పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

Narayana Sharma Mallavajjala కవిత

ఈనాటి కవిత-69 _______________________________ డా.కాసుల లింగారెడ్డి-ఇడుపుకాగితం తెలుగులో 55,60 ప్రాంతలకు ముందు వచ్చిన చారిత్రక సాహిత్యానికి తరువాత వచ్చిన చారిత్రక సాహిత్యానికి మధ్య ప్రధానవైరుధ్యమొకటి ఉన్నది.ముందు సాహిత్యం రాజుల కథలు,ఇతి వృత్తాలపై ఆధారపడితే తరువాతి సాహిత్యం ఈ సంప్రదాయం నుండి దూరమయ్యింది.ఈ క్రమంలోనే చారిత్రక వాస్తవికత(Historical Reality) ఒకటి కనిపిస్తుంది.చరిత్రని కల్పనతొ కాక వాస్తవధరంగా కవిత్వంలో నిర్మించడం.ఈ సందర్భం లోనే చారిత్రక నేపథ్యం(Historical Context)అనే పదాన్ని కూడా పరిశీలించాలి.ఒక కాలంలో ప్రబలంగా ఉండే ఆలొచనా ధోరణులు,జీవన విలువలను చారిత్రక నేపథ్యం అంటారు.నిర్దిష్టకాలంలోని రచయితలు విడివిడిగా,బృందాలుగా ఒకే రకమైన అలొచనా ధోరిణితొ ఉండటం. జాతీయోద్యమ కాలపు సాహిత్యానికి దేశభక్తి,భాషాభిమానం ,హరిజన సమస్య,వితంతు వివాహం,వరకట్నం మొదలైనవి చారిత్రక నేపథ్యం గా ఉన్నాయి.60 కి ఈ ఇవతలిభాగంలో ప్రాన్స్ లో విద్యార్థి ఉద్యమాలు,చైనాలో సాంస్కృతిక ఉద్యమం,వియత్నాం ఉద్యమం తో పాటు ఈనెలమీద వచ్చిన తెలంగాణా సాయుధ పొరాట గీతాలు,శ్రీకాకులం నగ్జల్బరీ గీతాలు మొదలైనవి చారిత్రక నేపథ్యం గా కనిపిస్తుంది.విప్లవ సాహిత్య ధోరణిగా వ్యవహారంలో కివచ్చింది కూడా ఇదే. ఈ దశాబ్దికాపు తెలంగాణ ఉద్యమ సాహిత్యంలోనూ అనేక చారిత్రకాంశాలు సాహిత్యాంశాలుగా రూపు దిద్దుకున్నాయి.డా.కాసుల లింగారెడ్డి గారు రాసిన "ఇడుపు కాగితం" కూడా అలాంటిదే. ఒక చారిత్రకాంశాన్ని ఉల్లేఖనం(Allusion)ద్వార వాస్తవవాద దృక్పథంతో వర్తమాన దృష్టితో రాయటం కనిపిస్తుంది. "పుస్తెలతాడు కట్టించి తన్నుకు చావమని సాపెన పెట్టిండు సచ్చినోడు." 1 "తాటికమ్మల గుడిసన్నా లేదని రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. కాసులు లేని కనాకష్ట కాలంల నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన. గొంతెండి ఎక్కిళ్ళు పెడ్తె కుడిదాయి కుడిపి కుతిదీర్చిన. నా రామసక్కని కుర్చీ ఇచ్చి సదువుకున్నోనివని రాజును చేసిన. నిన్నేమన్న కర్రె కుక్కను చేసి ఎంటదిప్పుకుంటినా?" ఇందులో మొదటి వాక్యమే ఉల్లేఖనం.తెలంగాణాను కలిపి "విశాలాంధ్ర"నుఏర్పాటు చేస్తూ నెహ్రూ గారన్న మాటల స్పృహ ఇక్కడ కనిపిస్తుంది."నిన్నే మన్నా కర్రె కుక్కను చేసి ఎంట దిప్పుకుంటినా ? "అన్న ప్రశ్నలో కూడా జానపద కథల్లో వినిపించే"బాల నాగమ్మ "కథ స్ఫురిస్తుంది. ఉత్తరనిర్మాణవాదం(Post -Strcturalism)ఈమలుపులో కనిపిస్తుంది.స్థిరమైన సత్యం అనే అంశం నించి బయటికి వచ్చి చెప్పటం,ప్రధానాంశంలోని ఆదర్శాన్ని తోసివేసి .వాస్తవాన్ని చెప్పడం,పెద్ద పెద్ద సిద్ధాంతాలని(Meta naretivs)నమ్మి వాస్తవాన్ని నిర్బంధించకుండా ఉండటం,బాహ్య వాస్తవికతని కాకుండా "స్వతంత్రంగా ఉండే వాస్తవాన్ని" చెప్పటం.వర్గం బదులుగా వ్యష్టివిలువలపై ఉత్తర నిర్మాణ వాదం దృష్టి నిలిపింది.దాంపత్యం అనెదానికన్నా స్థ్రీ,పురుషుడు అనె జెండర్ మీదా దృష్టి పెడుతుంది...పెళ్లి అనే అంశాన్నే కొనసాగిస్తూ చూపిన అంశాలుకూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తాయి. "మర్లువెళ్ళన్నా కాలేదు కాళ్ళ పారాణన్నా ఆరలేదు ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి. పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య అడ్డు తెరలెందుకంటివి సంపదలు నీకు సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి ఈ కాపురం నేనొళ్ళనంటె కూసున్న పెద్దమనుషులు కాసింత సర్ది చెప్పి కాయితం మీద కాపురం నిలిపిరి." ఈ భాగం లో "ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి/నీకు నాకు నడుమ/నియమాలెందుకంటివి./పొలిమేరలు చెరిపేసిన దేహాల మధ్య/అడ్డు తెరలెందుకంటివి/సంపదలు నీకు/సందేశాలు నాకన్న సత్యం నేనప్పుడే పసిగట్టి"- ఈ వాక్యాలు అందుకు నిదర్శనం, ఒక చారిత్రక వాస్తవాన్ని అంతే పటిష్టమైన సైద్ధాంతిక ధర్మంతో అందించటం లింగారెడ్డి గారి కవితలో కనిపిస్తుంది.కేవల ఉద్వేగం కాక నిబద్ధమైన దార్శనికతని ప్రదర్శించిన కవిత.బల మైన కవితావాక్యాలు కూడా అడుగడుగునా కనిపిస్తాయి.-"పొలిమేరలు చెరిపేసిన దేహాలు","వరిమొవ్వలోని మంచు ముత్యం","ఉనికి ఉనుక పొట్టవటం","కాలపు పలుగురాళ్ళమీద పదునెక్కి పారుతున్న జీవనదులసొంటి భాష" -లాంటి ప్రయోగాలు ఎంతో కొత్తగా ,కవిత్వాన్ని,వస్తువును నిలబెడతాయి. తాటికమ్మల గుడిసె,కర్రెకుక్క,పుస్తెలతాడు,మర్లువెల్లి,కుడిదాయి,ఇకమతులు,మల్లెసాల-వంతి ప్రాంతీయ పదజాలం కూడా ఈ కవిత సౌందర్యాన్ని అధికం చేస్తాయి..మంచి కవిత అందించినందుకు డా.కాసుల లింగా రెడ్డి గారికి ధన్యవాదాలు.

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bhpYIr

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి