పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, జులై 2012, గురువారం

రెడ్డి రామకృష్ణ || నిన్ను తగలెట్ట ||

మనువా నిను తగలబెట్ట
మళ్ళీ మళ్ళీ పుడతవేర "మనువా"
మానవ జాతికి నీవో మచ్చలాగ నిలచినావు "మనువా"

వేల వేల యేళ్ళుగ నువు మానవులను చీల్చినావు
మనుషుల మధ్య నింత అగ్గి బోసి రేపినావు
కూచొని కూడు తింటె కులమో అని గునిసినావు
పంటకాడలేనిమైల వంటకాడ ఎలగొచ్చెర "మనువా"

ఇద్దరు మాటాడుతుంటె మధ్యలోకి వస్తుంటవు
మనసుల్లో ఏవేవో మాయతెరలు కప్పేస్తావ్
శుభకార్యం అయిన గాని చెడగొట్టిపోతుంటావ్
ప్రేమికులను బతకనీక పురుగు మందులందిస్తవ్ "మనువా"

ఊరికి వాడకి మధ్యన గోడలాగ నిలబడతావ్
మంచినీళ్ళ బావికాడ పొంచి పొంచి దాగుంటావ్
బండికాడ బస్సుకాడ సినిమాపెండేలుకాడ
అదునుకొరకు చూస్తుంటవ్ తగువులు పెట్టేస్తుంటావ్ "మనువా"

కారంచేడుల నువ్వు కమ్మవారి పంచజేరి
దళితులమైన మమ్ము దారుణంగా చంపినావు
చుండూరు లోనేమో రెడ్లనెత్తికెక్కినీవు
కత్తులు దూసి మా నెత్తురు వెదజల్లినావు "మనువా"

లక్షింపేటల నీవు చిచ్చర పిడుగయ్యావు
బాంబులు పేల్చినావు ప్రజలను భయపేట్టావు
ఆడవారి చీర చివర కారపు మూటయ్యావు
భూమిని సాకుజూపి బుర్రలు పగలేసావు "మనువా"

కత్తులు గొడ్డళ్ళతోటి కాళ్ళుచేతులిరగగొట్టి
బాకులు బల్లేలు బట్టి బండరాళ్ళు ఎత్తిపట్టి
గుండెలపై గుద్ది నావు ఐదుగురిని చంపినావు
మాలల రక్తంతో నేలనంత తడిపినావు "మనువా"

కమ్మలు రెడ్లయితెనేమి తూర్పుకాపులయితెనేమి
వెలమలు కాళింగులయిన ఎవ్వరయిన ఏమిగాని
నువ్వు దరిని జేరినాక దానవుడవుతాడు మనిషి
దళితుల రక్తం తోనే దాహం గైకొంటాడు "మనువా"

జ్యోతిరావు ఫూలె నిన్ను తరిమితరిమి కొట్టినా
పెరియరు రామస్వామి గొయ్యతీసి పాతినా
అంబేద్కర్ మహాశయుడు అడుసులోకి తొక్కినా
ముళ్ళకంపలాగనువ్వు మళ్ళీ మళ్ళీ లేస్తవేరా "మనువా"

ఏళ్ళకేల్లు గడిచినగానేమి మారింది లేదు
దళితుల వాడలపై దాడులు పెరిగాయి తప్ప
ఆర్ధికంగ బలం లేక అన్యాయం అవుతున్నాం
అధికారం చిక్కినాక .. నీకంత్యక్రియలు చేస్తమురా "మనువా"

మనువా నిను తగలబెట్ట
మళ్ళీ మళ్ళీ పుట్టకురా "2"

(లక్షిం పేట దుర్ఘటనకు స్పందించి రాసినపాట)
*26-07-2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి