పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఆగస్టు 2012, గురువారం

పెరుగు రామకృష్ణ||మృత్యు ఘంటికలు...||


మట్టితో,
ప్రకృతితో

మమేకమై
మహిమాన్విత మైంది
మనిషి బ్రతుకు..
పైరుపంటల,పాడియావుల
పురాతన బందం గుండెల్లో
పదిలపరుచుకుని
ఆత్మ సాంగత్యంతో నడుస్తున్నాడు
పచ్చని ప్రపంచాన్ని చూసినప్పుడు
చెట్టు మొదల్లో నిల్చునప్పుడు
అమ్మ పొట్టలో తలదాల్చుకున్నట్లు వుంటుంది..
నిర్మలమో
ప్రశాంతమో
ఏదయితేనేం..
ఈ నేలను సుజలాం,సుఫలాం,
సస్య శ్యామలాం చేసిన
సృష్టి కర్తకు వందనం..
ఎన్ని రంగులు,
ఎన్నిపువ్వులు
ఎన్ని అందాలు అద్దిన
సృజనకారునికి అభినందనం..
దురదృష్టం..
కాలుష్యం కల చెరుపుతుంది
ఏవీ ..
తుమ్మెదనై పూల మొక్కల మధ్య
పరుగెత్తిన కలల ప్రపంచపు కొసలు
ఇప్పుడు
ఎవరో రహస్య శిబిరం నిర్మించుకున్నట్లు
పొలం మధ్యన పొగ గొట్టాలు లేస్తున్నాయి
గెణాల పాదులు తీసిన పొలం
రాత్రికి రాత్రి రొయ్యలగుంట లై
రసాయన స్నానం చేస్తుంది..
రక్తం రంగు నింపుకున్న దేహాలు
పచ్చదనాన్ని మార్చురీకి తరలిస్తున్నాయి
భూమి శిధిలమై మనిషికి
బూడిద బహుకరిస్తుంది..
దీప ద్రవాలన్నీ ఆవిరై
ఆమ్ల వర్షాలు కురిపిస్తున్నాయి
మనిషికీ మనిషికీ
మనిషికీ మట్టికీ మధ్య
పరిచయ నిర్మాణం భారమై పోతుంది
రెప్పమూసినప్పటి నల్లని దృశ్యాలన్నీ
మనిషి బతుకును మసక బారుస్తున్నాయి
అంతా వ్యాపార వ్యాపకమే ..
తరాల నాటి మది గోడలనిండా
నింపుకున్న ఆకు పచ్చటి అడవి
ఇప్పుడొక శిధిల జ్ఞాపకమే..
వేడెక్కిన భూమి మీద
మృత్యు ఘంటికలు మోగుతూ
బ్రతుకు వస్త్ర పోగుల్ని నిలువునా జ్వలిస్తూ..
అతి తీవ్ర గ్రీష్మాల్ని
స్వాగతించాల్సి వస్తోంది..
వెన్నెలని ఏరుకున్న చోటనే
కంకాళాల వికార వంతెన మీద నడవాల్సి వస్తుంది..
నిషిద్ద ప్రపంచపు గది ముందు
శరీర తొడుగుల్ని విడిచి
ఏమీ లేని తనం తో మిగలాల్సి వస్తుంది
ఇప్పుడు
మనిషి స్వార్ధంతో మట్టిని మింగేస్తుంటే..
భద్రకాళిలా రుద్ర రూపం దాల్చి
ప్రళయంలా మట్టి విరుచుకు పడి
మనిషిని మింగేస్తుంది..!!
*2.8.2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి