పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, మే 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

||కార్టూన్‌ కవిత్వం -|| చేరా || పత్రికలో కార్టూన్‌లు /పడటం చూళ్ళేదూ?/పద్యం ఆ మాదిరి పద్ధతి వీల్లేదూ ? - శ్రీశ్రీ - 1953 - తెలుగు స్వతంత్రలో అన్నారు. కార్టూన్‌ కవిత్వం తెలుగులో ఎప్పుడు ఆరంభమయిందో తెలియదు. అంతకు ముందు 1950 లో అప్పటి రాజకీయ పరిస్థితులను వ్యాఖ్యానిస్తూ నండూరి రామమోహనరావు గారు ఆంధ్ర వార పత్రికలొ అంత్యప్రాస నియమంతో లిమరిక్కులు రాసేవారు. చాలామంది అనుకుంటున్నట్టుగా అభ్యుదయ కవిత్వంతో సహా సాహిత్య ప్రక్రియలు చాలా వాటికి శ్రీశ్రీ ఆద్యులు కాకపోవచ్చుగాని చాలా క్షేత్రాలను చదునుచేసి చక్కని బాట వేశారు. అన్నీటికీ ఆద్యుడు కావటమే గొప్పకాదు. ఆ మార్గాన్ని పటిష్టం చేయడంకూడ గొప్పే. ఆ తర్వాత ఆ మార్గంలో నడిచిన ప్రసిద్ధులు చాలమందివున్నారు. భావకవిగా అరుదుగా గేయాలు, అధికంగా పద్యాకు రాసిన సీనియర్ కవి నాయని సుబ్బారావు గారు మారు కలం పేరుతో (సౌ వీరభద్రుడు) కార్టూన్‌ కవిత్వం రూపంలో ప్రద్హానంగా వచన కవిత కంటే ముక్త ఛందం అనాలి, అదే ఔచిత్యంకూడా. అది ఫ్రెంచ్‌ వెర్స్‌ లిబేరే అని అంటారు. వచన కవితను వెర్స్‌లీబ్ర అని ఫ్రెంచ్‌లోనూ, ఫ్రీవెర్స్‌ అని ఆంగ్లంలోనూ అని అనుకుందాం. ఈ రెండూ కవితా రూప పరిమాణంలో రెండు దశలు. మొదటిది లయ విముక్తం అయే ప్రయత్నమే కనిపిస్తుంది. కాని లయ స్ఫూర్తి అనియతంగా వుంటుంది. రెండవ దశలో లయ స్ఫురణ అసలేవుండదు. ప్రస్తుతం తెలుగు కవిత రెండవ దశలోవుంది. ఈ దృష్ట్యా నాయని సుబ్బారావు గారి కార్టూన్‌ కవితా రూపాన్ని ముక్తచ్ఛందం అంటున్నారు. వారు రాసిన ఆ కవిత్వానికి ఆధారమైన వార్తను కవితా ఖండిక కింద తెలుగులో సూచించేవారు. కొన్నింటికి ఆధారాలైన వార్తా కత్తిరింపులుఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి తీసుకున్నవి. అవి సౌవీరభద్రుడు పేరుతో ' అభ్యుదయ ' పత్రికలో రాశారు. వాటి వివరాలు మాత్రం దొరకవు. కాని 1965 ఆగస్టు నుండి ఆంధ్రప్రభలో అప్పుడప్పుడు ' క్షేత్రజ్ఞుడు ' అనే మారుపేరుతో ప్రకటించిన వాటి వివరాలు మాత్రం దొరుకుతాయి. అభ్యుదయలో రాసిన శైష్యోపాధాయిక, నా.గ.' జీవస్త్రోత్రం ' అనేవి లభ్యమవుతాయి. --'' ఎన్ని తుపానులు లేచినా, చేయదల్చుకున్న పనిక ఆగలేదు మేం ప్రకాశం దగ్గర తయరైనవాళ్ళంకదా’ విజయవాడలో ఆర్‌.టి.సి. బస్సుల ప్రారంభోత్సవ సందర్భంలో '' శ్రీసంజీవరెడ్డి '' అనే నోట్ శైష్యోపాధ్యాయిక కవిత కింద వుంది. '' ప్రకాశంగారి శిష్యులం మేము / పరమానందయ్య శిష్యులం కాము ‘‘.. అని ప్రారంభమై 22 లైన్ల కవితలో సంజీవరెడ్డి వర్గాన్ని పరమానందయ్య శిష్యులతో పోల్చారు సుబ్బారావు గారు. అందులో చివరి ఆరు లైన్లు చతురశ్ర గతిలో యిలా నడిచింది '' ఎన్ని తుపానులు రేగినా ఎన్ని అవాంతరాలు మూగినా చేరుస్తాం దులాన్ని మా గమ్యం శిష్య వాక్యమిది చిన్మయ రమ్యం అయితే స్వామీ అప్పటిదాకా సూది పదిలమేనా? - చూడు మజాకా'' మచ్చుకు మరొకటి నాన్‌ గెజిటెడ్ ఉద్యోగుల గురించి రాసింది '' ఇప్పుడు కూడా కష్టపడి పని చెయ్యమనండి వారిని యన్‌.జి.వోలను పొగడ్డాని సిద్ధంగానేవున్నాం. శాసన సభలో బెజవాడ గోపాలరెడ్డి గారు చేసిన ప్రకటనపై కవిత: '' అర్థికమంత్రి పొగిడి నిన్నంట ఆకాశానికెత్తుతాడంట ఇంత అదృష్టం పండించావా ఎంత ధన్యుడివు ఎన్‌.జీ.వా? '' అని మొదలై సాగుతుందీ కవిత '' ఆలస్యం కాకూండా జావో ఆఫీసుకు యన్‌.జీ.జీవో ఐదుగంటలదాకా కుర్చీకంటిపెట్టుకుని పనిచెయ్! ఫైళ్ళ దొంతరలన్నింటినీ పటాపంచలుచేయ్! ''... అదే కవితలో ముక్తాయింపుగా చతురశ్ర గతిలో '' వ్యర్థ మనర్థం తక్కినతందా సార్థకమైందొకటే అది ఆర్థిక మంత్రి పొగడ్త - అదే పురు షార్థమ్‌ - చరితార్థమ్‌! పరమార్థమ్‌ '' ..అంటారు .. రెండవ దశలో 1969 లో క్షేత్రజ్ఞుడు కలం పేరుతో రాసినకవితల్లో పాద సంఖ్య నిర్దిష్టం. నాలుగు పాదాల మూడు చరణాలు ) స్టాంజాలు) ప్రతి కవితలో. మొత్తం అచ్చయినవి 17. 22.8.1965 నాటి ఆంఢ్రప్రభ అచ్చయిన ' ఏనుగు ఏడ్చింది ' బ్రాకెట్లో కార్టూన్‌ కవిత్వం అని పేర్కొనబడటం విశేషం. ఆగస్టు 4 ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ లోని వార్త ఆధారంగా రాసినది '' ఎందుకు లేదు తమ్ముడూ! ఇది ప్రజా యుగం1 ప్రజా తంత్రంలొ ప్రజా సంక్షేనం కోసం పగలనక, రాత్రనక మన ప్రజా ప్రభువులు ముద్దు ముద్దుగా కార్చడంలేదూ మొసలి కన్నీరు! '' తెలంగాణాలో మద్య నిషేవణం, ఆంధ్ర ప్రాంతంలో మద్య నిషేధం వున్న కాలంలో రాసినది 19.9.65 నాటి ఆంధ్రప్రభ '' ఆంధ్రా కల్లు కొంత గుటకాయస్వాహా అక్కణ్ణే కానీ సాధు సుబ్రహ్మణ్యులకిది సంతాపకరమైతే కానీ తెలంగాణా కల్లు పాకల్లో త్రిశంత్కోటీ విలాసాలతో అందాలొలకబోస్తుందిక ఆంధ్ర సురాభాండేశ్వరి '' అని చమత్కరించారు. 12.12.1965 ఆంధ్రప్రభలో మళ్ళీ గోపాలరెడ్డిగారి మీద చమత్కార కవిత: '' పశ్చిమ జర్మనీ ' బ్లండు ' పిల్చేని కామరాడను కంప కందళించేని క్షేమాన పోయిర్ వచ్చేవు లాభాన పోయిరా జర్మనీ పోయిరావయ్య! ఇంకోటి ముక్దుం మొహియుద్దీన్‌ చేసిన ఒకానొక ప్రకటనపై 21.11.1965 ఆంధ్రప్రభలో కంద పద్యం వ్యగ్యంగా రాసారు '' కిలో గోష్‌ ఖరీదైదు రూపాయలల్లా కిలో మచ్చిదామందులో నర్థమల్ల మసాలా మజాయింత పట్టింతమంటే హరా మిర్చి ' అమ్లీ పలండూల్‌ పప్పుల్‌ మహమ్మేరు వంతల్‌ ఖరీదుల్‌ గదల్లా ప్రభుత్వమ్ము ఢంకా బజాయించి చాటే నినాదమ్మహా నేతిబీరాయెసల్లా ప్రయిస్‌లైను శాసించు ఫార్సెల్ల నల్లా '' విశ్రాంత ఉపాధ్యాయులకు ఫించన్‌ మంజూరు ఉత్తర్వులు శరవేగం రాబోతున్నాయని ఎగువసభలో ప్రకటనకు స్పందిస్తూ 5.12.1965 ఆంధ్రప్రభలో ఓ కవిత: '' రిటైరైన టీచర్లలో కొందరు రిటర్న్‌ టిక్కెట్‌ లేని ప్రయాణం శీఘ్రమేవ చేయనున్నారని చెప్పారు గనుకనే కొంతలో కొంత ఆర్థిక వ్యవస్థ కుదిరేపని ఆశిస్తే ' మాజీ కాసుమంత్రి, ఆధునా ముఖ్యమంత్రి చచ్చిపోతే ఫించన్‌ శాంక్షన్‌ చేస్తారా వాళ్ళకు అమాయకంగా అడిగి సభలో హాసం పలికించాడు భద్ర సింహానస్థుడు, సదా బ్రహ్మానందభరితుడు పండిన కాంగ్రెస్‌ కాలజ్ఞాని, బ్రహ్మయాధ్యక్షులు జరూరుగా వుత్తర్వులు జారీ అవుతున్నాయనె హలం పుచ్చిం కలం కొన్న ఆ బలరామాత్య అయ్యలూ! స్టేట్‌మెంట్ల ఆజ్యంతో ఆశలు పొంగించుకోండి అలసిపోయి ప్రాణాలు ' హరీ ' అనేంతవరకూ! (కాసు బ్రహ్మానందరెడ్డిపై సెటైర్‌ ఇది) అంతటి చేయి తిరిగిన నాయని సుబ్బారావు గారి వ్యంగ్య కవితలను జనవరి 1966 మొదటివారంలో ప్రచురణ కావలసినవాటిని కొన్ని రాజకీయ కాఋఅణాలవల్ల ప్రచురించలేకపోతున్నామని తిప్పి పంపుతూ, ఎప్పటిలాగా రాస్తూవుండమని తెలియ చేసారు పత్రికా యాజమాన్యంవారు. దర్మిలా నాయని సుబ్బారావు గారు కాటూన్‌ కవిత్వం రాయలేదు. భావ కవులు సామాజిక సమస్యల నుంచి పరిపోతారనే వారంలో ఏమంత నిజం లేదని నాయని సుబ్బారావుగారి కార్టూన్‌ కవిత్వం మరొకసారి నిరూపిస్తున్నది. ఈ కవిత్వంలో ప్రజా సమస్యల పట్ల సకాల స్పందన, సానుభూతి వ్యక్తమవుతున్నాయి. పదునైన హాస్యాన్ని ఆయుధంగా వాడుకున్న తీరూ కనిపిస్తుంది. తన కార్టూన్‌ కవిత్వాన్ని పద్యంగా, గేయాంగా, వచన కవితగా వాడారు. పద్యాన్ని] ఆధినికం చేయటంలో సుబ్బారావు గారి పాత్రవుంది. వచన పద్యాన్ని కార్టూన్‌ కవిత్వానికి అన్వయించటం అప్పటికి అంత ప్రాచుర్యంలో లేదు ( అసలు లేదేమో కూడ) మధ్యలో ఆగిపోకపోతే మరిన్ని ప్రయోగాలు వచ్చివుండేవి. ఇప్పుడు మిగిలినవైనా వచన కవిత్వ రూప పరిణామంలో వారి పాత్ర బహుముఖమైనది. **- రింఛోళి నుండి (పేజి 119 నుండి 125 ) (- ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం 1994 డిసెంబరు 5 - చే.రా) 23.5.2014

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SrDh0l

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి