పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

17, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

చదివిన కవిత్వ సంపుటి - 33 (కవి సంగమం ) కవిత్వ సంపుటి పేరు :- " ప్రవహించే పాదాలు " (కవిత్వం ) సంపుటిని రాసిన కవి పేరు :- " మంత్రి కృష్ణమోహన్ " సంపుటిని పరిచయం చేస్తున్నది : - " రాజారామ్.టి ” " అంతంరాంతర సీమల్లో ఆర్తి భ్రమర భ్రమణ ఝుంకార సంగీతం కృష్ణమోహన్ కవిత్వం “ 'ఇద్దరి మధ్య' 'మనసైన పుస్తకం' ' ప్రేమ '. జీవితపు 'డైరిలో ఒక పేజి ' అది అని ఆలోచిస్తూ, 'ఓ లో తట్టు దృశ్యం 'చూసినప్పుడు 'పోయమే రాయనక్కర్లేదు అని అనుకొంటూ, '. 'తడి ఆరని రాగాన్ని 'ఆలపిస్తూ ఓ' రాత్రి ' 'దుఃఖగీతం' పాడుతూ 'తిరిగిరాని వెన్నెల 'కోసం 'ముకురం ముందు ' 'ఒక నిట్టూర్పు' విడుస్తూ "చెట్టు పోయిన తరువాత 'కూడా 'జరిగింది చాలు 'అని అనుకొని 'దయావర్షం 'లో 'ప్రవహించే పాదాలు 'నడిస్తే కానీ 'వాళ్ళు చల్లబడరు "-అని 'ఏక వాక్యం 'తో చెప్పలేక ఏకంగా 'శిలా గీతం ' తో 'మైదానం 'లోకి వచ్చి 'ఆత్మని చూడు ' అని 'మట్టి మనసుకు నీరాజనం' ఇచ్చిన కవి మంత్రి కృష్ణమోహన్. నిజంగా ఆయనెవరో తెలీదు. తలగడ పక్కనే ఎన్నో రోజులుగా నా కంటి స్పర్శ కోసం నిరీక్షించిన సంపుటిలోని కవిత్వ పాదాలు నా మీద నుంచి నడచి ప్రవహించాయి ఈ రోజు.'కవిత్వం మీద వున్నంత ప్రేమ ' దేని పైన లేదేమో? అని ఇంట్లో అందరూ అనుకునేంత నన్ను ముంచేశాయి. "నిజానికిది ప్రేమ కవితా? లేక నిస్సహాయుడి గుండెకోత” ఈ సంపుటి అని నన్ను ఆలోచనా యాతనకు గురిచేసిన కవితా సంపుటి ఇది. 'ప్రేమేతరమైంది ప్రతిదీ దుర్భరమే దుస్సహమే'- అంటాడు కిరణ్ క్రాంత్ 'రాగధూళి'లో. ప్రేమ మినహా జీవితంలో మరేమీ లేదా?-అని అనుమానమొచ్చినప్పుడు వొక కవయిత్రి అది కూడా జీవితంలో ఒక ప్రధాన భాగమే కదా!-అని వాదనకు దిగింది.అంతటితో ఆ చర్చ ఆపేస్తే బాగుంటుందని నిలిపేశా.నా కున్న వ్యసనాల్లో ఒకటి నా కన్నా తక్కువ వయసున్న వాళ్ళతో ఇష్టంగా మాట్లాడటం. వాళ్ళు చెప్పేవి వినడం.ఓ రోజు LOVE అంటే ఏంటి అని నాకు బాగా సాన్నిహిత్యమున్న కుటుంబం లోని వార్నిఅడిగితే ఓ అబ్బాయి లేచి "LOSS OF VALUABLE EDUCATION "-అని అన్నాడు.ఎంత గొప్ప ఊహతో చెప్పాడా పిల్లాడు అని అనుకున్నాను..నిజానికీ ఈ మంత్రి కృష్ణమోహన్ ఈ సంపుటిలో అక్కడక్కడ చేర్చిన ప్రేమ కవిత్వం నన్ను మంత్రముగ్ధున్ని చేసి మోహనం కలిగించింది నాకు చదివిన తరువాత. ప్రణయ భావనలతో రాయగూడదని కాదు నేనంటున్నది అదే ఒక్కటే కవిత్వం అన్న భావన ఉండగూడదని. కృష్ణమోహన్ కి అలాంటి భావన అసల్లేదు అందుకే "శిలా గీతం "-లాంటి నిరుత్తురులనే చేసే పద్యాలు రాయగలిగాడు. "మట్టి పలకలు"-అనే నానీలు రాసిన కృష్ణమోహన్ మార్కాపురం నివాసి.ఆ ఊరు రాతి పలకలకు పెట్టింది పేరు.ఒకప్పుడు ఇసుకలో అక్షరాభ్యాసం చేసిన దృశ్యం రానురాను రాతి పలకలోకి మారింది.తరచు ఆరాతి పలకలు పగిలి పోవడం,పారిశ్రామిక వ్యాపారీ కారణంగా పగిలిపోని , తక్కువ ధరలో లభ్యమయే రేకు,ప్లాస్టిక్ పలకల సృష్టి జిరిగింది.కాల క్రమేణా రాతిపలకలు మాయమయి పోయాయి మనిషన్నవాడు మాయమైపోనట్లు. కంఫ్యూటర్ కీ బోర్డ్ మీద అక్షరాలు నేర్చుకుంటున్న ఇప్పటి పిల్లలకు అసలు పలకా బలపాలు ఎట్లా తెలుస్తాయి అందుకే ఈ కవి ఆ రాతి పలకల ఆంతరంగిక దుఃఖాన్ని "శిలా గీతం" చేశాడు.ఒకప్పుడు దేశమంతా ఈ రాతి మీదే ఓనమాలు దిద్దింది.ఈ కవి తొలిపద్యం కూడా ఈ రాయి మీదే మొలకెత్తింది.అందుకే ఈ కవికీ "కవిత్వం మీద వున్నంత ప్రేమ"వుంది ఆ రాయి మీద. ఈ రాయి మీదే నేనక్షరాలు దిద్దున్నానంటే యీ పిల్లలు నమ్మటం లేదు ఈ రాయి పలకా బలపాల అర్థనారీస్వర రూపమంటే యీ పిల్లలు నమ్మడం లేదు" ఎలా నమ్ముతారు వారు అక్షరాలకు ఆసనమవ్వడానికీ ఈ రాయి ఎన్ని రాతి దెబ్బలు తిన్నదంటే.ఈ రాయే తన వూరి జనం పాటకు గ్రామ్ ఫోన్ రికార్డ్ అయ్యిందని,తన వూరి చరిత్రకు ఈ రాయే శిలాశాసనం అయ్యిందని కవి మనల్నీ ఒక మధురిమ ఙ్ఞాపకాలలోకి నడిపిస్తాడు. అతి చిన్న వూరిగా వున్న మార్కాపురం ఒక పట్టణంగా మారె దృశ్యాన్ని "కొలనులో నీటి అలల్లా పట్నమై విస్తరించింది"-అనే ఒక చిన్న భావ చిత్రాన్ని కల్పించి ఆ వూరి ఆర్థిక పురోగతికీ ఆ రాయి ఎట్లా కారణమయ్యిందో గొప్పగా చెప్పాడు.ఇట్లా గతవైభవ పునఃస్మరణ అనే ఒక లక్షణాన్ని ఒక కవి నుంచి మరొక కవి అందుకొని తెలుగు వచన కవిత్వాన్ని అనుభూతి అంచుల మీద నడిపించారు.కృష్ణ మోహన్ తన బాల్యపు స్మృతుల్నీ ఈ శిలా గీతంలో మనకు పంచి ఆ అనుభూతిని మన అనుభూతిగా చేశాడు.ఇదీ ఒక మంచి కవిత్వ లక్షణం. ఆది వారం చాల మంది కవులు’ ఫాదర్స్ డే ‘సందర్భాన్ని కవిత్వం చేశారు.అట్లాగే ‘మదర్స్ డే’ ని కవిత్వం చేశారు.నిజానికీ ఆ వొక్క రోజేనా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నది అని నాకు చాల రోజుల నుంచి ఒక అసహనపు ఏవగింపు ఆ రోజుల పైన.నిరంతరం తల్లి దండ్రులను ప్రేమతో ఆప్యాయతతో చూసుకోవాల్సిన బిడ్డలు వారి తల్లిదండ్రులను అనాథాశ్రమాల పాల్జేస్తున్నారు.డబ్బు సంపాదనా మత్తులో కొందరు,వృద్ధులైన వారికీ సేవ చేయడానికీ ఇఛ్చగించని మనసుతో కొందరు ఏదో ఒక ముసుగుతో మాట్లాడుతూ కన్న వారిని వృధ్దాశ్రమాలలోకి నెడుతున్నారు.ఇంతకన్నా విషాదం మరోటి లేదు.ఈ కవి ఆ విషాదాన్ని "ఎ విజిట్ టు వృధ్దాశ్రమం"-అనే శీర్షిక తో కన్నిటి కవిత్వం నిర్మించాడు. వృద్ధులు అలా వృద్ధాశ్రమాలలో వుండాటాన్ని ఈ కవి సమర్థించడు కానీ అవే లేకపోతే ఆ వృద్ధులకు ఊరట ఎట్లా?-అనే ప్రశ్న వేసుకొని తనే ఇట్లా సమాధానం చెబుతాడు. "మూడోతరంతో ముద్దులాడే ఋతువులో ఇలా సాటి వయసుల్తో సమయాల్ని సాగదీయడం ఒక బాధ ఒక ఊరట" ఆ వృద్ధాశ్రమాల వాతావరణాన్ని ఈ కవి ఇట్లా చిత్రించి మనలో ఒక వ్యథను సృష్టిస్తాడు. కడుపు కోతలు గుండె వాతలు కలసి మెలసి తిరుగుతున్నాయి అనారోగ్యాలు అసహాయతలు సహజీవనం చేస్తున్నాయి ముసలి గువ్వల మనోవ్యధల్ని అక్కడి చెట్టు చేమలు విచ్చుకున్న చెవుల్తో ఆలకిస్తున్నాయి" ఆ ముసలి గుండెల వ్య్థల్నీ సాటి మనుషులు పట్టించుకోకపోయిన చెట్టు చేమలు వింటున్నాయనే చిత్రణతో వాటికి మానుషత్వారోపణ చేసి గుండె కరగి నీరయి పోయే మాటల్ని కవిత్వంలో వొంపుతాడు. ఇలా వాళ్ళు వృద్ధాశ్రమాల పాలు కావడం వాన ప్రస్థం కాదు కర్మఫలమూ కాదు అదొకగెంటివేత మాత్రమే. ఆచీకటి కోణాలు దాచెస్తే దాగని సత్యాలుగా వున్న ఆ మలిసంధ్యలు(అంత్య దశలో వున్న వృద్ధులు) తమ మౌనాల్ని ఛేధిస్తాయని కవి ప్రస్ఫుటీకరిస్తాడు."ఈ యాతన ఎవరికీ అర్థం కానిది,ఈ క్షోభ ఎవరికీ స్పృశించనిది"-ఎవరికీ వారే అలా ఆ వృద్ధాశ్రమాలలోకి నెట్టివేయబడినప్పుడు మాత్రమే అర్థమయ్యేది-అని కవి ఒక సత్యాన్ని కవిత్వం చేశాడు. "వాళ్ళ పాదాల్లో వాళ్ళ పాదాల నీలి మేఘఛాయల్లో నాకో పల్లె కనిపిస్తుంది, వో పొలం కనిపిస్తుంది ఆ పాదాల చుట్టూ పచ్చని పైరగాలులు రెక్కలు విప్పుకొని కదుల్తూ కనిపిస్తాయి ఆ మెల్లని దయాపవనాలు శ్రమగీతాలకు ఆలాపనగా వినిపిస్తాయి ఆ పాదాల మెట్టెల్లో సూర్యచంద్రులు వొదిగి,తల దాచుకొంటారు కాబోలు ఆ పాదాలు,తారకలకు కాంతి భిక్ష పెడతాయి కాబోలు ఒక్కో పాదంవొక్కో ఆకాశ శకలం ఒక్కో పాదం ఒక్కో నదీ ప్రవాహం ఒక్కో పాదం వొక్కో మేఘసందేశం" ఇలా ఆకాశంలో అర్థ భాగమైన వారి పాదాల సౌందార్యాన్ని,సుకుమారత్వాన్ని,గొప్పదనాన్ని,ఆ పాదల అజేయ విజయాన్ని కవిత్వంగా మార్చిన కవి ఎవరంటే మంత్రి కృష్ణమోహనే. ఉన్నచోటనే వుంటూ అనేక కిలోమీటర్ల దూరం నడుస్తూ,ఇంట్లో బయట అనేక కార్యాలను చక్కబెడుతూ,బరువైన కాడితో బాధ్యతలను మోస్తూ,లలితంగా మృదు ధృఢంగా పాదాలు కల వారెవరు?-స్త్రీలవే కదా!.శ్రమ నినాదల్ని నిరంతరం లిఖిస్తున్న పాదాలు కావవి కారుణ్య శరీరాలు అవి అని ఒక అద్భుత పోలికను ప్రవేశపెట్టి ఇంకా ఆ పాదాల పట్ల ఎవరికైనానిర్లక్ష్య అభిప్రాయమ్ వుంటే తొలగించే ప్రయత్నం చేస్తాడు.శ్రమతో స్వేదాన్ని రాలుస్తున్న ఈ పాదాల గుర్తులు ఈ భూతలం మీద మూడొంతులు అని వారి పాదాల విశాలత్వాన్ని గ్రహించలేని కళ్లకు చూపిస్తాడు. బంగారు కంకణం కనపడకపోతే గాభరా పడి గదంతా వెతికినట్టు "మనసైన పుస్తకం"కనపడకపోతే అంతే దిగాలుతో గాలింపు చేస్తాడట ఈ కవి.మనసైన పుస్తం కనపడక పోతే పరాయి దేశంలో మనిషి తప్పిపోయినంత బాధ-అని ఒక భావాన్ని కవిత్వం చేసి తన పుస్తక ప్రియత్వం ఎంతదో తెలియ పరుస్తాడు ఈ సంపుటిలో ఓ కవితలో.ఆ పుస్తకం దొరక్కపోతే నుదుటి మీద చెమట ధారలు,భూన భోంతారాలు బద్దలయ్యిన భయం కలుగతాయని అతిశయోక్తిగా అన్న అందులో ఆ కవి పుస్తకాల పట్ల కనపరిచే ఆసక్తి ద్యోతకమవుతుంది. మనల్ని నిశ్చేష్టితుల్ని చేసి తన దగ్గర నిలబెట్టుకొని చదువించే కవిత "చెట్టు పోయిన తరువాత ". ఏదయినా కోల్పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలిసేది అన్న అంశాన్ని హత్తుకొనెటట్లు చెప్పిన కవిత ఇది.మనం రాళ్లేస్తే తాను పళ్ళు ఇచ్చేది చెట్టే.మనం నరికేస్తే మళ్ళీ మొలిచి మనకు నీడ నిచ్చేది చెట్టే.తన ఇంటి ముంగిట్లో తన కురులను తాకందే ఎవరినీ బయటకు వెళ్ళనివ్వని చెట్టును మొత్తంగా నరికేసినప్పుడు కవి నిర్మించిన కవిత ఇది.రోడ్డు వేసేవాడు తనకు ఆ చెట్టు అడ్డమయిందని,కాలువలు ఊడ్చేవాడు అది రాల్చే ఆకులు తీయడాని కష్టమైందని ఎన్నేన్ని మాటలన్న ఆ చెట్టు మాత్రం సూర్యుడు చురుక్కుమన్నప్పుడు వారందర్ని తన నీడ కౌగిలిలోకి తీసుకొని సేద తీరుస్తుందని కృష్ణమోహన్ భావన చేస్తూ గోడ పక్కన నాటిన ఆ రెండు మొక్కలు చెట్లయితే గోడని కూల్చేస్తానని వృక్ష పరిరక్షణావశ్యకతను ధ్వనిస్తాడు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్ని అట్లానే నిలబెట్టే ఆట క్రికెట్.అదొక సర్వస్వంగా భావించే వాళ్ళు ఇప్పటికీ వున్నారు.ఆ అట జరిగేటప్పుడు,అయిపోయిన తరువాత కూడా దాన్ని గురించే స్థితి ఈనాటికీ వుంది.కార్యాయాలకు,స్కూళ్లకు డుమ్మా కొట్టి ,ఆఖరుకు పనులన్ని ఎగరగొట్టి ఆ ఆటను టి.వి ల్లో చూస్తున్నారన్న విషయం ఎవరు కాదనలేరు.అనంతపురం జిల్లాలో చాల కాలమే కీర్తిశేషులైన కవి కాకి (కోగిర జై సీతారామ్) పుట్టిన బిడ్డ క్యార్ క్యార్ మని ఏడవకుండా స్కోర్ స్కోర్ అని ఏడుస్తారని ఈ క్రికెట్ గురించి రాసినట్టు ఙ్ఞాపకం.ఎంతగా ఈ ఆట ప్రభావితం చేసిందంటే ఒక ఆటగాడికీ భారతరత్న ఇచ్చేటంతగా.ఈ ఆటని కవి మంత్రి కృష్ణమోహన్ "డైరీ లో ఒక పేజి" అనే కవితలో మనల్ని ఆలోచనలోకి నెట్టెసెటట్లుగా కవిత్వం చేశాడు. " ఆరోజు టి.వి తెర ముందు శిలా స్తంభాన్నవుతాను కళ్ళను వికెట్లకు కాపలా వుంచి గంటల కాలాన్ని కుప్ప పోసి తగలేస్తాను చలి మంట కాచుకోడానికి మరో నలుగురు చేరిపోతారు" కవి ఈ కవితలో ఈ ఆట కాలాన్ని ఎంతగా వృథా చేస్తున్నదో చెప్పడమే కాదు,ఈ ఆట ఎట్లా దేశ ఆర్థిక స్థితి సంక్షోభంలో పడటానికీ కూడ కారణమవుతున్నదో ఒక దృశ్యాన్ని చూపిస్తూ,ఆ రోజటి ఆకలి దప్పుల్ని సైతం మరిపించి మురిపించగల శక్తి ఈ ఆటకున్నదని "కడుపాకలి కళ్ళు తీరుస్తాయి దేహం దాహాన్ని మరచి పోతుందని"- వ్యక్త పరచని దుఃఖంతో చెబుతాడు. ఆటకు సంబంధించిన పారిభాషిక పదాలను కవిత్వం చేయటం అంత సులభం కాదు.అందులోను ఆ పదాలు ఆ కవితలో ఒదిగిపోయేటట్లుగా రాయడం అనుకున్నంతతేలిక కాదు.క్రికెట్ ఆటకు సంబంధించిన పదజాలాన్ని ఈ కవి ఎంత నేర్పుగా ఈ కవితలో వొంపాడో సొగసుగా చేశాడో చూడండి. ఆట బంతి చుట్టూ పరిభ్రమిస్తుంది చూపు పిచ్ మీద పరచుకొంటుంది బౌలర్ వేసే ప్రతి బంతికీ సాగిలపడ్డ వెన్నుపూస వికెట్ లా నిలబడిపోతుంది బౌండరి దాటే బంతి కోసం భారి సిక్సర్ కోసం కళ్ళు బైనాక్యుర్లయి కూర్చుంటాయి" ఇలా కవి క్రికెట్ ఆటను కవిత్వంలోకి తీసుకొచ్చి నిద్రలేక 'ఎర్రబడ్డ కళ్ళు నులుముకుంటున్న ' వాళ్లు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారు కదా!-అని నిట్టూర్పు విడుస్తాడు. 'కోపగిస్తాం గానీ/మనం నవ్వితే ఏడ్చే/ఏడిస్తే నవ్వే మనుషుల కంటే/అద్దం చాలా నయం కదూ!'-అని అంటున్న ఈ కవి తనే 'అద్దాన్ని బద్దలు చేయాలనిపిస్తుంది/ఒక్కరోజైనా/ఆప్యాయంగా పలకరించనందుకు'-అని విరుధ్ద భావాలతో చెబుతాడు.అద్దం ఎప్పుడూ వున్నది వున్నట్లే మాట్లాడుతుంది.హిపొక్రటిక్ గా వుండదు మనుషుల్లా.ఒక అద్భుత భావ సంచయాన్ని ఈ కవితలో కవి నిక్షిప్తం చేశాడు. 'ఒకప్పుడీ యవ్వనానికీ /అందాన్ని ఆరాధించటం / దినచర్యలో భాగమై వుండేది"-అనటం అప్పటి యువకుల మనస్తత్వాన్ని చిత్రిస్తాడు.'అందంగా తీర్చిదిద్దిన / తైల వర్ణ చిత్రం మీద / ఆకస్మికంగా యాసిడ్ పోస్తే "-అని అనటంలో ఈనాటి యువకులు ప్రేమ పేరుతో స్త్రీల మీద యాసిడ్ దాడులు చేసే సంఘటనను గుర్తుకు తెస్తాడు.'అల్లారు ముద్దుగానో ,అపురూపంగానో /చూసుకుంటున్నవన్నీ/ వొక్కొటొక్కటిగా కనుమరుగైపోవడమూ'-అని అనడంలో తల్లి దండ్రులు పోగొట్టుకున్న పిల్లల్ని ఙ్ఞప్తి చేస్తాడు. 'కానీ పచ్చగా ఎదిగిన పైరు మీద / వికృత కీటకాలన్నీ /మూకుమ్మడిగా దాడి చేస్తే '-అని అనటంలో అడకూతుర్లపైన లైంగిక దాడికి పాల్పడుతున్న వికృతత్వాన్ని స్ఫురణకు తెస్తాడు. ఇవన్నీ "ముకురం ముందు "అన్న కవితలో కవి వ్యక్తపరిచినవి.ఈ కవితలో ప్రతి పాదం కవిత్వమై పారాడింది."మంచు శిల్పంన్నించి /సౌందర్యంన్బొట్టు బొట్టుగా నేల రాలడం అసహజమేం కాదు"అని అంటున్న ఈ కవి "అంతా మన వేదనాజ్వలిత నిస్పృహే కాని అసలు పతనమయ్యేది సౌందర్యం కాదంటాడు.అద్దంలో ఎవరైనా కనీసం వారికి వారైన సమ్మోహనంగా కనిపించకపోరనే మనస్తత్వ శాస్త్ర అంశంతో ఈ కవిత చిత్రంగా ముగుస్తుంది.ఈ కవి శిల్పనిర్మాణ నేర్పుకు ముకురమే ఈ కవిత. "స్పీక్ ఇన్ ఇంగ్లీష్" "స్పీక్ ఇన్ ఇంగ్లీష్"-అనే ఏక వాక్యం ఒకే వాక్యం ఒకే వాక్యం కిటికీ కిటికీ కీ వేలాడుతున్న వాక్యం ఇవాళ చాలమందికి ముచ్చటైన వాక్యం తన గుండెలో బల్లెంలా ఎలా గుచ్చుకుందో ఆ చిన్న వాక్యం పాములా తన ఒంటిపై ఎలా పాకిందో చెబుతూ, మనల్నీ వాస్తవానికీ కల్పనకీ మధ్య నిలబెట్టి నిలదీస్తున్నట్టుగా అనిపించేటట్లు ఈ కవి రాసిన కవిత "ఏక వాక్యం".మాతృభాష పట్ల మమకారాన్ని పెంచే వాక్యం . చేతిలో చిల్లిగవ్వ వుంచుకోకుండా,ముఖంలో దిగులు వర్ణాల్ని చూపించకుండా త వారసత్వంపై విశ్వాసం వున్న నాయనమ్మను "అంతరం"-అనే కవితలోనూ,ఎన్నో మార్లు రూపం మారి మారి ఇవాళిలా మిగిలిపోయిన నాయనమ్మను "నానమ్మ కళ్ళ్ద్దాలు "అనే కవితలోను ఇంతవరకు మనం చూడని వైవిధ్యంతో చిత్రించాడు. బెలూన్ లతో అందమైన బొమ్మలు తయారు చేసే వారి జీవితాలు వారు తయారు చేసే గాలి బొమ్మల వలే ఆకలి చూపుల కిరణప్రసారాల ముందు పేలిపోతాయనే వేదనను "బొమ్మా-బొరుసు" లో చూపిస్తాడు.ఓ తడి ఆరని రాగాన్ని మనతో ఆలపింప చేస్తాడు. "నువ్వు వదిలివెళ్లిన లోకంలో నేనో ఒంటరిని,మూగ బాధని. ఈ రాత్రి ఈ నిముషం ఇప్పటికీ కాలిపోతున్న వాణ్ణి కరగి నీరౌతున్న మనిషిని " ఈ మాటలు తన దేవి స్మృతుల్లో ఈ కవి తడి ఆరని దుఃఖంతో మాట్లాడినవి.ఇపుడీ అక్షరాలనిండా ఆవిడా చిహ్నాలే.ఓ ఙ్ఞాపకాల పూలతోటే.ఒంటరిగా వెళ్ళటం అలవాటు లేని ఆవిడ "ఎవరికీ మాట మాత్రం చెప్పకుండా అర్థరాత్రి చీకటిలో అర్థాంతరంగా..వెళ్ళిపోతే కన్నీరు మున్నీరై తల్లడిల్లిపోయి రాసిన రాసిన వాక్యాలివి.రాసిన ప్రతి వాక్యంలో ఆమెనెంత అపూర్వంగా ప్రేమించాడో హృదయపు గూడులు కదిలేటట్లుగా ప్రతి కదలికలో ఓ పొందిక ప్రతి చర్యలో ప్రేమ ప్రబింబేచించేటట్లుగా చెప్పిన కవిత. "ఓ పాట నవుతాను,ఆగిపోతాను ఓ శిలనౌతాను,నడుస్తాను కఠిన సత్యంతో పోరాడుతాను,శాంతపడతాను జీవితాన్ని అర్ఠం చేసుకుంటానికి యత్నిస్తాను అయినా ,అశాంతి ద్వారం దగ్గర ఆగిపోతాను" ఎంతటి ఆవేదనాత్మక వాక్యాలో ఇవి అంత ఆలోచనాత్మక వాక్యాలు కూడా ఇవి. ఎంత దూరం నడిచినా,ఎంత కాలం గడిచినా ఆవిడా ఙ్ఞాపకాల పూదోటలో తానెప్పటికి తడి ఆరని రాగాన్నేఅంటున్న కృష్ణమోహన్ నిజంగా గొప్ప దేవీ ప్రేమికుడు.ఒక హృదయ దగ్ధ గీతం ఈ "తడి ఆరని రాగాన్ని "-అనే పద్యం. "నిత్యం దుఃఖపు కోణాలు స్పృశిస్తావు /నిరంతరం జీవన వేదాంతాలు జపిస్తావు '-అని అంటున్న కవి, ఇవాళ రాసే వస్తువు మారాలా? రూపం మారాలా? సారం మారాలా?-అని ప్రశ్నలు వేస్తున్నకవి , "కవిత్వ సింధువులో నేనొక బిందువు"-అని వినయంగా అంటున్న కవి ,"చుట్టూ వున్న చీకటి ఇంతగా వెక్కిరిస్తుంటే నేనొక మిణుగురునై చిన్న పద్యానికైనా శ్రీకారం చుట్టకుంటే ఎలా?"-అని తడి వాక్యాలు రాస్తున్న కవి మంత్రి కృష్ణ మోహన్. ఒక మంచి కవితా సంపుటిని అందించినందుకూ ఆ కవిని అభినంస్తున్నాను.ఉత్తమ కవిత్వం రాయాలనుకునే యువ కవి మిత్రులకు ఇలాంటి కవిత్వం విరివిగా చదవమని చెబుతూ...వచ్చే మంగళ వారం మళ్లీ కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i2JivZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి