పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, నవంబర్ 2013, సోమవారం

కవిత్వ విశ్లేషణ

కెక్యూబ్ వర్మ -దుఃఖ దీపం


తొలిదశల్లో అలంకారశాస్త్రం,కొంత కాలానికి కళాతత్వశాస్త్రం.ఇంకాకొంత కాలానికి మనస్తత్వ శాస్త్రం వచ్చాక సాహిత్యంలో అనేకమైన అంశాలు చర్చకు వచ్చాయి.ప్రధానంగా అలంకార శాస్త్రం నాటికే మనస్సు కు సంబంధించిన చర్చ ఉన్నప్పటికీ,సాహిత్యంలోనూ మనస్సుకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ పాశ్చాత్యులు వేసిన దారులు గమనింప దగినవి.

దుఃఖానికి మూలం సుఖం పైనున్న యావేనని భారతీయ తాత్వికుల ఆలోచన.ఈ ఆశావహ జీవితాన్ని అందుకోలేక పోవడమే దుఃఖ హేతువు.అందుకోలేని అంశం ఎలా అవగాహన లోకివస్తుందనేదీ ప్రశ్న.అది ఇతరజీవితాలని గమనించటం.దాన్నించి తనని గ్రహించటం.ఈ అనుభవాన్ని కళాకారుడు ప్రకృతినించి కూడా అనుభవిస్తాడు.

మానసిక యంత్రాంగాన్ని గూర్చి ఫ్రాయిడ్ కొన్ని సూత్రీకరణలు చేసాడు.మనో యంత్రాంగం లేదా స్వప్న యంత్రాంగం(The mechnism of Dreems)సంఘర్షణకు,బాధకు ప్రతినిధి.ఒక సందర్భం నించి కలిగే అనేక భావనలకు,వికారాలకు ఇదే మూలం.ఇందులో నాలుగు భాగాల్లో వ్యత్యయీకరణం(Displacement)ఒకటి.ఇది రెండు రకాలుగా జరుగుతుంది.అవ్యక్తాలోచనకు సంబందించిన వస్తువు భాగం మాత్రమే అభివ్యక్తిలో కనిపిస్తుంది.ఒకరకంగా అలంకార శాస్త్రంలో (Synecdoche)సారోపలక్షణను పోలి ఉంటుంది.ఒక అంశాన్ని మరోదానితో ఆరో పించి చెప్పటం.

పోల్చే అంశం ప్రతీకీ కరణం(Symbolisetion)కు లోబడి జరుగుతుంది.దర్శనం వీటిని దృశ్య ప్రతిమలు(Visual images)గా స్వీకరిస్తుంది.మనవాడుకలోని అనేక పదాలు ఇలానే ఏర్పడ్డాయి.భాషాశాస్త్రం తెలిసిన వాళ్లకి ఈ విషయంకొత్త గాదు.మనం అమూర్తార్థంలో పదాలను ఉపయోగిస్తాం కాని ఇవి ఒక మూర్తార్థాన్ని ఆధారం చేసుకునే పుట్టాయి."కుశలుడు"-అంటే చేయితెగకుండా దర్భలు కోసేవాడని,"ఘటికుడు"అంటే కుండ పొట్టకింద ఉంచుకుని నదిని ఈదేవాడని ఆర్థాలు. ఇతిహాసాలలో పేర్లు ఇలా మూర్త భాగాలనించి వచ్చినవే.అందువల్ల మూర్త భాగానికి సారూప్యాన్ని పట్టుకోవడం మనసుకు బాగా అలవాటైన పని.

కెక్యూబ్ వర్మ గారు మనిషికి దీపానికి మధ్య సారూప్యాన్ని ఆధారం చేసుకుని తాత్విక పునాదులనుంచి జీవితాన్నినిర్వచించారు.జీవితంచుట్టూ జరిగే అనేక అంశాలతో ప్రతీకాత్మకంచేస్తూ జీవితాన్ని నిర్వచించారు.

"నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు/గాలి నిన్ను కూచోనివ్వదు"

"నీ అరచేతులు చాలనప్పుడు లోలోన/దిగాలు ఒక్కసారిగా అసహనంగా"

"ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక/దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం"

"నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల/భయ దృశ్యం అల్లుకుంటూ"

"నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా/అల్లుకుంటూ అచేతనంగా"

"ఈ కాంతి రేఖల రాక పోకల/వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు"

అనేకదృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.ఇందులో "నీ" అనే పదం మాత్రమే కేవల వ్యక్తి వాచకం.ఇది లేకుంటే"గాలి/క్రీనిడ/నూనె ఒలకటం /కాంతి రేఖలు/మిణుగురులు/వలయం "లాంటి వన్ని అర్థపరంగా సామాన్యీకరణంచెందేవి.కాని వ్యక్తి వాచకం వల్ల ఇవన్నీ జీవితాన్ని అందులోని ఆటుపోటులని,కాపాడుకోడానికి పడే బాధని వ్యక్తం చేస్తాయి.అర్థక్షేత్ర పరిధిలో చూస్తే ఇవన్నీ దీపం అనే పరిధికి చెందినవే.

"చిక్కనవుతున్న చీకటి పాట/గాలి అలలనలా కోస్తూ"

"అచేతనంగా అభావమౌతున్న/రూపం ధూప కలికమవుతూ"

"నీ ఒక్కడివే ఈ గదిలో/ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ"

చివరి క్షణాలని వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపించే ఈవాక్యాలు కూడా జీవితం చుట్టూ ప్రతీకాత్మకంగా అల్లుకున్నవే.దర్శనం దృశ్యాలని చేజిక్కించుకుంటే అది విఙ్ఞానం రూపంలో లోనికి వెళ్లి ఙ్ఞానం ,అనుభవం ద్వారా కళగా వ్యక్తం చేయబడుతుంది.మంచి దార్శనిక కళానుభవం ఉన్న కళాకారుడే దాన్ని అందుకో గలుగుతాడు,అందించగలుగుతాడు.మంచి కవిత అందించిన కెక్యూబ్ వర్మ గారికి ధన్య వాదాలు.
                                                                     
                                                                                                                                                        
 
 
 
 
                                                                                                                                                      __________ఎం. నారాయణ శర్మ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి