పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం - చదివిన కవిత్వ సంపుటి - 26 కవిత్వ సంపుటి పేరు :- " నీ లాగే ఒకడుండే వాడు " కవిత్వాన్ని రాసి సంపుటి చేసింది :- "నంద కిశోర్ " కవిత్వ సంపుటిని పరిచయం చేస్తున్నది :- " రాజారామ్.టి " "వెన్నెలా స్నేహితా ఎవరోకాదు దేవీనే-ఆమె కన్నుల నీలి నీడల్లో నిలిచివున్న నవ భావనల నగిషీ కవిత్వం” "మన కంటే హాయిగా ప్రేమించుకొనెదెవరు?'-అని వెన్నెలా,స్నేహితలైన దేవినీ ప్రశ్నించి ఆమెను కవిత్వంతో ప్రేమిస్తున్నవాడు,'రెండు పేలవమైన దేహాల మధ్య ప్రేమ నిక్కచ్చిగా నలిగిపోతుందని'నిర్మొహమాటంగా అంటున్నవాడు,"కార్తీకంలో చందమామ పువ్వులై రాలడం దర్శించినవాడు,వాళ్ళ దేహం"మూడొంతుల కన్నీళ్ళు ఒక వంతు దేహం"-అని ఒక నిర్వచనం చేసినవాడు,"వానెందుకొస్తుందో నన్నొక్కన్నే అడుగు"-అని అనంత ఆత్మవిశ్వాసంతో అంటున్నవాడు,అడిగే ప్రశ్నలకీ "పూలు రాలేటి చప్పుడు చేస్తూ కొన్ని కరుకైన సమాధానాలు చెప్పగలిగినవాడు,కళ్ళకి తెలీని కాంతి భాషతో,కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో నిశ్శబ్దంగా మాట్లాడి మాట్లాడీ కరగిపోయిన ప్రేమను కవిత్వం చేసినవాడు,ఎంత రాసిన నిన్ను చేరాకే నా అక్షరాలు ఆనందంగా "అమృతమవుతాయని నిజాయితీగా పల్కుతున్నవాడు,'దుఃఖం నీ సహచరి దుఃఖం నీ ఆత్మ" అనే ఒక సత్యాన్ని గుండె పగిలేలా చప్పుడు చేస్తూ,గుక్కపట్టేలా గానం చేస్తున్నవాడు ఎవరంటే ఇంకెవరు "నీలాగే ఒక్కడుండే వాడు"-అని అంటున్న నందకిశోరే. "బయట వేసిన ఒక్కోఅడుక్కీ ఒక్కో మిత్రుడు దర్శనమిస్తాడు"-అంటూ స్నేహ దర్శన వాంఛను అభివ్యక్తం చేయగల స్నేహతత్వం,"ప్రియురాండ్ల చేతుల్లో పిల్లలు నవ్వుతారు,నెలవంక నెత్తి మీద నక్షత్రం వెలుగుతుంది"-అనగలిగే భావుకత్వం,"వలల్లో ఈదేంత వెర్రివున్నా ఉచ్చుల్లో చిక్కేంత పిచ్చిదనం లేదని" వెర్రికీ పిచ్చికీ తేడా చెప్పగలిగే సూటిదనం,ఎవరి లాలనకీ తనలో కవిత్వం చిప్పిల్లిందో చెప్పగలిగిన తెగువ,పువ్వుల భాషలా మాటల్లో మార్ధవత్వం,గువ్వల భాషలో మాట్లాడే మాధుర్యం,పిల్లల భాషలో పదాలల్లే అమాయకత్వం,"ఒంటరి మేఘం ఒకటి దఃఖమై వర్షించినట్లుగా వుండే వొక దుంఖ తేజస్సుతో వుండే కవి ఎవరంటే ఇంకెవరు "నీ లాగే ఒకడుండే వాడు"-అని అంటున్న నందకిశోరే. ఈ విశ్వంలో నా లాగా,నీ లాగా,ఎవరోఒకరిలాగా ఎవరో ఒకరు వుండే వుంటారు.అది ఎంత మాత్రం ఆశ్చర్యం కానే కాదు. ఒకానొక "సందర్భంలో శ్రీ.శ్రీ కన్నా బాగా రాసేవాడు వుండొచ్చు.శ్రీ.శ్రీ కన్నా తక్కువగా రాసే వాడు వుండొచ్చు.కానీ శ్రీ.శ్రీ లా రాసేవాడు మాత్రం వుండడు "అని ఒక విమర్శకు డన్నాడు.ఈ మాట ఇప్పుడెందుకంటున్నానంటే " నీ లాగా ఒకడుండేవాడు" నందకిశోర్ అని అతనితో అనడానికీ కాదు.నందకిశోర్ లా ఎవరైనా వుండొచ్చు కానీ,అతని కన్నా గొప్పగా రాసే వాళ్ళుండొచ్చు,అతని కన్నా తక్కువగా రాసే వాళ్లుండొచ్చు,కానీ నందకిశోర్ లా ఇంత 'ప్రేమ"తో కవిత్వం రాసే వాళ్ళు వుండరని చెప్పడానికీ పై మాట అంటున్నాను నేను. ఏ దేశంలో అయినా సామాజిక రాజకీయ విప్లవాలను కవులు తమ కవిత్వంతో ప్రభావితం చేయడమే కాదు తమ ముందున్న సాహిత్యధోరణుల మీద తిరుగుబాటు జెండా ఎగురవేశారు.ఆ కవులు ఏ పేరు పెట్టుకొన్నా,వారిని ఏ పేరుతో పిలిచినా వాళ్లు మాత్రం తాము నివసించిన సమాజంలోని ఆర్థికవ్యవస్థ మీద ఆధారపడి రచనల నిర్మాణం చేస్తూ మనుగడ సాగించడం అనివార్యంగా సాగింది.ధనిక పేద తేడా లేని సమసమాజ వ్యవస్థను స్థాపించాలని,అందుకు అనుగుణంగానే తమ రచనల్ని కవులు నిర్మించాలని కూడా వారు విశ్వసించారు.కవులు కూడా సమాజంలో ఒక భాగమేకాబట్టి,వీరికీసమాజంపట్లఒకబాధ్యతవుంటుందని,ఆబాధ్యతనేసామాజికస్పృహఅంటారనివారుఅంటూవుంటారు.అయితేవీరికిఏవ్యవస్థఏర్పడినాకూడాజీవితమనేదిఒకటివుంటుందనిఆజీవితానికీఒకచలనముంటుందనిసమస్యలుంటాయని వొక ప్రకృతి వుంటుందని ఆ ప్రకృతికీ స్పందించే కవులుంటారని గ్రహింపు వుండాలి..ఈ సమాజంలోని అనంతమైన వస్తువుల్లోఆదికాలంనుంచివున్నవస్తువు ప్రేమ.స్త్రీ,పురుషులున్నంతకాలం వాళ్ళ సంబంధాల గురించిన కవిత్వం వుంటుందని అయితే దాని స్వరూపం వారు జీవించే సమాజానికనుగుణంగా మారుతూవుంటుందని గమనించుకోవాలి. ఈ అంతర్జాల యుగంలో ఆ స్త్రీ,పురుష సంబంధ దర్శనం ను నందకిశోర్ తనకవిత్వంలోమనతో చేయిస్తాడు. ప్రేమ లోని అన్ని కోణాల్నీ నందకిశోర్ పాఠకులకు తన కవిత్వంలో చూపిస్తాడు. ప్రేమ అనేది ప్రేమించుకొనే వారి అనుభవం.కానీ నందకిశోర్ ఆ అనుభవాన్ని ఎవరూ ఊహించని విధంగా కవిత్వం చేస్తాడు.అమ్మ పాడే పాట బిడ్డ శ్రద్దగా వింటుంది.కానీ ప్రియుడు పాడే పాటని ప్రియురాలు శ్రద్దగా ఒక పసి పిల్లలా వింటుందట.అలా వినేటప్పుడు ప్రేమ ఎందుకుండదు?అని కవి ప్రశ్నిస్తాడు.ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ తల్లీ బిడ్డల మద్య ప్రేమలాగ వుంటుందని వొక గొప్ప ఊహని చేసి "మన కంటే హాయిగా ప్రేమించుకుండేది ఎవరు?"అని అడగడం ఎంత బాగుందో కదా! గోర్వెచ్చటి గాలి/కొంచెం తేమ,కొంచెం వేడి/వెన్నెల నిండా పరిచిన అందం/చీకటి నిండా వెలిగే దీపం "ఇంత కన్న ప్రేమించుకోడానికీ ఏంకావాలి?.ఇట్లాంటి వాతావరణంలో కవి "కనిపించని మంచు,కొంచెం సిగ్గు,కొచెం భయం,రాత్రినిండా పరిచిన దేహం,మనసునిండా కురిసే ప్రేమ" వున్నప్పుడు కోనేట్ల్లో కలసిపోక ఏంచేస్తాడు?-ఒక కాల్పనిక వాతవరణ చిత్రణ ఈ కవి కలం చేయగల మంత్రజాలం. ప్రేమలో పడ్డ వారికి అవతలి వారే ప్రపంచం.మరో ప్రపంచం వుండదు కనిపించదు.అందుకే ఈ కవి "నువ్వు" అనే కవితలో "నువ్వు ప్రపంచంకాదనేదెవరు"-అని అంటాడు.ప్రేమలో పడ్డవాళ్ళ జీవితం "మూడొంతుల కన్నీళ్ళుఒకవంతుదేహం."అనిపేర్కొనిప్రేమానేదిమనసులో,హృదయంలో గడ్డకట్టిన రెండు ధృవాలు"అని తీర్మానిస్తాడు.ప్రేమ అనేది"అనంతాల క్షితిజరేఖల్లో అంతులేనిది దుఃఖ మధ్య రేఖ" వ్యాఖ్యానిస్తాడు."పూల భాష"లో పోనీ..అయిందేదో అయ్యింది.వీసే యవ్వనాన్ని ఇకపై రోజు మన్నిద్దాం'అని ప్రియురాలితో సర్దుకుంటాడు ఈ కవి."నువ్వలా మోహంతో ముద్దు పెట్టుకుంటావో లేదో కొండవాలొక దారిలా" కనిపించడం తేలిపోయే ఆకాశాలు పూల నవ్వుల్నీ విసిరేయడం ఈలాంటి మాటలు కవిని ప్రియురాలి ముద్దు అతనిలోంచి ఆమెకు వొక వంతెన వేసి అతనిపైన అతనే నడిచి పోయేటట్లు చేసె ప్రభావాన్ని చూపుతుందని అర్థమవుతుంది. ఇంతగా ప్రేమలో లీనమైన కవిని మనమెప్పుడైనా చూశామా? "నిరామయ శోకం నీలో ప్రవహించే సమయం మోహిని స్పర్శలో మోసపోయింది/నిర్లిప్త ప్రపంచాన్ని పరిచయం చేసి కాలం చీకట్లో కలసిపోయింది"-అని దుఃఖితుడై భగాభగా మండిన ఒక ప్రేమికున్ని ప్రేమ "నీ దేహాక్షరంలో కాలిపోనిదై లిఖించబడిఉంది'-అని ఓదారుస్తాడు.'పిల్లలు దోసిళ్ళతో నక్షత్రాలు చల్లుతారు/నూరేళ్ళు బతకమంటూ నిండుగా దీవిస్తారు"-అనే నమ్మకాన్ని ప్రేమ పట్ల కలుగ చేస్తాడు."పసిపాపలా,పసిచూపుతో/అమ్మకన్నుల్లోని అనురాగం వర్షిస్తూ/కాంతిపూల సరాగాలకి లయబద్దంగా అడుగులు వేస్తూ/ఏ జన్మలోనో నన్ను కన్న అమ్మలా"అనే ఈ కవి ప్రేమలో అంటే ప్రియురాలిలో అమ్మను దర్శించడం అనే ఒక ఉదాత్త భావనను నందకిశోర్ కలుగచేయడం మనల్నీ ఒక వూహించని ప్రపంచంలోకి తీసుకెళుతుంది. "ఒకానొక అకాలంలో ఒంటరిగా కలిశాం మనం గుర్తున్నానా?"అని ప్రేయసిని అడిగే ప్రియుడికీ వారి బంధం ఇప్పటిది కాదని ఎప్పటిదో అని చెప్పడానికీ కవి ప్రియుడితో చెప్పించిన అనుభావాలు,వాటి అనుభూతుల లోతులు మనసు హృదయం తెలియని మార్మిక ఊహల్లోకి పాఠకుల్నీ తీసుకపోతాయి.ప్రేమతో,ప్రేమలోపడ్డ వాళ్ళకీ ఎంతకీ తీరని దాహం ప్రేయసి పంచిన పెదవుల వల్లో,ప్రేమవల్లో తెలియదని చెబుతూనే ఒక అమృతని మనకీ పరిచయం చేస్తాడు.ఎడబాటుకోర్చీ ఎదురేగుకుంటూ పోయేటప్పుడు ప్రేయసి,ప్రియులమధ్య ఎలాంటి అనుభూతి వుంటుందో ఈ కవికీ తెలిసినట్లూ ఇంకెవరికీ తెలియదేమోనన్నట్లు రాశాడు."పగటికీ రాత్రికీ తేడా వుండదు/చీకటి గట్టిగా విసిరివేయబడుతుంది/ఉక్కపోత ఎక్కువై ఉక్కిరిబిక్కిరి చేస్తుంది/వెన్నెలకసలే దయ వుండదు./సరిగా నిజాయితిగా చెప్పాలంటే/కావాల్సినదేది మిగిలుండదు."ఇలా చాల తేలికైన మాటల్తో బరువైన విరహ దుఃఖాన్ని మనలోకి కూడా ఎక్కిస్తాడు దుఃఖగీతితో. "ఫేక్ ఐడెంటిటి"అనే కవిత ప్రేమ,పగిలిపోయిన ప్రేమల్లోని కొత్త కోణాల్నీ చూపించి ప్రేమ "ఐ యామ్ నాట్ ఫేక్"-అని అంటున్నట్టుగా అనుభూతినిస్తుంది.ఇద్దరి మధ్య అంటే ప్రేయసి ప్రియుల మధ్య వుండే వ్యత్యాసం ప్రేమ వున్నప్పుడు తేలీకుండావుంటుంది .ఏ ఒక్కరిలో ప్రేమ సన్నగిల్లినా అప్పుడు వారు "అలల్ని విసురుతూ కవ్వించే నీకు/ సొగసుగా కదులుతూ ఆహ్వానించే నాకు నిజమే బహుశా పోలికే లేదు"-అని అనుకుంటారని ఈ కవి"జస్ట్ లైక్ దట్"అనే కవితలో చాల అనుభవైకవేద్యంగా చెబుతాడు. నందకిశోర్ "మూడు సందిగ్ధాలు"-అనే ఒక కవితలో "వక్రబుద్ది తన కుటిలస్వభావాన్ని కనపడకుం డా వుండటానికీ ఎంతైనా నిజాయితిని కనబరుస్తాడని,నిజాయితీలో వక్రబుద్ది,వక్రబుద్దిలో నిజాయితి వున్నట్టు కనిపిస్తారని,నిజాయితి లేదా వక్రబుద్ది ఏదో ఒక్కటే సంతృప్తినిస్తుందని ప్రేమను ప్రశ్నిస్తూ,"తీవ్రమైన దేహాకర్షణ చేత/భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నప్పుడు"అంటే ప్రియుడి చుట్టు ప్రేయసి లేదా ప్రేయసి చుట్టు ప్రియుడు తిరుతున్నప్పుడు ఎవరో ఒకరు మిగిలిపోయిన సందర్భంలో ఏర్పడిన సందిగ్ధాల ఖాళీల పూరణను చాల గొప్పగా చిత్రించాడు."మళ్లీ మళ్ళీ మళ్ళీ మళ్లీమళ్లీ ఆమె..నేను నేను ఆమె ఛ!"కవి ప్రేమ పట్ల ఎంత ప్రేమను కలిగివున్నాడో అంత చిరాకు పడినట్లు కూడా కొనీ భావనలు కలిగే అవకాశం ఈ మాటలు ధ్వనింపచేస్తాయి.వదిలి వేసే ధర్మాన్ని నిరసించాడానికీ కొన్ని భావనలు ఈఇ సంపుటిలో కవి చిత్రించాడేమోననిపిస్తుంది. నందకిశోర్ ఈ సంపుటిలో వొక ప్రేమను గురించే కాదు ప్రకృతిని,ఓపెన్ కాస్ట్ లో బర్వే అయిన ఊరుని,ముసుర్లు పట్టినప్పుడు ఇంటి వాతావరణాన్ని,తన నేల భాషలో గొప్ప కవిత్వం చేశాడు.గుండెల్ని కరగించేది,మనసును కన్నిటితో కడిగేది"రాఖీ"-అనే కవిత."అక్కా!నీ బాంచెన్.యేడున్న సల్లగుండు.."అని ప్రతి యేడు రాఖీ కట్టే అక్కను మనాది చేసుకొంటూ "సాగతోల్తాంటే/అమ్మ నా చేతిల/నీ చెయ్యి పెట్టినప్పుడో/నల్లపూసలు గుచ్చినంక/కార్ల నిన్ను తీస్కపోయేటప్పుడో/నిమిషమన్నా/దుక్కించక పోతిని"అని అన్నా,"అందర్ని సూడ బుద్దయితుందిరా అని /మొన్న మాట్లాడినప్పు డన్నా/ఏడ్వకపోతిని"అని అంటున్నా కవి మనల్ని నిజంగా ఏడిపిస్తాడు తన కవిత్వ విషాదాన్ని నింపి రాఖీలో. రాఖీలో పూసల్లా అక్క ఙ్ఞాపకాల్నీ నెమరేసుకొంటూ జరిగి పోయిన విషాదాన్ని” నెరేట్ “చేసిన పద్దతి కట్టిపడేసింది ఆ కవిత దగ్గరే నన్ను. "పెమింఅక్షిలా పాడ గలిగినందుకు/పాడుతూ అరవగలిగినందుకు/పువ్వుల్ని ఊహినందుకు/వెన్నెల్ని మోహించినందుకు"ప్రేమించబడతారని కొత్తగా చెప్పడం ఈ కవికే చాతనవును. 'ఎమో! నువ్వడగలేదు గాని చిట్టి తల్లీ! ప్రశ్నలు గుచ్చుకొంటున్నాయ్ ఎందుకైనా మంచిది. ఓ కథ చెప్తా విను" ఇలా మొదలయ్యే కవితలో పాఠకుల్నీ"నీలాగేఒకడుండేవాడు"అనుకుండేటట్లుగా చేసి ఒక ఊహాలోకంలోకి చిగురంతైన భయం లేకుండా చేతిలో చిన్న లాంతరొకటి పట్టుకొని మెల్లగా చీమలా కదిలేటట్లు" విహరింపచేసే చివర్లో "నువ్వొక ప్రాణం నిండిన ఆత్మవి/నీలా వుండటమే నాకు చాల యిష్టం"అనుకుండేటట్లు చేసె ఇంద్రజాలం చేస్తాడు తన కవిత్వ నిర్మాణ నిపుణనతో. "నేను సరోవరాల ధ్యాసలో ఒక్క ఎడారినీ తడపలేక అడవి మధ్యలో ఒక్క ఆకునీ మొలకెత్తించలేక మనుషుల మధ్యలో కాస్తైనా దుఃఖాన్ని రగల్చలేక నవ్వుని చల్లార్చలేక"-ఇలాంటీ అద్భుత వాక్యాలతో పరిఢవిల్లే దీర్ఘ వచన పద్యాలు ఈ కావ్యమంతా నిండి ప్రేమ లోయలోకి దాని సోయగాల సౌందర్యాన్ని చూపించడానికీ పరుగులు తీయిస్తాయి. ఈ సంపుటిలో నందకిశోర్ ముప్పైఆరు కవితల్నీ దేనికదే భిన్నంగా నిర్మించడమే కాదు "పునర్విమర్శ", "ఊవెల పిల్ల","ఒక సంధ్యావస్థ కాలంలోంచి","అనుకోకుండా..."మున్నగు దీర్ఘ వాక్యాల కవితల్ని చేర్చాడు.ఒకప్పుడు శేషేంద్ర శర్మ గారు వచన కవితను,కొంత పాదవిభజనతోను మరికొంత పాద విభజన లేకుండాను ఋతుఘోష లాంటి కావ్యాలు రాసినట్టు గుర్తు.నందకిశోర్ కూడా "దేవీ", "పువ్వుల సంద్రమా", "దుఃఖిత సహచరి" , "వెన్నెల స్నేహిత" లాంటి సంబోధనలతో ఎన్నటికి విసుగుచెందనివ్వని,ఏ ఒక్క క్షణం అసంతృప్తినివ్వని కవితాత్మకతో ప్రేమనీ విరహపు బాధనీ ఒక లయ తప్పని వేగంతో చిత్రించి మనల్నీ ఊపిరి వృత్తంలోనే నిలిచివుండేటట్లుచేసి"నీలాగేఒకడుండేవాడు"అనిపిస్తాడు మన చేత. ప్రేమ తత్వమే కాదు సమాజ తాత్విక అంశాల ప్రస్తావన ఈ కవితా సంపుటిలో అంతర్లీనంగా కనిపిస్తాయి.జీవన సత్యాల పరోక్ష నిక్షిప్తత ఈ కవితల్లో కనిపిస్తుంది. "పగిలినా పగలకున్నా ప్రతిబింబించడం మాత్రమే నీ గుణమైనప్పుడు ఎవరో విసిరిన రాయిని చూసి ఎందుకంత కోపం నీకు? నీ గురించి నీకే తెలియంది ఇంకేదన్నా మిగిలే వుందా?-(అద్దం) అద్దానికీ,మనిషి మనసుకి పెద్ద తేడా లేదని వ్యవహారంలో అనుకొంటూవుంటాం.అద్దం రాయి తగిలి ముక్కలయి పోతుంది.రాయి లాంటి మాటలకి మనిషి మనసు ముక్కలవుతుంది.ఆ తరువాత అతుక్కోవంటారు.కానీ నందకిశోర్ ఎవరైనా రాయిలాంటి మాటలతో ముక్కలు చేసే యత్నం చేసిన కోపం తెచ్చుకోకూడదనే భావనను సూచిస్తూ,అద్దం గురించి అద్దానికీ,మనషి మనసు గురించి మనిషి మనసుకూ అంతా తెలుసు కదా మరి ఎందుకు కోపం తెచ్చుకోవడం అని ప్రశ్నిస్తాడు.ఆ ప్రశ్నలోనే తన సమర్థనను ఎంతో ఆలోచనాత్మకంగా "నీ గురించి నీకే తెలియందేది"ఏదీ మిగిలి లేదనే లోతైన భావాన్ని అందజేస్తాడు.కవిత్వం కూడా అద్దం లాంటిదే.ఆ కవిత్వం పై ఎవరైన విమర్శల రాళ్ళు వేయొచ్చు.నీ కవిత్వం గురించి నీకు తెలియనిదేమి వుండదని అందుకోసం కోపం తెచ్చుకోడం కూడదన్న అంశాన్నీ కూడా పరోక్షంగా ద్వనింపచేస్తాడు.తక్కువ మాటల్తో ఎక్కువ అర్థాన్ని స్ఫురింపచేయడం మంచి లక్షణం. నందకిశోర్ కవిత్వం ఇట్లా వుంటుంది కాబట్టే ఎక్కువ కవులూ,పాఠకులు యిష్టాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిలోపలి లోతుల్లోకీ ఎట్లా ఇంకి పోతాడు? అనే ప్రశ్న మనల్నితొలిచే ప్రశ్న.ఈ ప్రశ్నకి జవాబు నందకిశోర్ కవితవంలో జవాబు దొరుకుతుంది.వాన కురిసేటప్పుడు స్వఛ్చంగా ఏ రంగు లేకుండా వుంటుంది.నేలకు దిగింతర్వాత ఆ నేల రంగునే పులుముకొని అందులోకి ఇంకి పోతుంది.అట్లాగే మనిషి కూడా ఇంకో మనిషి లోతుల్లోకి ప్రవహించడం వల్లా అతన్లో ఇంకి పోతాడని ఒక జీవన సత్యాన్ని చెబుతాడు ప్రకృతిని పోలిక చేస్తూ.కొన్ని లోతైన తాత్విక భావనల్ని చెప్పడానికీ సాధారణ పోలికల్నే తీసుకొని గాఢంగా సాంద్రంగా చెప్పగలిగే శక్తి నందకిశోర్ లో వుంది. ఏ భవబంధాలను పట్టించుకోని వాడిని అలా తిరిగేవాడిని తెగిన గాలి పటంతో పోలుస్తుంటారు.కానీ వొక ఉన్న్నత లక్ష్యాన్ని చేరుకోవడానికీ ఆధారం లేకపోయిన పడుతూ లేస్తోన్న వాడిని తెగిన గాలి పటంతో పోలుస్తూ,అతడు ఆ లక్ష్యం చేరుకొంటాడో,లేదో నీకు అనవసరం.అటుపోయి అతని లక్ష్యానికి నీవు అడ్డు కావొద్దని చెబుతాడు ఈ కవి.ఒక సమున్నత చింతన ఇతని కవితల్లో ప్రతిఫలిస్తుంది. జీవిత ప్రయాణంలో ప్రేమ కూడ ఒక మజిలి.అనుభూతుల అలల మీద ప్రణయ సముద్రం తీరం చేరడానికీ నందకిశోర్ కవిత్వం నావ మీద సేద తీరుతూ పయనించండి 'నీ లాగే ఒకడుండేవాడు"సంపుటాన్ని చదువుతూ...అని మిత్రులకు చెబుతూ మరో కవితా సంపుటి పరిచయంతో వచ్చే మంగళవారం కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m3qluI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి