పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, జూన్ 2014, మంగళవారం

Rajaram Thumucharla కవిత

కవి సంగమం -గ్రూప్ కోసం చదివిన కవిత్వ సంపుటి : - "34" సంపుటి పేరు :- "దుఆ"- (ప్రగతిశీల ముస్లిమ్ కవిత్వం) కవిత్వ సంపుటి రాసినది : - "పఠాన్ రసూల్ ఖాన్ " పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి " మీనార్ నుండి ఎగిరి దొంగ దెబ్బకు క్షతగాత్రమై విలపించే పావురాయి చేసే "దుఆ" నే ఈ రసూల్ ఖాన్ కవిత్వం" "బాబ్రీలో నీవు చేసిన గాయం ఇంకా మాననే లేదు గుజరాత్ లో నీవు నరికిన శరీరం అతకనే లేదు వీలైనప్పుడల్లా నా గాయాలను చిదిమి రాచపుండు చేశావు నా అస్తిత్వానికీ నీ అహంకారంతో దేశ ద్రోహం పులిమావు" (దుఆ) ఎక్కడా విన్నానా స్వరం? ఎవరివా వాక్యాలు?-అని ఆలోచిస్తూ ఈ వాక్యాలు "మీనార్" నుంచి నాకు వినబడ్డాయా లేక ఎక్కడైనా చదివానా అని అనుకుంటూ అక్కడ అడుగుపెట్టాను. ఆ బంగారు ముఖద్వారం ప్రాంగణంలో గాజులుఅమ్మే వాడి (bangle seller) సవ్వడులు స్వాగతం చెప్పిననట్లు అనిపించింది.నిరంతరం కవిత్వమై ప్రవహించే యాకూబ్ దంపతులు,పాత ఙ్ఞాపకాల పరిమళం వెదజల్లగానే గుర్తు పట్టిన కవి దిలావర్, వహ్వ అనిపించేలా ఉర్దూ కవిత్వ నజరానానందిస్తున్న వాహేద్,తన వాదాన్ని ఎవ్వరేమనుకున్నా ధైర్యంగా వినిపించే స్కైబాబ, కవిత్వ నిర్మాణ శిల్పాన్ని కొత్తగా వింగడించి చెప్పే నారాయణ శర్మ యువ కవులు తిలక్,విజయ కుమార్,కృష్ణమణి,అందర్నీ జీరో డిగ్రీ లోకి తీసుకెళ్ళే మోహన్ రుషి ఇలా అందరి మధ్యన వున్నప్పుడు ఒక యువకుడు తన కవిత్వ పుస్తకాలు పంచుతూ నాకు కూడా ఇచ్చాడు.ఎందుకో తెలీదు కాని ఎవర్ని అడగని ప్రశ్న అతన్ని అడిగాను. ఆవ్యక్తి నా ప్రశ్నకు బదులుగా ‘ఆటో మెకానిక్’ ని అన్నాడు.అంతే మనసంతా అతన్ని గురించే ఆలోచించడం మొదలెట్టింది .ఏం చదివాడో తెలీదు కానీ కవిత్వం అతని ఆరో ప్రాణం అని మాత్రం అర్థమయ్యింది నాకు. అసురా,సిధ్దార్థ,సంగిశెట్టి,సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నాళేశ్వరం శంకరం ,జగన్ రెడ్డి, మోహన్ రుషి, యాకూబ్, స్కై బాబ ఇందరి మధ్యలో వున్నా నాలో ఆ వ్యక్తి ఆలోచనే నన్ను ఒంటరి ద్వీపం లోకి నెట్టేసింది.యంత్రాలను మరమ్మత్తు చేసే అతను జీవితాన్ని మరమ్మత్తు చేసే కవిత్వం వైపు మొగ్గడం కొంచెం విస్మయానికి గురిచేసే సందర్భమే అయినా అలాంటి సందర్భాలు అనేకం గుర్తుకొచ్చి ఆ వ్యక్తి కవిత్వంలోకి వెళ్ళిపోయాను. మాటల్ని నిప్పు కణికెల్లా విసిరే శక్తి కల ఈ కవి పేరు పఠాన్ రసూల్ ఖాన్. అతని కవితా సంపుటే "దుఆ" “నేనేం చేయాలో నీ అధికారం చెబుతుంది నేనెలా వుండాలో నీ అజమాయిషి చూపుతుంది స్వతంత్ర దేశంలో వున్నా బానిస బ్రతుకు నాది” ముస్లిమ్ ల అస్తిత్వానికీ పై వాక్యాలు వారిపై ఈ కవి రాసిన శ్వేత పత్రానికీ కవిత్వరూపమేమో అని అనిపించకమానదు. "శత్రువు ఎంత బలమైన వాడైనా సహనంతో ఎదుర్కోవాలని,పగతో రగిలే వాడికి ప్రేమను పంచాలని,దౌర్జన్యం చేసిన వాడికై ‘దుఆ’ చేయమన్న "-ప్రవక్త వాక్యాలను ఈ కవి అక్షరాలనమ్మాడు."ప్రపంచం బాగుండాలి అందులో నా దేశం బాగుండాలి"-అని ఈ కవి అనుకుంటున్నాడు కాబట్టే 'నా లక్ష్యం ప్రేమైక భారతం "-అని అనగలిగాడు.ఈ రసూల్ ఖాన్ గొప్ప కవిత్వం రాశాడని కాదు, రాసిన దాన్ని చిత్తశుధ్దితో రాశాడని,తన వృత్తిని మించిన ప్రవృత్తిని కలిగివున్నాడని ఈ శీర్షికలో పరిచయం చేయాలనిపించింది. ఈ కవికీ ఆశావాద దృక్పథం అధికమేమో?.అందుకే భారతీయ చరిత్రను వక్రీకరించిన వైనాన్ని గుర్తించి "ఇంద్రధనుస్సులో లేని వర్ణంలా చరిత్ర పుటల్లో నన్ను వర్ణించాలనుకున్నావు"-అని అంటూ "నా తనువుకు ఎన్ని గాయాలైనా తలవంచక నిలుస్తాను కొత్త చిగురునై జనిస్తాను"-అని అనగలిగాడు "కొత్తచిగురు"-అనే కవితలో.ఖాదర్ మొహిద్దిన్ 'పుట్టు మచ్చ'లో ఆటలక్కూడా మతం అంటగడుతున్న దేశం దుస్థితిని గురించి కలత చెందితే ఈ కవి "నాకు అంటని వర్ణమేదో ఒంటినిండా పులుముతున్న భావన ప్రతి రాత్రి పీడకలై వేధిస్తుంది నాది కానిదేదో నాలో చూపిస్తూ నీ నీడ కూడా భయపెడుతుంది"-అని వాపోతాడు.భారత దేశ స్వాతంత్ర పోరాటంలో ముస్లిమ్ ల పాత్ర కూడా గణనీయమైనదే.ఆ విషయాన్ని "నీ స్వేఛ్చా గీతిక వెనుక ప్రవహించిన నెత్తురు నాదే "-అన్న వాక్యాల్లో వ్యక్తం చేసి, అయినా తనను పరాయివాడిగా చూసే నైజాన్ని నిరసిస్తాడు "కొత్త చిగురు"-అనే కవితలో ఆలోచనాత్మకంగా . మతసామరస్యానికీ మంట పెట్టాలని చూసే వాళ్ళని "మౌనంగా చూస్తున్నానని చులకనగా చూడకు మౌనం ముక్కలయితే చరిత్రే లేకుండా పోతావ్"-అని హెచ్చరిస్తాడు."చార్మినార్"-ని భాగ్యనగ కీర్తికిరీటంలో వన్నె తగ్గని కలికి తురాయిగా పోల్చడమే కాదు గతానికీ వర్తమానానికి మధ్య చరిత్ర చెక్కిన శిల్పంగా ఊహా చేస్తాడు.తాము వున్నచోటనే తమను పరాయి వారిగా చిత్రించే చరిత్ర రచన ,విధ్వంస కుట్ర తెలుసుకున్నామని ,తమ మౌనం బద్దలయితే చరిత్ర సాక్ష్యంగా కాటికి పోయిన మతోన్మాద శక్తుల ఉనికిలేని తనాన్ని తెలుసుకోమని మరోమారు గతించిన చరిత్రను గుర్తుచేస్తాడు. తమ సాంస్కృతిక చారిత్రక ఆనవాళ్ళను తుడిచిపెట్టే ప్రయత్నాన్ని కవిత్వం తో ప్రతిఘటిస్తాడు. సామ్రాజ్యవాదం,అగ్రరాజ్య దురహాంకారం,అవసరమనుకున్నప్పుడు ఒకదేశంలో రెండు మతాల మధ్య,రెండు పొరుగు దేశాల మద్య చిచ్చుపెట్టడం ఇవన్నీ ప్రపంచీకరణ దుర్లక్షణ పర్యావసానాలే.ఈ ప్రపంచీకరణ ప్రభావాన్ని కూడా ఈ కవి పసిగట్టినట్టున్నాడు.అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష వేయి తలల నాగుపాము.ఆ పాము పడగలో వర్ధిల్లిన జియోనిజమ్ వారసులు ఇజ్రాయీలు పాలస్తీనా ప్రజలపై జరిపిన దురాగతాలను ఈ కవి వినో చూసో తన అక్షరాయుధాల్ని ఎక్కుపెట్టాడు.పాలస్తీనా లోని గాజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండిస్తూ "గాయాల గాజా"-అనే కవిత రాశాడు. "అవును అక్కడ వెన్నెల హాయిని మంటలు కాజేశాయి లాలి పాడే చోట పాడె మీద ఏడ్చే తల్లుల రోదనలే ఎటు చూసినా ఉన్న చెట్టుకే చీడలు పడుతుంటే కొత్త చిగురులెక్కడ! విరిసే మొగ్గలకు చోటెక్కడ నీ దురాక్రమణ మంటలకు అమాయక ప్రజలను చిరు మొగ్గలను ఆహుతి చేస్తావా! చిరు హృదయాలను చిదిమి చిద్విలాసమా నీచుడా! ఏం... జాతిరా నీది" (గాయాల గాజా) ఇలా రసూల్ ఖాన్ యుధ్దనీతిని కావాలనే వదిలేసి చిన్నపిల్లల్ని,ఆడవాళ్ళని సైతం ఇజ్రాయిల్ మారణకాండలోవాళ్ళను భాగం చేస్తుంటే సహించలేక "ఉగ్రవాది ఇజ్రాయిల్ కు కర్రు కాల్చి వాత పెట్ట"మని కోరడమే కాదు "గాయపడ్డ గాజా కు మందు నివ్వు"-అని సిగ్గుని కోల్పోయి చూస్తున్న మిగిలిన ప్రపంచాన్ని కోరడమే కాదు అలాంటి ప్రపంచంలో తాను ఉన్నందుకు సిగ్గుపడతాడు. బాబ్రీ తప్పటడుగుల్ని తప్పని సర్దుకున్నాగుజరాత్ మారణకాండను అడ్డుకోలేని అప్పటి కేంద్ర అధికార పార్టినీ పరోక్షంగా "'నా గుండెలోని బాధలను నీ"హస్తం" స్పర్శతో మరిచాను"-అని ప్రస్తా విస్తాడు.మాములుగా ఆ పార్టీకే ముస్లిమ్ ఓటు బ్యాంక్ మొగ్గు చూపుతుందనే అభిప్రాయాన్ని కూడా ఈ కవి బలపరుస్తున్నట్టుగా " నీకై ఓటునవ్వడం తప్ప సంతోషం ఎరుగని నాకు"-అనే వాక్యాలు ధృవపరుస్తాయి. "నా రక్త మాంసాలను కూర్చి అన్ని సమకూర్చిన రిక్తహస్తాలు" చూపిన వార్ని కనికరం లేని ప్రశ్నలుగా ఈ కవి గుర్తిస్తాడు. "ఐస్ బాబు ఐస్ బాదం ఐస్ ఆరెంజ్ ఐస్ చల్ల చల్లని ఐస్ రండి బాబు రండి" ఈ మాటలు సైకిల్ వెనుక స్టాండ్ మీద ఒక డబ్బాని ట్యూబ్ లతో జారిపోకుండా కట్టుకొని ఒక చిన్న డబ్బాని తాడుతో తిరిగే చక్రానికి అనుసంధానించి అందర్ని ఆకర్షించే ఒక రకపు శభ్దాన్ని సృష్టిస్తూ పుల్ల ఐస్ అమ్మే ముస్లిమ్ ల ఆకలి తాపం చిత్రించిన కవిత లోనివి. "మంచులా కరిగే కాలం మాపై కక్ష కడితే తల్లిలా ఆదరించిన గ్రీష్మం జీలిగా నా తల నిమిరింది" అని మండే ఎండా కాలం కూడా తమని తనవారిగా తలపోస్తే తోటివారు తమను పరాయి వారుగానే ఆలోచించారనే భావనని ఈ కవి స్ఫురింప చేస్తాడు. ఏదయినా ప్రాణం వున్నదైనా,లేని దయినా అవసరాన్ని బట్టో ఆలోచనను బట్టో చూసే చూపును బట్టో తన రూపాన్ని ఎలా మార్చుకోగలదు?.కానీ పావురం ఆలయంలో వుంటే సామరస్యపు రూపం,చర్చిలో అది శాంతి కపోతం కానీ మసీదు పై వాలగానే మత పావురం.ఇది ఎట్లా సాధ్యం?.వస్తువు వొకటే.కానీ అది చేరిన ప్రదేశం వేరే.అందువల్లే దాని రూపం మసీదు మీద వాల గానే మతంగా మారిందనే ఒక వర్గ ఆలోచనని ఈ కవి ఎత్తిచూపిస్తూ ముస్లిమ్ లపై వున్న వివక్షను అద్దంలోని బింబంగా పావురంతో ప్రతిక్షేపిస్తూ దృశ్యమానం చేస్తాడు. ముస్లిమ్ పావురాళ్ళను బౌద్ద రాబందులు తరిమే దృశ్యం ఎక్కడ చూశామా?-అని మనకు అనుమా నం రావచ్చు.అహింసా పరమోధర్మః అని విశ్వసించే బౌద్ద మతంలో కూడా పరమత సహనం లేని కొందరు మయన్మార్ లో ముస్లిమ్ లపై దాడి చేసిన సన్నివేశం ఇంకా ఎవరు మరచిపోలేదు.ఆ సం ఘటనను రసూల్ ఖాన్ "యా అల్లాహ్"-అనే కవితలో గుర్తుచేస్తాడు. "దీపపు కాంతి లేనిమా ఇళ్ళు నీవు పెట్టిన నిప్పుతో ఊరికే దివిటీలుగా మారాయి చెయ్యేత్తి ప్రార్థిద్దామంటే మా వైపు జాలిగా చూశాయి" ఇలా ఈ కవి మయన్మార్ లో జరిగిన దాడిని ,అక్కడ ముస్లిమ్ ల నిస్సహాయతను ఒక గొప ఊహతో తెలియచేస్తాడు. ముస్లిమ్ పావురాళ్ళను బౌద్ద రాబందులు తరిమే దృశ్యం ఎక్కడ చూశామా?-అని మనకు అనుమా నం రావచ్చు.అహింసా పరమోధర్మః అని విశ్వసించే బౌద్ద మతంలో కూడా పరమత సహనం లేని కొందరు మయన్మార్ లో ముస్లిమ్ లపై దాడి చేసిన సన్నివేశం ఇంకా ఎవరు మరచిపోలేదు.ఆ సం ఘటనను రసూల్ ఖాన్ "యా అల్లాహ్"-అనే కవితలో గుర్తుచేస్తాడు. "దీపపు కాంతి లేనిమా ఇళ్ళు నీవు పెట్టిన నిప్పుతో ఊరికే దివిటీలుగా మారాయి చెయ్యేత్తి ప్రార్థిద్దామంటే మా వైపు జాలిగా చూశాయి" ఇలా ఈ కవి మయన్మార్ లో జరిగిన దాడిని ,అక్కడ ముస్లిమ్ ల నిస్సహాయతను ఒక గొప ఊహతో తెలియచేస్తాడు. "మా సహనమే నీ బలం మా మౌనమే నీ ఆయుధం స్వార్థం అంటని సత్య ప్రియులం కాలుతూ వెలుగు నిచ్చే ప్రమిదలం వెలుగు పూలను వేటాడాలని చూస్తే" కపట నీతి కడిగివేయబడుతుందని,దౌర్జన్యం దహించి వేయబడుతుందని "వెలుగు పూలు "-అనే కవితలో ఒక వేదనతో కూడిన సత్యాన్ని చూపుతాడు. ఈ కవి ఇస్లామ్ లోని కొన్ని ప్రగతిశీలం కానీ అంశాలను సైతం నిర్మొహమాటంగా ఖండిస్తాడు. పూజారి వ్యవస్థ లేని ఇస్లాం లో పూజారుల్లా చెలామణి అవుతున్న అగ్రవర్ణ బీజ మూర్ఖుల్లారా వెలుగును దాచే వారల్లారా దీపం క్రింది నీడల్లారా వెన్నెలను పంచాలి పట్టి ఆప కూడదు శాంతి సందేశం ఇవ్వాలి" అని అనడమే కాదు ఇస్లామ్ అంటే ఇలా చెబుతాడు. ఇస్లామ్ అంటే? మతం కాదు మానవ జీవన విధానం ధార్మిక విఙ్ఞానం బానిస సంకెళ్ళను తెంచిన సమానత్వపు ఆయుధం కాఠిన్యాన్ని కడిగిన కరుణామృత సాగరం హృదయాలను కలిపిన ఆత్మీయ నేస్తం" ఇలా ఇస్లామ్ మౌళిక ధర్మాలను కవిత్వం చేశాడు ఈ కవి రసూల్ ఖాన్. ప్రగశీలం అని అనని బురఖా సాంప్రదాయాన్ని సమర్థించే అంశాలు కూడా ఈ కవి చేతిలో కవిత్వం అవ్వడం అతని ప్రగతి శీలత్వానికీ అడ్డంకేమో? కొన్ని పేలవమైన పంక్తులు ,కవిత్వంగా మారని వాక్యాలు ఈ కవి కవిత్వం రాయాలన్న చిత్త శుధ్ది ముందు ఓడిపోతాయి.ఈ కవి మంచి చదువరి కాగలితే మంచి కవిత్వ సృజన చేయగడు.అతని ముందటి అఫ్సర్,యాకూబ్,దిలావర్,ఖాదర్ మొహిద్దీన్,మహజబీన్,స్కైబాబా,షమీఉల్లా మున్నగు కవులను చదివి అర్థం చేసుకొని కవిత్వం నిర్మిస్తే , కవిత్వ శిల్ప రహస్య నిర్మాణం తెలుసుకోగలిగితే మైనారిటీ ముస్లిమ్ వాద సాహిత్యానికీ మరో ఆణిముత్యం దొరికినట్టే. "తురకోళ్ళకు తెలుగు కవిత్వమా? అని నవ్వే విషపు ముళ్ళ మధ్య విరబూసిన వెలుగు గులాబీ " అయిన పఠాన్ రసూల్ ఖాన్ ని అభినందిస్తూ..వచ్చే మంగళవారం మరో సంపుటితో కలుద్దాం.

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T3YLQy

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి