పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

స్వాతీ శ్రీపాద గారి కవిత: నదులూ,స్వప్నాలూ




ఒక అంశాన్నో,సందర్భాన్నో ఎన్నుకుని దాన్ని వర్ణిస్తూ రాసే కవిత్వాన్ని వర్ణనాత్మక కవిత్వం(Discriptiv poetry)అంటారు.వర్ణన అత్యంత ప్రధానంగా ఇందులో కనిపిస్తుంది.

స్వాతీ శ్రీపాద అలాంటి వర్ణనతో రెండురూపాలని తీసుకుని రాసిన కవిత"నదులూ..స్వప్నాలు".రెంటిలో ప్రవాహదిశని వర్ణిస్తూ రాసిన కవిత ఇది.ఒకటి ఆరోపభావం అనేది అర్థమయ్యేదే.కాని వర్ణనతో సమర్థనీయమైన గమనాన్ని సాధించారు.

స్వాతీ శ్రీపాదగారి కవితలో గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.వాక్యాలు చాలా పెద్దగా సుమారు ఒక యూనిట్ అంతానిండిపోయేవిగా ఉంటాయి.అయితే ఇవి కొన్ని పొట్టి వాక్యాల సమూహం

"కనురెప్పల తలుపులు మూసినా, తెరిచినా,
ఆల్లి బిల్లిగా అటునుండి ఇటూ, ఇటునుండటూ
ఎగిరే తూనీగల్లా పరుగులు తీసే నదులు
మనసు లోలోపలి పొరల నుండి
మౌన శూన్యాలను దాటి
పరిచిత పలకరింపుల నును వెచ్చని
హృదయసీమ కనుమలలోకి
కాస్త అలవోక గా రాత్రి భుజాలపై వాలే
వెన్నెల రెక్కలా కదలి వెళ్తుంటాయి "-ఇలాంటి వాక్యాలని సాధక వాక్యాలు(Praacteesed sentences)అంటారు.క్రమాన్ని కొంత మార్చి రాయటం.ఇందులో ఒక వాక్యం రెండు వాక్యాల మధ్య సంధాయక సంబంధాన్ని కుదురుస్తుంది.

ఇందులో ఒక వాక్యాన్ని గమనిద్దాం.
"మనసు లోలోపలి పొరల నుండి/మౌన శూన్యాలను దాటి"
ఇది అలాంటి వాక్యమే.ఒక క్రమాన్ని దీన్నుండి అర్థం చేసుకోవచ్చు.
"మనసు లోలోపలి పొరల నుండి/మౌన శూన్యాలను దాటి
కనురెప్పల తలుపులు మూసినా, తెరిచినా,
ఆల్లి బిల్లిగా అటునుండి ఇటూ, ఇటునుండటూ
ఎగిరే తూనీగల్లా పరుగులు తీసే నదులు"
పై వాక్యం మరో వాక్యంతోనూ సంబంధాన్ని కలిగివుంది.

"మనసు లోలోపలి పొరల నుండి
మౌన శూన్యాలను దాటి
పరిచిత పలకరింపుల నును వెచ్చని
హృదయసీమ కనుమలలోకి
కాస్త అలవోక గా రాత్రి భుజాలపై వాలే
వెన్నెల రెక్కలా కదలి వెళ్తుంటాయి "

ఈక్రమంలో మొదటివాక్యం "నదులు"అనే పదం వల్ల నదుల్ని,రెండో భాగం "రాత్రి,పరిచిత పలకరింపులు,"వంటివాటివల్ల వెన్నలరెక్క స్వప్నానికి ప్రతీకగ కనిపిస్తుంది.ఇలాంటి వాక్య నిర్మాణాలను వర్ణాత్మక కవితనుంచి ఎన్నిటినైనా సాధించవచ్చు.

అదేస్థాయిలో కళాత్మక అంశాలుకూడా కనిపిస్తాయి.స్వాతీ శ్రీపాద లోనూ ఇలాంటివి అనేకంగా ఉన్నాయి.

"ఋతువులు గొర్రెపిల్లలై అడుగులో అడుగేసుకుంటూ
దారి తప్పే యోచనే చెయ్యవని?"

"సుతి మెత్తని పాదాలకాలి వేలి కొసలపై జారే
వెండి మట్టెల మెరుపు"

"ఎక్కడినుండో ఏ చిత్ర కారుడి చేజారిపడిన
రంగుల సమూహంలా ఉన్నట్టుండి
మొలుచుకొచ్చే సుమసమూహాల వసంతహేలా "

ఇలాంటి మార్దవమైన వాక్యాలు చాలా ఉన్నాయి ఈ కవితలో.'వెండిమట్టెల మెరుపు""ఋతువుల గొర్రెపిల్లలు"కొత్త ప్రయోగాలు.ప్రకృతి సంబంధమైన అంశాలని చెబుతున్నప్పుడు కవుల్లోని ప్రతిభ ఇలాంటికవితల్లో కనిపిస్తుంది.మంచి కవితనందించిన స్వాతీ శ్రీపాద గారికి అభినందనలు.


______ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి