పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

రాళ్లబండి కవితాప్రసాద్ -ఎగిరివొచ్చిన హంస





 



"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.


డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యాత్మిక అంశాలలో "హంస"శబ్దం ఙ్ఞానానికి ప్రతీక.పురాణాదులలో జీవం"పక్షి"గా చెప్పబడింది.ఈ హంసని ప్రతీకగా చూపుతూ ఈ కవిత సాగుతుంది.

ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది.

"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను.
నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది .
నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది .
నేను ఎగురుతున్నాను ......."

మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న తీరు తరువాతి అనేకాంశాలలో కనిపిస్తుంది.


"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది .
మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది .
ఇంకోసారి మేఘమవుతుంది .
నేను హిమాలయమై నదుల రెక్కలతో
పీఠ భూముల్లో ప్రవహిస్తాను "

ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.


"భూమ్మీద కావ్యాలు
అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్,
కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"

కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎగరడం మాని వ్యాపిస్తున్నానని"అంటారు.అప్పుడు రెక్కలు మొలిచాయి.వ్యాపిస్తున్నపుడు మొలిచిన
రెక్కలివి.

"రెక్కకొక కొత్త కన్ను.
రెక్క కింద మెదడు "

మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని అపేక్షించి,ఆకర్షిస్తుంది.కన్ను దృష్టికి ప్రతీక.దృష్టి లేదా దర్శనం ఙ్ఞాన వాహిక.ఈ దర్శనమే ఉన్నతీకరిస్తుంది.ఈ తర్కం తరువాత కవిత్వాన్ని నిర్వచిస్తారు.

"కవిత్వం వ్యక్తికి కాదు ,
ప్రపంచ హంసకు పర్యాయపదం"

అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి దివ్య జీవితానికి,ప్రశాంతతకు మార్గమైన దర్శనాన్ని ఈ కవిత చిత్రించింది.వస్తువుమత్రమే కాకుండా అందించిన తీరులోనూ ఈ కవిత ఉన్నత మైనది.

"ఇప్పుడు ఎగరడంమాని వ్యాపిస్తున్నాను !
శరీరమంతా హృదయం వ్యాపించింది !"

"నా భూమి ఒకకొత్త పద్యం లా కనిపిస్తోంది ."


మంచి కవితను మనందరికీ పంచి కవిత్వాన్ని కొత్తగానిర్వచించినందుకు కవితా ప్రసాద్ గారికి ధన్య వాదాలు.

"జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే జరామరనజం భయం"


                                                                                                           _____________ఎం. నారాయణ శర్మ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి