పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

షoషాద్ మహమ్మద్ గారి కవిత-మిగిలే ఈ రోజుని
 


గతకాలానికి సంబంధించిన వ్యక్తులు,భావాలు,సంఘటనలు,తిరిగి మననం చేసుకుంటూ రాయడాన్ని పునశ్చరణం(Anamnesis)అంటారు.గతాన్ని తార్కికంగా వ్యక్తం చేయడానికి ఇందులో మంచి అవకాశం ఉంటుంది.ఎక్కువగ జీవిత భావనలను వ్యక్తం చేయడానికి ఇలాంటి వాక్యాలు రాస్తారు.

షoషాద్ మహమ్మద్ గారు రాసిన కవితలో ఈ భావ జాలం ఉంది.ఈ అంశం వెనుక బలమైన స్త్రీగొంతుక వినిపిస్తుంది.అది గతాన్ని,వర్తమానాన్ని రేపటిని కూడా తార్కికంగా చిత్రించింది.ఆ రేపుని శూన్యంగా.

"ఎన్నెన్ని రాక్షస యుద్దపు చీకట్లు
ఓడిపోతున్న మనసును
ప్రతీ సారీ చంపేసుకున్నాను
నిన్నటి నా చరిత్ర

కావాల్సిందేదో
మనసుకెదురై ముసుగుతీసేసినట్టు"

ఈ వచనంలో భారమైన అనుభవశక్తి ఉంది."రాక్షస యుద్ధం""యుద్ధపు చీకటి"లలో అణచివేతని,"ఓడిపోతున్న మనసును""మనసుకెదురై ముసుగు తీసేసినట్టు"లలో కొల్పోతున్న జీవితాన్ని గూర్చి కనిపిస్తుంది.

ప్రతీ వాక్యంలోనూ ఒక అసహనం కనిపిస్తుంది.

'ప్రేమ యుద్ధానికి ఆహ్వానం
గెలుపైనా ఓటమైనా ఇద్దరిది
నిజంకాలేని రేపటి నా ఊహచిత్రం"

"చరిత్రకు సాక్షం
నా ఒడిలో
ఊహకి స్థానం నా గుండెల్లో"

తాను బందీ అవుతున్న అంశాన్ని చిత్రించిన సంధర్భాలు.వాక్యంలో గాఢతకనిపిస్తుంది.వస్తువు విషయంలో పోలిక లేదుకానీ గతంలో స్కైబాబాగారు రాసిన "దుఃఖనామా"కవితలోని వాక్యాలతో పోలికలున్నాయి.ఆ శైలి ఇందులో కనిపిస్తుంది.కొత్తగా రాస్తున్నట్టు కనిపించినా షoషాద్ గారిలో బలమైన గొంతుక ఉంది.మరిన్ని కవితలతో త్వరలోనే తానోప్రత్యేకమైన గొంతుగా కనిపిస్తుందనటానికి ఏమాత్రం సందేహపడ నవసరంలేదు.
 
 
                                                                                                               ______________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

బూర్ల వెంకటేశ్వర్లు-ఎన్నీల ముచ్చట్లు
 



తెలుగులో ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది.ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని సారవంతంగా,సహజాతి సహజంగా అందించింది.ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి సంబంధమైన కవిత రాయవచ్చాలేదా అనే చర్చలు జరిగాయి.బూర్ల వెంకటేశ్ కవిత అందుకు సమాధానం చెబుతుంది.

వెన్నెలని ఆధారం చేసుకొని చాల గొప్ప భావచిత్రాలతో ఈ కవితని నిర్మించారు బూర్ల.బూర్ల దర్శనంలో తన్మయీ భావంకనిపిస్తుంది.వెన్నెలని చాలా భిన్నంగా తెల్లటి దుప్పటిలా,పాలలా,వరిగొలుకల్లా,వెండిలా,తెల్ల కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు.బూర్ల దర్శనంపై వర్ణ(colour) ప్రభావం కనిపిస్తుంది.నిజానికి వెన్నెలని చల్లనిదనేదృష్టితో చూస్తారు.

"ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె
నేను ఇంట్ల ఉంటే/కిటికిలకెల్లి తొంగి చూస్తది
బైటికివోతె/ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది"

"రాత్రిరాత్రంత/తెల్లటి దుప్పటిగప్పి
నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లుమూసుకుంటే
మనుసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది"

"పొద్దుగాల పాలువిండేటప్పుడు
సర్వలదునికి జాక్కుంటది"

"ఆకాశంల నిలవడి నాకోసం తపస్సుజేసి/వరిగొలుకల అవతారమెత్తి
నా గుండిగెల నిండుతది/సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి
రమ్మని చేతులు చాపుతె/తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి
తనమనుసు తెల్లకాయిదం జేసి/నాకు ప్రేమలేఖ పంపిస్తది"

వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు.కోడ్ చేయగలిగితే అన్నివాక్యాలు అంతే బలమైనవి.తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో ఉన్న మార్దవాన్ని,మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది.సాధారణంగా తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ కనిపిస్తుంది.వెంకటేశ్ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు."తొంగి చూసు/ఎంటవడు/ముచ్చటవెట్టు/దునుకు/జాక్కొను/కుమ్మరిచ్చు/ఇనుకుంట"ఇలాంటివి కనిపిస్తాయి.

"చెప్పాలె/ఉంటే/వోతె 'లాంటి క్రియలుకూడా సహజత్వాన్ని ప్రదర్శిస్తాయి.కవిత్వానికి బూర్ల కొత్తకాదుకాని తనని నిలబెట్టే
కవితలో ఇదీ ఒకటవుతుంది.

"ఆమె కాళ్ళపట్టీల నుంచి రాలిపడ్డ గజ్జెలు
పక్షులగొంతుల్ల చేరి
ఉదయపు పాటలైతయ్"

ఇలాంటి మంచి ఊహలతో,భావచిత్రాలతో వెంకటేశ్ మరిన్ని మంచికవితలని అందిస్తడని ఆశిద్దాం.అభినందనలు బూర్ల వెంకటేశ్ గారు.
 
                                                                                                              ______________ఎం.నారాయణ శర్మ
 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ


రక్షిత సుమ-అడుగులు

 





ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.

నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం.చలం గారికి ఈ అలవాటు ఎక్కువ.చాలామంది కవులు ఒక అచ్చుమీదో,పదం మీదో వొత్తిడి(Stress)తో కవిత్వం రాస్తారు
.కవిత్వంలో వేగం (Swift)తేవడానికి ఇదో మార్గం.

రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు.నిజానికి ఇది ఊనిక మాత్రమే.మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి.పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.

"పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు
వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి
వసివాడని సంతోషాల కొసరడుగు
మసిబారని ఆలోచనల మెరుపడుగు"

'పోగుబడ్డ ప్రపంచ విషయాలు""వసివాడని సంతోషాలు""మసిబారని ఆలోచనలు"మంచి ప్రయోగాలు.ప్రేరణాత్మకంగా సాగే వచనం పఠనాసక్తినికలిగిస్తుంది.

"వెలుగెక్కడుందని నీడనడుగు
గమ్యాన్ని చేరేలా నడవాలంటే,
ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్నీ
దాటేయాలి నీ ప్రతి అడుగు"

నిజానికి ఇందులో పై చివరివాక్యంలోని "అడుగే" కవితకు ఊనిక.ప్రశ్నించి తెలుసుకోడంలోనే అన్నీ సమకూరుతాయనే అంసాన్ని ప్రతిపాదిస్తూ ఈవాక్యాలు కొనసాగాయి.కొన్ని వాక్యాలు మంచి భారతని కూఒడా కలిగి కనిపిస్తాయి.

"పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. "

పడకుండనితూకం,పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు.కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి.తనదైన వాతావరణం కవితకి కావాలి.మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు.నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది.మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.



                    
                                                                                                                                                                       ______________ఎం.నారాయణ శర్మ

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

కె.ఎన్.వి.ఎం.వర్మ-గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల




 






నైవ రాజ్యం న రాజాసి నదండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వే రక్షంతి చ పరస్ఫరం




(రాజ్యములేదు,రాజులేడు దండించేవాడు దండింప బడేవాడులేడు.ధర్మాన్నొకదాన్ని తాముగ నిర్మించుకుని ప్రజలు పరస్పరం ఒకరినొకరు రక్షించుకునేవారు)భారతం శంతి పర్వం లోని ఈశ్లోకం రాజ్యం యొక్క డొల్లతనాన్ని చెబుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో నైతే పాలన,చట్టం,న్యాయం అనే అంశాలు వ్యష్టిగా పనిచేస్తాయి.అందువల్ల రాజ్యం దాని ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.


వర్తమానంలో ప్రజాప్రతినిధులు కేవలం పార్టీనాయకులుగా ప్రవర్తించడం వల్ల ప్రజా ఉద్యమాలు అణచబడుతాయి.అందువల్ల తమ ఆకాంక్షలకోసం పోరాడేప్రజాచైతన్యం అనేక సార్లు మోసం చేయబడుతుంది.పోరాట ఫలితాలను ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా నాయకుల ఆలోచనలకు దగ్గరగా నియంత్రించ బడతాయి.అందువల్ల ఉద్యమకారుడు ఎప్పుడూ ఒక స్థితిలోనే ఉంటాడు.


కొన్ని సంఘాలని చూస్తే ఈ అంశం అర్థమౌతుంది.కొన్ని సమీకరణాల మేరకు ఒకే చింతనగలిగిన సంస్థలుకూడా వేరై పూర్వపు భాగస్వామ్య పక్షాలనే మళ్లీ నిషేదించాయి.పాలన రూపాన్ని మార్చుకుంటుందిగాని తననడవడినికాదు.

కె,ఎన్.వి.ఎం.వర్మ కవిత అలాంటి పోరాటాన్ని చేసిన వీరుని మనస్సులోని సంఘర్షణని చిత్రించింది.

'నేల తల్లిని దోసిలోకి తీసుకొని/కళ్ళ కద్దు కున్నాను,
చెమట రక్తం తడిసిన మట్టివాసనలోంచి/వనాన్ని ఆఘ్రాణిస్తిన్న కల."

"నిశబ్దాన్ని మౌనాన్ని చీల్చుకొంటూ/కెవ్వుమని నావీపు పై విరిగిన లాఠీ
పడదోసి కసితీరా తన్ని భూట్లు/వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాకా...
నా ఆకుపచ్చని కలని/ఆ గుప్పెడు మన్నుని
నాలుగు సిం హాల కళ్ళలోకి విసిరి/చీకటిలోకి మాయమయ్యాను."


వస్తుసంబంధంగా కవితా వచనంలో భావాభివర్గాలు(Ideological groops)ను గుర్తించవచ్చు.వస్తువు వాస్తవిక,సౌందర్య,తాత్విక మొదలైన వర్గలలో ఎవర్గానికి చెందుతుందనేది ఈ అంశం చెబుతుంది.వర్మ వాస్తవికతకి సంబంధించిన వస్తువును తీసుకున్నారు.కాని ఆఖ్యానం(Neretion)లో దాన్ని సౌందర్యనికి దగ్గరగా తీసుకువెళ్లారు."పచ్చనికల""వనాన్ని ఆఘ్రాణించడం"మొదలైన వి అందుకు ఉదాహరణ ."ఆకుపచ్చని కలని సిం హల కళ్లలోకి విసరడం"వ్యక్తిగత రక్షణని చూపుతుంది.

అకుపచ్చని కల ఆకాంక్షకి.నాలుగుసిం హాలు పోలీస్ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.


"ఎన్ని జెండాలు మోసినా,
యధాతదం చరిత్ర మొత్తం"

ఈ వాక్యం ఉద్యమ సంస్థల,పాలనల డొల్లతనాన్ని చెబుతుంది.ఫలాలను అందుకునే అవకాశం ప్రజకు చిక్కటం లేదనే అంశాన్ని నొక్కి చెబుతుంది.

కవిత చిన్నదైనా ,నిర్మాణం ,అభివ్యక్తి విషయంలో మంచి పరిఙ్ఞానం కనిపిస్తుంది.వస్తుగతంగా అంశం పాతదే అయినా చూసిన దర్శనంలో కొత్తదనముంది.ఇంకా మంచికవితలు వర్మ గారినుండి ఆశిద్దాం.


                                                                                                                                                      ______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

గుబ్బల శ్రీనివాస్-క్షురకుడు
 


అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన తరువాత బహుజన వాదం పేరుతో అణగారిన వర్గాల కవిత్వం(Poetry of appressed groups)వెలువడింది.నిజానికి ఇది వచ్చిన వేగం ఆకాలానికి అనేక చర్చలు తీసుకు వచ్చాయి.జూలూరి గౌరి శంకర్"వెంటాడే కలాలు"తీసుకువచ్చారు.ఆ తరువాత కూడా చాలామంది కవులు తెచ్చిన సంపుటాలున్నాయి.

చరిత్ర గతిలో వచ్చిన ఉద్యమాలవల్ల ఈ కవిత్వం తన గొంతును మార్చుకుంది.తరువాతి కాలంలో వచ్చిన ప్రపంచీకరణ (Globalisetion)కవిత్వం లో ఒక ప్రధాన పాయగా ప్రవహించిన కుల వృత్తుల కవిత్వం ఈ వర్గాలదే.దానికి కారణం ప్రపంచీకరణ వల్ల ఆయా వృత్తుల విధ్వంసం జరగటమే. ఆతరువాత తెలంగాణా ప్రాంతీయ ఉద్యమంలోనూ ఈ తాత్వికత పాత్ర గమనించదగింది

గుబ్బల శ్రీనివాస్"క్షురకుడు"మానవీయ స్పందనను కూర్చుకున్న కవిత.ఔపయోగిక దృక్పథంతో జీవితాన్ని పరిశీలించిన కవిత.ఇందులో అంశాత్మక పరిశీలన(Case study)ఉంది.నిజానికి ఇలాంటి నిర్మాణం దీర్ఘ కవితల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

"నెరిసిన తలలకు మాసిన ముఖాలకు
కత్తి పట్టి వైద్యం చేస్తాడు/వైధ్యుడు కాదు"

"రాక్షస రూపాలను అందమైన
నగిషీలు చెక్కుతాడు/శిల్పి కాదు"

చివరి భాగం వల్ల వాక్యం పొడుపుకథ నిర్మాణాన్ని సంతరించుకుంది.మనసును హత్తుకునే మార్దవమైన వాక్య భాగాలూ ఉన్నాయి.ఇవి ఒకింత కళాత్మకంగా కనిపిస్తాయి.

"మనసు లగ్నం అయితే/వేళ్ళు విన్యాసం చేస్తే
క్రమ పద్ధతిలో అమిరిపోతాయి/జులపాలు
అవి ప్రేమిక ఊహల్లో నీలి మేఘాలు"

"నిద్దరోతున్న జనాన్ని బద్ధకం కమ్ముకున్న లోకాన్ని
డప్పు దరువుతో చైతన్యం నింపుతాడు"

"తనువు చాలించి చివరి మజిలి
చేరుతుంటే/విచార గీతం ఆలపించి
మరుభూమి చేరుస్తాడు ఆత్మీయుడిలా "

జీవితాన్ని గమనించిన తీరు బాగుంది.మంచి అంశాలని కవిత్వీకరించారు.జీవితాన్ని అనేక భావాభి వర్గాలనించి చూడటం కూడా కనిపిస్తుంది.వచనంలో ఇంకా తాదాత్మ్యత అవసరమనిపిస్తుంది.సాధనే క్రమంగా ఆ మార్గాన్ని ఉపదేశిస్తుంది.మంచికవిత అందించినందుకు శ్రీనివాస్ గారికి అభినందనలు.
 
 
                                                                                                                                                    ______________ఎం.నారాయణ శర్మ

14, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

అరుణ నారద భట్ల-ఆశానగర్ అశోక్ నగర్


కారణాలు పెద్దగా తెలియవుకాని నిరుద్యోగం పై వచ్చిన కవితలు తెలుగులో చాలా తక్కువ.విద్యా సంబంధంగా కార్పోరేట్ విద్యపై సాహిత్యం చాలా సార్లు మాట్లాడింది.మిగత వ్యవస్థల గురించి మాట్లాడటం తక్కువే.ఆతరహాలోనే కోచింగ్ సెంటర్లూ
తెలుగునాట ప్రధానంగా రాజధాని హైదరబాద్ లో ఎక్కువ.అందులోనూ అశోక్ నగర్ అందుకు ఒక ప్రధాన కూడలి.

అరుణ నారదభట్ల కవిత ఇలాంటి జీవితాలను వారివెనక ఉన్న సంఘర్షణలను చిత్రించింది.ఈ జీవితాన్ని దగ్గరినించి గమనించిన సహృదయత ఈ కవితలో కనిపిస్తుంది.ప్రధానంగా ఆశకు,అవకాశానికి మధ్యన ఈ కథనం కనిపిస్తుంది.

"అది కలల సౌధమో/కాలం నేర్చిన జీవిత సత్యమో
లేక...పాలకులు పరచిన ప్రకటనల హోరో!"

"ఒక్కసారిగా సిటీ నడివొడ్డున పడి/లేవలేక కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు"

"బలీయమైన భవిష్యత్తుకై/కూడబెట్టిన సొమ్మంతా
ఆ వీధిలో ధార పోస్తున్నారు"

ఈవాక్యాల్లో ఒక అనుక్రమం ఉంది.ఆశ కలుగుతున్న స్థితిని,దానికోసం చేస్తున్న ప్రయత్నాన్ని,అందులో సఫల మౌతున్న ,కాని వారి గురించి ఈక్రమం వివరిస్తుంది.

"వులిదెబ్బకు భయపడక నిలదొక్కినవారే
సాకార ప్రపంచాన్ని చూస్తున్నారు"

"మింగుడు పడని ఓటమికి ముసుగేస్తూ
ముందేటికైనా నిలబెట్టుకుందామని
తేరుకోలేక....!?!ఒంటరిగానే ఆ గదిలో
మలివయస్సులోకి తొంగిచూస్తూ
అక్షరాలతో సహవాసం నేర్చి"

పోటీపరీక్షల్లో అనుకున్న స్థాయికి రాక,మళ్లీమళ్లీ ప్రయత్నించి ఇంకా వెదుకులాడే వాళ్లూ ఎక్కువే.కాని ఏదో ఆశ ఇంకా నడిపిస్తుంటుంది.నిజానికి ఈ జీవితాల వెనుక ఇంకా చాలా అంశాలున్నాయి.జీవితమంతా కవిత్వంలో పట్టనట్టు,అన్ని అంశాలు ఒకే కవితలో రావడమూ అసాధ్యమే.

"సాకార ప్రపంచం""చీకటి చెర""మలి వయస్సులోకి తొంగి చూస్తూ""కాలం దెబ్బ"లాంటి మంచి పద బంధాలున్నాయి.మరిన్ని మంచి కవితలు అరుణ నారద భట్ల అందిస్తారని ఆశిద్దాం.

కవిత్వంలోకి ఇంకా కొత్త వస్తువులు రావాలి.తమదైన జీవితాన్ని,తమ దైన ప్రపంచాన్ని కొత్త తరం గమనిస్తే కవిత్వీకరిస్తే కొత్త వస్తువులు,అదేవిధంగా పాతవస్తువులూ కొత్తగా తొంగిచూస్తాయి.



                                                                                                                                                 _____________________ఎం.నారాయణ శర్మ

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ

కరణం లుగేంద్ర పిళ్ళై -బతుకడమంటే
 


సాధారణంగా వర్ణనలో వాక్యాలని రాస్తాం ఈవాక్యాలలో రాసేపద్దతిని బట్టి కొన్ని నమూనాలున్నాయి.ఈ వాక్యాల్లో ప్రశ్నావాక్యాలు,పదసమ్మేళనం లాంటి కొన్ని మార్గాలున్నాయి.ఇందులో సాధారణంగా ఉండే వాక్యాలూ కొన్ని ఉన్నాయి.ఇలాంటివాక్యాలు అంశాన్ని చేరవేయడానికి వాహకాల్లాంటివి.

రెండువాక్యాలని ఒక యూనిట్ గా రాయటమో,రెండుచిన్న వాక్యాలని సమ్యుక్తం చేసిరాయటమో చేస్తాం.ఇలాచేస్తున్నప్పుడు వాక్యాల్లో కొన్ని అంశాలని గమనించవచ్చు.1.ఆఖ్యానం (Neretion)మరొకటి వ్యాఖ్యానం(Comment)ఒక సంధర్భాన్ని,అంశాన్ని కవిత్వీకరిస్తున్నప్పుడు ఈ రెండురకాల వాక్యాలు సర్వ సాధారణంగా కనిపిస్తాయి.

ఆఖ్యానం వస్తువునుగూర్చి చెబితే వ్యాఖ్యానం మన దర్శనంలోని విషయాన్ని చెబుతాయి.ఈరెండిటిలోనూ ఒకదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని నిర్వచనం(Definetion)అంటారు.ఈ నిర్వచనం సంక్షిప్తంగా ఉంటుంది సాధారణంగా.కాని వస్తువునుబట్టి సంగ్రంగా చెప్పాలనుకున్నప్పుడు దీనినిడివి ఎక్కువ అవుతుంది.

పూర్వంలో నీతిశాస్త్రం మొదలుకొని కవిత్వంలో ఇలాంటి వాక్యాలు చెప్పటం మొదలైంది.అంటే ఏమిటి?లాంటివాటికి ఇవి సమాధానాన్నిచెప్పేవి.లుగేంద్ర పిళ్లై"బతుకడమంటే "లో ఈ రకమైన వాక్యాలున్నాయి.జీవితాన్ని అనేకమైన అంశాలనించి కొలవడం ఇందులో కనిపిస్తుంది.వర్ణనలో ఇది సాధారణమే కాని ఇక్కడ పిళ్ళై ఒక వస్తువుచుట్టూ ఈ నిర్వచనాలని నిర్మించారు.

"ఆలోచనల సుడిగాలి
వీచినప్పుడు కొట్టుకుపోని/ఏకాంత ధ్యానమై నిలవాలి"

"భాద్యతల బండరాయి
నిశ్శబ్దాన్ని బద్దలు చేసినప్పుడు/చెదరని సరోవరమై నవ్వాలి"

ఈవాక్యాలన్ని జీవితాన్ని కూడ దీసుకునే బలాన్ని ఇవ్వడానికి నిర్వచిస్తున్నాయి.స్థిరత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఇందులో కనిపించే"ధ్యానం,సరోవరం,విత్తనం,శంఖారవం'అలాంటి అంశాలని సూచిస్తున్నాయి.

"మూగ గొంతు పలికే/పాటకు గొంతుక కావాలి
చెవిటి గుండెకూ వినబడే/చైతన్య శంఖారావమవ్వాలి"

"బతుకంటే జీవిస్తూ/మరణించడం కాదు
బతుకడమంటే/మరణిస్తూ జీవించడమవ్వాలి"

చివరివాక్యాన్ని పైవాక్యాలన్ని విడమర్చి చర్చిస్తాయి.చివరివాక్యపు సమగ్రతకోసం ఇలాంటివి అనేకమందిలో కనిపిస్తాయి.లుగేంద్రపిళ్ళై గారికి వస్తువును వర్ణించే అనుక్రం అర్థమైంది.వాక్యాలు కొన్నిసార్లు నినాదాల్లా కనిపిస్తాయి.కొంత కళాత్మకతను పెనవేసుకుంటే వాక్యాలకు ఆ నిర్దిష్టత చేరుతుంది.సమగ్రనిర్వచనాన్ని చెప్పుకోవడానికి ఈ కవిత మంచి ఉదహరణ.అభినందనలు కరణం లుగేంద్ర పిళ్ళై గారు.
 
                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

కపిల రాంకుమార్ కవిత : కవిత్వానికి మానిఫెస్టో



కొన్నళ్ల తరువాతకావొచ్చు,తొలిదశలోనే కావొచ్చు కవులకు కవిత్వం మీదా,ఆయా రచనల మీదా,ప్రక్రియల మీదా,వస్తువుల మీద కొన్ని అభిప్రాయాలుకలుగుతాయి.నిజానికి ఇవ్వే కొన్ని సార్లు తరువాతి కాలాలకు మార్గదర్శకమౌతాయికూడా.శ్రీశ్రీ "కవితాఓ కవితా".లాంటి కవితలు అలాంటివే.

ప్రాచీన కావ్యంలో కావ్య"ముఖం"పేరుతో అవతారిక ఒకటి ఉండేది.కవులు అలాంటి వాటిలోనే తమతమ అభిప్రాయాలు చెప్పేవారు.ఈ కాలంలో కూడా కవిత్వం ఇలా ఉండాలి అంటూ ఒకటో ,అరో కవితావాక్యాలు రాయనివారుండరు.

కపిల రాంకుమార్ గారు అలాంటి అంశాన్నే కవిత్వం చేసారు.ఇందులో రాంకుమార్ కొంత పూర్వుల మాటలకు విలువనిచ్చి మాట్లాడినట్టు కనిపిస్తారు.సినారే ఒక పద్యంలో "అంత కడివెడు పాలపై ఒకింత మీగడపేరినట్లు మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"అన్నారు.పాతనించి మిగుల్చుకునేది ఎంతో కొంత ఉంటుంది.

"జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ/పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!"

సాధరణంగా కనిపించినా ఈవాక్యాల వెనుక ఓ నేపథ్యముంది.ఈ మాటల వెనుక పరోక్షంగా ప్రాచీన సాహిత్యాధ్యయనాన్ని గూర్చి చెబుతున్నారు.

"అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!"

ఒక వాక్యాన్ని కళాత్మకంగ,ఆలంకరికంగా ఎలాచెప్పాలో తెలియడానికి అధ్యయనం చాలా అవసరం.పురాణాలల్లోనూ ప్రతీకలని పట్టుకోడానికి మార్గాలున్నాయంటున్నారు.నిజమే. బోదెలార్ సుసన్నా లాంటి పాశ్చాత్యులుకూడా వారిపుస్తకాలలో పురుషోత్తముడిలాంటివారిగురించి చెప్పుకున్నారంటారు.ఈ అధ్యయనం ఏ కాలానికైనా చాలావసరమే కదా.

"కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!"
చదివించే లక్షణం (Reedability)ఒకటి కవితకి చాల అవసరం.ఆనడక వెంటే పాఠకుడు పరిగెడతాడు.

"ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే/తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా/హృదయస్పందన కలిగించేలా"

పాల్ వాలరీ"కవిత్వం మేధకు కాదు హృదయానికి చేరాలి" అన్నాడు.అధ్యయనం వల్ల ఇవన్నీ పెద్దగా కష్ట పడకుండానే అలవడుతాయి.కవిత్వం ఎలా ఉన్న బిగుతుగా ,ప్రౌఢభాషతో ఎలావున్నా కవిత్వం లో కవిత్వం కనిపించాలని అంటారు.

చాలావరకు అందరికీ కవిత్వం ఎందుకురాస్తున్నామో అర్థం కాదు.పడికట్టు పదాలతో కవిత్వాన్ని నిలుపుకోలేము.వస్తువూ ఎక్కువకాలం నిలుపదు.కవిత్వమే కావాలి.అందుకోసం హృదయాన్ని ఆవిష్కరించే నేర్పుకావాలి.అందుకు అధ్యయనం, సాధన కావాలి.ఈ రెంటి గురించే రాంకుమార్ గారి కవిత మనకు సూచన లిచ్చింది.ధన్యవాదాలు రాం కుమార్ గారు మంచికవిత.
                                                                                                                                               _____________________ఎం.నారాయణ శర్మ
 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ



పారువెల్ల శ్రీనివాస రెడ్డి -గులక రాళ్లు


 


జీవితం,మానవుల ఉనికి.ప్రకృతి,ఆధ్యాత్మకత ఉన్న కవితని తాత్విక కవిత(Phylosophical poem)అంటారు.కవిత్వానికి సమాజం జీవితం కాక మరేదీ వస్తువుగా ఉండదుకదా?అనుకోవచ్చు.జీవితాన్ని చూసే దర్శనంలోనే తాత్విక కవిత వేరవుతుంది.శ్రీనివాస రెడ్ది గతంలోని ఙ్ఞాపకలను "గులక రాళ్లు"గా అభివర్ణిస్తున్నారు.

చిన్న తనంలో ఏరుకున్న గులక రాళ్లని అత్యంత భద్రంగా దాచుకుంటుంది బాల్యం బహుశః ఇందులో ఈప్రతిఫలనముంది.
ఇందులో రెండుకాలాల మధ్యన సూత్రంలా ఒక కొనసాగింపు కనిపిస్తుంది.నువ్వు ,నేను అనే రెండు అనిర్దిష్టపాత్రలు ఉన్నాయి.

"నలుగురిలో/నవ్వుతూ నవ్విస్తూ నేను
చీకటి రాత్రుల్లో ఒక్కడినై ఏడుస్తూ నేను/నువ్వు లేకుండా"

ఇందులో సాహచర్యంలో ఉండే తత్వాన్ని చెప్పారు.బయటి ప్రవర్తనకి ,మనసుకి మధ్యన ఉండే తారతమ్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు.రెండవ వాక్యంలోనూ ఇదే అనుక్రమం కొనసాగుతుంది.ఆతరువాత వాక్యంలో అంతర్ముఖత్వాన్ని తలపించే భావన కనిపిస్తుంది.

"నీకు మాత్రం/మనసుకు విప్పలేక ముసుగు కప్పుకొని తిరుగుతూ
అలిసి , కాలంతో కలిసిపోవడమే శరణ్యమయ్యింది"

"ముసుగు నీడను మోస్తున్న మనసును విడిచి
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతుకు "

అచేతనాన్ని ,సచేతనాన్ని గురించి మనోవైఙ్ఞానికవేత్తలు మాట్లాడారు.ఫ్రాయిడ్ ఙ్ఞాపకాన్ని ప్రాక్చేతనం అన్నాడు.పై వాక్యంలో సచేతనానికి ప్రేరేపించడం కనిపిస్తుంది."ముసుగు"అలాంటి పదమే.ప్రాక్చేతనలో సంసర్గ విధానాన్ని(Associative process)గురించి చెప్పాడు.అనేకాంశలని చెబుతూ ఙ్ఞాపకాన్ని తవ్వడం.

"గులక రాళ్లు""వాగు" ఇలాంటివే.ఒకసారి ఒక మిత్రుడు కవిలోని స్వరాన్ని బట్టి స్త్రీ,పురుష బేధాలని గుర్తించినట్టు,ఎదుటి పాత్రలను గుర్తించ వచ్చా అని అడిగాడు.ఐతే కవి అందుకు అవకాశమిస్తే కష్టం కాదనిపిస్తుంది.

శ్రీనివాస్ రెడ్డిగారి కవితలో "గాలి,వెన్నెల,"లాంటిపదాలు ఎదుటి పాత్రలో స్త్రీ మూర్తిని స్ఫురించేస్తాయి.అయితే ఙ్ఞాపకలను ప్రేరేపించడమే శ్రీనివాస్ గారిలో ప్రధానంగా కనిపిస్తుంది.మంచి కవితనందించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు.


                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

కవి యాకూబ్-చినుకు భాష






ఆత్మకళా,ఆత్మ కళాభ్యాసం,ఆత్మకళాసిద్ది అనే పదాలు ప్రాచీనకాలం నుంచి విరివిగా కావ్యమీమాంసలో కనిపిస్తాయి.ష్చెర్బీనా ఆత్మ కళాభ్యాసాన్ని గురించి మాట్లాడిందని,ఇది ప్రాచ్య,పాశ్చాత్య కళాతత్వ వేత్తలందరూ ఆదరించినదేనని శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం.

జగన్నాథుడు "భగ్నావరణ చిద్విశిష్ట స్థితి"గురించి చెప్పాడు.ఆవరణలో ఉన్న జగత్తుపోయి ఇదివరకే ఉన్న ఆత్మీకృతమైన సంస్కారం ప్రకాశిస్తుంది.బాహ్య జగత్తుకు,ఆత్మావరణానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తనలో జాగృతం చేసుకోవడమే ఆత్మకళాభ్యాసం.

ఈక్రమంలో దర్శన స్థితి చాలావిలువైనది"తతఃపశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం ప్రాణవామలకం యథా తత్సర్వంతత్వతో దృష్ట్వా" ఈతత్వదృష్టి,యోగస్థితి దర్శనాన్ని పదునుపెడతాయి.

దర్శనంలో స్పృహ అనేది ఒకటుంటుంది.దీనికి స్పర్శ మూలం.స్పర్శ నుంచి కవి ఆత్మీకరణ సంస్కారమైన స్పృహ లోనికి వెళుతాడు.తాను ఎటు ప్రయనిస్తాడనేది ఆత్మచైతన్యం,సంస్కార దృష్టిని బట్టి ఉంటుంది.ఇదంతా భౌతికం నుండి ప్రేరణ పొందిన కవి ఆత్మదృష్టివైపు వెళ్లటం.ఈ మార్గంలో కొన్ని సార్లు స్పర్శకూడా ప్రత్యక్ష భాగస్వామి అవుతుంది.కాని పరోక్షంగా స్పృహ అణువణువునా ప్రవహిస్తుంది.యకూబ్ చినుకుభాషలోఇలాంటిదృష్టిఒకటికనిపిస్తుంది.సాధారణదృష్టి,కళావిష్కారం,ఆత్మచైతన్యం,ఆత్మకళాసాధన ఇవన్నీ దార్శనిక పరిణతదశలు.


నిర్మాణపరంగా చూస్తేస్పర్సలోని చూస్తున్నవస్తువు,స్పృహలోని చెప్పబడుతున్న వస్తువు మధ్య సారూప్యతలుంటాయి.ఇలాంటి వాటిలో విలువలు ఒకదానికి ప్రత్యక్షంగా ఉంటే,మరోదానికి ఆపాదించబడుతాయి.

ఆమూర్తసంభాషణ, మూర్త సంభాషణ
అని రెండు ఉంటాయి.ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించినా ధ్వనిగతంగామరొకటి స్ఫురిస్తుంది.స్పర్స భౌతిక మైంది,స్పృహ ఆత్మికమైంది."కవిత్వాన్ని ఆత్మే స్వీకరిస్తుంది కాబట్టి చెప్పేదికూడా ఆత్మే అవుతుంది"అని అరవిందులన్నారు.

ఉద్వేగంతరువాత ఉపశమనం నుంచి కవిత ప్రారంభమౌతుంది.
"ఇంక కొంత సమయం, పడుతుంది/ఈ
ముసురు ఆగిపోవడానికి"

మనసునిఏదో ఉద్వేగంచుట్టుముట్టి ఉండడం,ఆ ఉద్వేగపు సమాప్తి గురించి ఆలోచించడం."మరీ చిన్నిచిన్ని చినుకులు/వాటికోవ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు/ఒకటి వెంట ఒకటి కుదురుగా." ఆత్మీ కరింపబడున అంశాలు కాలగతంగా చేరినవైఉంటాయి. అందువల్ల ఒక్కటొక్కటిగానే అందుతాయి.ఆవరించి ఉన్న అంశాన్ని తప్ప
మరోదాన్ని,భౌతిక జరిగే పరిణామాలని ఆత్మ పట్టించుకోదు.
"నిన్నటి సాయంత్రం నుండి ఇవాళ్టి ఉదయం లోపల/ఎన్నిపరిణామలు జరిగిపోలేదు/అవేమి పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు"-దానినుంచి ప్రేరణపొంది ముగించుకోడం తప్పా ఆవరించి ఉన్నదాని అంతుచిక్కదు

"ఈ ముసురు చేసే సంభాషణలో/ ఒక్క ముక్క అర్థంగాదు"

దృశ్యాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉన్నా..చిత్రించడం,ఆపాదించడం లాంటివి ఇందులో బలంగాకని పిస్తాయి.ఆవరించి ఉన్న ఓ ఉద్వేగపు క్రమాన్ని యకూబ్ గారు ఈ కవితలో చిత్రించినట్టు కనిపిస్తుంది. ఈ మూర్త సంభాషణలోనించి ఆమూర్తంగా మరోగొంతు ధ్వనిస్తుంది.

         

                                                                                                                                        ________________ఎం.నారాయణ శర్మ-1.8.2013

కవిత్వ విశ్లేషణ

Mehdi Ali: నీ విఙ్ఞత





 


మెహది అలిగారి కవితగురించి మాట్లాడుకున్నప్పుడు రెండువిషయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.1.అలీగారు వ్యక్తం చేసిన అంశం2.వ్యక్తం చేసిన తీరు. చాలాకాలం క్రితం బౌద్దానికి సంబంధించి"అశ్వ ఘోషుడు"మనుషుల ప్రవర్తనకు సంబంధించి "సౌందరనందం"లో ఒక వ్యాఖ్య చేసాడు.

"దృష్ట్వైకం రూపమన్యోహి రజ్యతేsన్యఃప్రదుష్యతి
కశ్చిద్భవతి మధ్యస్థఃతత్రైవాన్యో ఘృణాయతే"

ఒక రూపాన్ని చూసి ఒకడు సంతోషపడితే ఒకడు దూషిస్తాడు,ఇంకొకడు మధ్యస్థుడైతే
,వేరొకడు జాలిచూపిస్తాడు.మనుషులస్వభావన్ననుసరించి వారివారి విఙ్ఞతలననుసరించి వారి ప్రవర్తన ఉంటుంది.ఇలా వేరువేరు అభిప్రాయాలు కలగటం వారి మానసిక సంస్కారాలను బట్టే ఉంటుంది.

అలీగారు ఇలాంటి తత్వంలోనే నీవిఙ్ఞత అనివదిలేసారు.ఇందులో అనేకాంశాలని స్పర్శించడం కవికుండే సార్వత్రిక దృష్టికి నిదర్శనం.విమర్శలో సభ్యొక్తి (euphemisam)అనే పదాన్నొకదాన్ని వాడతారు.ఇది వాక్యాన్ని చెప్పే పద్దతికి సంబంధించింది.ఎదుటి వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు దురుసుగా,కటువుగా కాకుండా పరోక్షంగా చెప్పడం.

వ్యక్తం చేసిన తీరు గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు ప్రధానంగా గమనించాలి.కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్లకు ఏవిషయం రాయాలన్న దాంట్లో అనుమానం లేకున్నా.. ఎలారాయాలనేది,ఎదుటి వారికి ఎలాచేరవేయాలనేది మొదటి ఇబ్బంది.అలాంటి వారికి ఈకవితనుండి ఒక మార్గం దొరుకుతుంది.మొదట్లో చాలావరకు అందరూ పంక్తులలో పదాలనుపేరుస్తూ వెళతారు.అంటే ఒకే వాక్యాన్ని సుమారు మూడు నాలుగు పంక్తులల్లో రాయటం.ఇంకొందరు కుప్పగా ఒకేచోట రాసేస్తారు.ఇది ఒకరకంగా కవిత్వం రాసే వారిలో ప్రాథమిక దశ.ఎంత గొప్ప స్ఫూర్తి కలిగించే విషయం చెప్పినా నిర్మాణ క్రమం తెలిసి రాసే వారి వాక్యంలా చేరదు.

కొంత అధ్యయనం తరువాత ఇలాంటివారిలో పరిణత దశ కనిపిస్తుంది.అంశాలని యూనిట్లు గా రాయడం.ఈసమయంలో రెండు వాక్యాలుగా ,మూడువాక్యాలుగా రాయడం కనిపిస్తుంది.నిజాని ఈదశకి చేరడానికి కొంత కాలం పడుతుంది.ఇలాంటి కవితలు చదివి నిర్మాణాన్ని అర్థంచేసుకున్న వారికి ఆకాలం కొంత తగ్గొచ్చు.

అలీ కవితలో ప్రతి యూనిట్లోనూ వరుసగా నిర్మాణ సారూప్యత సాధించారు .

"నేనొక సముద్రాన్ని గంభీరంగా కనిపించడం నానైజం
భయపెడుటున్నానా కెరటాలతో ఆడమంటున్నానా
అర్థమెలాచేసుకుంటావో నీ విఙ్ఞత అది"

మొదటి దాంట్లో ప్రతిపాదక వాక్యం-సృజనధర్మ వర్ణన.రెండవదాంట్లో రెండు వైవిధ్యాంశాలు.మూడవది సూచన .నిర్మాణగతంగా ఇది శతకాలలో కనిపించే మకుటం లాంటిది.విమర్శ దీన్ని వాక్య నిర్మాణ పునరుక్తి(parallelism)అంది.సరళ వచనం (plain prose)లా కనిపించే కఠిన పదాల్లేని వచనం ఇందులో మరో ఆకర్షణ.అర్థ సంబంధంగా ప్రతీ పదంలోనూ కవికున్న అవగాహన కనిపిస్తుంది.ఒక అంశానికి సంబంధించి అనేక పదాలను నిర్మిస్తే అర్థ క్షేత్రం అంటాం.రెండు పదాలు ఉంటే సజాతీయాలు అంటాం.

శశి-వెన్నెల,సమీరం-చలి,సాగరం-కెరటం,రాగం-ఆహ్లాదం ఇలాంటి వన్ని అలాంటి పదాలే.ఇన్ని పంక్తుల్లోనూ మనిషి స్వభావాన్ని అంచనా వేస్తారు.రసానుభవానికి అనుకూలంగా ఏర్పడేవాటిని విభావాలు(objective correlative)అంటారు.ఇందులో ఆలంబన విభావం కారకం లాంటిది.సముద్రం,గ్రంథం,అనుభవం ఇలాంటివి ఆతాలూకే.మరోటి ఉద్దీపన విభావం ఆవేశవాతావరణాన్ని ప్రదర్శించేది.వాక్యాల్లో క్రియాగతంగా చెప్పిన వాక్యాలన్ని అలాంటివే.
ప్రకృతి గతంగా 3,భావన అనుభవాలకు సంబంధించి2,సాహిత్య సంబంధంగా3 అంశాలు కనిపిస్తాయి ఇందులో.
వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి సారూప్యతని ఆపాదిస్తారు.

"నేనొక అనుభవాన్ని పాఠం నేర్పడం నానైజం
అప్రమత్తత నేర్చుకోవాలా నిర్లక్షంగా వుండాలా
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

"నేనొక కవితని జాగృతం చేయడం నానైజం
కవితలో నిన్ను వెదుక్కుంటావో ఇతరులగురించి అనుకుంటావో
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

వాక్యనిర్మాణానికి సంబందించి ఆకాలనికి తగిన రచనకు దగ్గరగా ఉండే క్రమాన్ని అర్థం చేసుకోడం అవసరం.అలీగారి కవిత ఆపనిచేసింది.జయహో అలీగారు.


2.8.2013



                                                                                                                                            _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

సాయికిరణ్ కుమార్ శర్మ కొండముది-ధన్యజీవితం,

           
         




ధ్యానంగురించి చాలావరకు ప్రాచీన భారతీయయానులనుంచి ఇప్పటి వరకు చెప్పని వారంటూలేరు.విమర్శలో ద్వంద్వార్థరచన(allegory)అనేపదాన్నొకదాన్ని ఉపయోగిస్తారు.పాఠకుడికి ఆసక్తి రేపడానికి ఒకవస్తువుతో ఒకటిపోల్చి చెప్పడం,ఒక స్వభావంతో మరోదాన్ని పోల్చి చెప్పటమిలాంటిదే.

పాతకాలపు నీతి శాస్త్రం నుంచి ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యమంతాఈపనిచేసింది.ఇందులో ఒక మార్గం ప్రకృతిలోని అంశాలకు జీవితాన్ని ఆపాదించి చెప్పటం.ఇలాంటివాటిలో కవికి లోతైన పరిశీలనా శక్తి కావాలి.కొండముది సాయి కిరణ్ కుమార్ శర్మ ఒక చెట్టుజీవితాన్ని-వార్ధక్యంలో ఉన్న వృద్దురాలిలా దర్శించి కవిత్వీకరించారు.

ప్రకృతితో స్నేహం చేయడానికి ఒక దార్శనికపరిఙ్ఞానం కావాలి.

"దర్శనే స్పర్శణే వాపి శ్రవణే భాషనేపివా
యత్ర ద్రవత్యంతరంగః స స్నేహ ఇతికథ్యతే"

చూడటం,తాకటం,వినటం,మాట్లాదుకోటంవల్ల ఎక్కడైనా మనసు ద్రవిస్తే దాన్ని స్నేహం అంటారు.-అని నీతి శాస్త్రం.

ప్రాచీన సంస్కృత కవుల్లో వాల్మీకి,కాళిదాసు మొదలైన వారు ప్రకృతిని గూర్చి గొప్ప వర్ణనలు చేసారు.

వాల్మీకి-"నదీం పుష్పోడుపవహాం"(పూల పడవల్ని మోస్తున్న నదీ"అన్నాడు.

శూర్పనఖ రెండువైపులా ఉన్న రామలక్ష్మనులిద్దరినీ చూసి-ఎవరిని వరించాలో తెలియక అర్థం గాని స్థితిని ఇలాచెబుతారు"ఉభయ కూల సమస్థిత శాద్వలభ్రమగతా గత భిన్న గవీ దశాం"(ఇరువైపుల గడ్డి పెరిగితే ఏవైపున మేయాలో తెలియని ఆవులా ఉందన్నాడు)కాళి దాసు కూడా హిమాలయాలల్లో గాలిసవ్వడి వినిపిస్తుంటే "ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదయిత్వమివోపగంతుం"(కిన్నెరలు పాదే పాటకు ప్రకృతి తానాన్ని పాడినట్టుగా ఉందని అన్నాడు)

ష్చెర్బీనా మాటల్ని శేషేంద్ర శర్మ ఈ సందర్భంలో ఇలా వివరించారు.
"What distingushes an artistic vision of the world from all the other froms of knowledge is its much larger content of fantasy,imaginetion,cinjecture,instinct,and sub conciousness"
భార తీయ అలంకార శాస్త్రం కూడా"ఋషిశ్చకిల దర్శనాత్"అనీంది స్థూలంగా..

"పండు ముదుసలి వగ్గులా
మడతలు పడ్డ దేహంతో/చెట్టు"
చెట్తు స్థితిని దార్శనికంగా చెప్పి,కారణాలను ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు.

"ఆకలేసిన కాకిలా /ఆరో ఋతువు
ఆకులను అద్దుకు తినేసింది"
శిశిరంలో ఆకురాలిన సంధర్భాన్ని చెపుతున్నారు.ఈ కవిత లో ప్రాసపై మక్కువ కనిపిస్తుంది.భావనా వ్యక్తతలో శబ్దం పాత్రని కవి ఎక్కువగా విశ్వసించి నట్టు కనిపిస్తుంది. "అకలి,ఆరో ఋతువు,అద్దుకు తినటం,ఆకతాయిలు,అరవైచేతులు అన్నీ ఇలాంటివే.
నీడకూడ ఇవ్వలేకపొతున్నందుకు తడికళ్లతో ఉందని అంటారు.ఇందులో స్వభావాన్ని ఆపందించడం ఉంది.ధ్యానం, తో కవితను వ్యక్తం చేయటం ఇందులో కనిపిస్తుంది.
అభినందనలు.సాయి కిరణ్ కుమార్ శర్మ గారు.3.8.2013



                                                                                                       _______________ఎం.నారాయణ శర్మ


కవిత్వ విశ్లేషణ

వంశీధర్ రెడ్డి కవిత-ఓ రోజెందుకో,

         
                 




చాలానాళ్లక్రితం"చితి చింత"లో"మో" నరాల సంగీతం అంటూ ఓ కవిత రాసారు.అది దుఃఖానికి సంబందించిన బాహ్య స్థితిని ప్రతీకలనుపయోగించి చెప్పిన కవిత.వంశీధర్ కవిత(ఓ రోజెందుకో)లోనూ వస్తు గతంగా ఆకవితకి సారూప్యతలున్నాయి.

1966 తరువాత తెలుగులోనేకాక,మొత్తం సాహిత్యంలోనే ఒక కొత్త ఉనికిని,అభివ్యక్తిని మోస్తూ వచ్చింది వినిర్మాణం.ఈ వాదంలోని కొన్ని అంశాలని విమర్శ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది.

1.భాషకి,పదానికి నియతమైన ఉనికి ,మూలాలు ఉండవని నమ్మటం.
2.విమర్శకులు (నిర్మాణవాదులు)కవితా వివేచనలో చెప్పే కేంద్రం(center)అంచులు(feriferi)వంటివి లేవని విశ్వసించింది.
3.అనుభూతిని వ్యక్తం చేయడానికి అగాథం ఉంటుందని నమ్మింది.
4.సంపూర్ణత్వం అనేది భ్రమ అని అన్నీ అసంపూర్ణాలేనని నమ్మటం.
5.ఏ అంశంపై మరే అంశపు ఆధిపత్యం ఉందకూడదని ఆలోచించింది.
6.రచనలోని ఖాళీలగురించి,అనేకమైన అప్రధాన మైన విషయాలని కూడా పట్టించుకుంది.
6.ఇది స్వీయ మానసిక వాదంపై ఆధార పడుతుందని విమర్శకులు అభిప్రాయ పడ్దారు.
వంశీలో ఈ రకమైన మానసిక సంస్కారం కనిపిస్తుంది.
7.నిహిలిజం లాంటిపిడివాదాన్ని మోసిందని,ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టతను సృష్టించిదని నిందలుకూడాపడింది.

తెలుగులో కొందరు ఈ తరహాకవితలు రాసినా మో ఒకరే వినిర్మాణ కవిగా కనిపిస్తారు.వంశీధర్ ని ఒక కవిత తో నిర్ణయించేయలేం కాని గతంలోని కవితలని చూసాక ఇందుకు కొంత అవకాశమూ లేక పోలేదు.

మో కవిత్వంలో ప్రతీకలని ఎక్కువగా వాడుకునేవారు.వాటి ఉనికిని వాటికి ఆపాదించే స్వభావాలని సాధారణం కంటే భిన్నంగాఉపయోగించేవారు.శ్రీరామ్మూర్తి లాంటివాళ్లు సంస్కృతం,లాటిన్,లాంటి భాషలతో పాటు మెడిసిన్లోని పరిభాషని వాడారు.వాక్యాలక్రమాన్ని మార్చిరాయటంకూడ కొందరిలో కనిపిస్తుంది.

వంశీధర్ లో స్వీయమానసిక వాదం కనిపిస్తుంది.సహజంతో వైవిధ్యమైన ,వైరుధ్యమైన భాషని,వాక్యాన్ని ప్రేరేపించేదిదే.

వంశీవాక్యరచనకి అసంబంధస్వభావాలని,ఉపయోగాలని చేర్చడం ద్వారా అవగాహనకు సంబంధించి ఒక అగాధాన్ని సృష్టిస్తారు.సూత్రప్రాయంగా ఇందులో ఒక అర్థవాహిక పని చేస్తుంది.

"ఏడుపునీళ్లనిగాలిలో విత్తడం"
"వెంట్రుకనై కురవాలనిపించడం"
సీతాకోకని చుట్టడం" ఇవి అవగాహనకు దూరంగా కనిపించినా ఒక అర్థ వాహకం ఉంది-విషాదంలో వెంట్రుకలస్థితి,కోక అనేపదానికి సంబందించిన ఉనికి ఈ వాహకాన్ని సృష్టిస్తుంది.చాలవరకు ఇందులో కొన్ని స్థితి సమీకరణాలని ఉపయోగించారు.

మరో వాక్యంలో-దేవుడి మునిమనవలు పలకలు తీసి పాడు బొమ్మలు గీసేదాక-అంటూ రాస్తారు ఇందులోనూ మోకాళ్ల నడుమగడ్డం పెరగటం..మునిమనవలు,కాల సమీకరణాన్ని
చూపుతాయి.

ఎవరో దేవతట-అనే వాక్యంలోమేల్కోవడం అనే స్థితి ఉంది..స్వభావ గతంగా ఇదికొంత వేదాంతాన్ని ధ్వనిస్తుంది.కలలు మారటం పర్యవసానం.చివర్లో ఆక్రొశాన్ని ద్వనించే స్థితి ఒకటి ఉంది-దేవుడు చనిపోయాట్ట అనేవాక్యంలో..

స్వీయ మానసికవాదమొకటిఉందని తెలిసిందే..ఇది సహజానికి విరుద్దమైన భాషని,వాక్య రచనని ,నిర్మాణాన్ని,ప్రతీకల్ని ప్రేరేపిస్తుంది.ఇలాంటి కవితా మార్గాలని అర్థం చేసుకోడానికి కావల్సిన దర్శన గ్రంధాలుతెలుగులో ఎక్కువగా అందుబాటులోలేవు.బి.తిరుపతి రావుగారు రాసిన"పోస్టు మోడర్నిజం"-ఆయనే మో కవిత్వానికి రాసిన 1,2 పీఠికలు,సమీక్షలు."మిసిమి"పత్రిక వేసిన ప్రత్యేక సంచిక.మినహా కనిపించవు.కళతత్వశాస్త్రం -మౌలికాంశవివేచన అనేగ్రంధంలో డా.ముదిగొండ వీరభద్రయ్య కొంతచర్చించారు.

వంశీధర్ లో తనదైన మార్గం ఒకటి ఉంది.ఇది పైన చెప్పుకున్న భాషా,మనసిక సంస్కారాలకు దగ్గరిది.ఈ మార్గంలోవంశీసాధన గమనించదగింది.

4.8.2013





                                                                                                                _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

బి.వి.వి.ప్రసాద్ కవిత-పావురాలు

 





తెలుగులో వచనకవిత వచ్చాక ఆ పరిధిలోనే మరికొన్నిమార్గాలు కనిపిస్తాయి.అనుభూతి కవిత్వం ,అంతర్ముఖీనకవిత్వం ఈదశలో కనిపించేవే.బివివి ప్రసాద్ కవిత సుమారుగా ఆకోవకు చెందిందే.నిజానికి "హైకూ"పరిచయం ఒకటి కలిగాక తెలుగులో పైన చెప్పుకున్న రెండుమార్గాలు పరవళ్లు తొక్కాయి.ధ్యానం,సమాధి లాంటివి పూర్వమే కనిపించినా వాటిని గురించి ఈ 1,2 దశాబ్దాలు మాట్లాడటం అలా ప్రారంభమయిందే.

భౌతిక ప్రపంచాన్ని విడచి అహంకారాలులేని శాంతినపేక్షించే మానసిక ప్రపంచంలోనికి అక్కడినించి సౌందర్యమైన ప్రాకృతికప్రపంచంలోనీ దాన్నించి దృశ్యమూ,శబ్దమూ,రూపమూ లేని పూర్ణ ప్రపంచంలోనికి వెళ్లడం అంతర్ముఖీనత(introspection).అలావెళ్లేకవి అంతర్ముఖీనుడు(invertor).

యోగదర్శనం పేరుతో సౌందర్యారాధకులుచెప్పినది.సమాధి అభ్యాసాలను ప్రతిభా కారకాలుగా అలంకారికులు చెప్పినది ఈ లక్షణాలకు కాస్త దగ్గరగా కనిపిస్తుంది.

రుద్రటుడు(వచనాను స్మృతి)లో-
"మనసి సదా సమాధినీ"(సమాధి సిద్దమైందే ప్రతిభ)అని వ్యాఖ్యానించాడు.సమాధికి అలాంకారికులు చెప్పిన నిర్వచనాలూగమనించదగ్గవి."సమాధిరాంతరా"అనేది ఈ అంతర్ముఖీనత్వాన్నే చెబుతుంది.తౌత భట్టు కావ్య కౌతుకం లో శాస్త్రాధ్యయనం చేత ఙ్ఞానం లభిస్తుందని అక్కడినుండి దర్శనం కలుగుతుందని ఆదర్శనం వల్ల చేసే వర్ణన కవిగాచేస్తుందని అన్నాడు.

"సతత్త్వ దర్శనాదేవ శాస్త్రేషు పఠితఃకవిః
దర్శనాద్వర్ణనాచ్చాధ రూఢాలోకే కవి శృతిః"

బివివి ప్రసాద్ సృజనని ఇలాంటి దర్శనంతో దర్శించి చిత్రించారు.మనసులోకి ఊహలు రావడాన్ని,అందులోంచి సృజనరావడాన్ని స్పందనలుగా ,పావురాళ్లుగా చిత్రిస్తున్నారు.ప్రశాంతత అనే అంశమే "పావు రాళ్ల"నితెచ్చింది.శబ్దాన్నే కొరుకుంటే బహుశః చిలుకనో,మరోదాన్నో తీసుకునే వారేమో.అంతర్ముఖీనత అనిచెప్పడానికి ఈ ప్రశాంతతని అపేక్షించడమే ఆధారం.

ప్రసాద్ గారిలో విస్త్ర్తమైన నిర్మాణ ధార ఉంది.ఇది అనేక చోట్ల కనిపిస్తుంది.ప్రేరణ కలగడాన్ని చిత్రించే ఈ భావ చిత్రం అందుకు నిదర్శనం

"పిల్లలెవరో కాగితంపై రంగులు చల్లుతున్నట్టు
ఆటలో విరామం నిండిన ప్రశాంతతలోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చిచేరుతాయి"

భావచిత్రాలను1.అలంకారాలు2.పాశ్చాత్య కళాపద్దతులు3.మనోవైఙ్ఞానిక భూమిక ద్వారా మూడురకాలుగా చిత్రిస్తారు."చల్లుతున్నట్టు"అన్నక్రియా సంబంధం లోంచి ఉపమావాచకం ద్వారా ఇది అలంకారపద్దతిలో జరిగిందని చెప్పవచ్చు.చివరి వాక్యంలోంచిచూచినా "శాంతి వృత్తంలా/నీడరూపం వచ్చినట్టు"ఇలాంటివే.

మొదటి వాక్యంలోని"వాలటం"2 లోని"క్షణాలు
నోట కరవటం"ఇలాంటివన్ని స్థితులలోని క్రమాన్ని చూపుతాయి."ఈ పావురాలు ఎగిరేందుకు వచ్చినవికావు/వాలెందుకు వచ్చినవి"అనటం.చివరి వాక్యం కవిత ప్రయోజనాన్ని,అంతర్ముఖీనతని ప్రదర్శిస్తాయి.

"ఈ పావురాలు అందుకే వస్తాయి.
ఇవి నిశ్శబ్దం పొట్లాన్ని విప్పి శబ్దాన్ని వెదజల్లవు.
శబ్దం పొట్లాన్ని విప్పి నిశ్సబ్దాన్ని పంచి పెడతాయి"

ప్రతీక,దాన్ని నిర్వచించేతీరు,అందులో చిత్రించిన భావ చిత్రాలు..అందులోని దర్శనం బివివిని ప్రత్యేకంగాచూపుతాయి.తెలుగుకవితలోని ఒక ప్రధాన మార్గాన్ని ఆవిష్కరిస్తాయి.

5.8.2013
                                                                                                          _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

పెన్నా శివరామకృష్ణ-పోలిక ఒక మాధ్యమం






ఋగ్వేదంలో దశమ మండలంలో ఒక ఋచ ఉన్నది."చత్వారి వాక్ పరిమితా పదాని.తానిత్రీణి గుహితానేంగయంతి.తురీయం వాచో మనుష్యావదంతి"ఇందులో చత్వారి వాక్ అనేది గమనించదగ్గది.-వాక్కు యొక్క నాలుగు దశల్నిఈ ఋచ చూపింది."పశ్యంతి,మధ్యమ,వైఖారి నాలుగవది పరా".పశ్యంతి-చూచుచున్నది,మధ్యమ-అభివ్యక్తికి కావాల్సిన ఙ్ఞాన ,సౌందర్య,కళా,శాస్త్ర పరిఙ్ఞానాన్ని కూర్చుకునే దశ.మూడవది బయటికి చెప్పే అంశం.నాలుగవది వీటికి అతీతమైంది.

మిత్రులు పెన్నా శివరామ కృష్ణ కవిత "పోలిక ఒక మాధ్యమం"లో ఈఅంశాల్లోని మధ్యమ దశని స్పర్శించారు.సాధారణ,చర్వణ,ధారణ,మనన,సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు.చూడటం,చూసినదాన్ని నెమరువేసుకోటం,దాన్ని ఙ్ఞానంలో పాదుకోటం,దాన్ని సమన్వయం చేసుకోటం,-సృజంచడం ఇవి.బుద్ది దేన్ని అనుసరిస్తుందనేది ఒక ప్రశ్న?శాకుంతలం "బుద్దిఃకర్మానుసారిని"అన్నది.బుద్దికి చేసే పనులే కారణం.

కవిత్వంలో గాని సాధారణ వ్యవహారంలో గాని పోలికలు కనిపిస్తాయి.ఈపోలికలే ఏరకమైన సంభాషణకైనా మాధ్యమం అంటున్నారు కవి.ప్రతిపదానికి యోగ,ఆయోగ,ఔపయోగిక,సమన్వయ ,ఆవృత్తమనే దశలు ఉంటాయి. ఈ కవితలో ఇలాంటివి కనిపిస్తాయి.

శివరామకృష్ణ గారి వచనంలో వేగం(swift)ఉంది.దేన్నయినా మరింత భారంగా చెప్పడానికి పోలిక ఒక మాధ్యమం.దీని ఉపయోగాన్ని.ఉనికిని,రూపాలని కవితలో వ్యక్తం చేస్తారు.

"పోలిక ఒక ఉపగ్రహం/ఆత్మ ప్రదక్షణం చేస్తూ/భూగోళం చుట్టూ తిరుగుతుంది"ఇది ఉనికిని చెప్పే వాక్యం.పోలికలకు ఎక్కడో వెతకాల్సిందిలేదు.ఈ భూమిపైనే ఉన్నది.

"సకాలానికి అస్తమించే సూర్యుడిని గుర్తుచేసుకోకపోతే/చీకటి బాహువుల్లో క్షణ క్షణం/వెలుగులజల పొంగేదెట్లా?"పోలిక యొక్క విస్తృత రూపాన్ని అనేకకోణాల్లో పరిచయంచేస్తారు.అనేకాంశాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

"పోలిక ఓ విశ్వజనీన మాధ్యమం/
పోలిక దృశ్యా దృశ్యాల మధ్య పూల వారధి/
పోలిక వేదిక కొక ఆహార్యం మార్చుకునే నర్తకి/
రుతువుకొక రాగం పలికించే విచిత్ర పల్లవి"

లెనిన్ ప్రతిఫలన సిద్దాంతాన్ని (reflection theory)ప్రతిపాదించాడు.ఒక అంశంపై అనేక అంశాల ప్రతిఫలనం ఉంటుంది.నిర్మాణంలో వస్తువు ఉనికిని,అది విస్తృతమైన రీతిని అందులోని వాక్యాలే చెబుతాయి.శైలిలో వేగంతోపాటు సరళంగా కనిపించే వాక్యాల మధ్యన పేర్చిన సమాస బంధాలు కూడా ఈవేగాన్ని పెంచాయి.

"అశ్రు దరహాస తటిల్లత"
"నిక్షిప్త దరహాస మధురిమ"
"అనంత నీరవ నీరధి"-అలాంటివే..

బుద్ది అనేదానికి ఙ్ఞానం ప్రధాన ఆకరం.ఈ ఙ్ఞానంలో ప్రతిఫలనాలు అనేకం .బుద్దిజీవులు సూక్ష్మం నుంచి అనంతం లోనికి ప్రయాణం చేస్తారు.ఈ కవిత అలాంటిదే.
మంచికవితని అందించినందుకు పెన్నాశివరామ కృష్ణ గారికి,మనకు పునః పరిచయం చేసినందుకు యాకూబ్ గారికి ధన్యవాదాలు.

6.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

శివసాగర్ కవిత-నడుస్తున్న చరిత్ర


       
తెలుగు నేలమీద సోషలిస్టుపార్టీల ఆవిర్భావం తరువాత ఆ తాలూకు తాత్వికతలు,దృక్పథాలు అనేక అంశాలపై ప్రతిఫలించాయి.ఆ మార్గంలో ప్రత్యేక సాహిత్య మార్గాలు కూడావచ్చాయి.మార్క్సిస్ట్ సాహిత్య విమర్శనాపద్దతులు పాదుకొనడానికీ ఊతమిచ్చాయనటం కూడా అతిశయోక్తికాదేమో..బహుశఃఅభ్యుదయవాదం నుంచి అనంతర ప్రజా ఉద్యమ ధోరణులలో కూడా ఈ వాస్తవికత ప్రభావాన్ని కాదనలేం.

విమర్శలోనూ ఈమార్గంలో సవిమర్శక వాస్తవికత(Critical Realism)సామ్యవాద వాస్తవికత(Socialist Realism)అనే రెండు పదాలు కనిపిస్తాయి.మొదటిది-సమాజంలోని వ్యత్యాసాలను,వైరుధ్యాలను గుర్తించి,చిత్రించే ప్రయత్నం చేసింది.రెండవది సవిమర్శకవాస్తవికత కన్న ముందడుగు వేసి మార్క్సిస్ట్,లెనినిస్ట్ సిద్ధాంతాల ద్వారా-విప్లవం ద్వారానే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మింది.

ఇందుకోసం సోషలిస్టు వాస్తవికత ఓ తాత్విక ధారని సృష్టించింది.ఇందులో కొన్ని ప్రధాన అంశాలని గుర్తించవచ్చు.
1.విషయాలను పైపైన చూడటంగాక వాటికారణాలనూ అర్థంచేసుకోవడం మొదలుపెట్టింది.
2.ప్రతి అంశాలూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయని అభివృద్ధికి వర్గాలమధ్య సంఘర్షణ తప్పదని నమ్మింది.
3. పీడిత ప్రజల పక్షపాతంతో వారిలో చైతన్య సాధన ,నూతన సమ సమాజ స్థాపనకోసం ప్రయత్నించింది.

శివసాగర్ కవిత్వంలో రెండు తాత్విక ధారలు ప్రధానంగా కనిపిస్తాయి.అవి వైప్లవిక ,దళిత ఉద్యమాలు.ఈ రెంటికీ దగ్గరగా ఉన్నదే సోషలిస్టు వాస్తవికత.నిజానికి దళిత సాహిత్యానికి ఓ మేనిఫెస్టో లాంటి నిర్మాణ దార్శనికతనిచ్చిన కవిత శివసాగర్ ది.శంబూకుడు,ఏకలవ్యుడు మొదలైన పాత్రలని దళిత ప్రతీకలుగా అందించిన కవిత"నడుస్తున్న చరిత్ర". ఇప్పటికీ దళిత సాహిత్యాన్ని అంచనా కట్టడానికి శివసాగర్ కవిత సాహిత్య ప్రమాణం(Litarary Criterion).

"శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో/
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్దలితో నరుకుతున్నాడు"

"మనువు కళ్లలో సూదులు గుచ్చుకుని
నాలుక తెగ్గోసుకుని/చెవిలో సీసంపోసుకుని/
స్మశానంలో దొర్లుతున్నాడు"

వాద నిర్మాణంలోప్రాతిపదికగా మూడు సమీకరణలున్నాయి.ఇవి వాటి గమనాన్ని నిర్దేశిస్తాయి.1.స్వీయ అస్తిత్వోద్దీపన 2.తిరస్కారం 3.ధిక్కారం.ధిక్కార దశలోనే వాక్యాల్లో ప్రతీకార స్వరం వినిపిస్తుంది.ప్రతీకార,సంఘర్షణల్లోనే చరిత్ర పునర్నిర్మాణమౌతుంది.ఈ స్వరం ఈ కవితలోని అన్ని వాక్యాల్లో కనిపిస్తుంది.

శివసాగర్ తరువాతి కాలం శంబూకున్ని,ఏకలవ్యున్ని దళితప్రతీకలుగా అనేకసార్లు చిత్రించింది.బలిని తక్కువే.శివసాగర్ తరువాత కవిత్వం కర్ణుడిని కూడ ప్రతీకగా పరిచయం చేసింది కానీ ఈప్రతీకను కూడ తరువాతి కాలాల్లో కొనసాగించినట్లు కనిపించదు.ఈ మార్గంలోనే ఎండ్లూరి సుధాకర్"గోసంగిని"పరిచయంచేసారు.

జాషువా గబ్బిలం దళిత వాదానికి ఒక స్పృహని ఇచ్చివెళితే శివసాగర్ దానికి ఒక చైతన్యాన్ని దార్శనిక అస్తిత్వాన్ని చారిత్రక దృష్టిని ఇచ్చారు.

సాహిత్య చరిత్రకు ప్రధాన ఆకరమైన ఈకవితను పునఃపరిచయం చేసినందుకు కపిల రాంకుమార్ గారికి ధన్యవాదాలు.

7.8.2013







                                                                                                            _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



 





తెలుగులో1980 కి ఈవలిదశనుంచి సాహిత్యంలో స్త్రీవాదం ఒకటి కనిపిస్తుంది.60 కాలాలల్లోనే అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ వంటి దేశాలలో వీటి జాడలున్నాయని విశ్లేషకుల మాట.దీనిని ఆనుకొని ఒకవిమర్శాపద్దతికూడా ఉన్నప్పటికి దీని క్రమ వికాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.

తొలి దశల్లో ఆర్థిక ,సామాజిక,సాంస్కృతిక అసమానతలపై దృష్టి పెట్టిన స్త్రీవాదం ఇప్పుడు మానవీయ విలువలతో జీవితాన్ని చిత్రిస్తూ కొత్త కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తొంది.


సంస్కృతంలో శ్రీనివాస రథ్ అనే పండితుడు "తదేవ గగనం సైవ ధరా"అనే సంపుటిని ప్రచురించారు.అందులో ఓ చోట"శాస్త్రగతా పరిభాషాధీతా గీతామృతకణికాపి నిపీతా,కో జానీతే తథాపి భీతా కేన హేతునా విలపతి సీతా"(విఙ్ఞాన శాస్త్రాలలో వృద్దిని సాదించాం,భగవద్గీతను కొత్తగా అర్థం చేసుకో గలిగాంగాని ఇప్పటికీ సీత(స్త్రీ)ఎందుకు దుఃఖిస్తుందో ఎవరికి తెలుసు)అన్నాడు.

సాంకేతిక పురోగతిని అభివృద్దిగా చెప్పుకుంటున్న సందర్భంలో నైతికంగా ఎలా మానవీయ విలువలని కోల్పోయామో ఈ వాక్యాలు చెబుతాయి.

జ్యోతిర్మయి మళ్ల గారికవిత కూడాఇలాంటిదే..ఆధునిక దశలో సాహిత్యం మనోవైఙ్ఞానికాంశాలమీద దృష్టిపెట్టింది.ఈక్రమంలో జ్యోతిర్మయిగారు రెండు పాత్రల మనస్సులను,అందులో ఒకేపదంపై స్వభావగతంగా ఉండే భావనలనుదర్శించి కవిత్వీకరంచడం కనిపిస్తుంది.కవిత్వంలో పెద్దగా కళ.దర్శనం,వర్ణనలాంటివి లేక పోయినా ఈ కవిత సిద్దాంత ధర్మాన్ని మోసింది.

స్వభావగతంగా వ్యక్తులు,వర్గాల మధ్య వచ్చే అర్థ వైరుధ్యాలను"విపరిణామం"గాచెబుతారు.ఈస్పృహతో స్వభావాలని,దాన్నించి జెండర్ వర్గాన్ని నిర్వచించే ప్రయత్నం చేసారిందులో.

"కొంటె కళ్లతో ఆమె
చంపేయ్ నీచేతుల్లో చచ్చి పోవటం నాభాగ్యం
అతని గుండెలపై వాలి పోయింది"

"ఏమన్నా చేసుకో/నా అణువణువూ నీదేగా/
కళ్లు మూసుకుంది/-/ఆ కళ్లు అప్పుడే మూసుకు పోయాయి శాశ్వతంగా/"-చంపటం అనేపదం చుట్టూ రెండు దృశ్యాలను చిత్రించి ఈకవితను సాధించారు.

జెండర్ వైరుధ్యాలను ప్రాతిపదిక స్థాయినుండి కొన సాగించినట్టుగాకాక ఓకొత్తచూపు,ఆవిష్కరణ కనిపిస్తాయి.ఇందులోని స్త్రీ గొంతుక వాదతాత్వికతని కూర్చుకున్నా మానవీయ అన్వేషణ కనిపిస్తుంది.

నిర్మాణం,వాక్య రచన,అభివ్యక్తి విషయంలో ఈకవిత సౌష్టవంగాఉంది.మంచికవిత అందించినందుకు జ్యోతిర్మయి గారికి అభినందనలు.మరింత మంచి రచనలతో ముందుకువెళ్లాలని ఆశిద్దాం.

8.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ







సాహిత్యంలో మనస్సుకు,అందులోని వాతవరణానికివిలువ హెచ్చిన తరువాత కవిత్వ మార్గాలు అనేకంగవచ్చాయి.ఇవన్నీ అభివ్యక్తి మార్గాలను బలపరిచాయి.అస్పష్టత అన్న నిందకూడా కవిత్వం అప్పటినుండే మోయటం మొదలు పెట్టింది.

ఎం.ఎస్.నాయుడుగారి కవితలో "స్వాపము"అనే పదం ఒకటి ఈకవితలోకి మార్గాన్ని తెరుస్తుంది.స్వాపం-అనే పదానికి కల,పడుకోటం,నిద్ర,అఙ్ఞానం అనేఅర్థాలున్నాయి.ఇందులో గమనించాల్సింది ఇవన్నీ భౌతికాతీతాలు.

కలలు వాటికవేవస్తాయని చాలావరకు విశ్వసిస్తున్న క్రమంలో వైఙ్ఞానిక శాస్త్రంలో కొన్ని అంశాలు కనిపిస్తాయి.పూర్వం గ్రీకుల్లో అభిలషిత స్వప్నం(disired dreems)పొందే విధానం ఉండేది.ఈక్రమంలో "పొదుగుడు"(Incubetion)కేంద్రాలు వుండేవి.ఒక విషయం పై దృష్టిఉంచి,అదే వాతావరణంలో నిద్రించి స్వప్నాలనుపొందటం ఈసాధనలోని అంశాలు.ఈ కలల్ని తనకుండే ఉద్వేగ,ఉత్సాహ,ఉద్రేకాలమేరకే పొందుతాడు.సృజన కూడా అలాంటిదే.

అరిస్టాటిల్ గురువైన ప్లేటో స్వప్నంలో ఔద్వేగికాంశాన్ని (Exaitment particular)గురించి చెప్పాడుఈ సమయంలోనే మనిషిలో ఉండే వివిధ ప్రవృత్తులగురించి చర్చించాడు.థామస్ హబ్స్"అంతరంగావయవాల తాపం "(Distemper of inner parts)స్వప్నానికి మూలం అని అన్నాడు.ఫ్రాయిడ్ "స్వప్నార్థ వివరణ"(Interpredetionof dreams)వచ్చినతరువాత ఈఅధ్యయనానికి ఒక శకం మొదలైంది.

భౌతిక వాంఛలు స్వప్నాలయ్యేతీరుని,వాటి క్రమాన్ని గురించి కవిత్వీకరించడం కనిపిస్తుంది.మనస్సు ఏ మార్గంలో వెలుతున్న దనేది అంచనా వేయలేం.కవిలోని కవితాస్ఫూర్తి అందుకు కొంత అవకాశమిస్తుంది.నాయుడు గారి మొదటి వాక్యం ఓ భౌతిక క్రమాన్నించి జారుకునే అంశాన్ని చెబుతుంది.

"ఉత్త పెదాల్నే కడుక్కొనివొస్తాను
పెదాల్ని అక్కడే వదిలి"

"కాస్త నిరాకరించే పెదాలు
ఎప్పటికీలేని మౌనంలో"

సృజనసంబంధ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు 'పెదాలు 'పై విషయాలను చెక్కే భౌతికాంశాలు.వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని గురించి కాకపోయినా సృజనకి వెనుక ఉండే కొన్ని అంశాలగురించి మాట్లాడారు.భ్రాంతి(Illussion)విభ్రమం(Hallucinetion)సంభ్రాంతి-మనోవిక్షిప్తి(Paranoid)సమ్మోహనిద్ర(Hypnosis)బహు మూర్తిమత్వం(Multi personaality) ఈ అంశాలు సాహిత్యంలో అనేకంగా కనిపిస్తాయి.

నాయుడుగారి పైవాక్యాల్లో ఈమనో విక్షిప్తి ఉంది.ఎ కవితలో కనిపించే ఓ కళాత్మకానుక్రమణం(Artistic succession)ఉంది."వేళ్లు-వృక్షాలు"అందుకు ఉదాహరణ.హొతికాంసాలలో ఒక క్రమం ఉన్నట్టు మానసికాంశాలలోనూ ఉంటుంది.లేదా సృజనదశలో అలా పేరుస్తారు.

మాలినోవిస్కీ స్వప్నాలను 1.(వైయ్యక్తిక)స్వేచ్చా స్వప్నాలు 2.అధికారిక స్వప్నాలు అనివిభజించాడు.వ్యక్తి జీవిత ప్రభావంతో అతని ఇష్టంతో సంబంధంలేకుండాంతర్గత శ్క్తులు మలచగ పుట్టింది మొదటిది.శుభాశుభాలను నిర్ణయించుకొని తనకోరికల మేరకు పుట్టింది రెండవది.కవులు,సృజనకారులు బహుశః రెండవ కోవకు చెందుతారు.తెలుగులో వీటిని అర్థం చేసుకోడానికి తగిన ఆకరాలు లేవనేచెప్పాలి.ఇదిసమకూరాలనికోరుకుందాం.నాయుడుగారికి అభినందనలు

9.8.2013



                                                                                                                 ____________ఎం.నారాయణ శర్మ