పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మే 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

"కవి సంగమం " చదివిన కవిత్వ సంపుటి :- 28 పరిచయం చేస్తున్న కవిత్వ సంపుటి " సమాంతర ఛాయలు " (కవిత్వం) కవిత్వ సంపుటి రాసిన కవి "మువ్వ శ్రీనివాస రావు " (క్రాంతి శ్రీనివాస్ ) పరిచయం చేస్తున్నది :- రాజారామ్.టి "కవిత్వమంటే సూర్యుడూ చంద్రుడూ కాదు నేలతల్లి చూపుడు వేలి కదలిక కవిత్వమంటే భావనల సౌరభంలో తడిసిన అక్షరచలనాలు మాటల భ్రమణాలు కవిత్వమంటే నిరంతరం పారేది అనుక్షణం మారేది - (భ్రమణ చలనం) “ఇదే కవిత్వమన్నోళ్ళుఇలానే ఉంటుందన్నోళ్ళు" కవులు అనేకులు విమర్శకులు ఎందరో మనకు తారసపడే వుంటారు.కానీ ఖమ్మం కవి మువ్వా శ్రీనివాసరావు మాత్రం భావాలు కురిపించి తనకు తోచినట్టు రాసే కవినని " భ్రమణచలనం" అనే కవితలో చెప్పుకొన్న అతను ఎంత మంచి కవో అఫ్సర్, అరుణ్ సాగర్,యాకుబ్,ఖాదర్ మొహిద్దిన్, ప్రసేన్ ,కె.ఆనందాచారి,బి.వి.వి.ప్రసాద్, సీతారామ్ గార్లు రాసిన మాటలే చెబుతాయి.ఖమ్మం గుర్తు రాగానే పైనపేర్కొన్నవారేకాదు గాలికట్ట విద్యసాగర్,ఈ క్రాంతి శ్రేనివాస్ కూడా ఙ్ఞాపకానికొస్తాడు నాకు. ఎందుకంటే శ్రీశ్రీ ని నాకన్న ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి. "చరిత్ర అయినా,కొందరు మనుషులయినా,కొన్ని సంఘటనలయినా రూపం మార్చుకుంటాయి" కవిత్వంగా మారి బాహ్య స్వగతం అవుతాయంటాడు అఫ్సర్ క్రాంతి కవిత్వ రహస్యాన్ని విప్పుతూ. "ఈ కవిత్వాన్ని ఎవో కొన్ని రెఫరెన్స్ లతో తూచి కొలచి ఒక చట్రంలో ఒదిగించి విశ్లేషించలేనంటూ సాటి కవి అరుణ్ సాగార్ క్రాంతి శ్రీనివాస్ గారి వాక్యాలు "మంచి మాగాణిలో చేసిన అక్షర సేద్యంలో పుట్టాయి"అని వ్యాఖ్యానించాడు."మరణానికీ జీవితానికీ నడుమ తెరల కదలికలోంచి తొంగి చూచే దృశ్యాదృశ్యాల శ్వాస తెలిసిన సమాంతర ఛాయా గ్రాహకుడని" యాకూబ్ కితబునిచ్చాడు. అంతర్ముఖ వ్యాకూల కవిత్వంగా ప్రసేన్ భావిస్తే కె.ఆనందాచారి గారు "ఎంతో వస్తు విస్తృతితో,కవిత్వం కావాలన్న దాహంతో,కలలు కనే మనసుతో అధర్మంపై,అన్యాయలపై అసమ సమాజ దుష్టత్వంపై కవితా యుధ్ధ సైనికునిలా"రాశాడని క్రాంతి శ్రీనివాస్ ని గురించి అన్నాడు."జీవితంలో కవిత్వాన్ని పసిగట్టడంలోనూ,కవితలో సునాయసంగా జీవితాన్ని నింపడంలోనూ కవి నేర్పు కనిపిస్తుందని"బి.వి.వి ప్రసాద్ గారంటే ఖాదర్ మొహియుద్దిన్ "ఖండఖండాలుగా విభజితమయిన జీవన మహాసమరం తాలూకు ఒక మహవృత్తాంతం "-క్రాతి శ్రీనివాస్ కవిత్వం అని అన్నారు.చివరగా సీతారామ్ "ఇతను ముట్టించిన కవిత్వ దీపం ముందు కూర్చోండి " . అని " సమాంతర ఛాయలు" కవైన శ్రీనివాస్ కవిత్వాన్ని గూర్చి అంటాడు. ఈ ఒక్క మాటతో శ్రీనివాస్ కవిత్వం దీపంలా ఎన్నెన్ని అర్థకిరణాలని వెదజల్లుతుందో సీతారామ్ స్ఫురింపచేస్తాడు. ఇందరు ఈ సంపుటిని విశ్లేషించాక మళ్ళి నేనెందుకు రాయడమా? అన్న ఆలోచన ఇన్ని రోజులు ఈ సంపుటిపైన రాయనీయలేదు. కానీ...ఆతరువాత అనిపించింది కవిత్వమనేది అందరు చదువరులకు వొకే రకం అనుభవాన్నివ్వదు అని.ఆ చదువరుల జీవితానుభవం కానీ, కావ్య పఠానుభవం కానీ కవిత్వాన్ని అర్థం చేసుకుండే తీరును ప్రభావితం చేస్తాయనిపించింది.పైగా స్వానుభూతుల నేపథ్యంలో వొక్కో పాఠకుడు వొక్కో కవితను వొక్కో రకంగా అర్థం చేసుకుంటాడేమో?. అందువల్లా నాకు అర్థమయ్యే పరిమితిలో రాయోచ్చు కదా అని అనుకున్నా. " సమాంతర ఛాయలు" చదవడం మొదలెట్టగానే అది "మానవ జీవితానుభవాల పొరలను కెరలించిన కవిత్వంగా అనిపించింది. ఈ కవిత్వ కాంత కాలి 'మువ్వ'ల శబ్దం చిత్రంగా వినిపించి చదివించి మైమరిపించింది. "ఖమ్మం" ఎందుకంత ఎర్రగయ్యిందో,మందార పూలమయ్యిందో క్రాంతి శ్రీనివాస్ భావన నిజమో వూహనో ఊహించలేను కానీ ఈ ఆలోచన మాత్రం గొప్పగా అనిపించింది "1975...పోరాటగాథ " కవిత చదివితే.ఈ 1975 కాలాన్ని చీకటి రోజులు గా చరిత్ర గుర్తించింది." ఏందిరా?"-అని అన్న వ్యక్తిని "ఇందిర"అని అన్నాడని ఖాకీలు నిర్భంధించిన రోజులవి. బియాబానీ -అనే సామాన్య ముస్లిమ్ కుటుంబానికీ చెందిన యువకుని చుట్టూ తిరుగుతూ, ఆ చీకటి రోజుల్లో కాలువలా ప్రవహించిన రాజ్యహింసను,కరకు ఖాకీల దుర్మార్గపు దౌష్ట్యాలను ఈ కవిత గుర్తుకు తెస్తుంది. "మా వూరి మర్రి చెట్టు మీద అర్థరాత్రి మందారం పూసిందని ఖాకీలు కాలువల్లా ప్రవహించాయి తుపాకీ గొట్టాలు తూరుపు మొక్కలను పసిగట్టాయి తెల్లవార్లూ లాఠీలు ఎముకలూ మాట్లాడుకొంటూనే వున్నాయి" తూర్పున ఉదయించేది సూర్యుడే.ఉదయించే సూర్యుడు ఎర్రగా వుండి తిరుగుబాటు సంకేతమవుతాడని కవి మన ఊహకు వదిలేస్తూ ,తూర్పు మొక్కలు అని అనటంలో ఇంకా యవ్వనంలో అడుగుపెట్టని వాళ్ళనే స్పృహని అందిస్తాడు ఈ వాక్యాలా ద్వారా."లాఠీలు ఎముకలు మాట్లాడుకుంటునే వున్నాయి"-అని అనటం వలన ఆరోజుల్లో పోలీసులు ఎంతటి ఘాతుకాలకు పూనుకున్నారో కవి సూచిస్తాడు."మర్రిచెట్టు మీద మందారం పూసిందనే" ప్రతీకాత్మక వాక్యంతో ఊర్లోని పిల్లలో కూడా ఆ పరిస్థితులకు ఎదురుతిరిగే తత్వం ఏర్పడిందనే భావనను ఈ కవి అందిస్తాడు వూరిని ప్రతీకగా చేసి. సగం వూరు నిద్రపోకుండా ఆ పైశాచిక భాషని అనువదిస్తూనే వుంది తల్లి పేగును మాత్రం తప్పుడు తర్జుమాలతో వోదారుస్తూనే వుంది' ఊర్లోని ప్రజలు ఎమర్జన్సీ కారణంగా ప్రజలు నిద్రని కూడ కోల్పోయారని చెప్పడమే కాదు కొందరు ముఖ్యంగా పాలకవర్గాలు ఆ అత్యవసరస్థితిని బలపరుస్తు తప్పుడు సంకేతాలను ప్రజలకీ అందించారనే అంశాన్ని ఈ కవి పై మాటల్లో పేర్కొంటాడు.బియ్యాబానీని క్రాంతి శ్రీనివాస్ సకల జీవులను ప్రేమతో తాకి పలకరించే శిర్డి సాయితో, కాలం దింపిన మేకులతో వున్న ఏసుక్రీస్తుతో ఉపమిస్తాడు.అప్పటి కాలంలో సామాన్యుడైన బియ్యాబానీ వొక అసామాన్యుడిగా చిత్రీకరించబడిన చారిత్రికతను అర్థం చేసుకోవచ్చు."మా వూరికిచ్చిన బహుమతి/బియ్యాబానీ సాక్షిగా/ఇప్పుడు మా వూరినిండా/మందారాలు విరబూస్తున్నాయి'-అని ఈ కవి పోలీసు పాలనలో నలుదిక్కుల పారిన నెత్తుటి కాలువల" ప్రవాహపు ఘాతుకాల వల్లా పెరిగిన ఎరుపును దాని వ్యాప్తి కారణాలను సహేతుకంగా పేర్కొని ఆ ప్రాంత చరిత్రను పరోక్షంగా నమోదు చేశాడు ఈ కవి. చరిత్రతో పాటూ,అప్పటి సామాజిక స్థితిని, రాజ్యహింసను ఒక చారిత్రక అవగాహనతో రికార్డ్ చేసే గొప్ప శిల్పంతో ఆ చీకటి రోజుల భీభత్స సమవాకార దృశ్యాన్ని దృశ్యమానం చేస్తూ ఈ కవి "1975...ఓ పోరాట గాథ" అనే ఈ కవితను రాశాడు. "మహా నగరమంటే బజార్లని ముట్టుకోకుండా లోతయిన లోయలుగా తవ్వుకోవడమేనట" అని చెప్పే ఈ కవి ఇతరకవుల వలె మహానగర జీవితలాలలోని ఛిధ్రతని ,భీభత్స విధ్వంసతని,రొదల్ని మాత్రమే చెప్పకుండా ఈ "మహానగరం" అనే కవితలో మహానగరాల రూపంలోని డొల్లతనాన్ని,"జన సముద్రంలో మంచితనం కోసం వెతుకులాటే"నని ఆ మంచితనం ఏమాత్రం కన్పించదని ,మహానగరం మానవ బతుకుల్ని బహు చౌకగా అమ్ముకొనే తిర్ణాలా అని పేర్కొంటాడు.మహానగరం మనని మనం కొనుక్కుంటే తప్ప మిగలకుండా చేసే ఆర్థిక సూత్రాన్ని కూడా ఈ కవి ధ్వనింపచేస్తాడు.నగరం మహానగరంగా రూపొందే క్రమంలో ఆ నగరం చుట్టు వుండే ఊర్లు నగరంలో కలసిపోతాయి.ఆ అంశాన్ని ఈ కవి "ఉసిళ్ళలా ఊళ్ళన్నీ అక్కడే వాలిపోతున్నాయి"-అనిచెబుతూ నగరాల వెలుగుల భ్రమలో గ్రామాలు ఎలా మాయమవుతున్నాయో స్పష్టం చేస్తాడు."ఉసుళ్ళు" అనేవి వర్షం పడి వెలిసిన తరువాతా పుట్టుకొచ్చే చిన్న కీటకాలు.దీపపు కాంతులకు భ్రమసి ఆ దీపపు చుట్టు తిరుగుతూ జీవితాన్ని చాలిస్తాయి.వీటిని కవితలో పోలిక చేసి ఒక గొప్ప ఊహను పాఠకులకు అందించి వారి అవగాహనను విస్తృతం చేస్తాడు. "ఆరుబయట నులక మంచం మీద ఆరబోసుకున్న నేను బిగదీసిన కాళ్ళ కట్టపై గాలి కెరటాలలో తేలియాడుతూ విశాల విశ్వం నే వీక్షిస్తున్నపుడు శాంతి దీపమేదో లోపల వెలిగి ఆలోచనలన్నీ ఆవిరై ఒకప్పుడు పల్లె ఒడిలో నేను వెన్నెల నీడల్లో మైమరచి విశ్రాంతి పొదేవాన్ని" అంటున్న ఈ కవి " ఇన్ సోమ్నియా"(నిద్ర లేమి)కి కారణమేమిటి?.అందుకు కారణం కూడా కవి క్రాంతి శ్రీనివాస్ "రేపటి జీవిత పరుగు కోసం/మూసిన రెప్పల వెనక రిహార్సల్ వేసుకొంటూ కరువైపోయిన నిద్ర కోసం నిద్రలో కలల కోసం మందులతో కలబడుతున్నాను."అని చెబుతాడు.నిద్రలేమికీ అదొక్కటే కారణంగా చెప్పడు."ఆత్రపు ఆదుర్దా తరంగాలను అదే పనిగా వినిపిస్తున్న కరెంట్ విసనకర్ర","మధ్య మద్యలో కరెంట్ కోతలు కరివటం" కారణాలుగా చెబుతాడు.నిద్ర లేని రాని తనాన్ని ఎంత అద్భుతమైన పోలికతో సాదృశ్యం చేస్తాడంటే "అమ్మ కోళ్ళను గంప కింద కప్పెట్టినట్టు రాత్రి ఒక్కొ శబ్దాన్నీ పట్టుకొని దాచేస్తు పోతుందని".ఒక సాంద్రమైన అనుభూతిని భావ చిత్రాల పదచిత్రాలతో కలిగిస్తాడు. ఫ్యాన్ ను కరెంట్ విసన కర్ర అని అనటం వైచిత్రిగా తోస్తుంది. "24 ఇంటు 7 చిరుత పులి కళ్ళతో చెలరేగుతునే ఇంటింటికీ నిజాన్ని చెప్పాల్సిన" ఫోర్త్ ఎస్టేట్ గా నిలబడాల్సిన పాత్రికేయుడు "లేపాక్షి ఆలయంలో వ్రేలాడేస్తంభమై ఊరేగుతున్నాడు"అని ఈ కవి వ్యాఖ్యానిస్తూ.."గ్రద్ద కళ్ళెట్టుకొని" అతడు చేయాల్సింది చేయక చూడాల్సింది చూడక తెలియజేయాల్సింది తెలియజేయక వున్నాడనే భావాన్ని "దారితప్పిన కన్ను"-అనే కవితలో నిర్మొహమాటంగా చెబుతాడు.జీవితం "అంతా లెక్కే"అని కవి "లెక్కలు రాని మనిషి రెక్కలు తెగిన పక్షి ఒక్కటే"అంటూ ఒక జీవన సత్యాన్ని ఇలా కవిత్వం చేస్తాడు క్రాంతి శ్రీనివాస్. "సంక్లిష్ట జీవిత గణిత శాస్త్రంలో సమాధానాలు దొరికే దాకా ఎవరి సిద్ధాంతం వారు ప్రకటిస్తూ పోతూనే వున్నారు వేల కొట్టివేతల మధ్య నుండి సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తూనే వున్నారు" ఇలా కొన్ని కవితల్లో ఈ కవి తాత్విక భావనల చర్చను లేవదీస్తాడు. "దేహ మాళిగలు"అనే కవిత ఇందుకు ఉదాహరణ. మధ్య తరగతి ప్రజల జీవితాల్లోని కుహన ఆడంబర డాంభికత్వాన్ని,పరువును ప్రాణం కన్నా మిన్నగా చూసుకుండే తత్వాన్ని, రెండు విసురాళ్ల మధ్య పెసర గింజల్లా పగిలి నలిగే వనాన్ని"మధ్య తరగతి ఇప్పుడు మిధ్యా తరగతి మధ్య తరగతిగా మార్పు చెందుతోది "అంటూ ఎప్పుడూ/ఒక సంఘర్షణ ఒక సంక్షోభం" ఆ ప్రజల జీవితంలో ఒక భాగంగా నిలిచివుంటుందనే భావనను ఈ కవి వ్యక్తం చేస్తాడు.ఈ సంపుటిలో వున్న అనేక మంచి కవితల్లో "నేల దీపం "కూడా ఒకటి.కుల వృత్తుల పతనం గ్రామాల్లో జరిగిన వైనం,ఆ వృత్తుల్ని కాపాడుకోవడం కోసం ఏంచేస్తే సమంజసమో ఈ కవి తన తండ్రి చేసిన పనితో కవితను ముగిస్తాడు.మంగలి నారాయణ,చాకలి లక్ష్మయ్య,కుమ్మరి వెంకయ్య లేకుండా పెళ్లెట్లా చెయ్యాలని? సంశయపడే నాన వార్ని పిలిచి చుట్టాలని పక్కన పెట్టి చుట్టలు వాళ్ళ్తో కలసి కాల్చుకొంటూ పల్లెను మళ్ళి పెండ్లి పందిట్లో బతికించాడని-ఈ కవి మనసు తడి అయ్యేలా రాశాడు."పొదిలో పదిలంగా వుండాల్సిన బతుకు"ఛిద్రం కావడాని కారణం మంగల నారాయణ అన్నట్టు రాసిన వాక్యాలు ఇవి.వోడిపోయిన కోడి పుంజుల పాపం ఉత్తినే పోద్దా బాబు"-అని.ఈ మాటల్లో కర్మ సిద్దాంతపు వాసనలు కనిపించినా కవి అలా వారి బ్రతుకులు మారటానికీ గల కారణాలను సరిగ్గానే అంచనా వేశాడు.కుమ్మరి వెంకయ్య నవ్వుని "ఘట వాయిద్యం"తో ఉపమించడం లాంటి శిల్ప రహస్యాల్ని ఎంతో నేర్పుతో ఈ కవి పట్టుకొన్నట్టు గుర్తించవచ్చు. జీవితం జారిపోకుండా,జావగారిపోకుండా వుండేందుకు మహ నటుడిగా మారిపోయే మానవ బలహీనతల్నీ కూడా ఈ కవి నిజాయితితో చిత్రించాడు. "క్షమించకు తల్లీ కనీస అర్హతలేని కుహనా ప్రజాస్వామ్యాన్ని క్షమించకు తల్లీ పేట్రేగిన మూర్ఖపు మగ స్వామ్యాన్ని" అంటున్న ఈ కవి స్త్రీవాదం పట్ల సహానుభూతిని అనేక కవితల్లో బలపరుస్తాడు."హక్కుల్లో సగభాగం వస్తుందో రాదో/ఆకాశంలో సగం కాస్తా పాతికయ్యింది" అంటూ గర్భస్థ పరీక్షలతో పుట్టక ముందే మరణం పాలవుతున్న ఫిమేల్ ఫీటస్ ల దుస్థితిని కన్నీటితో "ఉమ్మ నీటి కన్నీరు'-అనే కవితను ఈ కవి చిత్రించాడు. మానవజీవితం నేడు "కరప్టెడ్ సాఫ్ట్ వేర్ "అయ్యిందని అందుకే హార్డ్ వేర్ లోకి కొత్త సాఫ్ట్ వేర్ అయిన ఎక్కించాలి లేదా సిస్టమ్ ను ఫార్మట్ చేయాలి అని ఈ కవి కంఫూటర్ పారి భాషిక పదజాలంతో ఒక కవిత రాసి తన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.ఇట్లా ఇంకా కొందరు కవులు కూడా రాసినట్టు ఙ్ఞాపకం. ఇంతకు ముందే చెప్పాను ఈ కవి స్త్రీ స్వామ్యాన్ని ఆహ్వానించేవాడని,నిజాయితిగా దేన్నయినా ఒప్పుకోగలడని."నేను నేను గానే వున్నప్పుడు/ఆమె నాలా మారి/ఆమె ఆమెగానే వుండాలనుకొన్నప్పుడు నన్నామెగా మార్చుతుంది"-అని తన జీవిత భాగ స్వామి గొప్ప తన్నాన్ని అంగీకరిస్తూ..'ప్రేమాన్నం పళ్ళెంలో పెట్టడమే గాక తనను "అప్ డేట్"కూడా చేస్తుందని చెప్పి ఆవిడపై తనకు గల ప్రేమను ,కృతఙ్ఞతను కవితా బద్దం చేశాడు.ఇలా పిల్లల పెంపకం ,వారి చదువులు ఎన్నేన్నొ అంశాలను వివిద కోణాల్లో ఈ క్రాంతి కాంతివంతం చేశాడు.మాములుగా పరువు ఆట్మహత్యలు జరుగుతాయి.కానీ దొర సానమ్మ పోరగాన్ని తగులుకొంటే దొర పరువు కోసం పోరగాన్ని హత్య చేసిన దృష్టాంతాన్ని "పరువు హత్య"అనే కవితగా చేసి "తుపుక్కున ఉమ్మే" ఛీత్కారాన్ని దొరల పట్ల కలిగిస్తాడు శ్రీనివాస్. "బిల్లులో పదో పాతికో రావాల్సివస్తే/వదిలేసి యాభై రూపాయలు ఖరీదు చేసే కృతఙ్ఞత కోసం/బేరర్ మొహం వెదుకులాడే పగిలిన పోయిన మన మొహాల గురించి చెబుతూ"విజయం వెనుకాల/పరుగెత్తడం మానుకోలేం/విజయమ్పై స్వారీ చేయడానికీ సాహసం చేయలేం" -అని జంకు లేకుండా చెప్పగలిగాడు ఈ కవి. ఈ సంపుటిలో ఒక లాంతర్ వెలుతురులా మెరిసిపోయే కవిత "దయ్యాల మాణిక్యమ్మ"."ఎదుళ్ళ చెరువు వాయలో కొరివి దయ్యమొకటి/లాంతర్లు పట్టుకు తిరుతోందట"-అని ప్రారంభమయ్యే ఈ కవిత "ఎవరో లాంతరుతో నడిచిపోయిన చప్పుడు/ధ్యైర్యాన్ని వంపిపోయిన చప్పుడు"-అనే వాక్యంతొ ముగుస్తుంది.లాంతరుతోనే ఆరంభం,ముగింపు ఈ కవిత ప్రత్యేకత. మాణిక్యమ్మ ధైర్యం,కుటుంబం పట్ల గల బాధ్యత,కష్టించి పనిచేసే తత్వం అన్ని ఈ కవితలో కవి రూపు కట్టించటమే కాదు అట్లాంటి స్త్రీల పట్ల సమాజంలో వున్న భావనను కవితలో నేర్పునంతా ప్రయోగించి చిత్రించినట్లు అనిపిస్తుంది.మహిళా సాధికారిక చిహ్నం ఆమె. "చేతిలో పసిది చంకలో చంటోడు కడుపులో ఇంకో కాయ" పై పాదాలు చదువుతుంటే శ్రీశ్రీ" భిక్షువర్షీయసీ" గుర్తుకు రావట్లేదా? ఈ మాటను ఎందుకు అంటున్నానంటే శ్రీ శ్రీ ని ఈ శ్రీనివాస్ అనుకరించాడని కాదు శ్రీ శ్రీ ని ఎంతగా యిష్టపడ్డాడో చెప్పడానికి.వయసు ముడతల మీద భయాన్ని వాలనీయనీ దైర్యపు నీడలా" ప్రతి స్త్రీకీ ఒక ఆదర్శంలా మాణిక్యమ్మ ఆవిష్కరించబడింది. అక్షర కుసుమాలను,మాట మాలలు చేసీ,అప్పుడప్పుడు కవితా పంక్తులు పేర్చుకొంటూ,కవిత్వ దాహం తీర్చుకొంటూ,భావాల్ని భాస్వరంలా మండిస్తూ,అవసరమైనప్పుడు అక్షర ఫిరంగులను మ్రోగిస్తూ..మువ్వ (మువ్వా శ్రీనివాసరావు) తన మ్రోతలో క్షతగాత్రలోకాన్ని ప్రతిధ్వనించిందని చెబుతున్నా.అప్పుడెప్పుడో పుస్తక ప్రకటనలో 'అందమైన క్యాలికో బైండ్"లాంటి మాటల్ని చేర్చేవారు.కానీ ఇప్పుడు ఆ ప్రస్తావనే కనిపించదు.మువ్వా శ్రీనివాస్ తన కవిత్వ సంపుటిని ఎంతో అందంగా చూడగానే చదవాలనే ఒక కాంక్ష కలిగే విధంగా తీర్చిదిద్దాడు.ఈ సంపుటి నాలుగు కాలాల పాటు చెదిరిపోకుండా వుండటమే కాదు ఇందులోని కవిత్వం కూడా చిరకాలం చెదరని ఙ్ఞాపకమై నిలుస్తుందని మిత్రులకీ చెబుతూ..".సమాంతర ఛాయలు"-చదివి మీ కవిత్వ నిర్మాణ నేర్పుని మరింత పెంచుకోగరని ఆశిస్తాను.వచ్చే మంగళ వారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QBV6Iy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి