పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ

బి.వి.వి.ప్రసాద్ కవిత-పావురాలు

 





తెలుగులో వచనకవిత వచ్చాక ఆ పరిధిలోనే మరికొన్నిమార్గాలు కనిపిస్తాయి.అనుభూతి కవిత్వం ,అంతర్ముఖీనకవిత్వం ఈదశలో కనిపించేవే.బివివి ప్రసాద్ కవిత సుమారుగా ఆకోవకు చెందిందే.నిజానికి "హైకూ"పరిచయం ఒకటి కలిగాక తెలుగులో పైన చెప్పుకున్న రెండుమార్గాలు పరవళ్లు తొక్కాయి.ధ్యానం,సమాధి లాంటివి పూర్వమే కనిపించినా వాటిని గురించి ఈ 1,2 దశాబ్దాలు మాట్లాడటం అలా ప్రారంభమయిందే.

భౌతిక ప్రపంచాన్ని విడచి అహంకారాలులేని శాంతినపేక్షించే మానసిక ప్రపంచంలోనికి అక్కడినించి సౌందర్యమైన ప్రాకృతికప్రపంచంలోనీ దాన్నించి దృశ్యమూ,శబ్దమూ,రూపమూ లేని పూర్ణ ప్రపంచంలోనికి వెళ్లడం అంతర్ముఖీనత(introspection).అలావెళ్లేకవి అంతర్ముఖీనుడు(invertor).

యోగదర్శనం పేరుతో సౌందర్యారాధకులుచెప్పినది.సమాధి అభ్యాసాలను ప్రతిభా కారకాలుగా అలంకారికులు చెప్పినది ఈ లక్షణాలకు కాస్త దగ్గరగా కనిపిస్తుంది.

రుద్రటుడు(వచనాను స్మృతి)లో-
"మనసి సదా సమాధినీ"(సమాధి సిద్దమైందే ప్రతిభ)అని వ్యాఖ్యానించాడు.సమాధికి అలాంకారికులు చెప్పిన నిర్వచనాలూగమనించదగ్గవి."సమాధిరాంతరా"అనేది ఈ అంతర్ముఖీనత్వాన్నే చెబుతుంది.తౌత భట్టు కావ్య కౌతుకం లో శాస్త్రాధ్యయనం చేత ఙ్ఞానం లభిస్తుందని అక్కడినుండి దర్శనం కలుగుతుందని ఆదర్శనం వల్ల చేసే వర్ణన కవిగాచేస్తుందని అన్నాడు.

"సతత్త్వ దర్శనాదేవ శాస్త్రేషు పఠితఃకవిః
దర్శనాద్వర్ణనాచ్చాధ రూఢాలోకే కవి శృతిః"

బివివి ప్రసాద్ సృజనని ఇలాంటి దర్శనంతో దర్శించి చిత్రించారు.మనసులోకి ఊహలు రావడాన్ని,అందులోంచి సృజనరావడాన్ని స్పందనలుగా ,పావురాళ్లుగా చిత్రిస్తున్నారు.ప్రశాంతత అనే అంశమే "పావు రాళ్ల"నితెచ్చింది.శబ్దాన్నే కొరుకుంటే బహుశః చిలుకనో,మరోదాన్నో తీసుకునే వారేమో.అంతర్ముఖీనత అనిచెప్పడానికి ఈ ప్రశాంతతని అపేక్షించడమే ఆధారం.

ప్రసాద్ గారిలో విస్త్ర్తమైన నిర్మాణ ధార ఉంది.ఇది అనేక చోట్ల కనిపిస్తుంది.ప్రేరణ కలగడాన్ని చిత్రించే ఈ భావ చిత్రం అందుకు నిదర్శనం

"పిల్లలెవరో కాగితంపై రంగులు చల్లుతున్నట్టు
ఆటలో విరామం నిండిన ప్రశాంతతలోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చిచేరుతాయి"

భావచిత్రాలను1.అలంకారాలు2.పాశ్చాత్య కళాపద్దతులు3.మనోవైఙ్ఞానిక భూమిక ద్వారా మూడురకాలుగా చిత్రిస్తారు."చల్లుతున్నట్టు"అన్నక్రియా సంబంధం లోంచి ఉపమావాచకం ద్వారా ఇది అలంకారపద్దతిలో జరిగిందని చెప్పవచ్చు.చివరి వాక్యంలోంచిచూచినా "శాంతి వృత్తంలా/నీడరూపం వచ్చినట్టు"ఇలాంటివే.

మొదటి వాక్యంలోని"వాలటం"2 లోని"క్షణాలు
నోట కరవటం"ఇలాంటివన్ని స్థితులలోని క్రమాన్ని చూపుతాయి."ఈ పావురాలు ఎగిరేందుకు వచ్చినవికావు/వాలెందుకు వచ్చినవి"అనటం.చివరి వాక్యం కవిత ప్రయోజనాన్ని,అంతర్ముఖీనతని ప్రదర్శిస్తాయి.

"ఈ పావురాలు అందుకే వస్తాయి.
ఇవి నిశ్శబ్దం పొట్లాన్ని విప్పి శబ్దాన్ని వెదజల్లవు.
శబ్దం పొట్లాన్ని విప్పి నిశ్సబ్దాన్ని పంచి పెడతాయి"

ప్రతీక,దాన్ని నిర్వచించేతీరు,అందులో చిత్రించిన భావ చిత్రాలు..అందులోని దర్శనం బివివిని ప్రత్యేకంగాచూపుతాయి.తెలుగుకవితలోని ఒక ప్రధాన మార్గాన్ని ఆవిష్కరిస్తాయి.

5.8.2013
                                                                                                          _____________ఎం.నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి