పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, మార్చి 2014, మంగళవారం

Kapila Ramkumar కవిత

కపిల రాంకుమార్|| కవిత్వంద్వారా శివాలెత్తించిన శివుడు! || రక్తం సూర్యుడ్ని ఆవిష్కరించి, చర్యల ప్రతిచర్యల పరిష్వంగంలో నేత్ర ధనుష్ఠంకారం చేసి, భారమితి తో తులనాత్మకం చేసి, మోహనమైన కవిత్వాన్ని భూనభోంతరాలు దద్దరిల్లచేసిన కవిత్వ సంపుటిని తన మాటలతో సంజాయిషి తనకు తానే యిచ్చి, కవి ప్రపంచాన్ని మెప్పించి, ఎందరో నూతన కలాలకు చక్కటి ఒరవడ్డి దిద్దే ఆంగ్లోపాధ్యాయుని తెలుగు కవితా విశ్వరూపం అలా ఓ చిన్న నేతిబొట్టులా కవితా భోజన ప్రియులకు అందిస్తున్నాను...... '' రక్తం /చుక్క వీగిపోయి / చెమట చుక్కగా రూపందింది చెమట చుక్క్క తకెత్తదు! ప్రశ్నించదు! నమ్మకంగా పంజేస్తుంది '' ** '' కాని సిరా చుక్కవుంది చూశావ్ విద్యుదాగారంవిప్లవా వాసం! సిరా చుక్క స్పర్శ చెమట చుక్కని రక్తం చేస్తుంది కల్తీ లేని కణకణలేని / నిప్పులాంటి రక్తాన్ని చేస్తుంది! '' అందుకే / రక్తం సూర్యుడు! రక్తం ప్రతిచర్య! ** శివారెడ్డి ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టడం కోసమో, లేదా మెప్పు సంపాదించటానికో కవిత్వ రాయలేదు. తనని తాని చీల్చుకుని, మధించి, మదించి, విశ్లేషించి, దహించికొని, పుటం పెట్టుకొని, నికార్సయిన సమాధానంలా, ఒక నిజాయితీ నింపుకొన్న, ధర్మంగానే రాసానన్నారు. తాను నమ్మకుండా, ఆసాంతం దాని లోతు తెలుసుకోకుండా, ప్రలోభాలతోనో, ఊసుపోకో మాత్రం రాయలేదంటారు. తరిచి, శోధించి, పరీక్షించి, ఫలితం వస్తుందన్న నమ్మకం కలిగిన తరువాత కవిత్వంతో అడుగుల పిడుగులు కురిపించారు. తన చిన్నతనంలో పడిన జీవన వాస్తవాల ఒడుదుడుకులను, బాల్యంలోని అన్ని అవస్థలను మరిచిపోలేదు కాబట్టే, ఆ ప్రభావం తన కవిత్వంలో పారదర్శకంగా చూపించకలిగారు. అమ్మ గతించిన బాధకాని, పల్లెటూరి పిల్లగాడి సహజ భయాలు, ఆందోళనలు జ్ఞప్తికి తెచ్చుకుని, జానపదులు పాడిన కీర్తనలు, తత్వాలు, బుడబుక్కలవాని ఆటపాట, గారడీవాని జిమిక్కులు, తొలకరి వానజల్లుల్లో తడిసి జలుబు చేసిన రోజులు, పశులకొట్టంలోని పేద, గొడ్లు తొక్కిన గడ్డి, రొచ్చు, అక్కడక్కడ తాను చూచిన ఎత్తు అరుగుల వాకిళ్ళు, కిచకిచమని సవ్వడిచేసే పిచుకలు, తాడిచెట్ల విహారం, వాగుల్లోని యిసుకతిన్నెలపై కట్టుకున్న గుజ్జగూళ్ళు, బడికి వెళ్ళేరోజుల్లో చేసిన అల్లరి, పడ్డ వేదనలు, రాత్రుల్లో గుడిసెలో కిటికి వద్ద ఎగిరే మిణుగురుల వెలుగు, వెన్నెల రాత్రులు, ఉక్కపోతల మండువేసవి, కాలువల్లో ఈతలు, అనాధ బాల్యాలు పరిశీలనలు, ఏకాకితనాలు, కేరింతలు, ఏడుపులు, ఫిర్యాదులు, యెన్నో అంతర్లోకాన్ని గుర్తుతెచ్చుకుంటూ, వాటి తాలూక శకలాలు వెంటాడాయి కాబట్టే మనకు ఇలాంటి కవిత్వాన్ని అందించాడేమోననిపిస్తుంది. ఒక దశలో ఆంగ్ల కవులను చదివినా, అప్పకవీయం ఔపోసన పట్టినా, ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలను సమాంతరంగా సవసాచిలా నడిపినవారు శివారెడ్డి.అందులో అతిశయోక్తిలేదు. '' చర్య - ఇన్నాళనుండి చావిట్లోనేవుందట! పుట్టిన దగ్గరనుండి మేకుకు కట్టేయబడేవుండట! కోడేదూడ! బయట కట్టేద్దామని తీసుకొస్తుంటే ఓక గుద్దు గుద్ది ఎత్తిపడేసి దేశాలమీద పాడిందట!.... స్వేచ్చలో స్వేచ్ఛగా స్వేచ్చకై .... కట్టెయటమంటే - తెంపుకుపొమ్మనే.... అణిచిపెట్టటమంటే ఎదురుతిరిగమనే .... అసంకల్పిత ప్రకార చర్యని చాల హృద్యంగా చెప్తారు '' చర్య '' లో. పరిశీలనం, జ్ఞాన సముపార్జనం, తులనాత్మకం కవనానికి అవసరం ప్రపంచపు పోకడేమిటి? ఎటుపోతోంది? మానవుడి స్థితి గతేమిటీ? రష్యా యేమిటి, చైనా యేమిటి, రాజకీయాలమేటీ, అన్యాయాలేమీటి, నిజాయితీ యేమిటీ. ఆర్థిక సంక్షోభాలేమిటి, ధంస్వామ్యం యేమిటీ, భూస్వామ్యం యేమిటీ, చరిత్ర, రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నష్టాలు, మతాలు, కులాలు, హిందూ, బౌద్ధ, జైన, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య బోధనలేమిటీ. రాహుల్ సాంకృత్యాయం ఎవరు? యిలాంటి ప్రశ్నలు, సందేహాలు తీర్చుకోలేకపోతే కవిత్వానికి సరుకెక్కెడిది? అందుకేనేమో అధ్యయనం అవసరమని నొక్కి చెబుతారు. ఆర్థిక విధానాలు మిశ్రమ ఆర్థిక విధానాలు, స్వాతంత్ర్యం ఎందుకు, దాని లక్ష్యం యేమిటీ ఇలాంటి పెక్కు చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకబుచ్చుకోవాలి కదా కవి అన్నవాడు. క్రాంతి దర్శకుడు కావాలి కదా! సాహిత్యంలో వస్తున్న విభిన్న ధోరణులెందుకు ఉత్పన్నం అయ్యాయి. ఒక దానిని మించి యింకొకటా? ప్రత్యామ్నాయమా? వక్రధోరణా, అరసం యేమిటీ, విరసం యేమిటీ, కవిత్వాభివృద్ధికి యేది దోహదపడుతుంది. యిలా తర్జమ భర్జన పడితేనే నికార్సయిన సాధన ద్వారానే కలకాలం నిల్చేకవిత్వం తిక్కన లాగ గురజాడలాగ, వేమన లాగ శ్రీశ్రీ లాగ, ఆరుద్రలాగ, కుందుర్తిలాగ, సృజనచేసే ప్రజ్ఞాపాటవం అలవడాలంటే నిరంతర అధ్యయనం, అనుసరణ, అవగాహన యెంతో అవసరం అంటారు శివారెడ్డి. భారమితి - కొలమానం కావొచ్చు - మరేదయినా కావొచ్చు కాని - '' కవిత్వానికి కాలం చెల్లిందనో, ఇది కవిత్వానికి కాలం కాదనో, అంతా స్థబ్దత యేర్పడిందనో.....చాలా మంది చేతులెస్తేసారట..... కాని శివారెడ్డి ఒప్పుకోరు కాబట్టే చేత్తో తలుపుమీద గుద్దటం కవిత్వం అంటారు. బోర్లా పడుకుని భూమిని వాటేసుకుంటే కవిత్వం, ముక్కుతో గాలిని వలేసి పట్టడం కవిత్వం, అప్రయత్నంగా చేయి మీసం మీదకి వెళ్ళి, గడ్డాన్ని సవరించుకోటం కవిత్వం, లేదా ఎర్రబడిన ఉదయం, శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జముకల కథ, శిర్సెత్తిన ధర్మపురి, అర్కాటి జిల్లాల్లో నినదించిన వాహకం కవిత్వం.... ముడి యినుము నల్లని రేయిని ఎర్రగా కాల్చి సాగ్గొట్టిన ఆయుధం చేస్తున్న అరణ్యమూ కవిత్వమే అంటూ చేతులన్నీ ఒక్కసారి లేచి ' ఇంక్విలాబ్ ' అంటే ఆకాశమంతా కవిత్వమే, ఈ విశ్వంలోని గాలి, భూమి కవిత్వమే! అంటారు శివారెడ్డి. ఏ విషయాన్నైనా కుండ బద్దలకొట్టి నిర్భయంగా చెప్పటం శివారెడ్డికి అలవాటు. తాను ఏ వామపక్ష పార్టీ సభ్యుడు కాకపోయినా శ్రీశ్రీ మాటల్లోంచి మంచి కమ్యూనిస్టుగాను, మార్క్సిస్టుగాను ఒప్పుకుంటారు. కమ్యూనిజం పట్ల యితర సభ్యులకంటే అపారమైన అవ్యాజ ప్రేమ, గౌరవం వుందని చెబుతారు.. తాను నమ్మాడు కాబట్టి ఒకరి మెప్పుకోసమో, ప్రేరేపించడానికో సంతోషపెట్టడానికో కాకూండా, అధ్యయన మాత్రాన మాత్రమే ప్రపంచ రాజకీయాల్ని లోతుగా పరిశీలించిన ఫలితంగానే తన వాజ్ఙ్మూలం ఇచ్చారు శివారెడ్డి. మోహనరాగం ఆలపించన శివారెడ్డి '' నాకింద పక్కలాగో / నావకింద నీళ్ళలాగో / కళ్ళకీంద నీడలాగో / ఆకాశంకింద పక్షి లాగో/ ఆకు సందుల్లో నర్తించే కిరణపుంజంలాగో / ఎండాకాల గాలి నుండి పైకి లేచినప్పుడు నువ్వుకనబడతావు/ వీధిలో ఎర్రటి సూర్యుడు రాయి నెత్తిమీద పడ్డప్పుడు నువ్వు వినబడతావు ''.....అంటూ తనకవితలో /'' చేదైనా వేపచెట్టు చిగురించిన వసంత కాలంలా నువ్వు అద్భుతంగా సంగీతించిన నిచ్చెనల వెదురు వనంలా నువ్వు '' అంతకుముందు కవితలలో నిప్పులు కురిపించిన శివారెడ్డి లాలిత్యమైన పదాలను మోహనా! మోహనా! అంటూ కొత్త కోణం ఆవిష్కరించారు. '' దయలేని విధి నిర్వహణలో / రోజుకో అంగం తర్పణ గావించాలికదా /బతుకు మోహనా బతుకు! /బతకటాన్ని ఓ పెద్ద పాపకార్యం చేసిన / బతకటాన్ని ఓ పెద్ద బండ బరువు చేసిన / బతకటాన్ని ఓ బడా వ్యాపారం చేసిన ఈ సుందరమయ వ్యవస్థలో బతుకు మోహనా! బతుకు!........తన ఆశంసను వ్యక్తపరచటంలో సఫలీకృతుడైనారు. తన పరిమితులకు లోబడి ఉద్యమాలలో తన కున్న సంబంధాల పరిమితులకు లోబడి తన శక్త్యానుసారం, సమాజ సందర్భంగా తాను తనను వ్యక్తీకరించుకుంటానంటూ, చేసే ప్రయత్నమే శివారెడ్డి కవిత్వం! ప్రజలకేనిటో చెప్పేప్రయత్నమే తన కవిత్వం! తన జీవితం నుండి తనను విడదీసినా, ఈ సమాజం నుండి కాని కాలాన్నుండి కాని విడదీసినట్లైతే తన కవిత్వమే మిగలదని, తనకవిత్వమే కాదు అసలు యే సాహిత్యమూ మనజాలదు, మిగలదు. అందుకే వారి మాటల్లోనే '' నా సోదరులకి కళ్ళిచ్చాను నా కామ్రేడ్స్‌కి చేతులిచ్చాను నా దేశానికి నా దేహానిచ్చాను కాదు నాదేశమే నాదేహం '' నేను తుడుం తయారు చేసే వాణ్ణి, నేను ఆయుధాలు తయారుచేసే వాణ్ణి, నేను పాటలు కట్టేఏ వాణ్ణి. మీ అనేకానేక కాంక్షలకి, ఆశలకి, ఊహలకి తగినట్టుగా పాటలు కట్టే వాణ్ణి - నేను పాటలు కట్టే వాణ్ణి...కె. శివారెడ్డి. '' ఇది శివమెత్తిన కె. శివారెడ్డి గురించిన స్వల్ప పరిచయం 4.3.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3gyhZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి