పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

శివసాగర్ కవిత-నడుస్తున్న చరిత్ర


       
తెలుగు నేలమీద సోషలిస్టుపార్టీల ఆవిర్భావం తరువాత ఆ తాలూకు తాత్వికతలు,దృక్పథాలు అనేక అంశాలపై ప్రతిఫలించాయి.ఆ మార్గంలో ప్రత్యేక సాహిత్య మార్గాలు కూడావచ్చాయి.మార్క్సిస్ట్ సాహిత్య విమర్శనాపద్దతులు పాదుకొనడానికీ ఊతమిచ్చాయనటం కూడా అతిశయోక్తికాదేమో..బహుశఃఅభ్యుదయవాదం నుంచి అనంతర ప్రజా ఉద్యమ ధోరణులలో కూడా ఈ వాస్తవికత ప్రభావాన్ని కాదనలేం.

విమర్శలోనూ ఈమార్గంలో సవిమర్శక వాస్తవికత(Critical Realism)సామ్యవాద వాస్తవికత(Socialist Realism)అనే రెండు పదాలు కనిపిస్తాయి.మొదటిది-సమాజంలోని వ్యత్యాసాలను,వైరుధ్యాలను గుర్తించి,చిత్రించే ప్రయత్నం చేసింది.రెండవది సవిమర్శకవాస్తవికత కన్న ముందడుగు వేసి మార్క్సిస్ట్,లెనినిస్ట్ సిద్ధాంతాల ద్వారా-విప్లవం ద్వారానే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మింది.

ఇందుకోసం సోషలిస్టు వాస్తవికత ఓ తాత్విక ధారని సృష్టించింది.ఇందులో కొన్ని ప్రధాన అంశాలని గుర్తించవచ్చు.
1.విషయాలను పైపైన చూడటంగాక వాటికారణాలనూ అర్థంచేసుకోవడం మొదలుపెట్టింది.
2.ప్రతి అంశాలూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయని అభివృద్ధికి వర్గాలమధ్య సంఘర్షణ తప్పదని నమ్మింది.
3. పీడిత ప్రజల పక్షపాతంతో వారిలో చైతన్య సాధన ,నూతన సమ సమాజ స్థాపనకోసం ప్రయత్నించింది.

శివసాగర్ కవిత్వంలో రెండు తాత్విక ధారలు ప్రధానంగా కనిపిస్తాయి.అవి వైప్లవిక ,దళిత ఉద్యమాలు.ఈ రెంటికీ దగ్గరగా ఉన్నదే సోషలిస్టు వాస్తవికత.నిజానికి దళిత సాహిత్యానికి ఓ మేనిఫెస్టో లాంటి నిర్మాణ దార్శనికతనిచ్చిన కవిత శివసాగర్ ది.శంబూకుడు,ఏకలవ్యుడు మొదలైన పాత్రలని దళిత ప్రతీకలుగా అందించిన కవిత"నడుస్తున్న చరిత్ర". ఇప్పటికీ దళిత సాహిత్యాన్ని అంచనా కట్టడానికి శివసాగర్ కవిత సాహిత్య ప్రమాణం(Litarary Criterion).

"శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో/
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్దలితో నరుకుతున్నాడు"

"మనువు కళ్లలో సూదులు గుచ్చుకుని
నాలుక తెగ్గోసుకుని/చెవిలో సీసంపోసుకుని/
స్మశానంలో దొర్లుతున్నాడు"

వాద నిర్మాణంలోప్రాతిపదికగా మూడు సమీకరణలున్నాయి.ఇవి వాటి గమనాన్ని నిర్దేశిస్తాయి.1.స్వీయ అస్తిత్వోద్దీపన 2.తిరస్కారం 3.ధిక్కారం.ధిక్కార దశలోనే వాక్యాల్లో ప్రతీకార స్వరం వినిపిస్తుంది.ప్రతీకార,సంఘర్షణల్లోనే చరిత్ర పునర్నిర్మాణమౌతుంది.ఈ స్వరం ఈ కవితలోని అన్ని వాక్యాల్లో కనిపిస్తుంది.

శివసాగర్ తరువాతి కాలం శంబూకున్ని,ఏకలవ్యున్ని దళితప్రతీకలుగా అనేకసార్లు చిత్రించింది.బలిని తక్కువే.శివసాగర్ తరువాత కవిత్వం కర్ణుడిని కూడ ప్రతీకగా పరిచయం చేసింది కానీ ఈప్రతీకను కూడ తరువాతి కాలాల్లో కొనసాగించినట్లు కనిపించదు.ఈ మార్గంలోనే ఎండ్లూరి సుధాకర్"గోసంగిని"పరిచయంచేసారు.

జాషువా గబ్బిలం దళిత వాదానికి ఒక స్పృహని ఇచ్చివెళితే శివసాగర్ దానికి ఒక చైతన్యాన్ని దార్శనిక అస్తిత్వాన్ని చారిత్రక దృష్టిని ఇచ్చారు.

సాహిత్య చరిత్రకు ప్రధాన ఆకరమైన ఈకవితను పునఃపరిచయం చేసినందుకు కపిల రాంకుమార్ గారికి ధన్యవాదాలు.

7.8.2013







                                                                                                            _______________ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి