               ( 05-11-2013)
   
 
                                                                                                                                                                      ---------------రాజారామ్.టి

4, నవంబర్ 2013, సోమవారం

కవిత్వంతో ఏడడుగులు




నిజానికి జీవించడం ఒక కళ. అసలు జీవించడమంటే ఏమిటో తెలుసుకోగలగడమే పెద్దకళ. దానికి ఇది ఇది అని పూర్తిగా తెలియనక్కరలేదు. ఒక రేఖామాత్రపరిజ్ఞానమైనా చాలు. పరిమితులు లేని జీవితం ఏదీ ఉండదు... బలహీనతలు లేని వ్యక్తీ ఉండడు. కానీ పరిమితులకిలోబడి, బలహీనతలు గుర్తించి, జీవితాన్ని ఎంచుకున్న లక్ష్యంవైపు నడిపించుకోగలగడంలోనే వ్యక్తిత్వం రూపుకడుతుంది. అదే ఋషిత్వం.

అటువంటి అపురూపమైన వ్యక్తిత్వం ఎమిలీ బ్రాంటే ది.

నిజానికి కలం పట్టుకున్న ప్రతివ్యక్తీ ఋషి కావలసిందే. అందుకే నానృషిః కురుతే కావ్యం అన్నారు. అలాంటి ఒక ఋషిలాంటి కవయిత్రి ఎమిలీ బ్రాంటే. ఆమె జీవిత చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తల్లి ఆమె మూడేళ్ళవయసులోనే చనిపోతుంది . ఆమె కళ్ళముందే ఇద్దరు అక్కలు చనిపోతారు. తండ్రి చాలా కట్టుబాట్లలో పెంచుతాడు. స్కూలు వాతావరణం ఆరోగ్యకరంగా లేకపోవడంతో ఒక ప్రైవేటు ట్యూటరు ద్వారా భాషలో ప్రాధమిక పరిజ్ఞానం సంపాదించినా, ఇంట్లో ఉన్న పుస్తకాల చలవవల్ల బైరన్, షెల్లీ, స్కాట్ వంటి హేమా హేమీల రచనలు చదివే అవకాశం వస్తుంది. స్వయంకృషితో ఫ్రెంచి జర్మను నేర్చుకుంటూ, ఇంకొకపక్క ఇంటిపనులన్నీ నిర్వహిస్తూ, మరొకపక్క పియానో నేర్చుకుంటూ ( ఇవన్నీ ఇంకా 20 ఏళ్ళ వయసు రాకముందే) ఆమె చూపిన అసమానమైన వ్యక్తిత్వానికి బ్రస్సెల్స్ లో ఉన్నప్పుడు ఆమెకు విద్యగరిపిన టీచరు ఏమంటున్నాడో గమనించండి: " ఈమె అబ్బాయిగా పుట్టవల్సింది. ఒక గొప్ప నావికురాలై ఉండేది. ఆమెకున్న సునిశితమైన తార్కిక శక్తితో సరికొత్త ఆవిష్కరణలు చేసి ఉండేది. బాధలవల్ల గాని, వ్యతిరేకతలవల్ల గాని ఆమెలోని పట్టుదల పిసరంతైనా మొక్కవోయేది కాదు."

స్వేఛ్ఛఒకరిచ్చేది కాదు. జీవించడం ఒకరు మప్పేది కాదు. మనకు లేనివాటిని గూర్చి జీవితకాలం తర్కించవచ్చు. నిందించవచ్చు. కాని మనిషికున్న పరిమితులకి లోబడి ఉన్న అపారమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ గడపడం అంత తేలిక కాదు. ఆ అవగాహన అంత చిన్నవయసులో రావడం అంతకన్నా కష్టం.

ఈ కవిత నిజం చెప్పాలంటే ఋషివాక్యమే. ఆమె మేధోశక్తికే కాదు, ఆమె విశ్వాసాలకీ, బలమైన వ్యక్తిత్వానికీ ఒక సూచిక. మనలాంటివాళ్లకి ఒక వెలుగురేక.


వృధ్ధ విరాగి
.

సంపదలు విలువైనవిగా భావించను,
ప్రేమ? ఆ మాటంటేనే నాకు నవ్వొస్తుంది,
కీర్తి కాంక్ష ఒక కల
ఉదయమవుతూనే కరిగిపోతుంది
.
నేను ప్రార్థించడమంటూ జరిగితే
నా పెదాలమీద కదిలే మాటలు ఒకటే:
నా మనసు నా అధీనంలో వదిలీ
నాకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించు!
.
అవును. నా రోజులు తొందరగా లక్ష్యాన్ని సమీపిస్తున్నకొద్దీ,
జీవనం లోనూ, మరణం లోనూ, నే కోరుకునేది,
సంకెలలులేని మనసూ,
దేన్నైనా ఎదుర్కోగల ఆత్మ స్థైర్యమూ. అంతే!
.
ఎమిలీ బ్రాంటే
బ్రిటిషు నవలాకారిణి, కవయిత్రి
(30 జులై 1818 – 19 డిసెంబర్ 1848)

.
The Old Stoic
.
Riches I hold in light esteem;
And Love I laugh to scorn;
And lust of fame was but a dream
That vanished with the morn:
.
And if I pray, the only prayer
That moves my lips for me
Is, 'Leave the heart that now I bear,
And give me liberty!'
.
Yes, as my swift days near their goal,
'Tis all that I implore;
In life and death, a chainless soul,
With courage to endure.
 









Emily-Bronte
(1846)


                                                                                                                          ______నౌడూరి మూర్తి 

నీలాగే ఒకడుండేవాడు

http://www.youtube.com/watch?v=6IWqRZuKc-k

కవిత్వ విశ్లేషణ

కెక్యూబ్ వర్మ -దుఃఖ దీపం


తొలిదశల్లో అలంకారశాస్త్రం,కొంత కాలానికి కళాతత్వశాస్త్రం.ఇంకాకొంత కాలానికి మనస్తత్వ శాస్త్రం వచ్చాక సాహిత్యంలో అనేకమైన అంశాలు చర్చకు వచ్చాయి.ప్రధానంగా అలంకార శాస్త్రం నాటికే మనస్సు కు సంబంధించిన చర్చ ఉన్నప్పటికీ,సాహిత్యంలోనూ మనస్సుకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ పాశ్చాత్యులు వేసిన దారులు గమనింప దగినవి.

దుఃఖానికి మూలం సుఖం పైనున్న యావేనని భారతీయ తాత్వికుల ఆలోచన.ఈ ఆశావహ జీవితాన్ని అందుకోలేక పోవడమే దుఃఖ హేతువు.అందుకోలేని అంశం ఎలా అవగాహన లోకివస్తుందనేదీ ప్రశ్న.అది ఇతరజీవితాలని గమనించటం.దాన్నించి తనని గ్రహించటం.ఈ అనుభవాన్ని కళాకారుడు ప్రకృతినించి కూడా అనుభవిస్తాడు.

మానసిక యంత్రాంగాన్ని గూర్చి ఫ్రాయిడ్ కొన్ని సూత్రీకరణలు చేసాడు.మనో యంత్రాంగం లేదా స్వప్న యంత్రాంగం(The mechnism of Dreems)సంఘర్షణకు,బాధకు ప్రతినిధి.ఒక సందర్భం నించి కలిగే అనేక భావనలకు,వికారాలకు ఇదే మూలం.ఇందులో నాలుగు భాగాల్లో వ్యత్యయీకరణం(Displacement)ఒకటి.ఇది రెండు రకాలుగా జరుగుతుంది.అవ్యక్తాలోచనకు సంబందించిన వస్తువు భాగం మాత్రమే అభివ్యక్తిలో కనిపిస్తుంది.ఒకరకంగా అలంకార శాస్త్రంలో (Synecdoche)సారోపలక్షణను పోలి ఉంటుంది.ఒక అంశాన్ని మరోదానితో ఆరో పించి చెప్పటం.

పోల్చే అంశం ప్రతీకీ కరణం(Symbolisetion)కు లోబడి జరుగుతుంది.దర్శనం వీటిని దృశ్య ప్రతిమలు(Visual images)గా స్వీకరిస్తుంది.మనవాడుకలోని అనేక పదాలు ఇలానే ఏర్పడ్డాయి.భాషాశాస్త్రం తెలిసిన వాళ్లకి ఈ విషయంకొత్త గాదు.మనం అమూర్తార్థంలో పదాలను ఉపయోగిస్తాం కాని ఇవి ఒక మూర్తార్థాన్ని ఆధారం చేసుకునే పుట్టాయి."కుశలుడు"-అంటే చేయితెగకుండా దర్భలు కోసేవాడని,"ఘటికుడు"అంటే కుండ పొట్టకింద ఉంచుకుని నదిని ఈదేవాడని ఆర్థాలు. ఇతిహాసాలలో పేర్లు ఇలా మూర్త భాగాలనించి వచ్చినవే.అందువల్ల మూర్త భాగానికి సారూప్యాన్ని పట్టుకోవడం మనసుకు బాగా అలవాటైన పని.

కెక్యూబ్ వర్మ గారు మనిషికి దీపానికి మధ్య సారూప్యాన్ని ఆధారం చేసుకుని తాత్విక పునాదులనుంచి జీవితాన్నినిర్వచించారు.జీవితంచుట్టూ జరిగే అనేక అంశాలతో ప్రతీకాత్మకంచేస్తూ జీవితాన్ని నిర్వచించారు.

"నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు/గాలి నిన్ను కూచోనివ్వదు"

"నీ అరచేతులు చాలనప్పుడు లోలోన/దిగాలు ఒక్కసారిగా అసహనంగా"

"ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక/దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం"

"నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల/భయ దృశ్యం అల్లుకుంటూ"

"నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా/అల్లుకుంటూ అచేతనంగా"

"ఈ కాంతి రేఖల రాక పోకల/వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు"

అనేకదృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.ఇందులో "నీ" అనే పదం మాత్రమే కేవల వ్యక్తి వాచకం.ఇది లేకుంటే"గాలి/క్రీనిడ/నూనె ఒలకటం /కాంతి రేఖలు/మిణుగురులు/వలయం "లాంటి వన్ని అర్థపరంగా సామాన్యీకరణంచెందేవి.కాని వ్యక్తి వాచకం వల్ల ఇవన్నీ జీవితాన్ని అందులోని ఆటుపోటులని,కాపాడుకోడానికి పడే బాధని వ్యక్తం చేస్తాయి.అర్థక్షేత్ర పరిధిలో చూస్తే ఇవన్నీ దీపం అనే పరిధికి చెందినవే.

"చిక్కనవుతున్న చీకటి పాట/గాలి అలలనలా కోస్తూ"

"అచేతనంగా అభావమౌతున్న/రూపం ధూప కలికమవుతూ"

"నీ ఒక్కడివే ఈ గదిలో/ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ"

చివరి క్షణాలని వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపించే ఈవాక్యాలు కూడా జీవితం చుట్టూ ప్రతీకాత్మకంగా అల్లుకున్నవే.దర్శనం దృశ్యాలని చేజిక్కించుకుంటే అది విఙ్ఞానం రూపంలో లోనికి వెళ్లి ఙ్ఞానం ,అనుభవం ద్వారా కళగా వ్యక్తం చేయబడుతుంది.మంచి దార్శనిక కళానుభవం ఉన్న కళాకారుడే దాన్ని అందుకో గలుగుతాడు,అందించగలుగుతాడు.మంచి కవిత అందించిన కెక్యూబ్ వర్మ గారికి ధన్య వాదాలు.
                                                                     
                                                                                                                                                        
 
 
 
 
                                                                                                                                                      __________ఎం. నారాయణ శర్మ