పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

బాలసుధాకర్ మౌళి కవిత-అతడు ఈదేశానికి వెన్నెముక





భావకవిత్వం,అనుభూతి కవిత్వంలో లక్షం ఆనందం అని చెప్పుకున్నాం.ఈ లక్షం ప్రయోజన వంతంగా ఉండాలని భావించిన కవితాశైలి మార్క్సిస్ట్ కవితారీతి(maarxist poetical tredition).నిజానికి ఇది కవితను చూచే రీతినించి పుట్టింది.చెప్పే అంశాన్ని కాకుండా చెప్పే పద్దతిని ఎక్కువగా పట్టించుకోలేదని తొలిదశలో విమర్శలున్నాయి

తరువాతికాలాల్లో వచ్చిన మార్క్సిస్ట్ సాహిత్యం ఈరెంటినీ అన్వేషించి కవిత్వానికి అవసరం మేరకు కళ కావాలని భావించింది.ఈక్రమంలోనే మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది.తెలుగులో డా.బి.సూర్య సాగర్ రచన"సాహిత్యం సౌందర్యం"ఈదశని స్థూలంగా పరిచయం చేసింది.

తెలుగులో ఈపద్ధతిని మాధ్యమంగా చేసుకుని విమర్శలో కొన్ని పదాలు కనిపిస్తాయి శ్రామిక వర్గ సంస్కృతి(Prelet cilt)-1917 నాటికి కమ్యూనిస్ట్ పార్టీలు ఈపదాన్ని తెచ్చాయి.పెట్టుబడీ దారీ ప్రభావాన్ని తిరస్కరించే విషయంలో ఈపదం ఉనికి కనిపిస్తింది.ఈ క్రమం లోనే ఉపయోగ్య కవిత్వం(Applied poetry)కనిపిస్తుంది.ఇదిశ్రామిక జీవన సమస్యలూ,రాజకీయ ,సామాజిక ,ఆర్థిక సమస్యలని గురించి రాసేకవిత.

బాల సుధాకర్ మౌళి కవిత "అతడు ఈదేశానికి వెన్నెముక"ఈ రకమైన సంస్కృతిని ప్రదర్శించింది.నిజానికి ఈకవితలో కావావలసినంత కళాత్మకత ఉంది.అంతే దృక్పథమూ కనిపిస్తుంది.అందుకు ఆధునికంగా కవితానిర్మాణంలో కనిపించే విభాగలుగా ఉండే శైలినొకదాన్ని ఎన్నుకున్నారు.

నాలుగు అంశాలలో మొదటిదాన్లో రైతు స్థితి
2లో స్వభావం3లొ పెట్టుబడిదారీ తిరస్కారం4లోపై లక్షణాలని సమీకృతం చేసారు.ఈ నిర్మాణం వెనుక కవి సాధన కనిపిస్తుంది.

ఇందులో కవి సృష్టించిన వాతవరణం ,అందులోని తీవ్రత,స్వరం అన్నిటిలోనూ తౌల్యత కనిపిస్తుంది.వాతావరణాన్ని చిత్రించ డానికి అనేకమైన భావ చిత్రాలు నిర్మించారు.

"అతని ఆకలి కడుపులో/పాముల తుట్ట
కదలక మెదలక నిద్రిస్తుంటుంది/అతని కళ్ల కుంపట్లలో
నిప్పుల సెగ/అడుగునెక్కడో అణిగి ఉంటుంది"

"అతని దేహశిలపై/సూర్యుడు సూదులకిరణాలతో
చెమటబొమ్మలను చెక్కుతుంటాడు/ఒక్కో బొమ్మా
పొలం కొలువులో చేరి/ఒక్కో వసంతమై పూస్తుంది"

ఇలాంటి భావచిత్రాలలోనూ కొంత శ్రామిక సంస్కృతి తళుక్కు మంటుంది."చెమట బొమ్మలు""ఆకలి కడుపు"వంటివ అందుకు ఉదాహరణలు."సూదుల కిరణాలతో చెమట బొమ్మలు చెక్కడం""వసంతమై పూయడం"కళకు అద్దం పడుతాయి.అంతే తీవ్రత ఉన్న స్వరమూ కొన్ని వాక్యాలలో ఉంది.


"అతని 'చేను ఆడబిడ్డల'పై/గుంటనక్కై కన్నేస్తాడొకడు
అతని 'పొలం ఇంటి'పై/ఒడ్డీ జెర్రెలనొదులుతాడొకడు
అతన్ని అధైర్యం ఉరితాడుపైకి/అశాంతి చేతులతో నెడతాడొకడు"



"పొలాన్ని శవం చేసి/పీక్కు తినాలనుకునే/
'రావణ గెద్దల అహంకారాని'కి
చెమటపూల మొక్కలతోనే/సమాధానం చెబుతాడతడు"


ఈ వాక్యాలల్లో దృక్పథం కనిపిస్తుంది.రైతు ఆత్మ హత్యదాకా వాతావరణాన్ని తీసుకెళ్లి స్ఫూర్తి దాయకమైన ముగింపునిచ్చారు.

మంచి కవితనందించారు బాల సుధాకర్ మౌళి.తెలుగులో రైతుల గురించిన సాహిత్యం వచ్చింది.వానమామలై జగన్నాథాచార్యులు "రైతు రామాయణాన్ని" రాసారు.దీనిపై డా.డింగరి నరహరి ఆచార్య పరిశోధన కూడా వచ్చింది.రైతాంగ పోరాట పాటలూవచ్చాయి.వచన కవితకు సంబంధించి"దర్భశయనం శ్రీనివాసా చార్య" వంటివారు ఇలాంటి కవితలు రాసారు.భాషా సంబందంగా "వందన కారుడు"వంటి పదాలపై మౌళి గారు పునరాలోచన చేస్తేబాగుంటుందనిపిస్తుంది.మంచి కవిత అందించినందుకు బాల సుధాకర్ మౌళి గారికి అభినందనలు.



                                                                                                


                                                            











                                                                                   ____ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి