పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

MAMIDI HARIKRISHNA || మూడు సంగమాలు||

 

Prologue
గంధం.. కుందనం..
పేర్లు వినడం- కవిత్వంలో రాయడమే..
కానీ ఇన్నాళ్ళకి-
ఆ రెండూ కలిసి ఒకే సారి
నా ఎదుట ప్రత్యక్షం అయ్యాయి..

రోడ్డు వారగా నిన్ను చూడగానే
నిలువెల్లా గంధం పూసిన కుందనపు బొమ్మే
అక్కడ నిల్చుందేమో అనుకున్నా..
గాలి లోకి అలవోకగా నువ్వు విసిరిన చిరునవ్వుల పరిమళాన్ని
ఆత్మీయంగా దోసిలిలో పట్టి
నీ వెంట నడవడాన్ని అపురూపంగా అనుభవించా..
*** *** ***
Intro
మలుపుల దారులను దాటేసి
గదిలోకి వస్తావు
మదిలోని ఆనకట్టల్ని తెంచేస్తావు
నోటితో యాపిల్ పండుని - కళ్ళతో నీ ఒంటి సొంపులని తింటూ ఉంటాను
మధ్య మధ్య చేతుల స్పూన్లతో
నీ నడుం మడతల్ని నంజుకుంటూ ఉంటాను..
ఆకాశమంత సిగ్గుతో- నక్షత్రమంత సంభ్రమంతో
విరగ కాసిన చెట్టంతటి భారంతో
నువ్వు కన్రేప్పలను వాల్చేస్తావు..
*** **** ***
Pre-Journey
యుగాల నాటి అన్వేషణ సరికొత్తగా మొదలవుతుంది
మాటలు- ద్రుశ్యాలవుతాయ్
చేతులు- సంభాషణ మొదలెడతాయ్
పెదాలు- అదృశ్య వర్ణ చిత్రాలవుతాయ్
చూపులు- సౌందర్య వర్షం లో కాగితపు పడవలవుతాయ్
*** **** ****
సరిగ్గా అప్పుడే-
నేను ఓ బౌద్ధ సన్యాసిలా
జీవన్ముక్తి యాత్రకు తొలి అడుగు వేస్తాను
నీ "వంటి " ఇంట్లోని గది గదికీ వెళ్లి
భిక్షాటన అడుగుతుంటాను ..
ఏ గదినీ వదలడం ఇష్టం లేదేమో-
దేహపు ఇల్లంతా కలియ తిరుగుతూ ఉంటాను
మధ్య మధ్య-
తీయని చెలమ నీటిని గుటక వేసి
పునర్ జీవాన్ని పొందుతాను
చేతి వేళ్ళ పెనవేతలో
ఊపిరిని నిలబెట్టుకుంటూ ఉంటాను ..
*** **** ***
Journey
ఏ లోక కల్యాణం కోసమో అన్నట్లుగా
పూజ ఆరంభం అవుతుంది

ఒక గదిలో
చుంబనాల దండకం చదువుతాను
మరో గదిలో
కౌగిలింతల స్తోత్రం చేస్తాను
ఇంకో గదిలో
కర స్పర్శల హారతి పడతాను
వేరొక గదిలో
దంత-నఖ క్షతాల కీర్తన పాడతాను
మరొక గదిలో
నాలుక కుంచెతో
వీపు నేలపై ముగ్గులు వేస్తాను
ఇంకో గదిలో
ఖర్జూరాలు పొదిగిన డమరు ద్వయాన్ని
చేతుల్లోకి తీసుకుని లాలన గా భజన చేస్తాను..

దేశ ద్రిమ్మరిని కదా
ఒక్క చోటే ఆగిపోలేను
మరో గదిలోకి ప్రవేశిస్తాను-
అక్కడంతా మైదానం..
మైదానం మధ్య ఓ దిగుడు బావి
బావి చరియల చుట్టూ ప్రదక్షిణలు చేసి
అందులో మూడు మునకలేస్తాను

ఇక చివరి గదిలోకి మాత్రం-
అత్యంత భక్తీ శ్రద్ధలతో ప్రవేశిస్తాను
ఎదురుగా తెరుచుకుని ఉన్న వ్యాస పీఠం-
అందులో ఓ అద్భుత కావ్యం
సున్నితంగా తడుముతూ దానిలోని పేజీలని
నెమ్మదిగా ఒక్కొక్కటే చదవడం మొదలెడతాను

కావ్య పథనం -
మంద్ర నాదంగా మొదలై మర్మ ఉచ్చారణ గా
తీపి మూలుగుగా రూపాంతరం చెందుతుంది..
పీఠం లో ప్రకంపనాలు
పేజీలు తిప్పడం లో వేగం
అక్షరాలూ- వాక్యాల వెంట పరుగు ఊపందుకుంటుంది
పుస్తకానికి నాకు మధ్య అంతరం చెరిగి పోతుంది

ఇప్పుడు పుస్తకమే-
నన్ను చదవడం ఆరంభిస్తుంది
నేనేమో నా సహజ కలాన్నిఒడిసి పట్టి
పుస్తకంలో లిఖిస్తూ ఉంటాను
కొత్త రచన శ్రీకారం చుట్టుకుంటుంది
అద్వైతం సారవంతం అవుతుంది
మంచు ఖండం బద్దలై రస గంగ పెల్లుబుకుతుంది
పుస్తకం ప్రతి పేజీలోనూ ఎగజిమ్మిన సిరా చుక్కలు అన్నీ కలిసి
నవ నవోన్మేశ పద్యం రెక్కలు విదిల్చి ఎగురుతుంది..
*** *** ***
Destination

కొత్త కావ్యంలో
మొత్తం మూడు అధ్యాయాలు-
దేహ సంగమం
మనో సంగమం
ఆత్మ సంగమం

జయ మంగళం- నిత్య శుభ మంగళం
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతి
*** *** ***
ప్రియా
ఇపుడిక నాలుగో అధ్యాయం రాయాలి..
రా..!
 
1st Sept,2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి