పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ

కరణం లుగేంద్ర పిళ్ళై -బతుకడమంటే
 


సాధారణంగా వర్ణనలో వాక్యాలని రాస్తాం ఈవాక్యాలలో రాసేపద్దతిని బట్టి కొన్ని నమూనాలున్నాయి.ఈ వాక్యాల్లో ప్రశ్నావాక్యాలు,పదసమ్మేళనం లాంటి కొన్ని మార్గాలున్నాయి.ఇందులో సాధారణంగా ఉండే వాక్యాలూ కొన్ని ఉన్నాయి.ఇలాంటివాక్యాలు అంశాన్ని చేరవేయడానికి వాహకాల్లాంటివి.

రెండువాక్యాలని ఒక యూనిట్ గా రాయటమో,రెండుచిన్న వాక్యాలని సమ్యుక్తం చేసిరాయటమో చేస్తాం.ఇలాచేస్తున్నప్పుడు వాక్యాల్లో కొన్ని అంశాలని గమనించవచ్చు.1.ఆఖ్యానం (Neretion)మరొకటి వ్యాఖ్యానం(Comment)ఒక సంధర్భాన్ని,అంశాన్ని కవిత్వీకరిస్తున్నప్పుడు ఈ రెండురకాల వాక్యాలు సర్వ సాధారణంగా కనిపిస్తాయి.

ఆఖ్యానం వస్తువునుగూర్చి చెబితే వ్యాఖ్యానం మన దర్శనంలోని విషయాన్ని చెబుతాయి.ఈరెండిటిలోనూ ఒకదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని నిర్వచనం(Definetion)అంటారు.ఈ నిర్వచనం సంక్షిప్తంగా ఉంటుంది సాధారణంగా.కాని వస్తువునుబట్టి సంగ్రంగా చెప్పాలనుకున్నప్పుడు దీనినిడివి ఎక్కువ అవుతుంది.

పూర్వంలో నీతిశాస్త్రం మొదలుకొని కవిత్వంలో ఇలాంటి వాక్యాలు చెప్పటం మొదలైంది.అంటే ఏమిటి?లాంటివాటికి ఇవి సమాధానాన్నిచెప్పేవి.లుగేంద్ర పిళ్లై"బతుకడమంటే "లో ఈ రకమైన వాక్యాలున్నాయి.జీవితాన్ని అనేకమైన అంశాలనించి కొలవడం ఇందులో కనిపిస్తుంది.వర్ణనలో ఇది సాధారణమే కాని ఇక్కడ పిళ్ళై ఒక వస్తువుచుట్టూ ఈ నిర్వచనాలని నిర్మించారు.

"ఆలోచనల సుడిగాలి
వీచినప్పుడు కొట్టుకుపోని/ఏకాంత ధ్యానమై నిలవాలి"

"భాద్యతల బండరాయి
నిశ్శబ్దాన్ని బద్దలు చేసినప్పుడు/చెదరని సరోవరమై నవ్వాలి"

ఈవాక్యాలన్ని జీవితాన్ని కూడ దీసుకునే బలాన్ని ఇవ్వడానికి నిర్వచిస్తున్నాయి.స్థిరత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి.ఇందులో కనిపించే"ధ్యానం,సరోవరం,విత్తనం,శంఖారవం'అలాంటి అంశాలని సూచిస్తున్నాయి.

"మూగ గొంతు పలికే/పాటకు గొంతుక కావాలి
చెవిటి గుండెకూ వినబడే/చైతన్య శంఖారావమవ్వాలి"

"బతుకంటే జీవిస్తూ/మరణించడం కాదు
బతుకడమంటే/మరణిస్తూ జీవించడమవ్వాలి"

చివరివాక్యాన్ని పైవాక్యాలన్ని విడమర్చి చర్చిస్తాయి.చివరివాక్యపు సమగ్రతకోసం ఇలాంటివి అనేకమందిలో కనిపిస్తాయి.లుగేంద్రపిళ్ళై గారికి వస్తువును వర్ణించే అనుక్రం అర్థమైంది.వాక్యాలు కొన్నిసార్లు నినాదాల్లా కనిపిస్తాయి.కొంత కళాత్మకతను పెనవేసుకుంటే వాక్యాలకు ఆ నిర్దిష్టత చేరుతుంది.సమగ్రనిర్వచనాన్ని చెప్పుకోవడానికి ఈ కవిత మంచి ఉదహరణ.అభినందనలు కరణం లుగేంద్ర పిళ్ళై గారు.
 
                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ
 

కవిత్వ విశ్లేషణ

కపిల రాంకుమార్ కవిత : కవిత్వానికి మానిఫెస్టో



కొన్నళ్ల తరువాతకావొచ్చు,తొలిదశలోనే కావొచ్చు కవులకు కవిత్వం మీదా,ఆయా రచనల మీదా,ప్రక్రియల మీదా,వస్తువుల మీద కొన్ని అభిప్రాయాలుకలుగుతాయి.నిజానికి ఇవ్వే కొన్ని సార్లు తరువాతి కాలాలకు మార్గదర్శకమౌతాయికూడా.శ్రీశ్రీ "కవితాఓ కవితా".లాంటి కవితలు అలాంటివే.

ప్రాచీన కావ్యంలో కావ్య"ముఖం"పేరుతో అవతారిక ఒకటి ఉండేది.కవులు అలాంటి వాటిలోనే తమతమ అభిప్రాయాలు చెప్పేవారు.ఈ కాలంలో కూడా కవిత్వం ఇలా ఉండాలి అంటూ ఒకటో ,అరో కవితావాక్యాలు రాయనివారుండరు.

కపిల రాంకుమార్ గారు అలాంటి అంశాన్నే కవిత్వం చేసారు.ఇందులో రాంకుమార్ కొంత పూర్వుల మాటలకు విలువనిచ్చి మాట్లాడినట్టు కనిపిస్తారు.సినారే ఒక పద్యంలో "అంత కడివెడు పాలపై ఒకింత మీగడపేరినట్లు మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"అన్నారు.పాతనించి మిగుల్చుకునేది ఎంతో కొంత ఉంటుంది.

"జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ/పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!"

సాధరణంగా కనిపించినా ఈవాక్యాల వెనుక ఓ నేపథ్యముంది.ఈ మాటల వెనుక పరోక్షంగా ప్రాచీన సాహిత్యాధ్యయనాన్ని గూర్చి చెబుతున్నారు.

"అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!"

ఒక వాక్యాన్ని కళాత్మకంగ,ఆలంకరికంగా ఎలాచెప్పాలో తెలియడానికి అధ్యయనం చాలా అవసరం.పురాణాలల్లోనూ ప్రతీకలని పట్టుకోడానికి మార్గాలున్నాయంటున్నారు.నిజమే. బోదెలార్ సుసన్నా లాంటి పాశ్చాత్యులుకూడా వారిపుస్తకాలలో పురుషోత్తముడిలాంటివారిగురించి చెప్పుకున్నారంటారు.ఈ అధ్యయనం ఏ కాలానికైనా చాలావసరమే కదా.

"కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!"
చదివించే లక్షణం (Reedability)ఒకటి కవితకి చాల అవసరం.ఆనడక వెంటే పాఠకుడు పరిగెడతాడు.

"ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే/తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా/హృదయస్పందన కలిగించేలా"

పాల్ వాలరీ"కవిత్వం మేధకు కాదు హృదయానికి చేరాలి" అన్నాడు.అధ్యయనం వల్ల ఇవన్నీ పెద్దగా కష్ట పడకుండానే అలవడుతాయి.కవిత్వం ఎలా ఉన్న బిగుతుగా ,ప్రౌఢభాషతో ఎలావున్నా కవిత్వం లో కవిత్వం కనిపించాలని అంటారు.

చాలావరకు అందరికీ కవిత్వం ఎందుకురాస్తున్నామో అర్థం కాదు.పడికట్టు పదాలతో కవిత్వాన్ని నిలుపుకోలేము.వస్తువూ ఎక్కువకాలం నిలుపదు.కవిత్వమే కావాలి.అందుకోసం హృదయాన్ని ఆవిష్కరించే నేర్పుకావాలి.అందుకు అధ్యయనం, సాధన కావాలి.ఈ రెంటి గురించే రాంకుమార్ గారి కవిత మనకు సూచన లిచ్చింది.ధన్యవాదాలు రాం కుమార్ గారు మంచికవిత.
                                                                                                                                               _____________________ఎం.నారాయణ శర్మ