పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, ఆగస్టు 2012, శనివారం

డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి||అడవిలో వాన ||

 
ఒకటే వర్షం
వనకన్య తడిసి ముద్దయ్యింది..
ముద్దబంతి పూవయ్యింది...
కొండగోగు పూల పెదాల చు౦భించే వాన

యదలోతుల లోతయిన లోయల్లోకి

అలవోకగా జాలు వారుతూ
పచ్చని కోకని పరుచుకుంటూ
ఎన్నెన్ని కళల కల్లళ్ళో నెమలి కన్నులై
మైదానాల్లో విచ్చుకున్నాయి ...

మోదుగుపూలని పొగమంచు ఘాడ౦గా
కౌగిలించుకుందేమో 'లక్క ' పొంగుకొచ్చింది ...

మయూరాల వయారాల్తో
కొండ కోనంతా పండుగే

గూడు తడిచిన గువ్వలు
గుహల్లోకి చేరి
వెచ్చని కౌగిళ్ళ స్వప్నాల్ని కంటూ...

వానకెంత ముద్దో వనమంటే....!?

వనాలనుండి సేకరించిన
వాన పూల వరదను కని
చెరువులన్నీ అచ్చెరువొ౦ది 'పొంగు'తున్నాయి !!

తడితడి నేలనుండి
చడిచేయకుండా
అమ్మవారి కుంకుమతో
ఆరుద్రలు బయలుదేరాయి ..!!

దాహార్తితో బక్కచిక్కి
బిక్కచచ్చిన పొలాలన్నీ
వర్శామృతౌషదాలతో
పునరుజ్జీవనమై
పసిడి పంటలతో కళ కళలాడుతూ ఉంటే
ఆహ్హనం రాకున్నా అరుదెంచిన ధాన్య లక్ష్ములు...!!!

చరా చరాన్ని జాగృతం చేసే వరుణా...!!
నిను వర్ణించ తరమా ..!!??
నీ రాక
నా ఎడారి హృదయాన
పూల గోదారుల్ని పొంగిస్తూ ..!

ఉప్పొంగే గంగా తరంగానివై
నా కలంలో అవ్యక్తానంద
భావాక్షర కెరటాల్ని సృష్టిస్తూ ...

*4.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి