పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి :- 31 ( కవిసంగమం ) చదివిన కవిత్వ సంపుటి పేరు :- " ఆకుపాట " ( కవిత్వం ) కవిత్వ సంపుటి రాసిన కవి :- " శ్రీనివాస్ వాసుదేవ్ " సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి “ “మనసు కాగితంపై తడి ఆరని ఓ వర్షపు సంతకం శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వం” " నువ్వేమో వెన్నెలా నేనేమో వాన "-అని అనుకొంటూ 'వర్షం లాంటి అసూయ పడే ప్రేమ " కోసం మనసంతా వర్షం లో తడపటానికీ "ఆ నాలుగు వర్షపు చుక్కలూ గుండెని తడిపి మరీపలకరింపు"చేయడానికి,"ఓఅక్షరమో వానకారుమేఘమో తట్టిలేపడానికీ ,"కాగితంపై వచ్చి పడుతుంటాయి వడగళ్ళ వానలా" "నిన్న వర్షంలో పట్టుకున్న వో బిందువులా " ఓ షెహనాయీ వేదనతో శ్రీనివాస్ వాసుదేవ్ కలం నుండి కాగితంపై తడి ఆరని సంతకంతో దివ్యానుభూతితో కొత్త భావనతో కవిత్వాక్షరాలు రాలి "ఆకుపాట "ని ఆలపించాయి. వర్షం అంటే ఎవరికైనా హర్షం కలుగక మానదు.శ్రీనివాస్ వాసుదేవ్ తన "వర్షం"-అనే కవితలో "వర్షం నా బలమైన బలహీనత" అన్నాడు. అందువల్లనేమో రాయాల్సిన సందర్భమొస్తే చాలు వర్షం గురించి కనీసం ఒక వాక్యమైనా రాస్తాడు ఈ సంపుటిలో చాల కవితల్లో.ఆ వాక్యాలే పైన నేను అన్నవి ఆయన గురించి. ఏకంగా "వర్షం"._(నా బయో గ్రాఫర్) అనే కవితను వర్షం పైన రాసేశాడు. "వర్షించినప్పుడల్లా ఓ కన్నీటి కథ ఓ షహనాయీ వేదన... వర్షవాకిళ్ళ వేదం,వాన చిగురు వేదాంతం కాగితప్పడవల సయ్యాట,చూరుపై నుంచి వానపాట మనసుపై తడి ఆరని ఓ సంతకం వర్షమెప్పుడూ ఓ అద్భుతం" ఓ అపురూప దృశ్యమే.కురుస్తున్న ప్రతి వాన చినుకు నేలను చేరే సమయంలో ఒక గోళం ఆకృతిలో వుంటుంది.చేయి చాచి అడిగినప్పుడల్లా అవి అనునయిస్తూ అరచేతిని తడిపినాయట.శ్రీనివాస్ ఊహా ఒక చాంపేయమాలల కవితంతా అల్లుకపోయింది ఈ కవితలో.షహనాయి స్వరపు దుఃఖపు జీరలా వాన చినుకు సవ్వడి ఓ కన్నిటి కథను చెబుతుందన్న భావమే వాసుదేవ్ ని విభిన్నమైన కవిగా నిరూపిస్తోంది. "వర్షంలో తడిసి తడవకుండా చేతిని బయటకు చాచినప్పుడల్లా చూరునుండి భారమైన చుక్కలు ఙ్ఞాపకపు నీడల్లా... ప్రతి గోళం ఓ కథ చెప్తూనే ఉంది ఓ ఙ్ఞాపకాన్ని వొదుల్తూ తమకంగా!" ఇందులోని భావ చిత్రం మన మనసులో ఒక గాఢముద్రనే వేస్తుంది.ఙ్ఞాపకాలతో బరువెక్కిన వాన చుక్క చెప్పే కథని విని చేయి దాన్ని వదిలేస్తుంటే ..ఆ వర్షపు నడుము చుట్టూ తన చేతులు వేసి కౌగలించుకున్నట్లు కవి ఊహచేసి కొత్త భావాన్ని,కొత్త దివ్యానుభూతిని ఇచ్చినట్లు అనిపిస్తుంది. నిశ్శబ్దంగా కురిసే వాన చినుకుల సడిని ఈ కవి ఆకాశపు నిట్టూర్పులుగా ,మనసు బావురమని అన్నప్పుడు అది కురిసిన కన్నీటి బొట్లుగా పోలిక చేయడం, ప్రతి వర్షాన్ని ఒక సంగీత విభావరిగాగా సంభావించడం కవి ఎంతగా ఊహల ఊయల్లోకీ వెళ్ళిపోయాడో "వర్షం" కవిత మనకు చూపిస్తుంది. కవి ఎంతగా వర్షాన్ని తమకంతో ఇష్టపడ్డాంటే వర్షం తన కథని రాసే బయోగ్రాఫర్ అని అనేంత. స్వర్గం నుంచి భూమ్మీదకు పరిగెత్తుకొంటూ వచ్చి ఆ భూమిలోకి వెళ్ళి మాయమయ్యే వర్షం ముక్తిని చెప్పే ఓ పాఠంగా కవి తాత్వికంగా చెబుతాడు.ఈ "వర్షం"-కవితలో ప్రతి పంక్తిలో కవి మెస్మరైజ్ చేసే పోలికల్ని ప్రతిభావంతంగా ప్రయోగించాడనటానికి ఎంతమాత్రం సందేహపడను. "వర్షం " కవితని చదివి రాసేటప్పుడు ఈ కరువు నేల మీద ఓ నాలుగు చినుకులు రాలటం కేవలం యాధృఛ్చికమేనేమో? ముప్పైరెండు బొమ్మలు చెపిన కథలు కొరవి గోపరాజు సింహాసనద్వాత్రింశిక లో పద్యంలో చెబితే ఆకులు చెప్పిన అరవైనాలుగు కథలు మైనంపాటి మైనంపాటి సుబ్రహ్మణ్యం శర్మ వచనంలో చెబితే డెభ్బైఏడు గుడి మెట్లు చెప్పిన కథల్ని శ్రీనివాస్ వాసుదేవ్ వచనకవిత్వం చేశాడు.అయితే శ్రీనివాస్ చెప్పిన తీరు వేరు.వాళ్ళంతా అనేక పద్యాల్లో, అనేకవందల పుటల్లో చెబితే ఈ కవి ఓక్కొక్క గుడిమెట్టు చెప్పే కథని ఆ మెట్ల చేతనే పాఠకుడే ఊహించుకునేటట్లు ఒకటి రెండు వాక్యాల్లోనే చెప్పిస్తాడు.ఆ యిద్దర్ని తక్కువ చేయడానికీ కాదు ఈ పోలిక నేను చెప్పింది.అసలు ఆ ఇద్దరికీ ఈ కవికీ సాదృశ్యమేలేదు. బొమ్మలు,ఆకులు కథలు చెప్పినట్లే గుడిమెట్లు కూడా చెబుతాయి కథల్ని అని చెప్పడానికే పోలికలు చెప్పాను. "గుడిమెట్లు-ఓ శిథిల కథల సంచిక"-అనే ఈ కవిత తనకి ఈ ప్రపంచాన్ని ఇచ్చిన అమ్మని, చేతుల్లోంచి జారిపోయిన తీర్థంలా వెళ్ళిపోయిన అమ్మని తలుచుకుంటూ,ఆమె ఙ్ఞాపకాలను తిరిగి గుర్తుకుతెచ్చే గుడిమెట్లను వొక అంతర్లీన దుఃఖంతో శిథిలకథల్నిచెప్పినట్లుగా శ్రీనివాస్ రాసిన కవిత ఇది. "గుడికన్నా ముందే పలకరించే /ఆ డెభ్బైఏడు మెట్లూ డెభ్బైఏడు కథలు"-అని ఈ కవితని కవి ఆరంభిస్తాడు. ఒక్కో గుడిమెట్టును ఎక్కుతూ వెనక్కినెట్టేస్తున్న అనుభవానికీ తను లోనైతే అతని అమ్మ మాత్రం గతాన్ని ఎక్కడో కలిపేసే ఆలొచనలో వున్నదని చెబుతూ,మెట్టు చివర మొలకెత్తుతున్న గడ్డి మొక్క,కాలానికి లొంగిపోయిన శంఖం పువ్వు,దేన్నుంచో విడివడిన సంపెంగ రెమ్మా ఇవన్నీ పలకరించి ఒక్కోక్కటీ జీవితానికి సరిపడ తమ కథలు చెప్పాయని కవి అంటాడు.ఆ అనడంలోనే గడ్డిమొక్క,శంఖం పువ్వు,సంపెంగ రెమ్మలకు మానుషత్వాన్ని ఆరోపించి వాటి వెనుక దాచేస్తే దాగని కథల్ని పాఠకుడు వూహించుకుండేటట్లు చాస్తాడు. "అమ్మ అంటూనే ఉండేది నీతో గుడికిరావడం 'ఓ అనుభూతిరా' అని అదేంటో అర్థంకాని వయసు! ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ మెట్లపొడుగునా ఇపుడు ఙ్ఞాపకాల శిలాజాలే" భూమిపొరల్నిఎంతో లోతుగా తవ్వుకొంటూపోతే ఆ లోపలిపొరల్లో పూర్వజీవుల జాతుల అసలు రూపాలు కప్పబడి వాటి వునికిగా నిలిచిన రూపాలనే శిలాజాలు అంటారు.'శిలాజం అనే పదాన్ని ప్రయోగించి కవి ఎంత లోతైన భావాన్ని ఈ కవితలో పొదిగాడో అర్థం చేసుకోవచ్చు."చీర కొంగుతో చెయ్యి తుడుస్తున్న ఆమెలో తెల్లరంగు అద్దుకున్న నవ్వు"ని కవి చూశాడట.ఆ నవ్వుకి అర్థం అపుడు తెలీకపోయినా,ఇపుడు గతాన్ని ఇలానే చూడాలని అవగతమయ్యిందట. అంటే తెల్లరంగు అద్దుకున్న నవ్వుతో చూడాలని.తెల్ల రంగు స్వఛ్చతకీ ప్రతీక.గతాన్ని అట్లా చూసే తత్వం అలవరుచుకోవడం అంత సులభమా?-చాలా లోతైన భావ పరంపరల్ని ఈకవి మనకొదిలేసే విద్యలో కడు నేర్పరిలా అగుపిస్తాడు ఇలాంటి వాక్యాలను రాసి. ఇదే కవితలో ఇంకో చోట " జీవితపుటల్లో అందమైన బుక్ మార్క్ ఈ గుడి మెట్లు"-అని అంటాడు.బుక్ మార్క్ అనే పదం కంఫ్యూటర్ కు సంబంధిన పారిభాషిక సాంకేతిక పదమే కావచ్చు.కానీ ఈ కవి ఆ పదాన్ని ఆ ఆలోచనలో వాడినట్లు లేదు.పుస్తకం చదువుతూ మధ్యలో ఆపేసినప్పుడు గుర్తుగా కొందరు అందమైన నెమలీకలు వాడేవారు.ఇప్పుడు పుస్తకానికి అనుబంధంగా ఒక రిబ్బన్ లాంటి దారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.చదివి ఆపేసిన తరువాత పుటల దగ్గర ఆ రంగుల రిబ్బన్ దారాన్ని వుంచడం వల్ల తిరిగి అక్కడనుంచే చదువుకుండే అవకాశం కలుగుతుంది.జీవితపుస్తకంలో ఆ గుడిమెట్లు ఓ బుక్ మార్క్ లా వుండి మళ్ళీ ఆ పుస్తకాన్ని తిరిగి చదువుకోవడానికీ,అంటే ఙ్ఞాపకం చేసుకోవడానికీ.ఇంతటి విస్తృతార్థాన్ని ఒక మాట బిగింపులో కవి శ్రీనివాస్ వాసుదేవ్ సాధించే ప్రయత్నం చేస్తాడు చాలా కవితల్లో. విశాఖ బీచ్ చేత కానీ సముద్రం చేతకానీ ఆకర్షంపబడనికవి వుంటాడనుకోను.మహాకవి శ్రీ శ్రీ సైతం విశాఖ మీద 15 ఆశ్వాసాల ప్రబంధం రాస్తానని రాయలేదు.విప్లవ కవయిత్రి విమల విశాఖ సముద్రాన్ని సౌందర్యదృష్టితో "ఉదయం నీరెండలో..అలలు బద్దకంగా వొళ్ళు విరుచుకొంటాయని ,అలలు తీరానికేసి తలలు బాదుకొంటాయని,సముద్రం గుండెలో చీకటి బాకులా రాత్రి గుచ్చుకుం టుందని,అప్పుడు అలలు నల్లగా పైకి లేస్తాయని అంటుంది వొక కవితలో."కిటికీ రెక్కల మల్లే కొట్టు కొంటూ జీరాడే అలల కుచ్చుల కర్టెన్లు తేలిపోతూ కిటికీలా విశాఖ సముద్రం"-అని రవూఫ్ అనే కవి ఆ సముద్రాన్ని అద్భుతంగా వర్ణించారు.శ్రీనివాస్ వాసుదేవ్ కూడా విశాఖ బీచ్ ని ఒక నోస్టాల్జియా గా చెబుతు ఆ సముద్రపు అలలపాటలను తన సొలిలాక్విలో వొక భాగంగా పోలుస్తాడు.సముద్రం ఏ కచేరిలో చూడని వాయిద్యపరికరాల ద్వనిని తన అలల శబ్దంతో మోసుకొచ్చిందనే ఒక భీతవహ ఊహని ప్రవేశపెడతాడు "నేనూ, నా సముద్రం"అనే కవిత ఆరంభంలో. "కంటి బిగువున అదిమిపట్టలేని దుఃఖంలా ఫెళ్ళుమన్న గుండె రోదించినట్టు ఉవ్వెత్తున లేచిపడే నిలువెత్తు కెరటం! వేయి మృదంగాలాఘోషగా ఆరంభమై శృతి చేసుకొంటున్న సితారలా ఒడ్డుపై వాలిపోతు" ఎంత ఊహాతీతంగా ఈ కవి సముద్రపు అలల సంగీతాన్ని ఊహ చేశాడో ఊహించండి ఒకసారి ఈ కవి సంభావన శక్తి ఏమిటో ద్యోతకమవుతుంది . తనతోనే,తనలోనే వుండే సముద్రాన్ని " ఎవరో స్త్రీ అని అరచారని చెప్పిన ఆ అరచింది కవే అని ఆ స్వరంలో మనం గుర్తించవచ్చు.కవి హృదయం పొందిన ఏ అనుభూతైనా అక్షరరూపం దాల్చి కవిత్వం కావాలి.కానీ కొన్ని అనుభూతులంతే కలాన్ని కలవరపెట్టితుఫాను మేఘంలా కురవకుండా కమ్మేసి పోయినట్లు కొన్ని మధురానుభూతులు కూడా కవిత్వమవ్వవని కవి ఎంతో వెతల వెక్కిళ్ళ మధ్య చెబుతూ అవి వెన్నెలని పట్ట్కొని జేబులో పెట్టుకోనివ్వవని,వర్షాన్ని తాగనివ్వవని అనుభవపూర్వక ఙ్ఞానంతో చెబుతాడు. "మట్టి ముద్దల్లోను,రాళ్ళ రాసుల్లోనూ అర్థంకానివన్నీ వుంటాయి దేవున్నో,దేవతనో చూడమన్నారు ఇక్కడే.. కళ్ళు మూసుకున్న చీకట్లో దండం పెడుతూనే ఉంటాను చిరునామా అవసరం లేని దేవుడికీ" ఈ దేవుడికన్నా మూరెడు మల్లెలు,మూడక్షరాలూ, చెప్పే కథలు-వీటన్నిటిని కవిత్వీకరించుకోవడమే తనకి ముఖ్యమని అక్షరాలే దేవుళ్ళని కవి తీర్మానించుకొంటాడు. ఈ కవి తన సంపుటిలో ఒక ఎలిజీ రాశాడు.ఎలిజీ అంటే ఆత్మీయులైనవారు కానీఉ,ప్రసిద్దులైన వారు కాని మరణిస్తే వారి స్మృతికి అంకితంగా రాసే రచన.సాధారణంగా ఎలిజీలు కరుణరసాత్మకంగా వుంటాయి.కొన్ని ప్రబోధాకాలుగా కూడ వుండొచ్చు.ఈ కవి కూడా వేగుంట మోహన ప్రసాద్(మో) చనిపోతే ఆయన చితి ని చూసి చింత చేశాడు ఒక ఎలిజీ రాసి."అక్షరమో...అనుభవమో"-అని దానికి శీర్షిక వుంచాడు.కవిత్వపు జిలుగులు తెలియనివాడు,కవితా హృదయం లేని వాడు కాదు వేగుంట మోహన ప్రసాద్.అత్యంత ప్రతిభావంతుడైనా ఈ అదునిక కవికొరకు శ్రీనివాస్ రాసిన ఇందులో "ఓ దిగులు కర్ర వేలాడుతోంది మెడపై పదానికీ పద్యానికీ ఇరుక్కున్నాననీ కొన్ని 'మో' లు ఎక్కువయ్యాయనీ.."-అని మో కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. పుట్టినప్పుడు పురిటి వాసన ఆడపిల్లేనా అని మూతి విరిచిన ముదితల ఆడిపోసుకొనే మాటల్లో "అమ్మా! నా డిబ్బి పగలకొట్టనే"-అని రోదిస్తున్న జోగిని స్వగతం గురించి చెప్పినా,"ఖబడ్దార్! మా గొంతు నొక్కాలంటే"-మళ్ళీ మా పాటలపై మాట్లడావంటే మా ప్రతి పాటా మీ మరణశాసనమవుతుందని ఛాందసుల దాడికీ గురైన కాశ్మీరీ యువతుల మ్యూజిక్ బ్యాండ్ నిర్వహనని గురించి రాసినా,స్వేచ్చ కోసం ఏడు చువ్వల్ని పట్టుకున్న ఖైదీల గురించి రాసినా,ఖ్మేర్ రోజ్ దురాగతాన్ని చెప్పినా,"ఎంత అందమైన పువ్వైనా వాడిపోక తప్పదన్నట్లు"-జీవితాన్ని ప్రశ్నించి నిర్వచించిన మరణాల్నీ వర్ణించినా,"ఈ గ్రాఫిటి గీతలు,గోడమీదికి దిగివొచ్చిన హరివిల్లులని"అనుకుండే వారిపైన నిషేధం విధిస్తూ చట్టం చేయాడాన్ని నిరసించినా,"ఇక్కడ చెట్లూ,దేహాలూ కాలుతుంటాయి కొన్ని కాలడం కోసం పుడితే కొన్ని పుట్టడం కోసం కాల్తాయి"-అని మలేసియా అడవుల్లో రబ్బరు తీసే ఉద్యోగంలో జాడల్ని కోల్పోయిన వారిని అభివర్ణించినా,"పలకరించలేని నిస్సహయత.."తో "అర్థం కాని దేహ సంశయం"తో-"జీవన మర్మంలో అర్థంకానీ దేహ మర్మమంతో ఊగిసలాడే ట్రాన్స్ జెండర్,దేహంలోపై భాగం స్త్రీగా,దిగువభాగంపురుషుడిగావున్న వార్ని చింత్రించినా శ్రీనివాస్ ప్రతిభా మన కళ్లను తప్పించుకోలేక ఇట్టే దొరికిపోయి ఆలోచనా సముద్రంలోకీ మనల్ని లాక్కెళుతుంది. అఫ్సర్ "ఆధునిక జీవన శకలాలుగా జీవిత విశ్వరూపం చూపించిన కవిగా ఈ కవిని గుర్తిస్తే,"తనదయిన ఒక ఆకాశాన్ని కోసుకొంటూ రాలిన కన్నిటీ చుక్కలను లోకంతో పంచుకుంటున్న కవి అని హెచ్చార్కే అంటే "బతుకు రంగుల కోరస్ ఈ కవి కవిత్వమని యాకుబ్ చెబితే నౌడురి మూర్తి గారు మాత్రం "కొందరి కవిత్వానికీ అనుభూతి,కొందరికీ ఆవేశం,కొందరికీ ప్రతీకలు,కొందరికీ పదబంధాలు,కొందరికీ గమకం లేదా తూగు,ఇలా ఒక్కోక్కరికీ ఒక్కొక్క ప్రత్యేకత వుంటుంది.ఈ ఆకు పాట వీటన్నిటి సమ్మేళనం"-అని అన్నారు. వీళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని వారు ఎవరూ వుండరు ఈ కవిత్వ సంపుటి చదివితే.నిజంగా ఈ సంపుటి "కవిత్వ కిర్మీరం".అంటే అనేక వర్ణాల కలయిక. బహుత్వ తత్వానికి(pluralistic philosophy ) ఈ కవి కవిత్వం ఒక ఉదాహరణం అని నేనంటాను. Smorgasbord అనేది అన్ని రుచులు వుండే విడివిడిగా వుండే పదార్థాలతో వడ్డించే స్కాండినేవియన్ బఫెట్ .దాన్ని విడివిడిగానైనా తినొచ్చట.లేదా కలుపుకొనైనా తినొచ్చట.ఈ పోలిక ఎందుకు తెస్తున్నానంటే ఈ సంపుటిలోని కవితల్నీ కలిపి చదువుకోవచ్చు.విడివిడిగానైనా చదువుకోవచ్చు.ఎలా చదువుకొన్నా కవిత్వపు గాఢత గాని,సాంద్రతలో చిక్కదనం గానీ ఎంత మాత్రం తగ్గినట్టు అనిపించని మంచి కవితల్నీ ఈ శ్రీనివాస్ వాసుదేవ్ ఈ సంపుటిలో వడ్డించాడు కవిత్వ ప్రియుల కోసం. ఓ చెట్టు కిందో,ఓ మేఘం కిందో మనసు పరచి మాట్లాడాలని వుందని కాంక్షించే ఈ కవి ఇంకా ఎన్నొ అద్భుత కవితల్ని వేలార్చినా స్థల.కాలాభావాల కారణంగా తాత్కాలికంగా విరమిస్తున్నా. Being,becoming,belonging ఈ ట్రినిటిలో నువ్వేమిటి కవీ?-అని ప్రశ్నించే ఈ కవి "మనసు మాట విననప్పుడల్లా ఓ కవితా వాక్యం పుడుతుందే నీ నుంచి-"అని కవికీ భరోసా ఇస్తాడు శ్రీనివాస్ వాసుదేవ్. "మనసుందని ప్రేమించలేను...మనసే ప్రేమయినప్పుడు నువ్వు లేవనీ అనుకోలేను. ప్రేమ నువ్వైనప్పుడు "-అని అనే ఈ కవి ప్రేమను గూర్చి కూడా తనదైన తాత్వికతతో పుష్కలంగా రాశాడు."ప్రేమ అడుగుల చప్పుడు గుండెలపై సున్నిత మోత/చీర కుచ్చెళ్ళకీ సంగీతముంటేనా"-ఇలాంటి అందమైన సుకుమార ప్రణయ మృదు భావనలేమీ కొదువలేదు ఈ కవిత్వంలో. కవి మిత్రులను శ్రీనివాస్ వాసుదేవ్ వినిపించే "ఆకుపాట" వినండని కోరుకుంటూ వచ్చే మంగళ వారం మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1wW4pnX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి