పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

పెన్నా శివరామకృష్ణ-పోలిక ఒక మాధ్యమం






ఋగ్వేదంలో దశమ మండలంలో ఒక ఋచ ఉన్నది."చత్వారి వాక్ పరిమితా పదాని.తానిత్రీణి గుహితానేంగయంతి.తురీయం వాచో మనుష్యావదంతి"ఇందులో చత్వారి వాక్ అనేది గమనించదగ్గది.-వాక్కు యొక్క నాలుగు దశల్నిఈ ఋచ చూపింది."పశ్యంతి,మధ్యమ,వైఖారి నాలుగవది పరా".పశ్యంతి-చూచుచున్నది,మధ్యమ-అభివ్యక్తికి కావాల్సిన ఙ్ఞాన ,సౌందర్య,కళా,శాస్త్ర పరిఙ్ఞానాన్ని కూర్చుకునే దశ.మూడవది బయటికి చెప్పే అంశం.నాలుగవది వీటికి అతీతమైంది.

మిత్రులు పెన్నా శివరామ కృష్ణ కవిత "పోలిక ఒక మాధ్యమం"లో ఈఅంశాల్లోని మధ్యమ దశని స్పర్శించారు.సాధారణ,చర్వణ,ధారణ,మనన,సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు.చూడటం,చూసినదాన్ని నెమరువేసుకోటం,దాన్ని ఙ్ఞానంలో పాదుకోటం,దాన్ని సమన్వయం చేసుకోటం,-సృజంచడం ఇవి.బుద్ది దేన్ని అనుసరిస్తుందనేది ఒక ప్రశ్న?శాకుంతలం "బుద్దిఃకర్మానుసారిని"అన్నది.బుద్దికి చేసే పనులే కారణం.

కవిత్వంలో గాని సాధారణ వ్యవహారంలో గాని పోలికలు కనిపిస్తాయి.ఈపోలికలే ఏరకమైన సంభాషణకైనా మాధ్యమం అంటున్నారు కవి.ప్రతిపదానికి యోగ,ఆయోగ,ఔపయోగిక,సమన్వయ ,ఆవృత్తమనే దశలు ఉంటాయి. ఈ కవితలో ఇలాంటివి కనిపిస్తాయి.

శివరామకృష్ణ గారి వచనంలో వేగం(swift)ఉంది.దేన్నయినా మరింత భారంగా చెప్పడానికి పోలిక ఒక మాధ్యమం.దీని ఉపయోగాన్ని.ఉనికిని,రూపాలని కవితలో వ్యక్తం చేస్తారు.

"పోలిక ఒక ఉపగ్రహం/ఆత్మ ప్రదక్షణం చేస్తూ/భూగోళం చుట్టూ తిరుగుతుంది"ఇది ఉనికిని చెప్పే వాక్యం.పోలికలకు ఎక్కడో వెతకాల్సిందిలేదు.ఈ భూమిపైనే ఉన్నది.

"సకాలానికి అస్తమించే సూర్యుడిని గుర్తుచేసుకోకపోతే/చీకటి బాహువుల్లో క్షణ క్షణం/వెలుగులజల పొంగేదెట్లా?"పోలిక యొక్క విస్తృత రూపాన్ని అనేకకోణాల్లో పరిచయంచేస్తారు.అనేకాంశాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

"పోలిక ఓ విశ్వజనీన మాధ్యమం/
పోలిక దృశ్యా దృశ్యాల మధ్య పూల వారధి/
పోలిక వేదిక కొక ఆహార్యం మార్చుకునే నర్తకి/
రుతువుకొక రాగం పలికించే విచిత్ర పల్లవి"

లెనిన్ ప్రతిఫలన సిద్దాంతాన్ని (reflection theory)ప్రతిపాదించాడు.ఒక అంశంపై అనేక అంశాల ప్రతిఫలనం ఉంటుంది.నిర్మాణంలో వస్తువు ఉనికిని,అది విస్తృతమైన రీతిని అందులోని వాక్యాలే చెబుతాయి.శైలిలో వేగంతోపాటు సరళంగా కనిపించే వాక్యాల మధ్యన పేర్చిన సమాస బంధాలు కూడా ఈవేగాన్ని పెంచాయి.

"అశ్రు దరహాస తటిల్లత"
"నిక్షిప్త దరహాస మధురిమ"
"అనంత నీరవ నీరధి"-అలాంటివే..

బుద్ది అనేదానికి ఙ్ఞానం ప్రధాన ఆకరం.ఈ ఙ్ఞానంలో ప్రతిఫలనాలు అనేకం .బుద్దిజీవులు సూక్ష్మం నుంచి అనంతం లోనికి ప్రయాణం చేస్తారు.ఈ కవిత అలాంటిదే.
మంచికవితని అందించినందుకు పెన్నాశివరామ కృష్ణ గారికి,మనకు పునః పరిచయం చేసినందుకు యాకూబ్ గారికి ధన్యవాదాలు.

6.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి