పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

Mehdi Ali: నీ విఙ్ఞత





 


మెహది అలిగారి కవితగురించి మాట్లాడుకున్నప్పుడు రెండువిషయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.1.అలీగారు వ్యక్తం చేసిన అంశం2.వ్యక్తం చేసిన తీరు. చాలాకాలం క్రితం బౌద్దానికి సంబంధించి"అశ్వ ఘోషుడు"మనుషుల ప్రవర్తనకు సంబంధించి "సౌందరనందం"లో ఒక వ్యాఖ్య చేసాడు.

"దృష్ట్వైకం రూపమన్యోహి రజ్యతేsన్యఃప్రదుష్యతి
కశ్చిద్భవతి మధ్యస్థఃతత్రైవాన్యో ఘృణాయతే"

ఒక రూపాన్ని చూసి ఒకడు సంతోషపడితే ఒకడు దూషిస్తాడు,ఇంకొకడు మధ్యస్థుడైతే
,వేరొకడు జాలిచూపిస్తాడు.మనుషులస్వభావన్ననుసరించి వారివారి విఙ్ఞతలననుసరించి వారి ప్రవర్తన ఉంటుంది.ఇలా వేరువేరు అభిప్రాయాలు కలగటం వారి మానసిక సంస్కారాలను బట్టే ఉంటుంది.

అలీగారు ఇలాంటి తత్వంలోనే నీవిఙ్ఞత అనివదిలేసారు.ఇందులో అనేకాంశాలని స్పర్శించడం కవికుండే సార్వత్రిక దృష్టికి నిదర్శనం.విమర్శలో సభ్యొక్తి (euphemisam)అనే పదాన్నొకదాన్ని వాడతారు.ఇది వాక్యాన్ని చెప్పే పద్దతికి సంబంధించింది.ఎదుటి వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు దురుసుగా,కటువుగా కాకుండా పరోక్షంగా చెప్పడం.

వ్యక్తం చేసిన తీరు గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు ప్రధానంగా గమనించాలి.కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్లకు ఏవిషయం రాయాలన్న దాంట్లో అనుమానం లేకున్నా.. ఎలారాయాలనేది,ఎదుటి వారికి ఎలాచేరవేయాలనేది మొదటి ఇబ్బంది.అలాంటి వారికి ఈకవితనుండి ఒక మార్గం దొరుకుతుంది.మొదట్లో చాలావరకు అందరూ పంక్తులలో పదాలనుపేరుస్తూ వెళతారు.అంటే ఒకే వాక్యాన్ని సుమారు మూడు నాలుగు పంక్తులల్లో రాయటం.ఇంకొందరు కుప్పగా ఒకేచోట రాసేస్తారు.ఇది ఒకరకంగా కవిత్వం రాసే వారిలో ప్రాథమిక దశ.ఎంత గొప్ప స్ఫూర్తి కలిగించే విషయం చెప్పినా నిర్మాణ క్రమం తెలిసి రాసే వారి వాక్యంలా చేరదు.

కొంత అధ్యయనం తరువాత ఇలాంటివారిలో పరిణత దశ కనిపిస్తుంది.అంశాలని యూనిట్లు గా రాయడం.ఈసమయంలో రెండు వాక్యాలుగా ,మూడువాక్యాలుగా రాయడం కనిపిస్తుంది.నిజాని ఈదశకి చేరడానికి కొంత కాలం పడుతుంది.ఇలాంటి కవితలు చదివి నిర్మాణాన్ని అర్థంచేసుకున్న వారికి ఆకాలం కొంత తగ్గొచ్చు.

అలీ కవితలో ప్రతి యూనిట్లోనూ వరుసగా నిర్మాణ సారూప్యత సాధించారు .

"నేనొక సముద్రాన్ని గంభీరంగా కనిపించడం నానైజం
భయపెడుటున్నానా కెరటాలతో ఆడమంటున్నానా
అర్థమెలాచేసుకుంటావో నీ విఙ్ఞత అది"

మొదటి దాంట్లో ప్రతిపాదక వాక్యం-సృజనధర్మ వర్ణన.రెండవదాంట్లో రెండు వైవిధ్యాంశాలు.మూడవది సూచన .నిర్మాణగతంగా ఇది శతకాలలో కనిపించే మకుటం లాంటిది.విమర్శ దీన్ని వాక్య నిర్మాణ పునరుక్తి(parallelism)అంది.సరళ వచనం (plain prose)లా కనిపించే కఠిన పదాల్లేని వచనం ఇందులో మరో ఆకర్షణ.అర్థ సంబంధంగా ప్రతీ పదంలోనూ కవికున్న అవగాహన కనిపిస్తుంది.ఒక అంశానికి సంబంధించి అనేక పదాలను నిర్మిస్తే అర్థ క్షేత్రం అంటాం.రెండు పదాలు ఉంటే సజాతీయాలు అంటాం.

శశి-వెన్నెల,సమీరం-చలి,సాగరం-కెరటం,రాగం-ఆహ్లాదం ఇలాంటి వన్ని అలాంటి పదాలే.ఇన్ని పంక్తుల్లోనూ మనిషి స్వభావాన్ని అంచనా వేస్తారు.రసానుభవానికి అనుకూలంగా ఏర్పడేవాటిని విభావాలు(objective correlative)అంటారు.ఇందులో ఆలంబన విభావం కారకం లాంటిది.సముద్రం,గ్రంథం,అనుభవం ఇలాంటివి ఆతాలూకే.మరోటి ఉద్దీపన విభావం ఆవేశవాతావరణాన్ని ప్రదర్శించేది.వాక్యాల్లో క్రియాగతంగా చెప్పిన వాక్యాలన్ని అలాంటివే.
ప్రకృతి గతంగా 3,భావన అనుభవాలకు సంబంధించి2,సాహిత్య సంబంధంగా3 అంశాలు కనిపిస్తాయి ఇందులో.
వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి సారూప్యతని ఆపాదిస్తారు.

"నేనొక అనుభవాన్ని పాఠం నేర్పడం నానైజం
అప్రమత్తత నేర్చుకోవాలా నిర్లక్షంగా వుండాలా
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

"నేనొక కవితని జాగృతం చేయడం నానైజం
కవితలో నిన్ను వెదుక్కుంటావో ఇతరులగురించి అనుకుంటావో
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

వాక్యనిర్మాణానికి సంబందించి ఆకాలనికి తగిన రచనకు దగ్గరగా ఉండే క్రమాన్ని అర్థం చేసుకోడం అవసరం.అలీగారి కవిత ఆపనిచేసింది.జయహో అలీగారు.


2.8.2013



                                                                                                                                            _____________________ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి