పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

సత్యశ్రీనివాస్ -ఏటి మాట




నిన్న కవిసంగమంలో మిత్రులు సత్య శ్రీనివాస్ గారు"ఏటి పాట"అనే కవితని పోస్ట్ చేసారు.ఈకవితనుంచి కళా,సౌందర్యం,ఆధ్యాత్మిక దృష్టి మొదలైన అంశాలని అర్థం చేసుకోవచ్చనిపించింది.

ప్రకృతి సంబంధంగా ఓ వాతావరణంలోకి వెళ్లి కవిత్వం రాస్తున్నప్పుడు కొన్ని అంశాలు గమనించ వచ్చు.ఇప్పటిదాకా వచ్చిన సౌందర్య వివేచన అంచెలంచెలుగావీటిగురించి చర్చించింది.

సౌందర్యం అనేదాన్ని1. వస్తుగత సౌందర్యం 2. ఆత్మగత సౌందర్యం అని విభజించారు.మొదటిది కనిపించే వాటిలోనే సౌందర్యం ఉందని,రెండవది కవి దృష్టివల్ల బయటికొస్తుందని నమ్ముతాయి

"ప్రకృతిలో కనిపించే సౌందర్యం దాన్ని ప్రేరేపించేకన్ను తటస్థపడినప్పుడు అది రెండింతలవుతుంద"ని ఎమర్సన్ అన్నాడు.ఈ విషయానికి కాస్త దగ్గరగా సంజీవదేవ్ ఆత్మాశ్రయానందం(Subjective joy)వస్తాశ్రయపు అందాన్ని(subjective buety)ని అధికం చేస్తుందని అన్నాడు.

ప్రకృతి కవిసృజన లోనే కళగా మారుతుంది తప్ప దానికదిగా కళ కాదన్నది కళావేత్తల అభిప్రాయం.ఈ క్రమానికి సంజీవ దేవ్ ఒక సూత్రాన్ని చెప్పారు.1.భౌతికము 2.తాత్వికము 3.ఆత్మికము మొదతి స్థాయిలో బయటికి కనిపించేదాన్నిన్ చూస్తాడు.రెండవ దశలో దాన్ని తాత్వికంగా ,తనదైన దృష్టితో చూస్తాడు.మూడవ దశలో ఆత్మ దృష్టితో భౌతిక కాంతిని దర్శిస్తాడు..అంటే ఈదశలో నామమాత్రంగానే భౌతికం ఉంటుందని అర్థం.

ఇక్కడే అనుభూతి,ఆత్మకళ గురించి మాత్లాడుకోవాలి. శేషేంద్ర శర్మగారు అనుభూతి అంటే ఇంద్రియానుభూతి మాత్రమేనని అన్నారు."ప్రపంచాన్నంతా తనలోకి వంపుకుని,తనలో చూసుకుని,తననికూడా ఆ వస్తుప్రపంచంలో చూసుకునే"తాదాత్మ్యస్థితిని ఆత్మకళగా ఈశావాస్యోపనిషత్తు చెప్పింది

అతీత మానసిక శక్తి(Super mind)విశాలదృష్టితో సత్యాన్ని దర్శిస్తుందని,దానికోసం అంతఃప్రేరణతోపుట్టిన ఆవేశంతో,భాషతో ఆవిష్కరిస్తుందని-అరవిందులు అతీంద్రియ కవితా సౌందర్యతత్వ దర్శనాన్ని(ovea-head asthetics)భవిష్య కవితా దృక్పథంగా వర్ణించారు.

సత్యశ్రీనివాస్ గారిలో 'ఏరు 'భౌతికం.మొదటి వాక్యంలో భౌతికము,కళాత్మకమూ,ఆధ్యాత్మికమైన ఆవేశాలు కలగలసి ఉంటాయి.భౌతికం నామమాత్రమే.

"నా చివరి కోరిక
ఆకుల సంచిలో నా శవపేటిక కుట్టుకోవాలని
జన్మ జన్మల చావుకిమళ్లీ
పుట్టుకనివ్వాలని
తొలకరి ఆకులకంటిన
మట్టిశ్వాసలా..."

జన్మజన్మలు,మళ్లీ పుట్టుక వంతివి ఆధ్యాత్మికాలు.'తొలకరి ఆకులకంటిన మట్టిశ్వాస 'లో కవి దర్శించిన ఆత్మికసౌందర్యం ఉంది.-రెండవ వాక్యంలో సాయంకాలం లోని ఓ దృశ్యంతో కళాత్మక ఊహ చేస్తారు.ఇది ఓ బొమ్మ గీసినట్టుగా వుంటుంది.

"అకులకి అటూ ఇటూ/సూర్యుడు/చంద్రుడు
నిదురించే నాకళ్లలోని/చీకటిచూపులధూళివెలుగునుండి/ఆవిష్కరిస్తున్న వైతరణీనది పల్లకి బొయీల్లా.."

నిదురించేకళ్లు,చీకటిచూపులు,ధూళి వెలుగులవల్ల తానున్న,అనుభవిస్తున్న స్థితి -వైతరణీనది అనదంలో సన్నివేశం స్ఫురిస్తాయి.పల్లకి వెళ్లి పొయినా బొయీల పాటవినిపించడం స్మృతిధార.

" ఈ కలయిక/ఆత్మ/సమయం/దేహం/
అందుకె.సూర్యాస్తమయానికి ముందేదహనసంస్కారాలు చేయాలేమో/అదీ ఏటి ఒడ్దున"

ఏటి ఒడ్డునుంచి ఆత్మిక దృష్టితో చేసిన ప్రయొగంలాంతిది ఈ కవిత.దహన సంస్కారాలు,ఆత్మ,దేహం,వైతరిణీనది ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితాన్నేఅయినా ఇవి వెలిగక్కేది మరణానతరజీవితమే.

చాలావరకు కవుల్లో కవిత్వీకరణకు కొన్ని అంశాలుంటాయి.ఇస్మాయిల్ గారికి 'చెట్టు 'లాగా..ప్రాచెన కాలం లోనూ"ఆతపత్ర భార్గవి""దీపశిఖా కాళిదాసు"లాంటివి చాలా ప్రచారంలో ఉండేవి.శ్రీనివాస్ గారికవిత్వం తో ఉన్న మితమైన,కొద్దిపాటి పరిచయంతో నాక్కూడా ఆయనలో"పచ్చని ఆకులు"ఆ మార్గం లోకనిపిస్తున్నాయి.


                                                                                                         

                                                                                        _____ఎం.నారాయణ శర్మ(28.07.2013)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి