పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మే 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం చదివిన కవిత్వ సంపుటి :- 29 కవిత్వ సంపుటి పేరు " సూర్యోదయానంతరం "(కవిత్వం ) సంపుటి రాసిన కవి "డాక్టర్: ఎస్.షమీ ఉల్లా " పరిచయం చేస్తున్నాది " రాజారామ్.టి "సముద్రపు గొంతులో జల తంత్రుల ధ్వని ష మీఉల్లా కవిత్వం "గుర్తుకు రావట్లేదా నే నెవరో నీకు?"- గట్టిగా దబాయించి …………………………… ప్రశ్నించిన మరుక్షణం ( వెంటాడనిదే ) గుర్తుకు......వచ్చే కవి నాకు షమీఉల్లానే. తమ ఇంట్లో మాట్లాడే భాష ఉర్దూ అయినా తాము నిలబడ్డ నేల భాషలో సజీవ కవిత్వం రాస్తున్న అఫ్సర్, యాకూబ్ ల తరువాత స్కైబాబ ,అన్వర్ ,బా రహంతుల్లా , మహజబీన్ , షాజహానా మున్నగు కవుల వరుసలో నిలువదగ్గ మంచి కవి ష మీఉల్లా. అణగారిన గొంతుకల పట్ల ఆర్తిని ,ముక్కలవుతున్న మానవ సంబంధాల పట్ల నిరసనని, జీవితాన్ని శాసిస్తున్న వ్యాపారధోరణుల పట్ల తిరుగుబాటుని షమీఉల్లా తన కవిత్వంలో పలికిస్తాడు కాబట్టే నేను ఇష్టపడతాను.అంతేకాదు ఏ కవి సమ్మేళనంలోనయిన తనదయిన గొంతుతో ఎలాంటి పేపర్ లేకుండా ఏ మాత్రం తడబడకుండా కవితను చదువుతూ శ్రోతల హృదిలోపలి గోడల్ని తాకుతాడు. "రెండు సంధ్యల మధ్య" గుండెలోని "ఆరని తడి"తో పసి "పాప" "మనసుతనం"తో "నిర్భయంగా" "రహస్తంత్రి " ని మీటుతూ "సూర్యోదయానంతరం " "అంతంతోనే మొదలవుతుంది " అనే "ఒక వెంటాడే విశ్వాసం " తో "తంగేడు పూల చెట్టు " లాంటి " పచ్చని "అతడి పాట" లోని "అత్తరు వాసన "వంటి కవిత్వాన్ని "తుమ్మముళ్ళు" లాంటి "ఒకానొక సందర్భం "వెంటాడనిదే " హృది "గది లోపల" నుండి కవిత్వం విరజిమ్మని అద్భుత కవి ష మీఉల్లా. పాట తూటలాంటిది. తూటా శరీరాన్ని చిధ్రం చేస్తే పాట హృదయపులోతుల్లోకి దూసుకపోయి బ్రతుకు చిత్రన్ని గీయడమో,ఘనీభవించిన దుఃఖాన్ని కలిగించడమో,సంతోషపు దీపకళికను వెలిగించడమో చేస్తుంది.పాట పాదానికీ గజ్జెకట్టిన గద్దర్ పాట షమీఉల్లా హృదయాన్ని జ్వాలా వలయంగా చుట్టుముట్టి మంటయి ప్రజ్వరిల్లి అతన్నొక సంక్షుభిత సాగరం చేసింది.ఆ వయసులో అతడి పాటకు పూర్తిగా లీనం కాని వాళ్ళు ఎవరైనా వుంటారా?.ఈ కవి గుండెతీగలను గద్దర్ పాట లాగి లాగి వదిలింది.ఆ గుండె తీగల ప్రకంపనమే ఈ సంపుటిలో " అతడి పాట "-అనే కవిత. ఒక పాట విన్నప్పుడు కలిగిన అనుభూతులను పట్టుకొని కవిత్వంలో నిలిపిన కవుల వరుసలో షమీఉల్లా కూడా చేరుతాడు. సైగల్ పాట కెరలించిన అనుభూతిని భావ గాఢతతో అఫ్సర్ కవిత్వం చేస్తే షమీఉల్లా గద్దర్ పాట తాకిడి తనలో రేపిన ప్రభంజనాన్ని చైతన్య సాంద్రతతో దుఃఖపు తడిని అద్ది కవిత్వం చేశాడు. "చెబితే నమ్మవు. కానీ!లీలగా మొదలయిన పాట జ్వాలా వలయాలుగా రగుల్కోవడం ప్రారంభమైంది. (అతడి పాట ) ఇలా ప్రారంభమయ్యే ఈకవితలో "అతడి పాట " మునుపెన్నప్పుడూ లేనంతగా కవిలో ఒక అలజడిని లేవనెత్తి "పాట నిండా ఘనీభవించిన దుఃఖమే" పొర్లిపోయే సన్నివేశాలని,"కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు గుండెలో మేకులై దిగబడే" సందర్భాలని దర్శింప చేసి కవి ఆనందాన్ని కొల్ల గొట్టిందట. "మంటయి ప్రజ్వరిల్లిన పాటనిండా బ్రతుకును కాటేసిన గాట్లు కన్పించాయి. పాటలో వీరుల్ని సంకెళ్ళు కరచిన వైనం చూశాను. తెగ్గోయబడ్డ తలలు విరగొట్టబడ్డ మోకాళ్ళు దీప కలికలై పాటలో లయిస్తుంటే కొడిగట్టిన దుఃఖాల దైన్యాలు గుండెలో మేకులై దిగబడుతున్నాయి" అంటూ షమీఉల్లా అతడి పాట గీసిన దుఃఖ దృశ్యాన్ని అక్షరాలుగా మార్చాడు. "ఈదురు గాలి తాకిడికీ కిటికి రెక్కలు కొట్టుకున్నట్లు"-అని అనటంలో కవిలో రేగిన అలజడిని స్ఫురింపచేస్తాడు ఈ కవి.అతడి పాటలో కవి తనను తాను వడబోసుకొని తనవీతీరా జీవితాన్ని దర్శించినక్షణం మనకు ద్యోతకమవుతుంది కవితని పరిపూర్ణంగా అర్థంచేసుకుంటే. గద్దర్ పాట కవిలో రేపిన విషాదభరిత విప్లవచైతన్యాన్ని వ్యక్తీకరించిన కవిత ఇది. ఏ కార్యనికైనా ఒక కారణం వుంటుందనిచాలమందినమ్మకం.ఈకవికూడాఒకపాపపక్షిలాగిరికీలుకొట్టడానికీ,ఏటినురగస్వఛ్చంగావుండటానికీ,నవ్వుల రూపంలో పువ్వులు పూచే లక్షణమేదో వుండటానికీ,ఆకులా గలా గల నవ్వటానికీ ఏదో కారణం వుంటుందని వెదుకాలాటను "పాప "అనే కవితలో చేశాడు.ఈ వెదుకులాట ఈ సంపుటిలో చాల చోట్ల మనం గుర్తించవచ్చు మరో రూపంలో. 'బార్లా తెరిచేందుకు కిటికీలున్నట్లు తలుపులు వున్నాయ్ ఏం ప్రయోజనం?! పోల్చుకోలేనంత అస్తవ్యస్తంగా దుమ్మురేగి ధూళి పట్టిన సొఫాలు,కుర్చీలు గోడల మీద వచ్చీ రాని అక్షరాలు కన్పించీ కన్పించని సుద్దముక్కల గీతలు దండెంమ్మీద అడ్డ దిడ్డంగా వేసిన పాత గుడ్డలు సంచరించేందుకు వీలు కానంత చిందర వందరగా చించి పడేసిన కాగితం ముక్కలు పరదాల అంచుల మీద టి.వి స్టాండ్ మీద వేలాడుతున్న బూజు తెరలు చీపురు కట్టతో విదిల్చేందుకు వీల్లేనంతా దట్టంగా బాత్రూమ్ మూలల్లో పేరుకుపోయిన మట్టి దిబ్బలు నిండా చీకటి ముక్కు పుటాలదిరిపోయేలా కమురు కంపు"( గది లోపల ) ఇదంతా గదిలోపల కానే కాదు. కవే” గదికీ.. నాకూ పెద్ద తేడా లేదు”- అని చెబుతున్నాడు. ఇలా అని కవి తన నిజాయితికీ అద్దంలా ఈ కవితని నిలుపగలిగాడు.హిపొక్రసీ పేరుకొన్న లోకంలో కనీసం కవుల్లోనైన నిజాయితినీ కోరుకోవటంలో తప్పు లేదనుకొంటాను. గది లోపల అపరిశుభ్రతకు, అంతరంగంలోని అపరిశుభ్రతకు తేడా లేదని చెప్పడానికీ గదిని అంతరంగానికీ ప్రతీక చేశాడు షమీఉల్లా.తనలోకి తాను తొంగిచూసుకొనే ధైర్యం,నిజాయితీ ఈ కవికీ ఉంది కాబట్టే అలా తొంగిచూసుకున్నప్పుడు అంతరంగం గదిలా వీలుకానంత చిందర వందరగా వుందని ,అనవసరమైన వస్తువుల్లా అనవసర ఆలోచనలూ,తొలగించాల్సిన బూజులా మదిలోని భావనలు వున్నాయని షమీఉల్లా చెబుతాడు." లోనికెల్దామంటే గదియెప్పుడు శుభ్రపడ్తుందో నా కయితే తెలియదు"-అనే సందేహాన్ని వెలిబుచ్చుతూ "ఒక ఎదురుచూపు ఒక ఆశ "-అనే ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేశాడు." గాలి,వెల్తురు సోకకపోతే ఏ గదియైనా ఇలాగే వుంటుందేమో?"-అని అనటంలో గాలి కున్న వీచే లక్షణం వుండటం వల్లా చింతన వీయబడాలని, వెల్తురుకు ప్రసరించే గుణం వుండటం కారణంగా ఙ్ఞానం విస్తరించాలని అలా జరిగినప్పుడే గదిలా అమ్తరంగం శుభ్రపడుతుందని కవి ఆలోచన.ఇట్లా ఎవరికీ వారు తమ అంతరంగంలోని అపరిశుభ్రతను తొలగించుకోగలిగితే లోకమంతా ప్రశాంతంగా వుండదా? అని అనిపిస్తుంది నాకు. "సమావేశం పూర్తయ్యేసరికి ఆ ప్రాంతమంతా కోలాహలమౌతుంది. ఒకర్నొకరు కాగడగా మండించుకుని విడిపోతారు ఎవరికీ వారు... విశ్వాసాల గుర్రాలెక్కి" ఎవర్ని గురించి రాశాడో ఈ వాక్యాలు సులభంగా పాఠకులు పట్టేయగలరు."సమావేశం"-అనే కవితలోని వాక్యాలివి.పీడిత,తాడిత జనాల విముక్తి కోసం పోరాడే యోధుల సమావేశాలు ఎలా వుంటాయో వారి సమావేశంలో పాల్గొన్న ఈ కవి తన అనుభూతిని ఇలా అభివ్యక్తంచేస్తాడు. "చుట్టూరా చూపుల ఫిరంగుల్ని సిధ్దం చేసి ఒక్కొక్కరే లేచి మాట్లాడుతుంటారు. ఆ మాటలకి ఉవ్వెత్తున ఎగిసిపడ్తూ.. తక్కినవారు పాశుపతాస్త్రాలు ధరించిన యోధులవుతుంటారు" "డేగ చూపుల్ని సారించి /తుపాకులు, లాఠీలు,ఇనుప టోపీలు.../గూఢాచారుల్లా వెంటాడటం వారికి తెలుసు"-అని అంటూనే వారు ఎంత అప్రమత్తతో వుంటారో కూడా ఈ కవితలో నిక్షిప్తం చేస్తాడు. "వారి నరనరాల్లో కలకలం రణతూర్యమై ప్రతిధ్వనిస్తుంటుంది వారి మాటల డెక్కల కింద మానసికోల్లాసం ముక్కలయినప్పుడల్లా నేను విస్మయానికి లోనవుతుంటాను." అనే షమీఉల్లా అట్లాంటి సమావేశాల్లో తన నిజానుభూతిని చాలా కళాత్మకంగా కవిత్వం చేశాడు ఎలాంటి భయోద్విగ్నతకు గురికాకుండా. "మృణ్మయ పాత్రల్లా ఎన్నిమార్లు ముక్కలయ్యానో ఫెళ్ళున! అనుభవాలకేం కొరత లేదు"-అని అంటున్న ఈ కవి"ఒకానొక సందర్భం"లో "పల్లవించిన ప్రతి ఆకూ ఆగమనానికీ ఆహ్వానమని భ్రమపడి" "మాటలు చాలు మనిషిని చంపడానికి ఈటెలా" అనే సత్యాన్ని కలలకు నిప్పంటుకున్నాక గుర్తిస్తాడు.తడిసి ముద్దయి పోవడానికీ ఒక స్వప్నాన్ని కొంచెం సత్యాన్ని మిగుల్చుకోలేకపోయానని తల్లడిల్లి పోతాడు.ఒక మార్మికతను ఈ కవితలో నింపి షమీఉల్లా రాశాడేమోననిపించింది నాకు. "వాళ్ళలో ఏ ఒక్కరైనా నా భుజమ్మీద చెయ్యి వేసి వీపు నిమరకపోతే నాలో అన్ని వైపులూ మూసుకపోయేవి ఒక పరివ్రాజకుణ్నై అంధకారంలో కల్సిపోయేవాణ్ని తలా ఒక చెయ్యి వేసి చేర్చక పోతే కదన కుతుహలమై కవాతు చేయకపోయే వాన్ని." ఇలా ఈ కవి తనని క్షిపణిగా మలిచిన వాళ్ళని,తనని శత్రుదుర్భేద్యమయిన కత్తుల కవచంగా తీర్చిదిద్దిన వార్ని,తనని ఓ మంటగా పోగేసిన వాళ్ళనీ తలచుకొని కృతఙ్ఞతని వారి పట్ల ప్రకటిస్తాడు.వారెవరో కాదు తాను ఎవరి సమావేశం పాల్గొన్నాడో వారే. మనుషులు చాల రకాలు.వాళ్ళల్లో మాటలతో బ్రతికే వారు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో "కొందరు అంతే "-అనే కవితలో వైవిధ్యంగా చెబుతాడు ఈ కవి.మూడు క్షణాలని అరువు తెచ్చుకొని ఆరు క్షణాలు చేసి బ్రతికే వారు,రకరకాల రంగులద్ది సిధ్దాంతలను రాధ్దాంతాలు చేసి బ్రతికే వాళ్ళు,ఏ రోజైనా,ఏవేళయిన మినహాయింపులు లేకుండా కేవలం కాసిన్ని మాటలతో బ్రతికే వాళ్లు ఇలా ఎందరో మనకు తెలిసినా మనం గుర్తించలేని వాళ్ళని తాను గుర్తించి మన ముందు నిలబెడతాడు. "అబద్దమనుకుంటావేమో! అద్దమ్ముందు నిలబడి ప్రయత్నించి చూడు ఎవరు ఎవరో తేలిపోతుంది."-అని అనే షమీఉల్లా "ఎదురుగా నిలబడి అద్దంలో చూసుకోడానికి సంశయిస్తుంటాను ప్రతి రోజూ నన్ను నేను"-అని నిక్కచ్చిగా "అద్దం "అనే కవితలో మనిషిలోని ద్వైధి భావాన్ని చిత్రించడమే కాకుండా "అచ్చు నన్ను పోలిన రూపాల్లో నాగులు,మిన్నాగులు గుమ్పులు గుంపులుగా కనిపించి నాకేసి చూస్తూ నాలుక చాస్తూ బుసలు కొడతాయంటా"డు.అలా అనడంలో మనిషి మానసిక వికృత తత్వాన్నీ ఒక ప్రతీకాత్మకతో స్ఫురించేశాడు. ముఖ్యంగా రాయలసీమలో అందులోను అనంతపురంలోని కవికీ నిత్య దృశ్యాలే సాయుధ ముఠాల చెసే దాడులు ప్రత్యర్థులపైన."మా ఊరి రహదారి "-అనే కవితలో ఈకవి "పగో,కోపమో, మచ్చుకత్తితోనో,వేటకొడవలి తోనో,ముఖాన్ని చెక్కి జనం గుర్తించకుండా పొదల్లో పారవేసిన దేహం"దుర్వాసనతో ఊరి రహదారి పక్కన ఎదురుకావడాన్ని,చెరచబడ్డ శీలం అవమానంతో తలెత్తుకోలేక ఆకుచాటున కన్నీళ్ళు రాల్చే దృశ్యాన్ని ఒకటేమిటి సర్వ ప్రలోభాలకు పరీవాహక ప్రాంతమైన ఊరి రహదారిని మర్చిపోలేక విషాద సమవాకార ప్రతీకగా చేసినా,"రాగాలు కూర్చిన గంటల శబ్దాలు/రహదారికీ సన్నాయి సరాగాలయ్యేవి."-లాంటి వాక్యాలతో మోహనంగా కూడా మారుస్తాడు.ఇది షమీ శిల్ప కూర్పులో ప్రడర్శించే నేర్పే.అందుకే షమీ నాకిష్టమైన కవి మా అనంతపురంలో. "పరారీ"-అనే కవిత కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో రాసిందే. అత్తరు వాసన ముస్లిమ్ ల జీవితాల్తో ఎంత ముడిపడివుందో ,అది వారసత్వపు ఆస్తిలా చావులోనూ,పుట్టుకలోనూ పరిమళమై వారిలో భాగంగా ఎట్లా అంటిపెట్టుకుందో, అలుముకపోయిందో మైనారిటి కవి షమీఉల్లా "అత్తరు వాసన "లో ఒక లాంతరు పట్టి చూపిస్తాడు. "నా వొంటి మీది అత్తరు వాసనంటేనే కుళ్ళిన దుర్గంధం కమ్ముకొస్తుందని కదా..నువ్వంటావు. డోకొచ్చినట్లుగా తల్లడిల్లిపోతావు. తిండానికి లేకపోయినా "అత్తరుకేం తక్కువలేదు నవాబు గారికి" అనే కదా! నా గుమ్మానికి కట్టిన నీ పరిహాసపు పరదాలు" అంటూ తమ సంస్కృతిని ఈసడించుకొని గేళి చేసేవారితో "మా గుండెల్లో గూడు కట్టుకున్న చీకటి విషాదాన్ని చూశావా ఎన్నడైనా"-అని ప్రశ్నిస్తాడు చిరు కత్తిలాంటి మాటలతో.మైనారిటీల జీవితాల్లోని దుర్భరత్వాన్ని "జీవన్మరణ సందిగ్ధరేఖల మధ్య బందీయై ఎప్పటికప్పుడు ఆఖరి క్షణంగా బతుకీడుస్తున్న వాళ్ళలో కుళ్ళిన వాసన కాకుండా మంచి వాసన ఎలా వస్తంది" అనే బాకు లాంటి సమాధానం చెప్పి ఆలోచింపచేస్తాడు. "అత్తరు.. అంతుదొరకని కూడలి దాని వెనకున్న నీలిరాగం చిమ్మ చీకట్లాంటి కన్నిటీ తెర నింగికెగిసి అది నేల కొరిగిన కెరటాల కలవరింత" ఒక నిర్వేదనతో గుండే నిఘంటువు మాత్రమే చెప్పగలిగిన అర్థాన్ని ఇచ్చాడు అత్తరుకీ షమీఉల్లా. ఏ మాత్రం కవిత్వపు అలికిడైనా ఉలిక్కిపడ్తున్నారు. ద్రవంగా మారినట్లు కంటికొలకుల్లో నీరైనిలబడుతున్నారు నవ్వించినా మాటల్లో దించినా..క్షణమే! చూస్తుండగనే కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు"- షమీఉల్లా కవిత్వపు పలకరింపుతో ఇక్కడ శ్రోతలు,పాఠకులు."చావుతో కొంతమంది చస్తున్నారు చావుతో కొంతమంది బ్రతుకుతున్నారు" అనే ఒక సార్వకాలిక సత్యాన్ని చెబుతున్న ఓ షమీ "నువ్వేం మాట్లడక పోయిన ఏకాంతంలో నిన్ను నేను పలకరిస్తాను"-అని చెబుతూ ముగిస్తున్నాను. భద్రమైన జీవితం ఏర్పడితే కొందరు కవులు నాలాగా కవిత్వం రాయడం మానేస్తువుంటారు.అట్లా మారకుండా ఎప్పట్లానే కవిత్వంలో ప్రవహించమని షమీకీ అడిగాడు కాబట్టి సలహా యిస్తున్నా. వచ్చే వారం మరో సంపుటి పరిచయంతో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPZxQQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి