పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

కవి యాకూబ్-చినుకు భాష






ఆత్మకళా,ఆత్మ కళాభ్యాసం,ఆత్మకళాసిద్ది అనే పదాలు ప్రాచీనకాలం నుంచి విరివిగా కావ్యమీమాంసలో కనిపిస్తాయి.ష్చెర్బీనా ఆత్మ కళాభ్యాసాన్ని గురించి మాట్లాడిందని,ఇది ప్రాచ్య,పాశ్చాత్య కళాతత్వ వేత్తలందరూ ఆదరించినదేనని శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం.

జగన్నాథుడు "భగ్నావరణ చిద్విశిష్ట స్థితి"గురించి చెప్పాడు.ఆవరణలో ఉన్న జగత్తుపోయి ఇదివరకే ఉన్న ఆత్మీకృతమైన సంస్కారం ప్రకాశిస్తుంది.బాహ్య జగత్తుకు,ఆత్మావరణానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తనలో జాగృతం చేసుకోవడమే ఆత్మకళాభ్యాసం.

ఈక్రమంలో దర్శన స్థితి చాలావిలువైనది"తతఃపశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం ప్రాణవామలకం యథా తత్సర్వంతత్వతో దృష్ట్వా" ఈతత్వదృష్టి,యోగస్థితి దర్శనాన్ని పదునుపెడతాయి.

దర్శనంలో స్పృహ అనేది ఒకటుంటుంది.దీనికి స్పర్శ మూలం.స్పర్శ నుంచి కవి ఆత్మీకరణ సంస్కారమైన స్పృహ లోనికి వెళుతాడు.తాను ఎటు ప్రయనిస్తాడనేది ఆత్మచైతన్యం,సంస్కార దృష్టిని బట్టి ఉంటుంది.ఇదంతా భౌతికం నుండి ప్రేరణ పొందిన కవి ఆత్మదృష్టివైపు వెళ్లటం.ఈ మార్గంలో కొన్ని సార్లు స్పర్శకూడా ప్రత్యక్ష భాగస్వామి అవుతుంది.కాని పరోక్షంగా స్పృహ అణువణువునా ప్రవహిస్తుంది.యకూబ్ చినుకుభాషలోఇలాంటిదృష్టిఒకటికనిపిస్తుంది.సాధారణదృష్టి,కళావిష్కారం,ఆత్మచైతన్యం,ఆత్మకళాసాధన ఇవన్నీ దార్శనిక పరిణతదశలు.


నిర్మాణపరంగా చూస్తేస్పర్సలోని చూస్తున్నవస్తువు,స్పృహలోని చెప్పబడుతున్న వస్తువు మధ్య సారూప్యతలుంటాయి.ఇలాంటి వాటిలో విలువలు ఒకదానికి ప్రత్యక్షంగా ఉంటే,మరోదానికి ఆపాదించబడుతాయి.

ఆమూర్తసంభాషణ, మూర్త సంభాషణ
అని రెండు ఉంటాయి.ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించినా ధ్వనిగతంగామరొకటి స్ఫురిస్తుంది.స్పర్స భౌతిక మైంది,స్పృహ ఆత్మికమైంది."కవిత్వాన్ని ఆత్మే స్వీకరిస్తుంది కాబట్టి చెప్పేదికూడా ఆత్మే అవుతుంది"అని అరవిందులన్నారు.

ఉద్వేగంతరువాత ఉపశమనం నుంచి కవిత ప్రారంభమౌతుంది.
"ఇంక కొంత సమయం, పడుతుంది/ఈ
ముసురు ఆగిపోవడానికి"

మనసునిఏదో ఉద్వేగంచుట్టుముట్టి ఉండడం,ఆ ఉద్వేగపు సమాప్తి గురించి ఆలోచించడం."మరీ చిన్నిచిన్ని చినుకులు/వాటికోవ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు/ఒకటి వెంట ఒకటి కుదురుగా." ఆత్మీ కరింపబడున అంశాలు కాలగతంగా చేరినవైఉంటాయి. అందువల్ల ఒక్కటొక్కటిగానే అందుతాయి.ఆవరించి ఉన్న అంశాన్ని తప్ప
మరోదాన్ని,భౌతిక జరిగే పరిణామాలని ఆత్మ పట్టించుకోదు.
"నిన్నటి సాయంత్రం నుండి ఇవాళ్టి ఉదయం లోపల/ఎన్నిపరిణామలు జరిగిపోలేదు/అవేమి పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు"-దానినుంచి ప్రేరణపొంది ముగించుకోడం తప్పా ఆవరించి ఉన్నదాని అంతుచిక్కదు

"ఈ ముసురు చేసే సంభాషణలో/ ఒక్క ముక్క అర్థంగాదు"

దృశ్యాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉన్నా..చిత్రించడం,ఆపాదించడం లాంటివి ఇందులో బలంగాకని పిస్తాయి.ఆవరించి ఉన్న ఓ ఉద్వేగపు క్రమాన్ని యకూబ్ గారు ఈ కవితలో చిత్రించినట్టు కనిపిస్తుంది. ఈ మూర్త సంభాషణలోనించి ఆమూర్తంగా మరోగొంతు ధ్వనిస్తుంది.

         

                                                                                                                                        ________________ఎం.నారాయణ శర్మ-1.8.2013

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి