పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

తిలక్ బొమ్మరాజు-చెట్టు





 


చెట్టు అనాదికాలంగా గొప్ప కవితా వస్తువు.చెట్టుని ఆదర్శమయంగా,త్యాగ శీలిగా నీతిశాస్త్రం అనేక కోణాలలో అభివర్ణించింది.సత్పురుషుడుగా చెప్పింది.

"ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే
ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ"

(చెట్టు తను ఎండలో వుంటు ఆశ్రయించిన వారికి నీడనిస్తుంది.ఇతరుల కోసం ఫలాలను కూడా ఇస్తుంది.సత్పురుషుడిలా)

తెలుగులో మనకి"చెట్టుకవి"(ఇస్మాయిల్)ఉన్నారు.ఏ కాలానికైనా చెట్టు గొప్ప వస్తువు.అలాంటి చెట్టు వస్తువుగా రాసిన కవిత తిలక్ "చెట్టు".ఇందులో తిలక్ లో ఒక ఉద్వేగం కనిపిస్తుంది.చెట్లను నరకడం పట్ల స్పందించి,భవిష్యత్తుని ఊహిస్తున్నారు.అనేక అవసరాలకోసం చెట్లపై జరుగుతున్న పనులని తిరస్కరిస్తున్నారు.

"నా తనువునంతా/తొలిచేస్తూ/తడియారని కొమ్మలపై
మానవ త్రాచుల/గొడ్డలి వేట్లు ",

"నవ్వుతున్న/వెన్నెల పూలు
నా ఒళ్ళంతా/తుంచేసేవారే ... కాని తుమ్మేదవాలనిచేవారేవ­­రు ?"

చెట్టు తానుగా మట్లాడుతున్నట్టుగా ఉత్తమ పురుష కథనం.త్రిపురనేని గోపిచెంద్ "మాకూ ఉన్నాయి స్వగతాలు"లో ఇలాంటి శైలి కనిపిస్తుంది.అందులోనూ ఓ తుమ్మ చెట్టు కథ ఉంది.మంచి భారమైన వాక్యాలున్నాయి.గొంతుకని సమర్థవంతంగా అవి ప్రసారం చేస్తాయి.

"నా మనసంత దిగులే/రాలిపోయిన ఆకులను
చూస్తే/హృదయమే బరువవుతుంది/నా జాడే కరువైతే"

"ఒడిలిన ఆకులకన్న/రాలిన పువ్వులకన్న బాదిస్తోంది నేను లేని
నా భూమిని పరికిస్తే/కూకటి వేళ్ళతో పెకలించేసారు/నా నేస్తాలెందరినో"
రెండు స్థితుల సంఘర్షణని చూపారిక్కడ.రాలిన ఆకులు,తనులేని భూమి ఈరెంటినించి తిలక్ వచనం సాగింది.సాధరణంగా కవిత్వంపై ప్రతిఫలనాలుంటాయి.తిలక్ కవితపై సామాజిక ,వైఙ్ఞానిక ప్రతిఫలనాలున్నాయి.చెట్టులేని వాతావరణాన్ని ,ఆయా క్రమాలని ఊహించి జాగృతులని చేస్తున్నారు.


"పొదిగిన గూళ్ళు అన్ని చెదిరిపోయాయి ఇక నాలో ఒదగలేక ఆకసం సైతం అలిగింది/నా నిష్క్రమణతో"

"మేఘం ఉరమనంటుంది
నేను లేని ఈ ధాత్రిలో చినుకు కురవనంది చెంతకురానివసంతాన్ని/చూసి "

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు "శ్రీ రామచంద్ర లఘు కావ్య సంగ్రహః"అనే గ్రంథంలో ఓ కథలో వృక్షంలేని నగరాన్ని చిత్రించారు.అందులో "రావణ నగరి లంకాయాం షడపి రుతవః "అంటూ రావణ నగరంలోని వృక్ష రక్షణ గూర్చి చెబుతారు.ఈ క్రమంలో పరోక్షంగా తిలక్ ప్రపంచీకరణని తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తాడు.కాని వాక్య రూపంలో ఇది కనిపించదు.

"మానవ త్రాచులు/వెన్నెల పూలు/వొదగలేని ఆకసం"లాంటి పదబంధాలతో పాటూ "చినుకు కురవనంది చెంతకు రానివసంతాన్ని చూసి"వంటి కళాత్మక,అనుభూతి వాక్యాలున్నాయి.

కొత్తగా రాస్తున్న ప్పుడు కవిత్వాన్ని ఒక రూపంలోకి తెచ్చుకోవటం కూడా అవసరం.వాక్యాలని యూనిట్లుగా రాస్తున్నప్పుడు.ఆవాక్యాల రూపం అవగాహనని అడ్డుకోగూడదు.వాక్యాల సమగ్ర రూపమే కవిత సమగ్రతని నిలబెడుతుంది.పద బందాన్ని "వరుస"లో రాయగూడదని కాదు కానీ దానివల్ల అర్థ సంబంధంగానో,వస్తు సంబంధంగానో ఒక అవసరమో,ప్రత్యేకతో ఉండాలి.

వేరువేరుగా వరుసలు,వాక్యాలు,యూనిట్లు రాస్తున్నప్పుడు కూడా అర్థం, వ్యక్తీ కరణ ప్రధానం.ఈ విభాగాలని ,వరుసలని రాస్తున్నప్పుడు శ్రద్ధ అవసరం.

మంచికవిత అందించినందుకు తిలక్ బొమ్మరాజు గారికి అభినందనలు.ఇంకా సాధన,అధ్యయనంతో మరిన్ని మంచి కవితలకోసం తిలక్ తనను నిలబెట్టుకోడానికి దగ్గరలో ఉన్నారు.

"వృక్షోరక్షతి రక్షితః"అనే కాదు"నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను" అని మనమంతా నమ్మితే చాలు.




                                                                                                              __________ఎం. నారాయణ శర్మ   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి