పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, జులై 2012, ఆదివారం

జ్యోతిర్మయి మళ్ళ || ఒకరికి ఒకరు ||

నువ్వేనాలోకం
'నీకోసం నేను' అంటుందామె

ఇష్టపడడమే ఇష్టం ఆమెకు
ఒదిగుండడంలోనే హాయి ఆమెకు
పిచ్చిది...
లోకాన్ని గెలిచినంత తృప్తి అందులో

నువ్వూ నేనూ ఒకటే
'మనకోసం మనం' అంటాడతను

నిజాల్ని ప్రేమిస్తాడు
నిరాడంబరతను ఆస్వాదిస్తాడు
మేధావి..
ఏం తెలీదతనికి అతని దృష్టిలో !
*15-07-2012

కరణం లుగేంద్ర పిళ్ళై || నీది కోయిల పాట కాదు! ||

నీకే పూర్తిగా తెలియని నీ గురించి
తెలుసుకోమనడం మూర్ఖత్వమే..
కాకుంటే ఏమిటి లోకులు కాకులు అంటావు
కాకిలా అరుస్తూ కోయిల పాట అని విన మంటావు
వేలం పాటలో ఓట్లు కొన్న నీకు
మా పాట్లు ఎలా అర్థమవుతాయిలే
అధికార మొండి తనం కూడా
నీకు అవిటితనమేనని ఎలా చెప్పాలి
జబ్బలు చరుచుకొని బరిలో
ఎంత కలియ దిరిగినా
పోటీ ఉన్నప్పుడే కదా
ఆ గెలుపు మజా తెలిసేది.
అందరూ తలలూపే గొర్రలయినప్పుడు
తోక బెత్తేడు కాక మూరెడు ఉంటుందని
ఆశించడం వెర్రితనమే..
శవాలు కాల్చే కాటి కాపిరిగా
ఉంటే ఆనందమేముంటుంది
ప్రాణాల దీపాలు వెలిగించే
ఇంధనమై కాలిపోతే కదా
అందులో తృప్తి అనే ఆనందం జనించేది..
పచ్చని బతుకు రెమ్మల్ని త్రుంచి
ఎడారిలో పాతి పెట్టే పనులు చేయకు
రైతు కాడి రెక్కలు విరిచేసి
సెజ్ ల దయ్యాలకు ఆహారంగా వేయకు
భూములను భుజించే రాబందులను మేపి
కరెన్సీ నోట్లను పండించాలనుకుంటే.
*14-07-2012

జయశ్రీ నాయుడు || ఆశా.. అక్షరం! ||

అక్షరాలూ..
ఆశలూ..
కటిఫ్ కొట్టాయి..
బ్రతిమిలాడాలి..
బుజ్జగించాలి..
మళ్ళీ విత్తనాలు
పాదుకోవాలి.

*15-07-2012

ఆర్. ఆర్. కే. మూర్తి. || "దేశభక్తి" ||

‎తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
సిపాయి పగిలిన మోకాటి చిప్ప సాక్షిగా
రైతు స్రవిస్తున్న పాదం సాక్షిగా

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
గతించి పోయిన స్మ్రుతుల జోలికి వెళ్ళనని
శవాలపై అయుధాలెత్తనని
తాతలనాటి కసి మనవళ్ళపై చూపనని
నీకు పట్టిన దేశభక్తి నిను కాటికి నడిపించదని

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
అయ్యనూ అమ్మనూ సాకుతానని
తమ్ముడి బాగోగులు చూసుకుంటానని
పక్కింటి బాబాయి కి సాయపడతానని
ఇంటికొచ్చిన వాడికింత బువ్వ పెడతానని

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
లంచం తీసుకోకుండా పని చేస్తానని
ఎక్కడ పడ్తే అక్కడ ఉమ్మనని
అడిగిన వాడికి చేతనైందేదో చేస్తానని
దేశాన్ని దూషించిన వాడి చేతికో ముద్దు పెడతానని

తమ్ముడా నాకో ప్రమాణం చేయవా !
పేదవాడి కన్నీటిని నేలరాలనీయనని
అన్యాయం అక్రమాలు సహించేది లేదని
నలుగురినీ పోగేసి పోరాడుతానని
లాఠీలకు చెరసాలకు భయపడేదిలేదని

*15-07-2012

వేంపల్లి గంగాధర్ || సిద్ధార్థుడు అడివికి వెళ్ళిపోయాడు ! ||

అతడు ఎక్కడో
వెతకనవసరం లేదు ...
 
నడి రాత్రి నట్ట నడడివి దిశగా
మహా ప్రస్తానం..
మనకెప్పుడు అవుతుంది జ్ఞానోదయం ...!

మహా నగరాల నిండా భస్మం
నిమజ్జనం కూడా అవసరం లేదు

దుఃఖ మయ దృశ్యాలు….

మొదటి దృశ్యం :

దేహ మంతా ముడుతలు పడ్డ
నడుము వంగి నడవ లేక నడుస్తున్న
మూడు కాళ్ళ ముసలి వాళ్ళు
గుంపులు గుంపులు గా
మనకు కనిపిస్తూనే ఉంటారు .....!

రెండవ దృశ్యం;

గడియారం ఆసుపత్రి
రోగులతో పొంగి పొర్లుతుంది...
కుష్టి వ్యాధి ఒక్కటే కాదు
దేహమంత కుళ్ళిన కమురు వాసన
రాత్రంతా వీధిలో ఎవరో దగ్గు తున్నా,
ఫ్యాన్ రెక్కలకు ఉరిపోసుకొని తనకలాడుతున్న,
రోడ్డు ఫై బాటసారి ని గుద్దుకొని వాహనాలు వెళ్తున్న ,
తత్త్వం మనకు బోధ పడదు !

మూడవ దృశ్యం:

నిన్న నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు
ఇవాల కన్నుమూసి కన్నీళ్ళు మిగిల్చిన సత్యం
పూలదండల మధ్య నీ దేహం
నీ తల వద్ద ప్రమిదలో దీపం
నీ చుట్టూ కన్నీటి ప్రవాహాలు
నీ శవ యాత్ర నీకే ఎదురుతుంది ....
తట్టుకొనే ద్యైరం నీ కుందా!
స్మశానానికి వెళ్తున్న వ్యక్తి శవం
నీ కు ఎన్నోసార్లు గుర్తుకొస్తూనే ఉంటుంది ....

మూడు దృశ్యాలు ముగిసిన తర్వాత ...
సిద్ధార్థుడు అడివికి వెళ్ళిపోయాడు !
ప్రతి నగరమూ కపిలవస్తు కానవసరం లేదు ...
శిద్దోధనుడి పుత్రప్రేమ ఒక కన్నీటి శోకం
సిద్ధార్థుడు నడిచిన దారి ఒక కాంతి శ్లోకం

ప్రపంచమంతా దుఃఖ మయం

త్యజించిన తర్వాత నుంచి
నిన్ను నీవు నిర్మితం చేసుకుంటావు !
*15-07-2012

www.vempalligangadhar.com

సతీష్ చందర్ || శిశువు నేడు లేచెను ||


రెండు దశాబ్దాల క్రితం చుండూరు(ప్రకాశం జిల్లా)లో ఇప్పుడు లక్ష్మీపేటలో జరిగినట్లే దళితుల మీద దాడి చేశారు. ఇప్పుడు చంపింది కాపుకులస్తులయితే, అప్పడు చంపింది రెడ్డి భూస్వాములు. అప్పడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు పరిచితమయినదే. అయిన లక్ష్మీపేట దాడి నేపథ్యంలో ఎందుకో మిత్రులతో పంచుకోవాలనిపించింది.


Photo By: Ken Banks


సమాధుల కడ్డంగా బండరాళ్ళెందుకు

పర్వతాల్నే పేర్చమనండి

ఉన్నట్టుండి జీసస్సులు

ఉషస్సుల్లా చివాల్న లేవకపోరు.



ఊరినే వెలివేసినట్లు

ఊరు మధ్య సమాధులా?



ఊరుకు నాలుగు మూలలు

జీవులకు నాలుగు కాళ్ళు

పొర్లడానికి నాలుగు వరసలు

కులం నాలుగు పాదాలా పాకేది.



ఎక్కడో అయిదో మూల దూరంగా

పశువుల పాకలో రెండు కాళ్ళ శిశువు జననం



తోకచుక్క పొడిచిందో లేదో కాని

ఊళ్ళో తోక తెగిన చప్పుడు.



శిశువు పాదస్పర్శకు మైలపడ్డ పశువుల ఆగ్రహం

మొరిగి, ఓండ్రపెట్టి, ఊళ వేసిన శోకాలపన



ఈ శిశువు-

బానిసల కంటిపాప

ఒక శతాబ్దపు స్వప్నశకలం

వందేమాతరపు తొలిచరణం

పశుధర్మశాస్త్రం ప్రకారం శిశుజననం మహాపాతకం



శిశువుకు-

రెండు కాళ్ళుండటం నేరం

మిగులు భూమ్మీద అడుగులు వేయకుండా

మేకులు కొట్టారు.



రెండు చేతులుండడం నేరం

పని చూపమని యాచించకుండా

చిల్లులు పెట్టారు.



శిరస్సులో మెదడుండడం నేరం

మళ్ళీమళ్ళీ రాజ్యాంగం రాయకుండా

ముళ్ళ కిరీటం గుచ్చారు.



ముఖవర్చస్సుండడం నేరం

ఏ తల్లీ ముద్దాడకుండా

కాండ్రించి వుమ్మారు.



అన్నిటికన్నా ఛాతీలోపల గుండెకాయ వుండడం నేరం

బానిస కొడుక్కి ప్రేమెందుకని

బరిసెలతో పొడిచారు

పంట పొలాల్లో శిశువుకు శిలువ మరణం

పట్టపగలు చీకటి కమ్మింది.

ఆకాశం అయిదు ముక్కలుగా చీలింది.

సూర్యుడు నాలుగు ముక్కలూ అతుక్కొని ముఖం కప్పుకున్నాడు.



శిలువ మీద శిశువు పలికిన చివరి మాట:

‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురు.

నేను తిరిగి లేచువరకునూ వీరిని సజీవముగా వుంచుము’.



ఊళ్ళో పశువుల పరారీ.

నాలుగు రోడ్ల కూడలిలో

గర్భం దాల్చిన నేలతల్లి.

వీరుల సమాధులన్నీ నిండు చూలాళ్ళే.



పిరికి వాళ్ళు పశుపాలకులు!

శిశువింకా లేవకుండానే పశువధను నిషేధించారు.

‘పశువులను వెదకి శిక్షించుటకు

శిశువు ఈ లోకమునకు వచ్చును’



గర్భశోకతప్త హృదయులైన మాతృమూర్తులారా

కళ్ళు తుడుచుకుని

ధవళ వస్త్రాలతో స్వాగతం పలకండి.



‘శిశువు నేడు లేచెను. హల్లెలూయ’
*15-07-2012

కె క్యూబ్ వర్మ || అద్దం పెంకు ||

ఇంత చిన్ని అద్దం పెంకు
ఆ గూటిలో...

చుట్టూ అలికి తెలుపు నలుపుల
ముగ్గు పెట్టిన మట్టి గోడ

చూరు పై తాటాకు
రెమ్మల రిబ్బను వేలాడుతూ...

వెదురు బద్దల తడిక హుందాగా
గోడకు చేరగిలబడి...

రెండు నెమలీకలు
అలా ముంజూరుకు గుచ్చి...

నుదుటిన ఇంత సింధూరం
ఎర్రగా సూరీడు బిళ్ళంత..

ఈ చిన్ని
అద్దం పెంకులో నా గుండె చిత్రం....

మసిబారనీకు
ఆ దీపపు సెమ్మెలా...
*15-07-2012

బివివి ప్రసాద్ || దిగులు గీతం ||


1

దిగులు గాలిపటం ఎక్కడో ఎగురుతూ ఉంది ఈ విరామసమయంలో

2

వాన కురుస్తుంటే లోలోపల దాగిన తాపమేదో తగ్గి చల్లబడాలి కదా

కానీ ఈ దిగులేమిటి

దారిలో తగులుకొన్న కుక్కపిల్లలా నాతోనే తిరుగుతోంది

3

ఎందుకని ఆకాశమా ఏడవకమ్మా అనాలనిపిస్తోంది

మననెవరూ ఓదార్చనపుడు, మనకెవరినైనా ఓదార్చాలనిపిస్తుందనుకొంటా

4

విరామమెంత బరువుగా వుంటుంది

ఈ ఖాళీ సమయాన్ని తెల్లకాగితంలా మడిచి దాచుకొని

వత్తిడుల మధ్య వాడుకోగలిగితే బాగుండును

5

ఏదో ఒకటి చేయాలి

నన్ను నేను తప్పించుకోవాలి

కురిసే, కురిసే వానని ఊహతో ఆపగలనేమో ప్రయత్నించాలి

6

సంగీతమో, స్మృతులో, కవిత్వమో

దేనికైనా ఈ దిగులు సరైన సమయం

కానీ, అన్నిటినీ విడిచి,

ఈ సారైనా దిగులు గర్భంలోకి సరాసరి దూకాలని ఉంది

ఏ సృష్ట్యాది కాలపు వెలుతురులు అక్కడ దాగివున్నాయో చూడాలి

ఏమీ లేకపోవటమైనా అక్కడ ఉండకపోతుందా

అంతూ, దరీ లేని స్వేచ్ఛ నన్ను ముంచేయకపోతుందా

నిజమైన వాన ఏదో నన్నొక చినుకుని చేసి ఎటైనా విసిరేయకపోతుందా


*15-07-2012

నంద కిశోర్ || ‎66G ||

అరె భాయ్!
చూసావా ఎపుడన్నా?
చౌమహల్లాలోని కత్తుల్ని,తుపాకుల్ని
అందానికే అతిశయమనిపించే
అలనాటి వైభవాల్ని,
అఫ్జల్‌మహల్లోని దీపాల్ని,సోఫాల్ని,
చెదరకుండా కూర్చున్న
నవాబుల జ్ఞాపకాల్ని..

భాయ్!
విన్నావా ఎపుడన్నా?
వింటేజ్‌కారుల్లోంచి మోగేటి హారన్‌ని,
అటుగ వెళ్ళే గాలి
మోసుకెళ్ళే సంగీతాన్ని,
రాణుల గుసగుసల్ని,రహస్య భాషల్ని,
ఎవరికి వినపడని సన్నటి ఏడుపుల్ని,
అందమైన కొలనులో
హంసల గానాన్ని..

చూస్తున్నావా నువ్వు?
హైకోర్టుని,ఉస్మానియాని,
సందేశాల్లేని పావురాల్ని,
పాతబడ్డ నయాపూల్ని,నాగరికతని
మురికినీళ్ళలో తేలి
ఊపిరాడని మూసీనీ,
తీరాన్ని మిగల్చకుండా
కొట్టుకుపోతున్న చరిత్రని..

వింటున్నావా ఎపుడన్నా?
రోగుల అరుపుల్ని,
న్యాయంలేని వాదనల్ని,
ఏడ్చే గడియారాల్ని,పాడని మసీదుల్ని,
సిటికాలేజిలో
తన్నుకున్న నినాదాల్ని,
ఫుట్పాత్ దుకాన్లో
ముసల్మాన్ గొంతుని..

ఆబిడ్స్ లో చెట్ల నీడలు
అసెంబ్లీకి వలసెళ్ళాయి.
నాంపల్లి విద్యాలయంల
సురవరంకి గిరాకి లేదు.
మెహదీపట్నం అంచులో
సగం భూమి సైన్యం తింది.
లంగర్‌హౌస్లో ఆగేదెవడు?
బ్యాచులరే అయ్యుంటాడు.

గోల్కొండలో ఉన్న రాళ్ళన్ని
కూలలేక కూలబడ్డయి.
రామదాసు బందికానలో
రాముడింక బయటకి రాలె.
సప్పట్లు కొట్టినవంటే
బూతులేవో ఇనబడుతున్నయ్.
కోటపైకి ఎక్కిసూస్తివో
నగరమంత పాతబడ్తది.

గిదంతా నీకెందుకులేగాని,
'అమాయకుడా'..
నీకు నచ్చేటి పాట పాడనా?
॥పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ॥

(*66G గోల్కొండ నుండి శాలిబండ పోయే బస్సు నంబరు. ఈ రూటులో చార్మినారు తాకదు.)
*15-07-2012

మెర్సీ మార్గరెట్ కవిత

శ్వాసనంతా దారాలుగా మార్చి 
నీ గుండె చుట్టూ నన్ను ముడుపు కట్టుకున్నా 
తలగడలో దూరి పోయి 
శ్వాసవై 
రాతిరంతా కబుర్లాడుతావని 
చెవులకు నా మనసును తగిలించా

ఉక్కపోస్తున్న మనసుకు
నీ శ్వాసలు
భావాలై చల్లబరచాలని
చీకటింట్లో దీపమైనట్టు
నీ మాటల్తో
నా గుండెలో శ్వాసను వెలిగించాలని
మసిబారుతున్న ఆశలను
కన్నీటితో శుభ్రం చెశా

ఏమయ్యావ్ ?
రెక్కలు గాలికిచ్చి
మనసును నాకిచ్చావ్ అని మరిచి
పెదాలకు ప్రేమ అర్ధాలు నేర్పి
ఉషస్సుని తిమిరాన్ని కలిపే దారిలో
రాగాల ఊయల వేసుకొని
గాలితో గుస గుసల కచేరి చేస్తూ
సంధ్యా వేళయ్యిందని ఎరుగక
గుండె గూటికి దారి మరిచవా ?

*14-07-2012

సత్య శ్రీనివాస్ || మట్టి తావీజు ||

శిధిలమైన
ఇంటి గోడల్ని
అంటి పట్టుకున్న
రావి మొలక

*14-07-2012

ప్రవీణ కొల్లి || విరామం ||

మనసు అలసట మదికి తెలుస్తూనే ఉంది
తనువు బడలిక భారమై ఎదను వేడుకుంటోంది
కాస్తంత విరామం ఇవ్వమని...

కాలం పరుగెడుతూనే ఉంది నా పనిలా
కాసేపు...కాసేపంటే కాసేపే
ఈ పనిని పక్కన పెట్టి
ఈ రోజును నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని
నన్ను నేను అభిషేకించుకోనీ....

నిద్ర లేమి లేని కనులతో
సూరీడి గోరు వెచ్చటి దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడితో కబుర్లు చెపుతూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ....

పువ్వుల పరిమళాలను మోసుకొచ్చిన ఆ చిరుగాలి
మనసు మూలాల్లోకి జొరబడి
సరసాలాడుతూ విసుర్లు విసిరింది
ప్రపంచాన్ని పల్లెటూరన్నావు
మనసులు ఇరుకు సంధులు చేసావు
ప్రకృతికి మేకప్పులేస్తున్నావు
సరి సరి..ఒప్పుకున్నా
ఈ నిట్టూర్పుల సెగలింక ఈపూటకు పక్కన పెట్టనీ
నీ సరసన నన్ను సేదతీరనీ
వేడుకోలును వయ్యారంగా ఆలకించిన
చిలిపి గాలి నా ముంగురులను ముద్దాడింది
పులకరించిన తనువు అలసటను మరిచింది...

తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న గాలిపటం
గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ ఆ స్తబ్దతను ఆస్వాదిస్తుంటే
మరోమారు జన్మిస్తున్నట్టుంది...

నీలాకాశపు పందిరి కింద
చంద్రవంకను వంగి ముద్దాడి ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా
ఈ రాత్రి
కొబ్బరాకుల నడుమ నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
వెన్నెలను కౌగలించుకుని
మబ్బుల లాలిపాటలో ఓలలాడా...

నిన్నటి రోజున జనించిన
ఆ రాగం
నా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు
మనసు పొరలలో రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో విశ్రమించే వరకు....

ఈ విరామం కొత్త ప్రాణాన్ని నాలో నింపింది...

*14-07-2012

మెర్సీ మార్గరెట్ కవిత

ఘల్లు ఘల్లు మంటూ
నీలి చీరతో వర్షం
ఎదురుగా వచ్చి కూర్చుంది

కళ్లలోని
కన్నీటి చుక్కల్ని తుడుస్తూ
ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని
మెల్లిగా చిరునవ్వు నవ్వింది

-"ఒంటరివని ఎవరన్నారు ?"
నాకన్నా ఒంటరి ఎవరున్నారంటు -

-"మేఘంలా ఆవిరైన నన్ను కౌగలించుకునే
వారెవరు ?
పొగలు పొగలుగా కదులుతూ ఎవరి
గుండెని గట్టిగా హత్తుకోలేను
గాలి అధికారం నాపై ఎప్పుడు ఉండేదే
నా ఇష్టానికి నేను ప్రయానించలేను

ప్రేమ కబుర్లకి .. సందేశం మోసుకెల్లడం వరకే
తరువాత నా వైపు చూసేదెవరు
వర్షించే వరకు పూజలు పునస్కారాలు

ప్రకృతి పలుకులు ..ముచ్చట్లు మూడు నెలలకే
ముగించుకొని మళ్ళీ ఎదురు చూపులు చూడడం తప్ప
అంతవరకు చాలదన్నట్టు
అడవుల్ని నరుకుతూ నా గొంతునులుముతూ
నా కాళ్ళని విరగొట్టి పాపమని
దొంగ ప్రేమ చూపిస్తుంటే

కొద్ది సేపటి ఆనందం ఇలా
కొండల గుసగుసలలో కరిగిపోతు
నేల నేలంతా పరుచుకుని వేడి నింపుకుంటూ
పచ్చిక పైరులతో ఆడుతూ పాడుతూ
ప్రకృతితల్లి ఒడిలో నిదురోయే వరకే అని

తన కళ్ళలో నీళ్ళుఓదార్పు పూలై
నా పైన కురిపించి నను హత్తుకుని
పిలవగానే నేను నీతో ఉంటానని
తన ప్రేమతో తడిపి ఒంటరితనాన్ని
పంచుకుని నేస్తమయింది..

*14-07-2012

రవీందర్ వీరెల్లి || ఆశ ||

నా ముందు
పెన్నుంది
తెల్లని పేపరుంది
నిద్రను కరిగించే వెచ్చని రాత్రీ వుంది.

ఇక
వో పొద్దుపొడుపు పోత పొయ్యాలి.

*14-07-2012

రామ్మోహన్ డింగరి || నా ఆలోచనా చిలుకొయ్యకి ..||


నిన్నటి నీ జ్ఞాపకం

వేళ్ళాడుతునే వుంది .

ప్రతీ సారి ,ప్రతీ క్షణం

వర్తమానంలో తగుల్తూ ..!

ప్రతీసారి అనుకొంటా ..

ఆ చిలుకొయ్యని వూడ బెరకాలని ,

కానీ అనుభూతి బావుందని ఆగిపోతా....!

*14-07-2012

కిరణ్ గాలి || అతడు ||

అతడెందుకో అదివరకటిలా లేడు
అందమా ఆనందమా తగ్గింది
కళ్ళల్లొ మునుపటి కాంతి శిఖలు లేవు
పెదవులపై ఇంద్ర ధనస్సులు లేవు

ఎందుకనొ మరి అతను అదివరకిటిలా అస్సలు లేడు
దేహం వడలిందా ధైర్యం సడలిందా
యవ్వనానికి వ్రుద్దప్యానికి మద్య
కూలిన వంతెనలా అలా
ఒరిగి పొయాడు
పూర్తిగా ఒదిగి పొయాడు

గతం దిగుడు బావిలో
జ్ఞాపకాల రాయి పడ్డప్పుడల్లా ఉలిక్కి పడతాడు

అనుభవాల ఉరికొయ్యలకి వేలాడుతున్న
అనుబంధాల కళేబరాలు
ఇంకా అతడికి
పచ్చిగానె తగులుతున్నాయా

రాజిల రాపిడిలొ రాలి బూడిదైన అశయాల
అవశేషాలు ఇంకా వెచ్చగానే
అతడిని వెన్నాడు తున్నాయా

అతడెందుకో మరి ఎదురుపడితె
అపరాధిలా తలదించుకునే వుంటాడు
అనుకున్నది సాదించలేదనా
అసలేమీ సంపాదించలేదనా
అవసరమైనప్పుడు సాహసించలేదనా

అసలెందుకని తప్పు చేసినట్టు
తప్పించుకు తిరుగు తాడు?

ఒంటరిగానె ప్రపంచాన్ని గెలవాలని బయలు దేరిన వాడు
పాండవులే కౌరవులని తెలిసి బహుశా అస్త్ర సన్యాసం చేసాడు

ఇన్నేళ్ళ అజ్ఞాన వాసం ముగిసి
సిగ్గుతొ అజ్ఞాత వాసంలోకి వెల్లిపొయాడు
ఇప్పుడు ఎదురుపడ్డా
ఎరగనట్టే వుండిపోతాడు

అద్దంలో అతడు
అదివరకటిలా లేడు
అపరిచితుడిలా వున్నాడు

*14-07-2012

ఆదూరి ఇన్నారెడ్డి కవిత

ఇప్పుడు నామనస్సు మనస్సులోలేదు
మనసులో ఆలోచనలు లేవు
ఉన్నదల్లా ఒకటే
ఏ నిముషంలో ప్రాణం పోతుందో అనే ఆలోచన

ఇపుడు హృదయాలలో స్పందన లేదు
ఆర్ద్రత అనురాగం లేదు
అనుభూతి, ఆత్మీయత లేదు
ఎదురయ్యేదంతా ఒకటే....
మరణ మ్రుదంగ నాదాల సవ్వడులు...
జనారణ్యంలో మానవ మృగాల సంవేదన..వినిపిస్తుంది

ప్రక్రుతిలో నాకు మనసున్న ప్రాణులే కనిపించడంలేదు
పలకరింపు లేదు పరామర్శ లేదు
గాలి,నీరు లేదు
మంచి, మమత లేదు.అనురాగంలేదు
గుర్తుకు వస్తున్నదంతా ఒకటే...
చనిపోయిన తరువాత నాదేహం కుళ్ళు వాసతప్ప

*14-07-2012

కిరణ్ గాలి || భయవత్గీత ||


ఒకానొక రోజు శ్రీ శ్రీ శ్రీ దేవులుంగారు
కాలక్షేపానికి ఒక మహత్కర్యాన్ని మోదలు పెట్టారు

కాలాన్ని పగలు రాత్రిగా విభజించారు
శబ్దన్నో మరి శున్యాన్నో నాకు ఖచ్చితంగా తెలియదు కాని
మోత్తానికి పంచభూతాలుగ విస్పొటించారు

ప్రాణాన్ని ఆడ మగగా వ్యత్యసించారు
సృష్టిని ప్రతి సృ ష్టించే వరమిచ్చారు
సంతృ ప్తిగా విశ్రమించారు

ఈ ప్రాణం
విఛ్ఛిన్నమయ్యేదిగా మోదలై
ఇదేదిగ, పాకెదిగ, ఎగిరేదిగ,
చివరకు అనుకోకుండ
ఆలోచించేదిగా పరివర్తనం చెందింది

ఈ ఆశించని పరిణామానికి
దేవుడు గారు కంగారు పడ్డారు
చించితె నేను చించాలి గాని
మట్టిముద్ద దీనికెంటీ అనవసరపు పైత్యమ్
అని సొచాయించారు

అప్పుడు ఆయన తెలివిగా ఆ మట్టి ముద్దలొ
మనసు అనే వైరస్ని ఇన్జెక్ట్ చేసారు

ఇంకేముంది
మట్టిముద్ద మని ష య్యింది
దానిలో ఆరి-షడ్వర్గాలైన
కామ, క్రోద, లొభ, మోహ, మద, మాత్సర్యాలనే
ట్రొజాన్స్ స్వైరవిహారం చేసాయి

పర్యవసానమే..

త్రేతాయుగంలో మంచికి చెడుకి ఘర్షణ
ద్వాపరయుగంలొ మనిషికి మనిషికి ఘర్షణ
కలియుగంలొ మనిషికి మనసుకి ఘర్షణ

అయ్యో పెద్దాయనా ఎందుకిలా చేసావు అని అడిగితే
నా సృష్టిలొ లోపం ఎమీ లేదురా అబ్బాయ్
ఉన్నదంతా నీ దృష్టిలోనె అన్నారు
నాకు ఫలానికి మలానికి
ఆట్టే తేడా లేదు అని సెలవిచ్చారు

కాని వింటానంటె నీకొక చిట్కా చెప్తాను
నేనూ నువ్వు బింబ ప్రతిబింబాలం
నాలో మంచంతా నీలో వుంది
నీలోని చెడంతా నాలోంచి వచ్చిందే
అంచేత నన్ను కాకా పట్టి
నీకు కావలిసిందంతా పట్టుకుపొ అన్నారు

అయితే మనిషి మనసులో
అప్పటికే ఆరంభమైన
నిరంతర సంఘర్శనల
రాపిడిల ఒరిపిడికి
ఆత్మ అనే
అన్యపధార్దం ఒకటి పుట్టింది

దాన్ని భగవంతుల వారు
కోయలేరు తీయలేరు
కాల్చలేరు పూడ్చలేరు
అది అనంతమైన తేజస్సై
మనిషిలోని మలినాన్ని మింగడం మోదలు పెట్టింది

....

భగవంతుడు నిరాకారుడని ఎవరన్నారు
భయమే భగవంతుడి రూపం
అది లేకపోతె
శ్రీ శ్రీ శ్రీ దేవులుంగారికి
అస్తిత్వమే లేదు

ఆత్మకు ఆకారం వుంది
అదే నిలువెత్తు మానవత్వం
ఈ తత్వమ్ నీకు భోదపడిందా
ఇహ నీకు దేవుడితో పని లేదు

*14-07-2012

వంశీధర్ రెడ్డి || అనుక్షణికం ||


కప్పుకున్న నిద్ర, చిరిగి
శూన్య బిలాలగుండా
కనిపిస్తూ చీకటి రూపాలు
కనుమరుగైతూ రేపటి కలలు....
సుషుప్తి శిథిలాల్లోంచి నిర్మితమైతూ జాగృతి
అంతశ్చేతనుణ్ణి చేస్తూ, అంతరంగమావిష్కరిస్తూ,
నిన్ననింకా జ్ఞా పకంగా మారనీయని నీ నవ్వు
తెలి మంచులా, తొలి మహిమలా,
వన్నెలింకా గుర్తుగా మిగిల్చిన నా నువ్వు
పిల్ల తెమ్మెరలా, పూల తాకిడిలా,
నా ఆలోచనలకాలంబనౌతూ
నా లోచనాలకాలింగనమౌతూ...

ఎవరూ చూడలేని
నా అంతఃప్రపంచపు భవన ప్రహేళికా దారుల్లో
మైకం వీడని
నా బహిర్లోకపు ప్రవేశికా ద్వారాల్లో
పాశవిక లిప్స,
అసంపూర్ణ సంపూర్ణమై, అసాధ్య సాధ్యమై,

మన రెండు ఆత్మలు, ఒక్కటిగా నశించి
పునరుధ్భవించి
పునస్సంధానించుకుని...
గది గోడల బీటలు చేసిన శబ్దం, విన్పించని చెవులతో,
మది తలపుల భారం కార్చిన రక్తం, కనిపించని చెలిమితో,
ఎంతకీ దొరకని చెదిరిన మనసు ముక్కలేరుకుంటూ
కాలంలో ప్రయాణిస్తూ,
నాగరికత పొరల్లో నక్కి నవ్వుతున్న,
అనుభూతుల ఆనవాళ్ళు
నావేనా,,, నువ్వేనా,,,
మరి దరికి రావూ?
దారికి రానివ్వవూ?

పురా ఙ్నాపకాల్లారా, చేరండి,
ఆవిరౌతున్నా, ఏ అనుభూతుల్లేక
స్థాణువౌతున్నా, నాకే నేన్లేక

ఏమిటా పరిహాసం,
నేనే లేకుంటే మీకునికేది
నేనే రాకుంటే, మీకీ అలుసేది
ఒంటరినై ఇన్నాళ్ళు బ్రతకలేదా,
ఇకపై బ్రతుకే లేదా,
సరే, సెలవిక, ఎప్పటికీ,

అస్పష్ట స్పష్టంగా అశరీరవాణి దూరాన,
"మిత్రమా, ఒక్క క్షణం,
మరిచావా,
సృష్ట్యాదినుండిప్పటికెన్ని కోట్లసార్లొచ్చావో,
ఇంకేం మిగిలిందిక్కడ, నీదని మన్నించడానికి,
మరేం మునిగిందిప్పుడు, నీవుగా మనలేకపోవడానికి,
చూసుకో ఎవరికరువిచ్చావో,
చేరుకో ఎవరికొరకొచ్చావో,
దిగంతం దగ్గరే, అనంతమూ చేరువే,
మేలుకో ఉదయం చూపని యామినుల్లోంచి,
మారిపో హృదయం చూపిన మాయలనొదిలి"

*14-07-2012

Ro Hith || Sparrows ||

In the summers of May
a troop of grey sparrows
used to flow into our lane
as an escaped cloud of monsoon
roosted on the neem tree
and pollinated the music they
brought from different worlds.
When someone shooed them
they all rose into sky
as a single tide with million chirps
and flew to neighbour's compound wall
and then to the current pole
sopping the world with music.

Elders chopped the neem tree
as the sparrows were causing
ripples in their still lives.
Sparrows didn't return the next summer
the silence of May remained dry
and some unconventional rains
withered the street.

*14-07-2012